మన దేశంలో పాకిస్తాన్ గూఢచారుల పుట్ట పగులుతోంది. ఇందులో ఇప్పటికే అరెస్టయిన వారిని విచారిస్తే పంజాబ్లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 50 మంది వెలుగులోకి వచ్చారు. అయితే వారి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా పంజాబ్ పోలీసులు గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై అదియాన్ గ్రామానికి చెందిన సుఖ్ప్రీత్ సింగ్, చందు వడాలకు చెందిన కరణ్బీర్ సింగ్ను గురుదాస్పూర్లో అరెస్ట్ చేశారు. దీంతో ఒక్క పంజాబ్ రాష్ట్రంలో అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లను, .30 బోర్కు చెందిన ఎనిమిది తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు పాకిస్తాన్కు చెందిన ఇంటర్`సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఆపరేటివ్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలింది. వారిద్దరూ భారత సాయుధ బలగాలకు చెందిన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేశారు.
ఇక 50 మంది వ్యక్తుల విషయానికి వస్తే నిఘా నీడలో ఉన్నవారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. అయితే గూఢచర్యం గురించి తమకే పాపం తెలియదని విచారణలో తెలిపారని చెప్పారు. సమగ్రమైన విచారణ జరిపిన తర్వాతనే వారికి క్లీన్ చిట్ ఇస్తామని పోలీసులు చెప్పారు. అరెస్టయిన అనుమానితులతో ఈ వ్యక్తులకు ఉన్న సంబంధంపై ఓ అంచనాకు రావడానికి పోలీసులు సాంకేతిక పరమైన, మానవ మేధస్సుతో కూడిన దర్యాప్తులను మొదలుపెట్టారు. అంతకు మునుపు మే 11న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఒక అధికారికి సాయం అందించారనే అభియోగంపై 31 ఏళ్ల గుజాలా అనే మహిళను, ఆమె సహచరుడు యమీన్ మొహమ్మద్ను పంజాబ్ పోలీసులు మలెర్కోట్లలో అరెస్టు చేశారు. వీరిద్దరూ కూడా ఆ ప్రాంతంలో నడుస్తున్న అతి పెద్ద గూఢచర్య నెట్వర్క్లో భాగస్వాములని పోలీసులు తెలిపారు. వారు చెప్పినదాన్ని బట్టి గుజాలా న్యూఢల్లీిలో పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఎప్ాసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ను కలుసుకుంది. అతడికి వేగుగా మారిపోయింది. సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసేది. బదులుగా డబ్బులు తీసుకునేది. గుజులాకు డబ్బులు ఇవ్వాలని పాస్పోర్టు, వీసా ఏజెంటు యమీన్కు డానిష్ చెప్పాడు. ఆమె యమీన్ నుంచి రూ.10 వేలు, డానిష్ నుంచి నేరుగా రూ.20 వేలు అందుకుందని పోలీసులు తెలిపారు.
తప్పుడు పత్రాలతో అనర్హులైన వ్యక్తులకు సిమ్ కార్డులు జారీ చేసిన అభియోగంపై 28 ఏళ్ల సేల్స్ మ్యాన్ నీరజ్ కుమార్ను మే 12న అరెస్టు చేశారు. షాపూర్కుండీకి చెందిన మోహిత్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో నీరజ్కుమార్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడు 2020లో నీరజ్ నుంచి ఒక సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అయితే నీరజ్ తన అనుమతి లేకుండానే తనకు చెందిన పత్రాలతో మరో సిమ్ కార్డు జారీ చేసిన సంగతిని మోహిత్ గుర్తించారు. కేసు దర్యాప్తు సందర్భంగా ఆ అనధీకృత సిమ్ కార్డు పాకిస్తాన్లో యాక్టివేట్ అయ్యింది. కేసు నమోదు కాగానే అది డీయాక్టివేక్ అయిపోయిందని తేలింది.
గత రెండేళ్లుగా బతిందా కంటోన్మెంట్లోని ఒక దుకాణంలో టైలర్గా పనిచేస్తున్న ఉత్తరాఖండ్లో రూర్కీకి చెందిన రఖీబ్ ఖాన్ను పొరుగుదేశం తరఫున గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అభియోగంపై మే13న అరెస్టు చేశారు. కంటోన్మెంట్ అధికారులకు అతడి కార్యకలాపాలపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రఖీబ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అతడు కంటోన్మెంట్ ప్రాంతంలోని దుకాణంలోనే ఉంటున్నాడు. ఇదే ప్రాంతం నుంచి ఇవే అభియోగాలపై బిహార్లో సమస్తిపూర్కు చెందిన సునీల్ కుమార్ అనే చర్మకారుని ఏప్రిల్ 29న అరెస్టు చేశారు. కుమార్ 2017 నుంచి బతిందా కంటోన్మెంట్లో పనిచేస్తున్నాడు. ధోబియానా బస్తీలో పదేళ్లుగా ఉంటున్నాడు. అతడి సోదరుడు, చిన్నాన్న కూడా అదే ప్రాంతంలో చర్మకారులుగా పనిచేస్తున్నారు. కుమార్ బ్యాంక్ స్టేట్మెంట్, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నామని, అతడి మొబైల్ ఫోన్ను ఫొరెన్సిక్ పరీక్షకు పంపించామని, దానికి సంబంధిం చిన నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆర్మీ కంటోన్మెంట్లను, వైమానిక స్థావరాలను ఫోటోలు తీసి, వాటితో పాటుగా కీలకమైన వివరాలతో గూఢచర్యానికి పాల్పడ్డారనే అభియోగంపై పాలక్ షేర్ మసీ, సురేష్ మసీ అనే వ్యక్తులను మే 3న అమృత్సర్లో అరెస్టు చేశారు. వారిద్దరికీ అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఖైదీ హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టూ అలియాస్ హ్యాపీ ద్వారా ఐఎస్ఐతో కాంటాక్ట్ ఏర్పడిరది. అంతేకాకుండా ఇద్దరు నిందితులకు ఐఎస్ఐ ఆపరేటివ్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు విశ్వసిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టయిన వీరంతా కూడా ఐఎస్ఐతో టచ్లో ఉంటూ పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్ము కశ్మీర్లో సైనిక సాయుధ బలగాల కదలికలు, కీలక మైన వ్యూహాత్మక స్థావరాల సమాచారాన్ని శత్రువుకు చేరవేసేవారని పోలీసు వర్గాలు వెల్లడిరచాయి.
క్షీరసాగర మథనపు హాలాహలం.. గూఢచర్యం
పాకిస్తాన్లో ఉగ్రవాద పీఠాలు తునాతునకలై పోయేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ క్షీరసాగర మథనాన్ని తలపించింది. భారత్ ధైర్యసాహసాలకు, త్రివిధ దళాల పాటవానికి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇది పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతమైతే దేశంలో పూటకొక చోటు నుంచి పుట్టుకొస్తున్న పాక్ గూఢచారులను హాలాహలంగా భావించాలి. గూఢచర్యం అభియోగంతో పదుల సంఖ్యలో యువతీ యువకుల అసలు స్వరూపం బైటపడిరది. వారిలో యూట్యూబర్ నుంచి సామాన్యుల దాకా ఉన్నారు. వారంతా కూడా 20 నుంచి 40 సంవత్సరాలలోపు వయసున్నవారు కావడం గమనార్హం. వీరంతా సోషల్ మీడియా, నగదు ప్రలోభాలు, తప్పుడు హామీలు, మెస్సేజింగ్ యాప్లు, ఆఖరికి పాకిస్తాన్కు వ్యక్తిగత పర్యటనలతో ఐఎస్ఐ పన్నిన గూఢచర్యపు సాలెగూటిలో చిక్కుకున్నారు.
జవాను సైతం..!
సీఆర్పీఎఫ్ జవాను మోతీరామ్ జాట్ను జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు మే 26న ఢిల్లీలో అరెస్టు చేశారు. మోతీరామ్ 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందించాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఐఎస్ఐ వర్గాల నుంచి అతడికి వేర్వేరు మార్గాల్లో నిధులు అందేవని చెప్పారు. మోతీరామ్ జాట్ ఉగ్రదాడి జరగడానికి కొద్ది రోజుల ముందు పహెల్గావ్లో విధులు నిర్వర్తించాడని సమాచారం. నిందితుడుని పటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలో ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచగా కోర్టు అతడిని జూన్ 6వ తేదీ వరకు ఎన్ఐఏ కస్టడీకి పంపించింది.
మూడేళ్ల కారాగారవాసం నుంచి మరణ శిక్ష దాకా..
గూఢచర్యం అంటే ఒక వ్యక్తి, సమూహం లేదా దేశం గురించి సమాచారాన్ని సేకరించడం. సాధారణంగా రాజకీయ లేదా సైనిక ప్రయోజనాల కోసమని గూఢచర్యానికి పాల్పడుతుంటారు. దీనిలో భాగంగా ప్రజా బాహుళ్యంలో లేని కీలకమైన సమాచారాన్ని పరాయి దేశాల్లోని తమ బాస్లకు అందిస్తుంటారు. ప్రభుత్వ ప్రణాళికలు, రక్షణ వ్యూహాలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పురోగతులు లాంటివి కీలకమైన సమాచారం కిందకు వస్తాయి. గూఢచర్యానికి పాల్పడటాన్ని తీవ్రమైన నేరంగా ఎందుకు పరిగణిస్తారంటే అది దేశ అంతర్గత భద్రతకు, సార్వ భౌమత్వానికి ముప్పు కాబట్టి. దీనికి సంబంధించిన చట్టాల విషయానికి వస్తే.. 1923నాటి అధికారిక రహస్యాల చట్టం గూఢచర్యానికి వ్యతిరేకం. ఇది వలస రాజ్యాలకాలంనాటి చట్టం. గూఢచర్యాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారం శత్రువుల చేతుల్లో పడకుండా ఉండటానికి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టం లక్ష్యం భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగించడానికి విదేశీ శక్తులు లేదా శత్రుదేశాలకు చెందిన ఏజెన్సీల చేతుల్లోకి కీలకమైన సమాచారం చేరకుండా ఉండటం. ఇది భారత పౌరులందరికీ వర్తిస్తుంది. గూఢచర్యం, అత్యంత రహస్యమైన ప్రభుత్వ సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఈ చట్టం పరిధిలోకి అధికారిక రహస్యాలు, కోడ్లు, పాస్వర్డ్లు, ప్రణాళికలు, ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన సమాచారాన్ని వక్రీకరిస్తూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడం వంటివి వస్తాయి. ఇవి భారత శిక్షా స్మృతి సెక్షన్లు 121, 121ఏ, 124 పరిధిలోకి వస్తాయి. ఈ సెక్షన్ల ప్రకారం ఎవరైనా గూఢచర్యానికి పాల్పడినట్టు నిరూపితమైతే అలాంటివారికి జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశముంది.
ఇతర కీలకమైన సెక్షన్లు సెక్షన్3
దేశానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో నిషేధిత ప్రదేశాలు అంటే సైనిక స్థావరాలు, ఆయుధశాలలు వంటి వాటిని సమీపించడంలో, వాటిలోకి ప్రవేశించడం లేదా తనిఖీ చేయడం. శత్రు దేశానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగపడే స్కెచ్లు, ప్రణాళికలు లేదా నమూనాలను తయారు చేయడం. శత్రువుకు ప్రయోజనం చేకూర్చే రహస్య అధికారిక కోడ్లు, పాస్వర్డ్లు, పత్రాలు లేదా సమాచారాన్ని పొందడం, సేకరించడం, రికార్డ్ చేయడం, ప్రచురించడం లేదా కమ్యూనికేట్ చేయడం వంటి వాటికి శిక్షలను ఈ సెక్షన్ నిర్వచిస్తుంది. ఈ నేరాల క్రింద మూడేళ్ల జైలు నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
సెక్షన్ 5
అధికారంలో ఉన్నవారు లేదా ప్రభుత్వంతో సంబంధం ఉన్నవారు రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులకు తెలియజేయడాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది. విదేశీ శక్తుల ప్రయోజనార్థం లేదా దేశ భద్రతకు హాని కలిగించే విధంగా అటువంటి సమాచారాన్ని ఉపయోగించడం, అధికారిక పత్రాలు లేదా సమాచారాన్ని కలిగి ఉండటాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. ఇందుకు మూడు సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉండవచ్చు.
బీఎన్ఎస్ సెక్షన్ 152
ఈ సెక్షన్ ఉద్దేశ్యపూర్వకంగా పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆర్థిక మార్గాలు లేదా మరేదైనా పద్ధతి ద్వారా విభజన, సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసకరమైన కార్యకలాపాలకు ప్రేరేపించే లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించే వ్యక్తులకు వర్తిస్తుంది. వేర్పాటువాదాన్ని ప్రోత్స హించడం లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యత లేదా సమగ్రతకు ప్రమాదం కలిగించేవారు ఈ సెక్షన్ కింద జరిమానాతో పాటు ఏడేళ్లకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది.
– జాగృతి డెస్క్