పర్సంటేజీ విధానం అమలుచేస్తేనే తెలుగు రాష్ట్రాల్లో తమ థియేటర్లను ఆడిస్తామని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యం నిర్మాతలను హెచ్చరించడం, ఈ డిమాండ్‌ను నిర్మాతలు ఒప్పుకోకపోవడం, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చలన చిత్ర పరిశ్రమకు ఘాటులేఖ విడుదల చేయడం ఇత్యాది అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సినిమా థియేటర్లను లీజు పేరుతో గుప్పెట్లో పెట్టుకున్న నలుగురు పెద్ద నిర్మాతలు ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాస్తవ సమస్యను పరిష్కరించక ఇతర మార్గాలు అన్వేషించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే విషయాన్ని సినిమా వ్యాపారంలో ఉన్న వారు గుర్తించాలి. సినిమాకు డబ్బురావాలంటే థియేటర్లలో టిక్కెట్లు తెగాలి. అలా ఆదాయం వచ్చి ఈ రంగంలోని వారంతా బాగుంటారు. కాని అవేమీ జరగకుండా వచ్చిన దానినే పంచుకుందామని ఆశపడితే కొత్త సమస్య వస్తుంది.  అసలైన సమస్యను పరిష్కరించకపోవడం సినిమా రంగం దీనావస్థకు కారణం.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2000 సినీ థియేటర్లు ఉన్నాయి. వాటిలో మల్టీఫ్లెక్సులు వెయ్యి పోగా మరో వెయ్యి మాత్రమే సింగిల్‌ థియేటర్లు. మల్టీఫ్లెక్సుల్లో పర్సంటేజీ విధానం అమలవుతుంది. దాని ప్రకారం, సినిమా ప్రదర్శనలో వచ్చే ఆదాయంలో సగం థియేటర్‌ యాజమాన్యాలకు ఇచ్చేయాలి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో అందుకు భిన్నంగా అద్దె ప్రాతిపదికన చెల్లిస్తారు. ఇప్పుడు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు, తాము అద్దె ప్రాతిపదికన కాకుండా పర్సంటేజి విధానంలోనే సినిమాను ఆడిస్తామని, లేకుండా థియేటర్లు బంద్‌ చేస్తామని నిర్మాతలను హెచ్చరించడం తెలిసిందే. అయితే నిర్మాతలు దీనికి ఒప్పుకోలేదు. జూన్‌ 12న పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘హరిహర వీరమల్లు’తో పాటు అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రూ. వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన సినిమాలకు ధియేటర్లు ఇవ్వబోమని యాజమాన్యాలు అడ్డు తగలడంతో ఆయా సినిమాల భవిష్యత్‌ ఆందోళనలో పడిరది. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.

అద్దె, పర్సంటేజీలకు తేడా ఏమిటి?

అద్దె, పర్సంటేజీ విధానాల వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. పంపిణీదారులు తమ జిల్లాల్లో సినిమాలను ఆడిరచేందుకు నిర్మాతలతో ఒప్పందం చేసుకుంటారు. ఆయా జిల్లాల్లోని థియేటర్లల్లో సినిమాలు ఆడిరచేందుకు వారానికి ఇంతని నిర్ణయించిన అద్దె చెల్లిస్తారు. పెద్ద హీరోల సినిమాలకు ఈ విధానం అనువుగా ఉంటుంది. థియేటర్ల అద్దె కన్నా ఎక్కువ మొత్తమే వస్తుంది కాబటి ్ట వాటితో పంపిణీదారులకు,అటు థియేటర్ల యాజమానులకూ నష్టం ఉండదు. అంటే అద్దె విధానం వల్ల థియేటర్ల యాజమాన్యానికి నికరా దాయం వస్తుంది. సూపర్‌ హిట్‌ సినిమాకూ, ఫ్లాప్‌ సినిమాకూ థియేటర్ల యజమానులకు వచ్చే ఆదాయంలో మార్పేమీ ఉండదు. కానీ పర్సంటేజీ అలా కాదు. ఓ సూపర్‌ హిట్‌ సినిమా వస్తే, నిర్మాత రాబడిలో కొంత థియేటర్‌ యజమానికి పర్సంటేజీ రూపంలో లభిస్తుంది. ఉదాహరణకు అద్దె రూపంలో రూ.1 లక్ష చెల్లించాల్సిన చోట, పర్సంటేజీ విధానం వల్ల రూ.2 లక్షలు ఇవ్వాల్సి రావచ్చు. అయితే చిన్న సినిమాల విషయంలో మాత్రం థియేటర్‌ యాజమా న్యాలు మరోలా మాట్లాడతాయి. చిన్న సినిమాలు హిట్‌ అయితేనే డబ్బులొస్తాయి. 98 శాతం సినిమాలకు ఒకటి రెండు రోజులు కూడా 30 శాతం ప్రేక్షకులు రారు. అక్కడ మాత్రం తప్పనిసరిగా అద్దె విధానాన్నే అమలు చేస్తారు. అంటే సినిమా హిట్‌, ఫ్లాప్‌తో నిమిత్తం లేకుండా తమ అద్దె మాత్రం తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తారు. పర్సంటేజీ విధానం కేవలం పెద్ద సినిమాలకే అమలు చేయాలని ధియేటర్ల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంటే హిట్‌ సినిమా నుంచి దోచుకోవడానికి రెడీ అయిన లీజుదారులు, ఫ్లాప్‌ సినిమా బాధల్ని పంచుకోవడానికి మాత్రం ముందుకు రారు. ఒకవేళ చిన్న సినిమాను కూడా పర్సంటేజీ విధానంపై ఆడిరచాలంటే థియేటర్‌కు వాటా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేశారంటున్నారు. కలక్షన్‌ రూపంలో వంద రూపాయలు వస్తే, అందులో 60 శాతం థియేటర్‌కి ఇచ్చేయాలంటున్నారు. మిగిలినదే పంపిణీదారుడికి వస్తుందన్నమాట. అయితే ఇది… రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 శాతం థియేటర్లను లీజుకు తీసుకున్న నలుగురు పెద్ద నిర్మాతలు థియేటర్ల యజమానులుగా చేస్తున్న డిమాండ్‌గా భావిస్తున్నారు.

వాస్తవ పరిస్థితిని ఎందుకు గుర్తించరు?

సినిమా ధియేటర్లకు వచ్చేవారి సంఖ్య నానాటికి తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణం. 1990 వరకు సినిమాలు హిట్‌, ఫ్ల్లాప్‌ అనే తేడా లేకుండా అడేవి. థియేటర్ల రేట్లు కూడా అందుబాటులో ఉండేవి. ఫ్ల్లాప్‌ సినిమా అంటే 4 వారాలు, హిట్‌ అంటే 50 రోజులు. సూపర్‌ హిట్‌ అంటే వంద రోజులు ఆడేవి. సెకండ్‌, థర్డ్‌ రిలీజ్‌లు కూడా వారం, రెండు వారాలు అడేవి. కాని ఓపెనింగ్స్‌ గురించి వచ్చిన ఆలోచన సినిమాల సామర్ధ్యాన్ని తగ్గించి వేసింది. 2000 సంవత్సరం నుంచి సినిమాలపై సాంకేతిక రంగ ప్రభావం పెరిగినట్లు కనిపించినా జనాలకు మాత్రం సంతృప్తినివ్వలేదు. కథలు, సెంటిమెంటు పండించే అంశాలు తీసేసి కేవలం గ్రాఫిక్స్‌ను చొప్పించి జనాలను సంతృప్తిపరిచేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఓపెనింగ్స్‌ మాత్రమే వస్తున్నాయి. లాంగ్‌ రన్‌ ఆడటం లేదు. గ్రాఫిక్స్‌ కంపెనీలు, సౌండ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలకు అత్యధిక మొత్తం ఖర్చవుతుంది. దీనిపై ఆధారపడ్డ ఇతర రంగాలకు మేలు జరగడం లేదు.

మల్టీఫ్లెక్సుల్లో దోపిడి

స్థానిక థియేటర్లను లీజుకు తీసుకుని శాటిలైట్‌ సిస్టం, ఆధునిక సౌండ్‌ సిస్టంలను ఏర్పాటు చేసుకున్న మల్టీఫ్లెక్స్‌ సంస్థలు వినియోగదారులను దోచుకోవడం ప్రారంభించాయి. ఈ థియేటర్లలోని క్యాంటీన్‌లలో అమ్మే పదార్థాల ధరలు కూడా అధికంగా ఉంటున్నాయి. సాధారణ క్లాస్‌ టిక్కెట్‌ ధర రూ.200ల నుంచి ఉంటుంది. రూ.20 లు విలువైన పాప్‌కార్న్‌కే రూ.150 వసూలు చేస్తున్నారని అంటున్నారు. కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే రూ.2 వేలు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో సూపర్‌హిట్‌ అయితేనే వేటికైనా వస్తారు.

 ఇప్పుడు కథాకథనం గల సినిమాలు తగ్గిపోయాయి. కేవలం హీరోల ఇమేజ్‌ను గ్రాఫిక్స్‌ను నమ్ముకుని మాత్రమే సినిమాలు తీస్తున్నారు. దాంతో ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల్లో పది శాతం మించి ఆడటం లేదు. కథ, కథాగమనం సరిగా లేకుంటే ఎంతటి పెద్ద హీరో సినిమా అయినా, ఎంతటి గ్రాఫిక్స్‌ సినిమాప్లాఫ్‌ అవుతున్నాయి. రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. దానికితోడు హిట్‌ సినిమాలకు కూడా జనం వెళ్లడం లేదు. ఆ చిత్రాలు త్వరలో ఓటీటీల్లో వచ్చేయడం ఒక కారణమైతే. కొన్ని వెబ్‌సైట్లలో ఈ చిత్రాలు మరుసటి రోజు నుంచే క్వాలిటీతో దర్శనం ఇవ్వడం మరో కారణం. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందుబాటులోకి వస్తున్న సినిమాలను ఎవరు చూడకుండా ఉంటారు?

ఇరు వర్గాల మధ్య చర్చలు

థియేటర్ల బంద్‌ గొడవపై ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతల మధ్య హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో చర్చలు జరిగాయి. 90 శాతం సినిమాలు ఫ్లాప్‌ అవుతున్న దృష్ట్యా థియేటర్ల యాజమాన్యం పర్సంటేజీల జోలికి రావద్దని నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే నెలల తరబడి ఖాళీగా ఉంచుకుని తాము ఎలా థియేటర్లు నడపగలమని యాజమాన్యం పేర్కొంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం సరైన మార్గంగా సీనియర్లు పేర్కొన్నారట. టికెట్‌ రేట్లను అందుబాటులో ఉంచాలని, థియేటర్లలో చిరుతిళ్లు, తినుబండారాల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని కొందరు నిర్మాతలు గట్టిగా పట్టుబట్టారు. ‘టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చారని ఇష్టానుసారం పెంచకూడదు. ఉదయం ఆటకు, సాధారణ రోజులకు టిక్కెట్‌ రేట్లు తగ్గించాలి. పార్కింగ్‌ ఫీజు తీసేయాలి. లేదా సగానికి తగ్గించాలి’ అని కూడా సూచించారు. ‘పైరసీ బెడద తగ్గించడానికి, మూవీరూల్జ్‌, బప్పం వంటి పైరసీ సైట్ల జోరు అరికట్టడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని, 50 రోజుల తర్వాతే ఓటీటీలు విడుదల చేయాలని, చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు పెద్ద హీరోల సినిమాల రీ రిలీజులను చేయరాదు. థియేటర్లో సినిమాలు లేనప్పుడు మాత్రమే రీ రిలీజులపై దృష్టి పెట్టాలి. పెద్ద హీరోలు సంవత్సరానికి కనీసం ఒక సినిమా అయినా చేసేలా చూడాలి. ఈ విషయంపై హీరోలందరిని సమావేశపరచి వారిని ఒప్పించాలి. సినిమా ప్రమోషన్ల విషయంలో హీరోలు, హీరోయిన్లు, మిగిలిన సాంకేతిక సిబ్బంది సహకరించాలి. ముఖ్యంగా నిర్మాతలపై భారం తగ్గాలి. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి. సినిమా హిట్టయి, మంచి లాభాలొస్తే అప్పుడు అందులో వాటా ఇవ్వొచ్చు’ లాంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ కూడా వేయబోతున్నారని సమాచారం.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE