ఆ ‌మధ్య వచ్చిన ఒక చలనచిత్రంలో ఓ ఊరి పెద్దకు, ఆ ఊరిలోని ఒక వైద్య కళాశాల యాజమాన్యానికి మధ్య జరిగే సంభాషణలో, ఆ ఊరి పెద్ద ఇలా అంటాడు.. ‘డబ్బు సంపాదించుకోవాలంటే వెళ్లి సారా కొట్టు పెట్టుకో, చదువుతో వ్యాపారం చెయ్యకు’ అని. ఇది అక్షరాలా నిజం. ఇదే భావన మన భారతీయ తత్వంలో ఇమిడి ఉంది. పురాతన కాలం నుంచి భారతదేశంలో విద్యను ఎప్పుడూ వ్యాపార దృష్టితో చూడలేదు. అందుకే డబ్బు ప్రమేయం లేకుండా మంచి విద్యను అభ్యసించే అవకాశం విద్యార్థులకు లభించింది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, విశ్వవిద్యాలయాలను స్థాపించి, వాటి ద్వారా అనేకమంది విద్యార్థులకు విద్యను చేరువ చేసింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు క్రమంగా లోపించసాగాయి. బోధన సిబ్బంది  కొరత, ఉన్న వారిలో క్రమశిక్షణ లేమి, పాఠశాలలకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడం.. లాంటివి ఈ విద్యాసంస్థల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆసక్తి క్రమేణా సన్నగిల్లింది. ఇదే అదనుగా, నాణ్యమైన విద్యను అందిస్తామంటూ ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు ఆరంభ మయ్యాయి. అలా ప్రభుత్వ పాఠశాలలను అధిగమించి, పూర్తి గుత్తాధిపత్యం సాధించాయి. విద్యను వ్యాపారం చేసి, విపరీతమైన ఫీజు, పుస్తకాలకు యూనిఫామ్‌కు అంటూ అనేక రకాలుగా అత్యధిక మొత్తంలో పిల్లల తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ ప్రైవేటు పాఠశాలలో ఒక విద్యార్థి సంవత్సరానికి సగటు రూ.70 వేల నుంచి రూ. 80 వేలు ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది. ఇతర రుసుములతో కలిపి అది రూ. లక్ష వరకు అవుతుంది. దేశంలోని అన్నీ ప్రముఖ పట్టణాలలో ఇదే పరిస్థితి. తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడిని తట్టుకొంటూ, గత్యంతరం లేక వారి పిల్లలను ఇక్కడే చదివించాల్సిన పరిస్థితి.

పాఠశాలల తర్వాత కాలేజీ విద్యాభ్యాసం మరీ కష్టతరమవుతోంది. మరోవంక ప్రభుత్వ కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఒక్క కళాశాలలో కూడా విద్యార్థులు; అధ్యాపకులు కూడా కనిపించరు. ఆకాశాన్నంటే ఫీజుతో, ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను రకరకాలుగా ఆకర్షిస్తూ, చేరిన తర్వాత వారి మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతోంది. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే, ఒత్తిడికి పెరిగిందనేందుకు వేరే ఉదాహరణ అవసరం లేదు. ఈ సంస్థల్లో బోధన సిబ్బంది పరిస్థితి మరీ దయ నీయం. వారు చదువు చెప్పడంతో పాటు, విద్యార్థుల అడ్మిషన్ల పక్రియలో కూడా భాగస్వాములు కావలసి ఉంటుంది. ‘ఇంతమందిని చేర్పిస్తేనే నీ ఉద్యోగం ఉంటుంది’ అంటూ భయాందోళనల పాలు చేయడం సర్వ సాధారణం. ఒక తరగతికి 100 నుంచి 150 మంది విద్యార్థులకు, ఒక బోధకుడు వరసగా 3 లేక 4 క్లాసులను చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ, వారికి దక్కే ప్రతిఫలం అంతంత మాత్రమే. ప్రైవేటు అనుబంధ ఇంజినీరింగు కళాశాలల్లోనూ అదే దయనీయత. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు మాత్రమే పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభించడమే అందుకు కారణం. కాగా, అక్కడి బోధన సిబ్బంది పరిస్థితి మరీ దారుణం. వారి నెల జీతం రూ. పదిహేను వేలు ఉండటం లేదు. అదీ ఒకేసారి కాకుండా, మూడు నాలుగు నెలలకోసారి ఇస్తారు. కొన్ని కళాశాలలు అధిక వేతనాలు ఇస్తున్నట్లు చూపించుకొనేందుకు, నెల మొదట్లో ఎక్కువ జీతం ఇచ్చి, వారం తర్వాత అందులో ఎక్కువ భాగాన్ని తిరిగి తీసుకొంటున్నారు. ప్రభుత్వం నుంచి అక్రిడిటేషన్‌ ‌సంస్థలు వచ్చినప్పుడు, వారికి రికార్డుల్లో తప్పుడు సమాచారాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. కాగా గత పదేళ్లలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 40 ఇంజినీరింగు కళాశాలలు మూతబడ్డాయి.

దేశంలో గత 30 ఏళ్లుగా ప్రైవేటు రంగంలో విశ్వ విద్యాలయాలను నెలకొల్పుతుండగా, పదేళ్లుగా ఈ పక్రియ దేశంలో బాగా వేగవంతమైందని చెప్పాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నియమ నిబద్ధతతో నడుపుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, వ్యాపార దృక్పథ•ంతో స్థాపితమైన విశ్వవిద్యాలయాలు విద్యార్థులు, అధ్యాపకుల పాలిట శాపాలుగా పరిణమించాయి. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సంగతిని ఒకసారి పరిశీలిస్తే… గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను పట్టించుకొనే ప్రభుత్వమే కరువయ్యిందని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం, ఆంధప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు కొత్తగా ఉప కులపతులు నియమితులు కావడాన్ని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టాలని చూస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వ విద్యాలయాలలో 4330 అధ్యాపకులకుగాను కేవలం 1048 మందే ఉన్నారని ఒక వార్త పత్రిక కథనం. దీనిని బట్టి 75 శాతం బోధనా సిబ్బంది కొరతతో నడుస్తున్నాయని అర్థం అవుతోంది.

ఇక ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రస్తావనకు వస్తే, వీటి గురించి బాగా వింటున్నాం. తమిళనాడులో ఇలాంటి విశ్వవిద్యాలయాలున్నాయి. కాగా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రైవేటురంగ విశ్వవిద్యాలయాలున్నాయి. బయటకు ఈ యూనివర్సిటీల గురించి బాగా వింటున్నా, వీటి అసలు స్వరూపం అక్కడి బోధన సిబ్బందికే బాగా తెలుసు. కొన్ని రోజుల క్రితం ఆంధప్రదేశ్‌లో ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక అక్రిడిటేషన్‌ ‌సంస్థతో చేస్తున్న లాలూచి ప్రయత్నాలు బట్టబయలు కావడంతో, ఆ కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లడం విదితమే. అక్రిడిటేషన్‌ ‌సంస్థలు తనిఖీలకు వచ్చినప్పుడు, తాము సక్రమంగా నడిపిస్తున్నామని చెబుతూ దాటవేస్తున్నారు. అధ్యాపక, విద్యార్ధి నిష్పత్తిని పాటించటం లేదు. విద్యార్థులు అడ్మిషన్ల పక్రియలో భాగంగా, ఇబ్బడి ముబ్బడిగా సీట్లు పెంచేసుకొని, సౌకర్యాలున్నా లేకపోయినా, ఎక్కువమంది విద్యార్థులను చేర్చుకొని వారిని రకరకాల ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతాలు, ఇంకా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రకరకాల వెసులుబాట్లు ఏవీ కల్పించటం లేదు. ఉదాహరణకు అధ్యాపకులకు ఇచ్చే సంపాదిత, వైద్య సెలవుల్లాంటి సౌకర్యాలు చాలా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో లేవు. మహిళా బోధకుల ప్రసూతి సెలవును మంజూరు చేయక పోగా, విశ్వవిద్యాలయాన్ని వదలి వెళ్లిపోవాల్సిందిగా పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. అలా కానిపక్షంలో ‘జీతంనష్టంపై వెళ్లాలి’ అని సూచిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయాలు యూజీసీ గుర్తింపు పొందినప్పటికీ, జీతాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేవు. అధ్యాపకులకు సంబంధించిన గ్రాట్యుటీ, పీఎఫ్‌ ‌సౌకర్యాలు తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా, ఆయా విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలలో, కేంద్ర ప్రభుత్వం విధిగా పెంచే కరవు భత్యం శాతం ఇక్కడ చెల్లించడంలేదు. ఆ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లదలచే అధ్యాపకుడు మూడు నెలల నోటీసు ఇవ్వాలని, లేని పక్షంలో మూడు నెలల జీతం జమ చెయ్యాలనే ఒత్తిడి వస్తోంది. మరోవంక, అలా వెళ్లేవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, యూనివర్సిటీ యాజమాన్యాలు పైశాచికానందాన్ని పొందుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రైవేటు యూనివర్సిటీలలో పైన చెప్పుకున్న లోపాలున్నాయి. అయినప్పటికీ ఆయా యూనివర్సిటీలు పేరొందిన సంస్థలుగా చెలామణి అవుతున్నాయి. వీటిని ప్రభుత్వాలు గమనించటం లేదా? కొన్ని రోజుల క్రితం ‘నేచర్‌ ‌జర్నల్‌’‌లో వచ్చిన కథనం ప్రకారం, తమిళనాడులోని రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో అధ్యాపకులపై పెరుగుతున్న ఒత్తిడి కారణగా లోప భూయిష్టమైన పరిశోధనా పత్రాలు ప్రచురిత మవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఏది ఏమైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అలాగే, ప్రైవేటు యూనివర్సిటీలలో జరుగుతున్న అరాచకాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించి వాటిని సరైన గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.

  • ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల జీతాల వివరాలను పబ్లిక్‌ ‌వెబ్‌సైట్‌లో పెట్టాలి.
  • అధ్యాపకులకు ఇస్తున్న గ్రాట్యుటీ, పీఎఫ్‌లను విధిగా ప్రభుత్వానికి తెలపాలి.
  • NIRF ర్యాంకింగ్‌ ‌సిస్టంలో బోధనా సిబ్బంది సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ప్రతి ప్రైవేటు యూనివర్సిటీలో ప్రభుత్వానికి సంబంధించి ఫిర్యాదులు విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి.

– లక్ష్మీకుమార్‌ ‌టీవీ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE