పశువైద్యం కోసం ఉపయోగించే ఆ ఒక్క మందు. దీని కారణంగా 1990 నుంచి 2007 వరకు- కేవలం 17 సంవత్సరాలలోనే- భారత దేశంలోని 99 శాతం రాబందులు తుడిచిపెట్టుకు పోయాయి. ఆ మందు పేరు డిక్లోఫెనాక్. షికాగో విశ్వవిద్యా లయం జరిపిన ఒక పరిశోధనలో ఈ చేదు నిజం బయటపడింది. ఒకప్పుడు భారత దేశంలో ఈ పక్షి విశేషంగా కనిపిస్తూ ఉండేది. ఆకాశమంతా తమదే అయినట్టు ఎగురుతూ ఉండేవి. ఎక్కడ ఏ జంతువు మృత కళేబరం కనిపించినా దానిని ఆరగించి, ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ ఉండేవి. ప్రకృతి కోసం ఉద్భవించిన ఈ సహజ పారిశుద్ధ్య జీవి అత్యంత విషాదంగా ఈ లోకం నుంచి నిష్క్రమించవలసి వస్తున్నది. ఇక్కడే ఒక విషయం గమనించాలి. జంతువుల మృత కళేబరాలు వెదజల్లే కాలుష్యం వల్ల ఏటా ఐదు లక్షల మంది చనిపోతు న్నారు. ఆ చావుల నుంచి ఇంత కాలం మనిషిని తప్పించిన ఈ పక్షికి చివరికి ఇలాంటి గతి పట్టింది. ఇంతటి విషాదం వెనుక ఉన్నది పశువైద్యంలో ఉపయోగించే మందు డిక్లోఫెనిక్. ఈ మందు అవశేషాలు జంతువులలో ఉండిపోతున్నాయి. అవి మరణించిన తరువాత తినే రాబందులకు ఆ మందే ప్రాణాంతకంగా పరిణమించింది. ఈ కారణంగా ఎక్కువ రాబందుల కిడ్నీలు చెడిపోతున్నాయి. ఈ మందును 2006లోనే భారత ప్రభుత్వం నిషేధిం చింది. కానీ జరగవలసిన నష్టం జరిగి పోయింది. భారత్లో రాబందుల సంఖ్య భారీగా ఉండేది. ఒక అంచనా ప్రకారం వాటి సంఖ్య నాలుగు కోట్ల నుంచి యాభయ్ కోట్లు. 2007 నాటికి ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. జిప్స్ బెంగాలెనిసిస్ (ఇది శాస్త్రీయ నామం, వీటి పిరుదు భాగం ఎత్తుగా ఉంటుంది) 99.9 శాతం, భారత రాబందులు (జిప్స్ ఇండికస్) 95 శాతం అంతరించిపోయాయి. జిప్స్ టెనూయిరోస్ట్రిస్ (వీటి ఉదరం వాలుగా ఉంటుంది) 97 శాతం కనుమరుగయ్యాయి. జీవజాలంలోని ఒక పక్షి జాతి ఇంత శరవేగంతో అంతరించిపోవడం చరిత్రలో ఇదేనని షికాగో విశ్వవిద్యాలయం తెలియచేసింది. డిక్లోఫెనిక్ మందును నిషేధించినా తరువాత రాబందుల మరణాల ఆగలేదు. ఇవి సంవత్సరానికి ఒక్క గుడ్డు మాత్రమే పెడుతున్నాయి. ఇదే కాకుండా, విద్యుదాఘాతాలు, గాలిపటాల దారాలు, విండ్ టర్బయిన్స్ కూడా వీటి మరణానికి కారణమవు తున్నాయి. వీటి పతనంతో అడవి కుక్కలు, అడవి కాకుల సంఖ్య పెరుగుతోంది. ఇవి రాబిస్కు మూలాలు. మరొక విపత్తు- రాబందుల పతనంతో పార్సీల ఆచారాలకు భంగం వాటిల్లు తున్నది. వారి సంప్రదాయం ప్రకారం భౌతిక కాయాన్ని పంచ భూతాలకు తగలనివ్వరు. కాబట్టి కొద్ది ఎత్తులో ఏర్పాటు చేసిన కట్టడాలలో భౌతికకాయాలను ఉంచి, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. రాబందులు కనుమరుగు కావడంతో తోళ్ల పరిశ్రమకు కూడా తీవ్ర నష్టాలు వస్తున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ జాతి రక్షణ కోసం చర్యలు చేపట్టింది.