సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు జ్యేష్ఠ శుద్ధ సప్తమి –  2 జూన్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆపరేషన్‌ సిందూర్‌పై వార్తా ప్రవాహం సహజమే. కానీ ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు చేరువ కావాలని ఉబలాటపడుతున్న బాంగ్లాదేశ్‌ పరిణామాలనూ పరిశీలించడం అవసరం. వాగాడంబరంలో, దంబాలు పలకడంలో పాక్‌, బాంగ్లా పాలకులు, సైనికాధికారులు పోటీలు పడుతున్నారు. పాక్‌తో యుద్ధం వస్తే, తానేదో బావుకోవచ్చునని బాంగ్లా దింపుడుకళ్లం ఆశతో ఉంది. కానీ భారత ప్రభుత్వం ఏప్రిల్‌, 2025లో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ పుష్‌ బ్యాక్‌’తో ఆ ప్రభుత్వ పరిస్థితి శ్లేష్మంలో పడ్డ ఈగ చందంగా మారింది. ఒక పథకం ప్రకారం కోట్లాది మందిని భారత్‌లోకి నెట్టిన బాంగ్లాకు వాళ్లని తిరిగి దేశంలోకి అనుమతించడానికి మనస్కరిం చడం లేదు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి భారీ సుద్దులు వల్లిస్తోంది. భారత్‌లో తిష్టవేసిన బాంగ్లా దేశీయులను, రొహింగ్యాలను వెళగొట్టడానికి చేపట్టినదే ఆపరేషన్‌ పుష్‌ బ్యాక్‌.

ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నారన్న పేరుతో ప్రజలను భారత్‌ గెంటివేయడం ఆమోదయోగ్యం కాదనీ, ఈ విషయంలో అవసరమైతే తమ సైన్యం జోక్యం చేసుకోవడానికి వెనుకాడమనీ బాంగ్లా మిలటరీ ఆపరేషన్స్‌ డైరక్టరేట్‌ సంచాలకుడు బ్రిగేడియర్‌ జనరల్‌ మహమ్మద్‌ నజీముద్దౌలా భారత్‌ను హెచ్చరించాడు. ‘ది డైలీ స్టార్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ తాటాకు చప్పుళ్లు చేశాడు. సరిహద్దుల వ్యవహారాలు ప్రస్తుతానికి బాంగ్లాదేశ్‌ సరిహద్దు రక్షణ దళం, బోర్డర్‌ గార్డ్‌ బాంగ్లాదేశ్‌ చూస్తున్నాయని, అవసరమైతే సైన్యం కూడా దింపేస్తామని మే 26న మాట్లాడాడు. జరుగుతున్నదేమిటి? మిడతల దండుల్లా చొరబడిన బాంగ్లాదేశీయులను మన అధికారులు ఏరివేయడం ప్రారంభించారు. దొరికిన వాళ్లని బాంగ్లా సరిహద్దు రక్షణ దళానికి అప్పగిస్తున్నారు. ఐదులక్షలో ఆరులక్షలో కాదు, 2016లో భారత ప్రభుత్వం వెల్లడిరచిన లెక్కల ప్రకారం 20 మిలియన్‌లు. అంటే రెండు కోట్లు. చిత్రం ఏమిటంటే, ‘ఎలాంటి పత్రాలు లేకుండా’ ఉన్నవారిని గెంటేయడం ఆమోదయోగ్యం కాదంటూ బాంగ్లా నోరు పారేసుకోవడం. అంతకు మించి సైన్యం దింపుతామన్న బెదిరింపు ఒకటి. మరీ హాస్యాస్పదమైన విషయం` వాళ్లు మాత్రం తమ దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న భారతీయులను సరైన దౌత్యమార్గాలలోనే పద్ధతిగా పంపుతారట. ఇంతకీ బాంగ్లాలో ఎంతమంది హిందువులు మిగిలారని! పైగా బాంగ్లా సరిహద్దుల నిర్వహణలో అంతర్జాతీయ మర్యాదలు ఉట్టి పడుతూ ఉంటాయట. బాంగ్లాదేశ్‌ ఆంతరంగిక వ్యవహరాల సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ జహంగీర్‌ ఆలమ్‌ చౌధురి మే 18న ఇలాంటి ప్రకటనే చేశాడు. భారత్‌లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న బాంగ్లాదేశీయులు ఉంటే, వాళ్లని అప్పగింత పద్ధతి ద్వారానే పంపాలట. బాంగ్లాలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్న భారతీయులను తాము అదే విధంగా అప్పగిస్తామని కూడా పెద్దమనిషి అవతారం ఎత్తాడు. కానీ వాస్తవం`బాంగ్లా సరిహద్దులలో భద్రతా వ్యవస్థలు ఇక్కడ నుంచి వెళుతున్న బాంగ్లాదేశీయులను అనుమతించడానికి ససేమిరా అంటున్నారు. స్వదేశీయుల గత పౌరసత్వాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.

భారత్‌లో బాంగ్లా దేశీయుల, రొహింగ్యాల ఉనికి, సమస్యలు ఇప్పటివి కావు. వీళ్లని వదిలించుకోవడానికి మొదలైనదే ఆపరేషన్‌ పుష్‌ బ్యాక్‌. ఈ పనిలో సహకరించవలసిందని మే 22న మన విదేశ వ్యవహారాల శాఖ బాంగ్లాకు పిలుపునిచ్చింది. చట్టానికి దొరికి, శిక్షాకాలం పూర్తి చేసుకున్న వారే 2,360 మందిని పంపవలసి ఉంది. కానీ ఇక్కడి కోర్టుల కారణంగా, బాంగ్లాలో యూనస్‌ ప్రభుత్వ వైఖరితో ఇది నత్తనడక నడుస్తున్నది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ లెక్కల ప్రకారం కొంతకాలం క్రితం వరకు ఏడాదికి దాదాపు 5000 వంతున బాంగ్లాదేశీయులు చొరబడేవారు. పుష్‌ బ్యాక్‌తో కాస్త తగ్గవచ్చునని ఆయన అభిప్రాయం. పుష్‌ బ్యాక్‌ మొదలయ్యాక రాష్ట్రాల నుంచి (ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు) బాంగ్లా సరిహద్దులకు చొరబాటుదారులను పంపేస్తున్నారు. ఒక్క త్రిపుర రాష్ట్రమే 2022 నుంచి 2024 వరకు 1746 మంది చొరబాటుదారులను బాంగ్లాకు పంపింది. ఏమైనా పుష్‌బ్యాక్‌ మంచి ఫలితాలనే చూపుతున్నది. నిజానికి చాలామంది స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నారు. కానీ రెండుకోట్ల మంది. పంపడం పెద్ద పనే. అయినా జరిగి తీరాలి.

భారత్‌లో తిష్టవేసే హక్కు సహజంగా ఉందని చొరబాటుదారులు భావిస్తున్నట్టే ఉంది. జమ్ముకశ్మీర్‌లో ప్రాథమిక విద్యాశాఖ తమ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 400 మంది రొహింగ్యా కుటుంబాల పిల్లలను నిరుడే తొలగించింది. దీనితో రొహింగ్యా వర్గం పెద్ద దీన్‌ మహమ్మద్‌కు కోపం వచ్చేసింది. ఇంతకాలం ఊరుకుని, హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మా పిల్లల చదువులకు ఆటంకం కాదా అని రుసురుసలాడాడు. పైగా తమకు భారత పౌరులుగా ఆధార్‌ కార్డులు ఇవ్వరేమిటి అంటున్నాడు. తమ దగ్గర ఐక్యరాజ్యసమితి ఇచ్చిన కార్డులు ఉన్నాయట. వాటిని భారత్‌లో గుర్తించడం లేదని వాపోయాడు.

దురదృష్టం ఏమిటంటే రొహింగ్యాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు అనుమతించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అదే మాటను గుర్తు అతడు చేస్తున్నాడు. కానీ ఇటీవలనే మళ్లీ అత్యున్నత న్యాయస్థానం అందరినీ పంపేయండి అని శ్రీలంక వాసి కేసులో ఆదేశించింది. రెండు కోట్ల మంది బాంగ్లాదేశీయులను ఈ దేశంలో ఉంచాలని వాదించే మేధావులు, కోర్టులకెక్కే లాయర్లు తక్కువేమీ కాదు. బుజ్జగింపు బురదలో ఉన్న రాజకీయనేతలు వాళ్లకి ప్రభుత్వం వైపు నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి ఇక్కడి పేదరికం మాటేమిటి!

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE