పాకిస్తాన్ మతోన్మాదానికి, భారత్పై ఉగ్రదాడులకు చైనా ఆజ్యం పోస్తోంది. భారీ విధ్వంసానికి ఊతమిచ్చే ఆయుధాల తయారీకి సరుకులు సమకూరుస్తోంది. డ్రాగన్ తన అమ్ముల పొదిలో అణ్వాయుధాల సంఖ్యను, వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ముష్కర దేశానికి అదే విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తోంది. ప్రపంచ వేదికపై తనతో అన్ని విధాలుగా పోటీపడుతున్న భారత్ జోరుకు పగ్గాలు వేయడానికి తహతహలాడుతోంది. దక్షిణాసియా వ్యూహాత్మక చిత్రపటంపై క్లిష్టమైన త్రైపాక్షిక క్రియాశీలతకు తనకు నచ్చే రంగులను అద్దుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ భుజం మీద చైనా తుపాకీ పెట్టింది. ఇదెవరో దారినపోయే దానయ్య కాలక్షేపానికి చెప్పిన కబుర్లు కాదు. అమెరికా రక్షణ నిఘా ఏజెన్సీ ` డీఐఏ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ముప్పు వచ్చే అంశాలపై నివేదికలో వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం పాకిస్తాన్ భారత్ను అత్యంత ప్రమాదకారిగా భావిస్తోంది. కానీ భారత్ మాత్రం చైనాను తన ప్రథమ శత్రువుగా భావిస్తోంది. భారత్కు పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి అది భద్రతా సమస్య కన్నా ఎక్కువ. ఇరు దేశాల మధ్య గత మే నెల మధ్యకాలంలో సీమాంతర దాడులు జరిగినప్పటికీ చైనాను ప్రథమ శత్రువుగా చూస్తున్న భారత్ పాకిస్తాన్ను ఎలాగోలా దారికి తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉంది. ఈ నివేదిక భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతకు ఇచ్చే ప్రాధాన్యతలను వెల్లడిరచింది. అవి ప్రధానంగా అంతర్జాతీయ వేదికపై భారత్ నాయకత్వాన్ని ప్రదర్శించడంపైన, అన్ని విషయాల్లోనూ చైనాతో దీటుగా వ్యవహరించుకోవడం పైన, మిలిటరీ శక్తి, సామర్థ్యాలను పెంచుకోవడం పైనా దృష్టి పెడతాయి. ఏప్రిల్ చివర్లో జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. అందుకు ప్రతిగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణులతో దాడి చేసింది. దీంతో మే 7 నుంచి 10వ తేదీ వరకు ఉభయదేశాల సైనిక బలగాలు క్షిపణులు, డ్రోన్లు, శతఘ్నులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. మే 10న ఇరుదేశాల సైనిక బలగాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని అమెరికా నివేదిక పేర్కొంది. చైనా కన్నా మిన్నగా అంతర్జాతీయ వేదికపై తన నాయకత్వ పాత్రను పెద్దది చేసుకోవడానికి, హిందూ సముద్రం ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యులను కుదుర్చుకోవడానికి భారత్ ప్రాధాన్యతను ఇస్తోందని వెల్లడిరచింది. ఇండో`చైనా సరిహద్దు వివాదాన్ని కూడా అది ప్రస్తావించింది. ఇరుదేశాల సైనిక బలగాల మధ్య 2020లో ఘర్షణ జరిగినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం అలాగే ఉన్నప్పటికీ కొంత మేరకు ఉద్రిక్తత తగ్గిందని పేర్కొంది.
రక్షణ రంగానికి వచ్చేసరికి భారత్ ఈ ఏడాది కూడా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కచ్చితంగా ప్రోత్సహిస్తుంది. దీనికి సంబంధించిన సరఫరా గొలుసులను మరింత విస్తరి స్తుంది. అణుశక్తి సామర్థ్యాన్ని సంతరించుకున్న అగ్ని`1 ప్రైమ్ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి, అగ్ని`5 బహుముఖ స్వతంత్ర లక్షిత పునఃప్రవేశ వాహనాన్ని పరీక్షించనుంది. భారత్ త్రివిధ దళాల్లో అణుశక్తిని బలోపేతం చేసుకోవడానికి, శత్రుదేశాల నుంచి ముంచుకొచ్చే ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అణుశక్తి ఆధారిత రెండవ జలాంతర్గామిని కూడా సాగర ప్రవేశం చేయిస్తుందని అమెరికా నివేదిక వెల్ల డిరచింది.
పాకిస్తాన్ విషయానికి వస్తే.. పొరుగుదేశాలతో సీమాంతర ఘర్షణలు, తెహ్రికే తాలిబన్ పాకిస్తాన్, బలోచ్ నేషనల్ మిలిటెంట్ల నుంచి పెరిగిపోతున్న దాడులు, అణ్వాయుధాల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. పాకిస్తాన్ 2024లో ఏడాది పొడుగునా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రోజువారి ఆపరేషన్లు చేపట్టినప్పటికీ అదే ఏడాది ఉగ్రవాదులు 2,500 మందికిపైగా ప్రజలను బలిగొన్నారని నివేదిక పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ దృష్ట్యా భారత్ను అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్న పాకిస్తాన్ దానికి తగ్గట్టుగా తన సైన్యాన్ని ఆధునీక రించుకుంటూనే ఉంటుంది. పాకిస్తాన్ భారత్కు త్రివిధ దళాల పాటవం పరంగా ఉన్న అనుకూల తలను దృష్టిలో పెట్టుకొని యుద్ధానికి పనికివచ్చే అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఆ దేశం ఇప్పటికే అభివృద్ధి చేసుకున్న అణ్వాయుధాలకు మరింత పదునుపెట్టే పనిలో ఉంది. తన దగ్గర ఉన్న అణుసామాగ్రికి, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి భారీ విధ్వంసానికి దారి తీసే ఆయుధాలకు(డబ్ల్యూఎండీ) అవసరమైన సామాగ్రిని తప్పనిసరిగా సంపాదించు కుంటుందని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ చైనా నుంచి ఆర్థికపరమైన, సైనికపరమైన సాయాన్ని పొందు తోంది. చైనాతో కలిసి అనేకసార్లు సైనిక విన్యాసాలు చేపట్టింది. పాక్ చేపట్టిన డబ్ల్యూఎండీ కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని, టెక్నాలజీని చైనా సరఫరాదారులు అందిస్తున్నారు. ఆ సరఫరాదారులు కొన్నిసార్లు వాటిని హాంగ్కాంగ్, సింగపూర్, టర్కీ, యూఏఈ గుండా సముద్ర మార్గంలో పాకిస్తాన్కు చేరవేస్తుంటారని అమెరికా నివేదిక వెల్లడిరచింది.
– జాగృతి డెస్క్