భారతదేశంలో నాలుగో వంతు కూడా లేని పాకిస్తాన్, సింధు నదీజలాలలో 80 శాతం వాటా అందుకుంది. దీనిని చూసి చరిత్ర నవ్విపోయింది. పాక్ నైజం 1948లోనే అనుభవానికి వచ్చింది. హిందువులు, ముస్లిం జనాభా మార్పిడికి సంబంధించి లియాఖత్ అలీ-నెహ్రూ ఒప్పందం దారుణంగా విఫలమైంది. అయినా ఇంత అధ్వానంగా ఉన్న సింధు జలాల ఒప్పందం మీద సంతకాలు జరిగిపోయాయి. ఇది స్వతంత్ర భారత తొలి ప్రభుత్వ నిర్వాకం. భారత్కు 20 శాతం జలాలే దిక్కయ్యాయి. ఇలా ఆరున్నర దశాబ్దాలుగా సాగుతోంది. అది ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నా సింధు ఒప్పందం భగ్నం కాకపోవడం, ఆ దిశగా భారత నాయకత్వం ఏనాడు ఆలోచించకపోవడం దానికి వరమైంది. ఇప్పుడు పాపం పండింది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా ఆ వరమే శాపంగా మారింది. పెహల్గావ్ తదనంతర పరిణామాలలో భాగంగా భారత్ పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేసిన సంగతి తెలిసినదే.
కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పిదాలను నేటి ప్రభుత్వం సరిదిద్దుతున్నది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే సింధు జలాల ఒప్పందం రద్దు గొప్ప తప్పిదాన్ని నివారించడమే. ఈ నిర్ణయం గురించి పునరాలో చించుకోవాలని పాకిస్తాన్ ఇప్పటికి నాలుగుసార్లు భారత్కు లేఖలు రాసింది. పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయద్ అలీ ముర్తాజా సింధు జలాల నిలిపివేత గురించి నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత జల్శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. అన్ని లేఖలను జల్శక్తి శాఖ విదేశీ వ్యవహారాల శాఖకు భద్రంగా పంపింది. భారత్ నిర్ణయంతో పాకిస్తాన్లో జల సంక్షోభం ఏర్పడిందనీ, నీరు లేని డ్యాములే మిగులుతాయని ముర్తాజా విలపించాడు.
భారత్ మాకు నీళ్లు ఆపితే, భారత్కు మేం ఊపిరి ఆపేస్తాం అంటూ ఉగ్రవాద సంస్థల నాయకులు ప్రేలాపనలు ఇప్పుడు ఏమైనాయి? నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తామని పాక్ రాజకీయ నేతలు హెచ్చరికలు జారీ చేసిన విషయం అప్పుడే మరచిపోయారా? చైనా కూడా భారత్లోకి నీళ్లు రాకుండా ఆపగలదని అంటూ వచ్చిన బెదిరింపులు ఎందుకు చప్పబడ్డాయి? వీటికి పరాకాష్ట- సింధు నదీ జలాలను నిలిపి వేయడం యుద్ధ చర్య వంటిదేనని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బీరాలు పలకడం. ఇదీ జలాయుధం గొప్పతనం. ఈ వాగాడంబరం ఆపి నీళ్లు తెచ్చే మార్గం చూడండి అని పాకిస్తాన్లోనే కొందరు దూర దృష్టి కలిగిన వాళ్లు గోల పెడితే అప్పుడు అరుపులు తగ్గాయి. వీరంగాలు నీరసించాయి. ఇది నీటి బాంబు. ఎప్పుడైనా పేలిపోతుంది, ముందు దానిని నిర్వీర్యం చేసే పనేదో అది చూడండి, అని పాకిస్తాన్లో కొందరైనా గుర్తించి, ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ పార్లమెంట్లో కొందరు ఎంపీలు కన్నీటితో, ఈ ఉద్రిక్తతలను ఆపండి అంటూ చేసిన విన్నపాలు, కార్చిన కన్నీళ్ల వెనక ఉన్నది కూడా ఇందుకు సంబంధించినదే. నీళ్లు లేకపోతే భవిష్యత్తు ఏమిటి? ఎప్పుడూ జిహాద్, ఉమ్మా, హిందూ నిర్మూలన, ఆటంబాంబులు అంటూ ఉన్మాదంతో ఊగిపోయే వారు కాకుండా, కాస్త బుర్ర పెట్టి ఆలోచించేవారు కూడా అక్కడ ఉన్నారన్నమాట. ‘ఇప్పుడు తలెత్తిన ఈ నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించుకోలేకపోతే, మనమంతా ఆకలితో అలమటిస్తూ చచ్చిపోవలసిందే. సింధు నదీ పరీవాహక ప్రాంతమే మనకు జీవనాధారం. మనకు అవసరమైన జలవనరులలో నాలుగిం• మూడు వంతులు పొరుగు దేశం నుంచి రావలిసిందే. మరొకటి. ప్రతి పదిమంది పాకిస్తానీ లలో తొమ్మిది మంది బతుకు, సింధు పరీవాహక ప్రాంతంతోనే ముడిపడి ఉంది. అసలు మనదేశంలో వేసే 90 శాతం పంటలక• సింధు జలాలే ఆధారం. మన విద్యుదుత్పత్తి కేంద్రాలన్నీ కూడా సింధు పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ సంక్షోభం అంటే మరేమీ కాదు. మన ముందు పేలడానికి సిద్ధంగా ఉన్న నీటి బాంబు. ఆ బాంబును మనం నిర్వీర్యం చేసి తీరాలి’ అన్నాడు పాకిస్తాన్ సెనేటర్ సయద్ అలీ జఫర్. కిందటి నెలలో జరిగిన సెనేట్ సమావేశాలలోనే తన గోడు వెళ్లబోసుకున్నాడతడు.
సమస్త జీవులకు నీళ్లు ఎంత ప్రధానమో తెలియనిది కాదు. అయినా ప్రపంచంలో ఎవరూ పాకిస్తాన్కు నదీజలాలను నిలిపివేస్తే భారత్ను ప్రశ్నించలేదు. భారత్ నిర్ణయం అమానవీయం అని గగ్గోలు పెట్టలేదు. ఇందుకు ఒక వర్గం మాత్రం మినహాయింపు. వాళ్లే భారతదేశంలోని ఉదార వాదులు, సెక్యులరిస్టులు. వీళ్లు మాత్రం భారత్ నిర్ణయంలో చాలా అమానుషత్వాన్ని చూశారు. అంటే, పెహల్గావ్లు, బొంబాయి పేలుళ్లు ఎన్ని జరిగినా మనమే పెద్ద మనసుతో మరచిపోవాలన్నది ఈ సెక్యులరిస్టుల అభిప్రాయం. ఆ రక్తపాతాన్ని పిల్లచేష్టగా పరిగణించి విడిచిపెట్టాలన్నదే చాలా రాజకీయ పార్టీల నిశ్చితాభిప్రాయం.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని ఈ ఏప్రిల్ 23న భారత్ రద్దు చేసింది. ఇదేమీ హఠాత్ప రిణామం కాదు. మూడు దశాబ్దాల ఘోర సరిహద్దు తీవ్రవాదానికి కీలెరిగి పెట్టిన వాత. పెహల్గావ్లో 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా చంపిన తరువాత భారత ప్రభుత్వం తీసుకున్న తీవ్ర చర్య ఇది. ఉగ్రవాదాన్ని అదే పనిగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మొత్తానికి భారత్ విధించిన సామూహిక శిక్ష. వీసాల రద్దు, దౌత్యవేత్తల సంఖ్య తగ్గింపు, అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీల ఏరివేత దీనికి అదనం. సరిహద్దు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేశామని పాకిస్తాన్ ప్రపంచానికి పూర్తి నమ్మకం కలిగించే వరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ చెప్పేసింది. చర్చలంటూ జరిగితే రెండు అంశాలపై ఉంటాయని కూడా సుస్పష్టంగా వెల్లడించింది. భారత్లో రక్తం చిందించిన ఉగ్రవాదుల అప్పగింత, ఆక్రమిత కశ్మీర్ భూభాగం అప్పగింత అనే రెండే రెండు అంశాలు తప్ప, అంతకు మించి చర్చించేది ఏదీ ఉండదని కూడా తెగేసి చెప్పింది. చాలా చిత్రంగా మా దేశంలో ఉగ్రవాదులే లేరు అంటూ ఇంతకాలం బొంకిన పాకిస్తాన్ పెహల్గావ్ రక్తపాతం తెచ్చిన వీరావేశంలో చాలా విషయాలు అంగీక రించింది. అందులో ప్రధానమైనది-ఉగ్రవాదులను తాము మూడు దశాబ్దాలుగా మేపుతున్నాం అన్నదొకటి. ఆ దేశ రక్షణ మంత్రే ఈ విషయం ప్రపంచం మొత్తం వినేటట్టు మీడియాకు చెప్పాడు. భారత్ వైపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జవాబు తిరుగులేని అస్త్రాన్ని మరిపించింది. నీళ్లు, నెత్తురూ కలసి పారలేవు అని తేల్చి చెప్పారు ప్రధాని. అంతేకాదు, తూటాలు- ఉగ్రవాదం, చర్చలు కూడా ఒకేచోటకు రాలేవని వెల్లడించారు మోదీ. కాగా సింధు జలాలతో ముడిపడి ఉన్న కొన్ని ప్రాజెక్టులను కూడా తాము నిర్మించబోతున్నామని కూడా మోదీ తెలియచేశారు. బియాస్ను, గంగ కాలువను కలుపుతూ 130 కిలోమీటర్ల కాలువ నిర్మాణం అందులో ఒకటి. యమునతో కలిసే మరొక కాలువ నిర్మాణం కూడా అందులో ఉంది. భారత రాజకీయ నాయకత్వం నుంచి ఇంతటి రాజకీయ సంకల్పం గతంలో పాకి స్తాన్ చూడలేదు. ఇంత జరిగాక పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరుదేశాలకు చెందిన అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. కానీ ఆయన మాటను గౌరవించేవారు, ఆలకించేవారూ ఎవరూ లేరు. ముస్లిం దేశాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
పాకిస్తాన్ అంటేనే దగా కళలో నిష్ణాతురాలని వైమానిక దళ మాజీ గ్రూప్ కెప్టెన్ అజయ్ అహ్లావత్ తాజాగా వ్యాఖ్యానించారు. అది ప్రపంచ రాజ్యాలనే ఆ దగా కళతో దోచేస్తున్నదని కూడా అన్నారు. నిజానికి ఇది అజయ్ సొంత అభిప్రాయం అనుకోవద్దు. అమెరికా రాజనీతి శాస్త్రవేత్త సి. క్రిస్టిన్ ఫెయిర్ రాసిన వ్యాసం మీద ఆయన స్పందించారు. ‘పాకిస్తాన్ అంటేనే పెద్ద దగాకోరు. ఆ దేశం వాళ్లు అందరినీ చవటలను చేసేస్తారు. ఎవరినీ వదలరు. వాళ్లు దశాబ్దాలుగా అమెరికా మీద పడి తినేశారు. ఆ విధంగా వాళ్లనీ చవటలను చేశారు. పాకిస్తాన్ నుంచి చైనాకు ఎదురుకాబోయే అనుభవం కూడా అచ్చంగా అలాగే ఉండబోతున్నది. కానీ కాస్త సమయం పడుతుంది అంతే’ అన్నారు అజయ్. క్రిస్టిన్ పాకిస్తాన్ చేతిలో అమెరికా మోసపోయిన సంగతిని ప్రస్తావించారు. పాకిస్తాన్ మేక వన్నె పులిలాంటి రూపం తెలిసినా అమెరికా మోసపోవడమే పెద్ద వైచిత్రి అని ఆమె అంటారు. వాషింగ్టన్లోని భారత దౌత్యకార్యాలయానికి క్రిస్టిన్కు పలుసార్లు ఎదురైన ప్రశ్న ఒకటి ఉండేది. అది- ‘మీ అమెరికా వాళ్లు ఇంత సుదీర్ఘకాలం ఆ పాకిస్తానీల చేతిలో ఎలా మోసపోతూ వచ్చారో తెలుసుకోవాలని ఉంది.’ ఇంకో ప్రశ్న- ఆ రోగ్ దేశం వరసగా అమెరికా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు ఎలా అందుకోగలిగింది? ఆ డబ్బంతా పట్టుకెళ్లి ఉగ్రవాదం పెంచి పోషించ డానికి, అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి ఎలా ఉపయోగించుకోగలిగింది? క్రిస్టిన్ మరొక ఆశ్చర్యకరమైన పరిణామాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతూ అంత సానుభూతి ఎలా సంపా దించింది? ఇప్పుడు మాత్రం క్రిస్టిన్ వాస్తవం దగ్గరకి వస్తున్నారనే అనిపిస్తుంది. పాకిస్తాన్ ఆటలు సాగడానికి పాకిస్తాన్ వ్యవహారాలు చూసిన కొందరు అధికారుల ఐచ్ఛిక ధోరణే కారణమని అంటారామె. పైగా ఆసియాలోని స్థానిక సమీకరణాల గురించి వారికి తెలిసిందేమీ లేదనీ అన్నారు.
మతోన్మాదానికి సంబంధించి పాకిస్తాన్ చేసే వాదనలలో కొన్ని కప్పిపుచ్చిన అంశాలు ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్లోకి సోవియెట్ రష్యా చొరబాటు తరువాతనే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని లేదా జిహాద్ నినాదాన్ని అందుకుందని, జిహాదిస్టు విధానాన్ని చేపట్టిందని చాలామంది భావన. కానీ అది అర్ధసత్యమేనని అంటారు క్రిస్టిన్. అఫ్ఘానిస్తాన్ మీద సోవియెట్ రష్యా దండయాత్రకు చాలా ముందే జిహాదిస్టులను పాకిస్తాన్ తయారు చేసే కార్యక్రమం చేపట్టింది. 1973-74 కాలంలో జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రధానిగా ఉండగానే జిహాదిస్టు వ్యూహం అమలవుతున్నది. హుసేన్ హకానీ చేసిన పరిశోధన ఆధారంగా క్రిస్టిన్ ఈ విషయం వెల్లడించారు. అంటే ఆసియాలో సోవియెట్ రష్యా ప్రాబల్యం పెరగడం, దానిని నిరోధించడానికి అమెరికా రంగంలోకి దిగడం వంటి పరిణామాలకు చాలాముందే జిహాదిస్టులకు పాకిస్తాన్ స్వర్గతుల్యంగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆఫ్ఘానిస్తాన్ రాజు జహీర్షాను ప్రధాని, మాజీ సైనికాధికారి మహమ్మద్ దావూద్ ఖాన్ పదవీచ్యుతుడిని చేసిన సమయం నుంచి పాకిస్తాన్ జిహాదిస్ట్ విధానం పట్ల మక్కువతో కనిపిస్తుందంటారు క్రిస్టిన్. ఈ పరిణామం 1973 నాటిది. ఆ సమయం లోనే భుట్టో ఐఎస్ఐ అఫ్ఘానిస్తాన్ విభాగం ఏర్పాటు చేశాడు. దీని పని ఇస్లామిస్టులను ఏకం చేయడమే.
పాకిస్తాన్ నేడు చైనాకు దగ్గరగా ఉండవచ్చు. కానీ గతంలో ప్రపంచ రాజకీయాలలో భాగంగా జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందాలలో భాగస్వామిగా ఉన్న దేశం పాకిస్తాన్. ఉగ్రవాదం మీద అంతర్జాతీయ పోరులో అమెరికాను పాకిస్తాన్ తుదికంటా మోసగిస్తూనే ఉంది. ఒకపక్క ఉగ్రవాద ముఠాలకు చేయూతనిస్తూనే అమెరికా నుంచి బిలియన్ డాలర్ల నిధులు తెచ్చుకుంది. తాలిబన్ నాయకులకీ, హకానీ ముఠాలకీ పాకిస్తాన్ అండగానే ఉంది. ఇవి చేసిన ఘనకార్యం ఏమిటీ అంటే, అఫ్ఘానిస్తాన్లో అమెరికా నాయకత్వంలో ఉన్న నాటో సేనల మీద దాడులకు తెగబడడమే.
అమెరికాను ఈ విధంగా దగా చేస్తే, భారత్ పట్ల పాకిస్తాన్ వైఖరి మతోన్మాదం, రక్తపాతంతో కలసి ఉంది. కశ్మీర్ మీద అవాకులు చెవాకులు పేలడం, కశ్మీర్ మనదేనంటూ సొంత ప్రజలను దగా చేయడం పాకిస్తాన్ నేతలకు సర్వసాధారణం. గడచిన మూడుదశాబ్దాలుగా పాకిస్తాన్ అరాచకాలు భారత్కు చూపిన నరకం సామాన్యమైనది కాదు. పేలుళ్లు ఒకవైపు, సరిహద్దులలో ఉగ్రవాదం ఒకవైపు, చొరబాట్లు మరొకవైపు. ఇన్ని ఉన్నా, వేలాది మంది చనిపోతున్నా భారత్ అసాధారణమైన సహనం ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ చేతగానితనంగా చూసింది. ‘పాకిస్తాన్తో భారత్కు సరిహద్దు ఉగ్రవాద సమస్య ఒక్కటే కాదు. అవాంఛనీయ మార్పులు వస్తున్నాయి. భద్రతకు ముప్పు, నాణ్యమైన విద్యుదుత్పా దనకు సమస్య, వాతావరణ కాలుష్యం, జనాభా సమీకరణాల మార్పు వంటి పరిణామాలు తప్పడం లేదని భద్రతా మండలిలో మన శాశ్వత సభ్యుడు పి. హరీశ్ వాదించడం ప్రపంచాన్ని ఆలోచింప చేసిందనే అనాలి.
– జాగృతి డెస్క్