* ఆర్ఎస్ఎస్ డాక్టర్జీ కనుగొన్న ఔషధం స నిషేధాలు రాజకీయ ప్రేరేపితాలే!
* శాఖలో మార్పులను స్వాగతిస్తాం!
* వనవాసీ నాయకత్వం వారి నుంచే రావాలి!
* పంచపరివర్తన్లో మొదటిది సమరసతే!
* స్వయంసేవక్ల సోదరీమణులూ సంఘంలో ఉన్నారు
* 2047 నాటికి సంఘపని విస్తరిస్తుంది
* ఇప్పుడిక ధార్మిక విప్లవం రావాలి
– సంఘ శతాబ్ది సందర్భంగా సర్సంఘచాలక్తో ముఖాముఖీ
వందేళ్లు ఒక ధ్వజానికే నిత్య వందనం… కోట్లాది గళాల నుంచి వందేళ్లుగా ఏకైక నినాదం.. ఒకే పథంలో వందేళ్లుగా అవిశ్రాంత ప్రస్థానం. ఇది ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఏ దేశం, ఏ జాతి, ఏ సమాజం చూడని విజయం. ఏ సంస్కరోణద్యమం, ఏ విప్లవోద్యమం, ఏ అక్షరోద్యమం, ఏ ఒక్క రాజకీయోద్యమం ఆవిష్కరించలేకపోయిన ఘట్టం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి (ఆర్ఎస్ఎస్) మాత్రమే ఇది సాధ్యమైంది. 1925లో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్, విశ్వం మీద సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తూ, 2025 విజయదశమికి శతాబ్ది సందర్భంలోకి అడుగుపెడుతున్నది. మూడు నిషేధాలు, వేలాది దాడులు, నిర్బంధాలు.. వందేళ్లలో ఎన్నో కడగండ్లు, క్షుద్ర రాజకీయాలతో పెనుగండాలు, బానిస మనస్తత్వాలు పుట్టించిన నీచ అభాండాలు.. అయినా కాషాయధ్వజం రెపరెపలాడుతోంది. విజాతీయ రాజకీయంతోను ఆర్ఎస్ఎస్ కుంగిపోలేదు, పైగా రాటుదేలింది. విదేశీ సిద్ధాంతాల ఎదురుగాలిలో అస్థిత్వం కోల్పోలేదు. ఎదురొడ్డి, ప్రయాణంలో మెలకువలు గ్రహించగలిగింది. హిందూ ఐక్యతా నినాదానికి మరింత పదును తెచ్చింది. ఐక్యత దిశగా హిందూ సమాజ ప్రయాణం అప్రతిహతంగా సాగేందుకు దారులు పరిచింది. నేడు ఆసేతు శీతాచల పర్యంతం ఆర్ఎస్ఎస్ జాడ ఉంది. అయినా ఇంతటి మహా ప్రయాణంలో ఇదొక మైలురాయిగానే సంఘం భావిస్తున్నది. నిన్నటి వరకు సంఘం ఏమిటి? ఇవాళ సంఘం ఎక్కడ నిలిచి ఉంది? రేపటి సంఘం ఏమిటో, ఎటో చర్చించడానికీ, ప్రయాణం తిరిగి సాగించడానికీ, అదే ఆలోచించడానికీ శతాబ్ది క్షణం ఒక బిందువునే భావిస్తున్నది. సంఘం గురించి భారతీయులు ఏమనుకుంటున్నారు? శత్రువులు ఏమని తలపోస్తున్నారు? ఇది తెలుసుకోవడం, అందుకు అనుగుణంగా సాగిపోవడం ఎలాగో ఆలోచించడానికే ఆ సందర్భం ప్రయోజనం. అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ సంవత్సరం ఇదే చర్చించింది. ఎదురైన ప్రశ్నలకు ఎలాంటి జవాబులు ఇచ్చామో, ఇప్పటికీ ఎదురవుతున్న సవాళ్లకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో అక్కడ చర్చించారు. ఇంత ప్రయాణానికీ, భారత భూమి మీద వచ్చిన ఈ నవ చైతన్యానికీ మూలాధారమైనవి ఏమిటి? ఆత్మ విస్మృతి నుంచి సాధారణ హిందువును మేల్కొలిపినది ఏది? నిత్యశాఖ. ఆ శాఖకు క్రమం తప్పకుండా వచ్చే సాధారణ స్వయంసేవక్. శాఖలోనే సామాన్య స్వయంసేవక్ అసాధారణ విజయాలు సాధించే చరిత్ర నిర్మాతగా మారుతున్నాడు. హిందూ సమాజ చరిత్రలో భవ్యమైన పుటలు చేర్చినవారు సామాన్య స్వయంసేవకులే. ఏకాత్మతా యాత్ర, అయోధ్య, సామాజిక సమరసత అందుకు ఉదాహరణలంటే కాదనలేం కదా! ఇవాళ శాఖ హిందూ సమాజానికి ప్రతిబింబం. హిందూ సమాజం తాలూక అత్యుత్తమ స్వరూపం భారత్ను కూడా ఒక అత్యుత్తమమైన దేశంగా తయారు చేస్తున్నది. హిందూ సమాజంలో మంచితనం ఉంది. మంచితనం మాత్రమే కాదు, చరిత్ర సారాన్ని బట్టి జాతి శక్తిమంతం కూడా కావాలంటున్నది ఆర్ఎస్ఎస్. మనవైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడనంత బలోపేతం కావాలని ఆశిస్తున్నది ఆర్ఎస్ఎస్. స్వరాజ్య సమరం ఇచ్చిన విలువలు, సనాతన ధర్మం ప్రసాదించిన మార్గం దేనికీ భంగం లేకుండా భిన్నత్వాన్ని మన్నిస్తూ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయాణం అనిర్వచనీయమే. ప్రపంచశక్తిగా, విశ్వగురు స్థానం దిశగా దూసుకుపోతున్న ఒక జాతిలో స్ఫూర్తిని నింపుతూ సంఘ శతాబ్ది సందర్భంగా సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఈ అంశాలను వివరించారు. ‘ఆర్గనైజర్’ సంపాదకుడు ప్రఫుల్ల కేత్కర్, ‘పాంచజన్య’ (హిందీ వారపత్రిక) సంపాదకుడు హితేశ్ శంకర్, ‘వివేక్’ (మరాఠీ వారపత్రిక) సంపాదకురాలు అశ్వినీ మయేకర్, మలయాళ దినపత్రిక ‘జన్మభూమి’ సహ సంపాదకుడు ఎం.బాలకృష్ణన్ నిర్వహించిన ఈ ముఖాముఖీలో కొన్ని అంశాలు:
(ఈ ముఖాముఖీ ఆపరేషన్ సిందూర్ కంటే ముందే, మార్చి 21-23, 2025న అఖిల భారతీయ ప్రతినిధి సభల నేపథ్యంలో నాడు జరిగింది.)
మీరు సంఘ స్వయంసేవక్గా, సర్సంఘ్ చాలక్గా సంఘ 100 సంవత్సరాల ప్రయాణాన్ని ఎలా చూస్తారు?
డాక్టర్ హెడ్గేవార్జీ ఎంతగానో ఆలోచించి, పరిస్థితులను అర్థం చేసుకొని సంఘకార్యాన్ని ఆరంభించారు. దేశం ముందున్న సమస్యల పరిష్కారానికి ప్రయోగాలు చేసి ఒక ఔషధాన్ని కనిపెట్టారు. ఆ ఔషధం అద్భుతంగా పని చేసింది. ప్రణాళికాబద్ధంగా సంఘ పనులు జరిగిపోతుం టాయి. సంఘం తాను వెళుతున్న దారిలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగు తుంటుంది. సంఘం ఇలాంటి ఒక స్థితికి చేరు కోవడానికి 1950 దాకా సమయం పట్టింది. ఆ తర్వాత సంఘం దేశమంతటా విస్తరించింది. అప్పటి నుంచే స్వయంసేవకులు సమాజంతో మమేకం కావడం మొదలైంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల వరకు స్వయంసేవకులు సామాజిక జీవనంలోని వేర్వేరు క్షేత్రాల్లో కర్తృత్వంతో, తమదనే భావంతో, సౌశీల్యంతో పనిచేస్తూ సమాజ విశ్వాసాన్ని చూరగొన్నారు. 1990 తర్వాత ఆ భావజాలం, గుణ సంపద ఆధారంగా దేశాన్ని ముందుకు నడిపించ వచ్చని చేసి చూపించారు. ఇప్పుడు ముందున్న పని ఏమిటంటే, ఈ గుణ సంపదను, భావజాలాన్ని స్వీకరించడం ద్వారా మొత్తం సమాజం అన్ని విభేదాలను విస్మరించి నిజాయితీతో, నిస్వార్థంతో సమాజంకోసం పని చేస్తూ గొప్ప దేశంగా మార్చడం.
1948, 1975లలో ఎదుర్కొన్న నిషేధాల నుంచి సంఘం సంస్థాగతంగా ఏం నేర్చుకుంది?
ఈ రెండు నిషేధాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. ఆ నిషేధాలు విధించినవారికి కూడా సంఘ వల్ల లాభమే తప్ప ఏమాత్రం హాని ఉండదని తెలుసు. ఇంత పెద్ద సమాజంలో సర్వసాధారణంగా భావజాలాల మధ్య పోటీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సంఘంపై నిషేధం విధించారు. మొదటి నిషేధంలోని ప్రతి మాటా సంఘానికి వ్యతిరేకంగా ఉంది. దాంతో సంఘ కార్యకలాపాలను ఆపాల్సి వచ్చింది. కానీ సంఘం అన్ని ప్రతికూలతల మధ్య నిషేధం నుంచి బయటపడిరది. ఆ తర్వాత 15 నుంచి 20 సంవత్సరాలకు పూర్వ స్థితికి చేరుకొని, అంతకంటే మిన్నగా ముందుకు సాగింది. కేవలం శాఖలను మాత్రమే నిర్వహిస్తూ సామాజిక కార్యకలాపాల్లో ముఖ్య భూమికను పోషించని స్వయంసేవకులు సమాజంలోని వేర్వేరు కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వాటిల్లో సంఘ భూమికను సుస్థిరపరచసాగారు. 1948నాటి నిషేధం వల్ల సంఘానికి మేలు జరిగింది. మేం మా సామర్థ్యాన్ని తెలుసుకోగలిగాం. సమాజంలోనూ, వ్యవస్థల్లోనూ మార్పులు తీసుకురావడానికి స్వయంసేవకులు ప్రణాళికను రూపొందించుకొని ముందు వరుసలో నిలిచారు. సంఘం ఆలోచనలలో మొదటి నుంచి సంఘ పని కేవలం ఒక గంట శాఖకే పరిమితం కాదని, మిగిలిన 23 గంటల్లో సంఘ విలువలను మన వ్యక్తిగత, కుటుంబ, సమాజ, జీవనోపాధి కార్యకలాపాల్లో కూడా వ్యక్తపరచాలని నిర్ణయించారు. 1975 నాటి నిషేధకాలంలో పెరిగిన సంఘ శక్తి, సామర్థ్యాలు సమాజానికి అనుభవంలోకి వచ్చాయి. మంచివాళ్లందరు నిరాశలో మునిగిపోయి నప్పుడు, సామాన్యమైన స్వయంసేవక్లో ఈ సంక్షోభం నుంచి మనమందరం సురక్షితంగా బైటపడతామనే నమ్మకం ఉండేది. 1975లో అత్యవసరపరిస్థితి కాలంలో తనపై విధించిన నిషేధాన్ని సంఘం ఒక సమస్యగా మార్చడానికి బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసింది. ఆ సమయంలో సంఘాన్ని విమర్శించేవారికి కూడా సాయపడిరది. అప్పట్లో సమాజం గురించి ఆలోచించేవారిలో ఒక విశ్వసనీయమైన సైద్ధాంతిక ధృవంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంఘం ఏర్పరుచుకుంది. గడ్డు కాలం ముగిసిన తర్వాత సంఘం అనేక రెట్లు బలశాలిగా బయటకు వచ్చింది.
ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లు ఏవి?
ఒకప్పుడు సంఘం దగ్గర ఏమీ లేదు. భావజాలానికి గుర్తింపు లేదు, ప్రచార సాధనాలు లేవు, సమాజంలో నిర్లక్ష్యం, వ్యతిరేకత మాత్రమే ఉన్నాయి. కార్యకర్తలు కూడా లేరు. ఈ సమాచారాన్ని కంప్యూటర్లో నమోదు చేస్తే, ఇది పుట్టిన వెంటనే అంతమైపోతుందనే భవిష్యవాణి చెబుతుంది. కానీ దేశ విభజన సమయంలో హిందువులను రక్షించడంలోనూ, సంఘంపై నిషేధం విధించిన సమయంలోనూ ఎదురైన కఠినమైన సవాళ్లను సంఘం విజయవంతంగా తట్టుకొని నిలబడిరది. సంఘ పని కొనసాగుతుందని, సంఘం వృద్ధి చెందుతుందని 1950 నాటికే నిరూపితమైంది. ఈ పద్ధతిలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయవచ్చునని అనిపించింది. సంఘం మునుపటికంటే మరింతగా విస్తరించింది. సంఘం శక్తి ప్రాముఖ్యం 1975 నాటి అత్యవసర పరిస్థితి సమయంలో సంఘం పోషించిన పాత్ర వలన సమాజం దృష్టికి వచ్చింది. అలాగే, ఏకాత్మతా రథయాత్ర, కశ్మీర్, శ్రీరామ జన్మభూమి ముక్తి ఉద్యమం, వివేకానంద 150వ జయంతి వంటి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న కారణంగా సంఘం పట్ల, సంఘ భావజాలం పట్ల సమాజంలో ప్రబలమైన విశ్వాసం బాగా విస్తరించింది.
సంఘం భౌగోళికంగా, సంఖ్యాపరంగా వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ నాణ్యమైన పని చేయడంలో, స్వయంసేవకులకు మంచి ప్రశిక్షణ ఇవ్వడంలో సంఘం విజయవంత మైంది. దీనికి కారణాలు ఏమిటి?
నాణ్యత, సంఖ్యపరంగా చూసినప్పుడు మీరు సంఖ్యను కాకుండా నాణ్యతను మాత్రమే పెంచితే లేదా నాణ్యతను కాకుండా సంఖ్యను మాత్రమే పెంచితే, పెరిగిన నాణ్యత లేదా పెరిగిన సంఖ్యను నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. దీన్ని అర్థం చేసుకున్న సంఘం మొదట్నుంచీ యావత్ సమాజాన్ని సంఘటితం చేయడంపైన దృష్టి పెట్టింది. కానీ సంఘటితం చేయడానికి కూడా ఒక అర్థం ఉంది. ఒక వ్యక్తిని ఎలా సిద్ధం చేయాలి, ఇలా సిద్ధమైన వ్యక్తులను ఎలా ఉంచాలి, ‘మనం’ అనే భావన ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికే కొన్ని ప్రమాణాలు ఏర్పడినాయి.
మనం ఈ ప్రమాణాలను ఉల్లంఘించకుండా, ప్రమాణాల విషయంలో రాజీపడకుండా సంఖ్యను పెంచాలి. దీని అర్థం వ్యక్తులను సంఘానికి దూరంగా ఉంచాలని కాదు. ఒక పెద్ద సంస్థ ప్రారంభమైననాటి ఉదాహరణ ఒకటి చెబుతాను. సోషలిస్టు భావజాలంతో ఉన్న ఒక వ్యక్తి ఆ సంస్థకు కార్యకర్త అయ్యాడు. అతడికి సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది. అతడు మొదటిసారిగా అభ్యాస వర్గకు వచ్చాడు. సిగరెట్ల సంగతి పక్కన పెడితే అక్కడ సుపారి నమిలేవాళ్లు కూడా ఎవరూ లేరు. అతడు రోజంతా కిందామీదా పడ్డాడు. రాత్రి పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర పట్టడంలేదు. సరిగ్గా అప్పుడే ఆ సంస్థ మంత్రి వచ్చారు. నిద్ర పట్టకపోతే కాసేపు అలా బయట తిరిగి రండి అని అతడితో అన్నారు. మంత్రి అతడితో కొద్ది దూరం నడిచిన తర్వాత దగ్గర్లో ఉన్న కూడలిలో సిగరెట్లు దొరుకుతాయని చెప్పారు. మీకు కావలసినన్ని సిగరెట్లు తాగి తిరిగి రండి అని తెలిపారు. వర్గలో సిగరెట్లు దొరకవు. అయినా అతడు వర్గలోనే ఉండిపోయాడు. మంచి కార్యకర్తగా మారి పోయాడు. అదేసమయంలో సిగరెట్ తాగడం మానేశాడు. అతడు ఆ సంస్థను ఆ ప్రాంతంలో ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొనివెళ్లారు. ఒక వ్యక్తి ఎలా ఉంటారో అలాగే స్వీకరించాలి. పట్టువిడుపు మనలో ఉంది. అదే సమయంలో మనం కోరుకున్న విధంగా ఆ వ్యక్తిని తీర్చిదిద్దుకునే ఆత్మీయత అనే కళ కూడా మా దగ్గర ఉంటుంది. మాకు ఈ విషయంలో ధైర్యము, విశ్వాసము ఉంది. ఈ కారణంగానే సంఖ్య పెరిగినప్పటికీ నాణ్యత అలాగే ఉంటుంది. సంఖ్య కావాలి కానీ అదే సమయంలో గుణాత్మకతకూడా ఉండాలి. కానీ మొత్తం సమాజాన్ని గుణాత్మకంగా మార్చాలనే ఎఱుక మాకు ఉంది.
సంఘం నేటికీ డాక్టర్ హెడ్గేవార్జీ, శ్రీగురూజీల ప్రాథమిక ఆలోచనలకు అనుగుణం గానే ముందుకు సాగుతోంది. ఇందులో ఏదైనా మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి మార్పు జరిగింది?
డాక్టర్జీ, శ్రీ గురూజీ లేదా బాలాసాహెబ్జీ ఆలోచనలు సనాతన సంప్రదాయం లేదా సంస్కృతికి భిన్నంగా లేవు. ప్రగాఢమైన చింతన, కార్యకర్తలు ప్రత్యక్షంగా చేసిన ప్రయోగాల అనుభవ సారం సంఘ పద్ధతిని బలోపేతం చేసింది. దాంతో సంఘం పురోగమిస్తోంది. కార్యకర్తల్లో మొదట్నించీ కూడా పుస్తకాల పట్ల, వ్యక్తుల పట్ల విధేయతకు గాని, దేన్నయినా గుడ్డిగా అనుకరించడానికి గాని చోటు లేదు. తత్త్వమే మాకు ప్రధానం. మహాపురుషుల గుణగుణాలను, వారి మార్గాన్ని అనుసరిస్తాము. కానీ దేశ, కాల, పరిస్థితులను బట్టి మనం స్వయంగా బాట వేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇందుకోసమని నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఉండాలి. సంఘంలో నిత్య (శాశ్వతం) అంటే ఏమిటి? బాలాసాహెబ్జీ ఒకానొక సందర్భంలో ‘హిందుస్థాన్ హిందూదేశం’ అని అన్నారు. ఈ ఒక్క మాటను తప్ప సంఘంలో ప్రతీ దాన్ని మార్చవచ్చు. సంపూర్ణ హిందూ సమాజం ఈ దేశం పట్ల ఒక బాధ్యతా యుతమైన సమాజంగా ఉంటుంది. ఈ దేశ స్వభావం, సంస్కృతి హిందువుల సంస్కృతిగా భాసిల్లుతున్నాయి. అందుకనే ఇది హిందూదేశం అయింది. ఈ మాటను స్థిరపరుచుకొని ప్రతీది చేయాలి. అందుకనే స్వయంసేవకుల ప్రతిజ్ఞలో ‘‘పవిత్రమైన మన హిందూధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించు కోవడంతోనే హిందూ రాష్ట్ర సర్వాంగీణ ఉన్నతి’’ అనే మాట వినపడుతుంది. హిందూ పదానికి మన భాష్యం కూడా విస్తృతమైంది. దాని పరిధిలో దారి చేసుకుంటూ దేశ, కాల, పరిస్థితులకు తగ్గట్టుగా దారి మార్చుకుంటూ ముందుకు సాగేందుకు తగినంత వీలు ఉంది, అవకాశం ఉంది. ప్రతిజ్ఞలో ‘‘నేను సంఘంలో ఒక భాగస్వామిని’’ అని కూడా ఉంటుంది. భాగస్వామి అంటే సంఘ రూపకర్త, సంఘ సూక్ష్మరూపం, సంఘ అవిభాజ్య అంగమని అర్థం. అందువల్లనే వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారికి చర్చలో పూర్తి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి చేరుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను ఆ నిర్ణయంలో విలీనం చేసి ఒకే దిశగా ముందుకు సాగుతారు. తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ అందరూ దాన్ని అంగీకరించా ల్సిందే. అందువల్ల ప్రతీ ఒక్కరికీ పనిచేసే స్వేచ్ఛ ఉంటుంది. అందరి దిశా ఒకటే అవుతుంది. మనం శాశ్వతమైన దాన్ని కాపాడుకుంటాము. అశాశ్వతమైన దాన్ని దేశ, కాల, పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ ముందుకు సాగుతాం.
సమాజం మారింది, జీవనశైలి మారింది, నేటి ఈ పరిస్థితిలో సంఘ దైనందిన శాఖ నమూనా ప్రభావం అంతగా ఉందా? లేదా ఇందుకోసమని ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఉన్నాయా?
శాఖ కార్యక్రమాల్లో మార్పులు జరుగుతుంటాయి. వాటిని మేం ఆహ్వానిస్తుంటాం. కానీ శాఖ ప్రాథమిక సూత్రాలైన కలిసికట్టుగా ఉండటం, సద్గుణాలను సామూహికంగా ఉపాసన చేయడం, ప్రతి రోజూ మాతృభూమి పరమవైభవం కోసం పనిచేస్తున్నామనే సంకల్పాన్ని చేయడం. ఒకరితో ఒకరు కలిసిపోవడం, పరస్పరం సహాయం చేసుకోవడం అనేవి శాఖ మూలాధారాలు. వీటికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. సామాన్యులెప్పుడూ సామాన్యులుగానే ఉంటారు. వారెప్పుడైతే ఇతరులతో కలిసిమెలిసి జీవించడం మొదలుపెడతారో అప్పుడు వారు అసామాన్యులౌతారు. సామాన్య వ్యక్తులు అసామాన్యమైన పనులు చేస్తారు. అసామాన్యమైన త్యాగాలు కూడా చేస్తారు. కానీ, దానికంటూ ఒక వాతావరణం ఉండాలి. అలాంటి ఒక వాతావరణంలో మమేకమైపోవాలి. ఆ తర్వాత వచ్చే పరివర్తనకు కారణం తార్కాణం, ఆత్మీయత తప్ప మరొకటి కాదు. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లండి. అక్కడ ఏదైనా మార్పు వచ్చి ఉంటే దాని వెనుక ఒక నమూనా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. దూరంగా ఉంటే కుదరదు. ఆప్తుడుగా మారి దగ్గరకు వెళ్లాలి. అప్పుడు అది మనకు చేరువైపోతుంది. మహాపురుషులు చాలా మంది ఉన్నారు. నాకు వారందరూ తెలుసు. వారి పట్ల మనకు గౌరవ, మర్యాదలు ఉన్నాయి. కానీ నేను ఎవరి ప్రభావంలో ఉంటానో అలాగే నడుచుకుంటాను. వారిలాగే వ్యవహరిస్తాను. కానీ నా మిత్రుడు నాకన్నా కాస్త మంచివాడైతే అతడ్నీ అనుసరిస్తాను. ఇదే మార్పునకు సంబంధించిన ఓ నిరూపితమైన పద్ధతి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అప్పటివరకు శాఖకు మరో నమూనా ఉండదు. కార్యక్రమాలు, తదితరాలు మారిపోతాయి. శాఖ సమయం మారిపోతుంటుంది. రూపం మారిపోతుంటుంది. శాఖ కార్యక్రమం పరిపరి విధాలుగా ఉంటుంది. అందుకు ఆది నుంచీ అనుమతి ఉంది. కానీ శాఖకు ప్రత్యామ్నాయం లేదు. శాఖ ఏనాటికీ అప్రస్తుతమైపోదు. నేడు అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి శాఖ నమూనా గురించి అధ్యయనం చేస్తున్నారు. అడిగి మరీ తెలుసుకుంటున్నారు. మేం ప్రతీ పదేళ్లకు ఒకసారి మరో ప్రత్యామ్నయం ఉందా అని చర్చిస్తుంటాం. నేను నేటివరకూ అలాంటి 6 నుంచి 7 చర్చల్లో పాల్గొన్నాను. కానీ మేం ఏదైతే చేసుకుంటూ పోతున్నామో దానికి సంబంధించి ఇప్పటివరకూ మరో ప్రత్యామ్నాయం లభించలేదు.
సంఘాన్ని ఎవరైతే బయట నుండి చూస్తారో, సంఘ అనుభూతి ఎవరికైతే కలుగదో వారికి సంఘం రూపురేఖలు మాత్రమే అర్థమవుతాయి. కానీ ఇంత సుదీర్ఘ ప్రయాణంలో సైద్ధాంతిక విమర్శ, ఆత్మచింతన ప్రక్రియ ఎలా ఉంటుంది?
దానికి ఒక ప్రక్రియ ఉంది. అందులో నిశ్చితమైన ఆశయాలు, ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని అందించే పద్ధతి వేర్వేరుగా ఉంది. రూపురేఖలు మాంనవచ్చు. కాని రూపురేఖల అంతర్భాగంలో ఉన్నది మాత్రం మారదు. పరిస్థితితోబాటు మనఃస్థితి ప్రాముఖ్యత కూడా ఉంటుంది. అందువల్లనే మేము ఇచ్చే ప్రశిక్షణలో దేశ పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్లు మొదలైన వాటిని గురించి సంపూర్ణంగా ఆలోచిస్తాం. దానితోబాటుగా అనేక సందర్భాల్లో స్వయంసేవక్ ఎలా ఉండాలి, ఏ గుణాల ఆధారంగా సంఘటన చేయబడుతుంది. అతనిలో ఆయా గుణాల వికాసం కోసం ఏమి చేయాలనే విషయాలను కూడా ఆలోచిస్తాం. ప్రార్థనలోని సామూహిక సంకల్పం, ప్రతిజ్ఞలో అది వ్యక్తిగత సంకల్పంగా ప్రతిదినం స్మరిస్తాం. స్వయంసేవక్ అంటే స్వయంగా ప్రారంభించేవాడని అర్థం. సంఘంలో ఘటకుడు అనే పదానికి అర్థం ‘‘నేను ఎలా ఉన్నానో సంఘం అలానే ఉంది, సంఘం ఎలా ఉందో నేను అలానే ఉన్నాను’’. ఉదాహరణకు సముద్రంలో ప్రతి నీటిబిందువు సముద్రంలాగానే ఉంటుంది. అదేవిధంగా అన్ని బిందువుల కలయికతోనే సముద్రం ఏర్పడుతుంది. ఈ విధంగా ఒకటి` పూర్ణత్వ సంబంధం సంఘంలో ప్రారంభం నుండే వస్తున్నది. స్వయంసేవక్లో ఆత్మచింతన నిరంతరం జరుగుతుంది. స్వయంసేవక్ ద్వారా విజయం చేకూరితే ఆ శ్రేయస్సు సంఘానిదే. ఒకవేళ విజయం లభించకపోతే ‘‘నా వలన ఎక్కడ లోపం జరిగిందని’’ ప్రతి స్వయంసేవక్ ఆలోచిస్తాడు. ఇలాంటి ప్రశిక్షణే స్వయంసేవకులకు ఇస్తారు.
సంఘం వనవాసీ ప్రాంతాలలో ఎలా ముందుకు సాగుతోంది?
వనవాసీ ప్రాంతాలలో మొదటగా చేయవలసిన పని వనవాసీ బంధువులకు సాధికారత కల్పించడం. వారికి సేవ చేయడం. ఆ తర్వాత వారి ప్రయోజ నాలను కాపాడటానికి ప్రయత్నాలు జరగాలనే అంశం చేర్చడమైనది. వనవాసీ సమాజం పట్ల శ్రద్ధ చూపుతూ అది దేశ జన జీవనంలో ఒక భాగంగా అర్థం చేసుకొని దానిని ముందుకు తీసుకొని వెళ్లే నాయకత్వం వనవాసీ సమాజం నుంచే ఉద్భవించాలని మేం కోరుకుంటున్నాము.ఈ ప్రాంతాల్లో పని చేస్తున్న స్వయంసేవకుల సంఖ్య పెరుగుతోంది. వనవాసీ సమాజం అంటే ఏమిటి?వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి? వనవాసీ సమాజం నుంచి ఉద్భవించిన గొప్ప వ్యక్తులు, స్వరాజ్య సమరానికి దోహదపడిన వనవాసీ వీర నాయకులు.. ఈ విషయాలన్నింటి గురించి వారికి అవగాహన కల్పిస్తూనే, క్రమక్రమంగా జాతీయ స్వరంలో మాట్లాడేవారు, ఇందుకు వారిలో నుంచే సహకరించే కార్యకర్తలు, నేతృత్వం వహించే వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈశాన్య ప్రాంతాలతో పాటు ఇతర వనవాసీ ప్రాంతాల్లో సంఘ శాఖల సంఖ్య పెరుగుతోంది.
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాల్లో హిందువులు పీడనకు గురవుతున్నారు. వారిపై హింస చోటు చేసుకుంటోంది. ప్రపంచంలో మానవహక్కుల గురించి ఆందోళన చెందుతున్న వారు హిందువుల గురించి కూడా అదే విధంగా ఆందోళన చెందుతారా? ఈ విషయం సంఘ ప్రతినిధి సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
హిందువులు బలంగా మారినప్పుడే వారిని గురించి ఆలోచన జరుగుతుంది. ఎందుకంటే హిందూ సమాజం, భారతదేశం కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి. హిందూ సమాజం తాలూకు అత్యుత్తమ స్వరూపం భారతదేశాన్ని కూడా ఒక అత్యుత్తమమైన దేశంగా తయారుచేస్తుంది. తమను తాము హిందువులుగా చెప్పుకోని వారిని కూడా భారత్ ముందుకు తీసుకొనివెళ్లగలదు. ఎందుకంటే వారు కూడా హిందువులే. భారతదేశంలోని హిందూ సమాజం బలపడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారంతటవారుగా బలం పుంజు కుంటారు. ఈ పని జరుగుతున్నది కానీ పూర్తి అయితే కాలేదు. క్రమక్రమంగా ఆ పరిస్థితి ఏర్పడుతున్నది. బాంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హింసాకాండపై మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఆక్రోశం, కోపం వ్యక్తమైనాయి. ఇంతే కాదు.. అక్కడి హిందువులు తామిక ఏమాత్రం పారిపోయేది లేదని, బదులుగా అక్కడే ఉంటూ తమ హక్కులను పొందుతామని చెప్పారు. ఇప్పుడు హిందూ సమాజం అంతర్గతంగా బలపడుతోంది. ఒకవైపు సంస్థ అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు దాని ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అప్పటివరకు పోరాడుతూనే ఉండాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో వారి కోసమని ఒక హిందూ సంస్థ(సంఘటన)గా మన పరిమితుల్లో మనం ఉంటూనే చేయగలిగినదంతా చేస్తాము. అందుకే సంఘం ఉంది. స్వయంసేవక్ చేసే ప్రతిజ్ఞ కూడా ‘‘ధర్మం, సంస్కృతి, సమాజాలను పరిరక్షించడం ద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి’’ కి పాటుపడాలని చెబుతోంది.
అంతర్జాతీయ వ్యవస్థలో సైనిక శక్తి, దేశ భద్రత, ఆర్థిక శక్తికి సంబంధించి వాటికంటూ ఒక ప్రాముఖ్యం ఉంది. దీని గురించి సంఘం ఏమనకుంటోంది?
ఎవరైనా సరే శక్తిమంతంగా ఉండి తీరాలి. సంఘ ప్రార్థనలో ` అజయ్యాంచ విశ్వస్య దేహీశ శక్తిమ్ అని ఒక పంక్తి ఉంది.మనల్ని ఎవరూ జయించలేనంత శక్తి మనకు ఉండాలి. మన సొంత బలమే నిజమైన బలం అవుతుంది. భద్రతకు సంబంధించినంతవరకు మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మన భద్రతను మనమే చూసుకోవాలి. మనల్ని ఎవరూ ఓడిరచలేరు. యావత్ ప్రపంచం కలిసి వచ్చినా మనల్ని ఓడిరచలేనంతగా మనం శక్తిమంతులం కావాలి. ఎందుకంటే ప్రపంచంలో కొందరు దుష్టులు ఉన్నారు. వారిది దుందుడుకు స్వభావం. మంచివారు కేవలం మంచితనంతోనే భద్రంగా ఉండలేరు. మంచి తనంతో పాటుగా శక్తి కూడా ఉండాలి. ఒంటరిదైన ఒక దారీ తెన్నూ అంటూ లేని శక్తి హింసకు కారణమవుతుంది. అందుకనే దానికి తోడుగా మంచితనం ఉండాలి. ఈ రెండిరటినీ మనం ఆరాధించాలి. భారత్ అజేయమవుతుంది. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశయచ దుష్కృతామ్’ ఇలాంటి సామర్థ్యం ఉండాలి. చెడును అంత మొందించేటప్పుడు ఎలాంటి ఉపాయంతో పనిలేదు. కానీ తోడుగా స్వాభావికంగా మంచితనం ఉన్నప్పుడు రావణుడ్ని అంతమొందించి, విభీషణుడ్ని రాజును చేసి తిరిగి వచ్చేస్తారు. యావత్ ప్రపంచ వ్యవహా రాలపైన మన ప్రభావం ఉండాలని మనం అనుకోవడంలేదు. ప్రతి ఒక్కరి జీవితం ఆరోగ్య వంతంగా, సమర్థమంతంగా ఉండాలనే మనమిలా చేస్తున్నాం. మనం శక్తిమంతులం కావాలి. ఎందుకంటే మన సరిహద్దుల వద్ద దుర్మార్గుల దుష్టత్వాన్ని మనం అనుభవిస్తున్నాము కాబట్టి.
సంఘ శతాబ్ది సంవత్సరంలో ఐదు పరివర్తనలతో ఒక తీర్మానం వచ్చింది. దీనికి సంబంధించి ఏదైనా కార్యాచరణ ప్రణాళిక తయారైందా? దాని ఆధారంగా మున్ముందు చేయాల్సింది ఏముంది?
ఆచరణాత్మక పరివర్తనకు మానసిక భావన చాలా అవసరమైంది. ఏ పని అయితే మానసిక భావనను, స్వభావాన్ని మారుస్తుందో ఆ పనినే ఇవ్వాలి. దాంతో జీవితం కూడా చక్కబడుతుంది. అందుకనే ఐదు పరివర్తనల ప్రస్తావన వచ్చింది. మొదటగా సామరస్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. అది మన సమాజంలో ప్రేమను పెంచాలి. విభిన్నమైన సమాజాలు భిన్నమైన పరిస్థితుల్లో, వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో సమస్యలతో ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలో మీకోసం ఒక నియమం చేసిపెట్టి ఉంది, అది నాకు కూడా మంచిది అనేది సరికాదు. దీని నుంచి ఒక దారి ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అవి మన మనసులో ఉన్నట్లయితే సురక్షితంగా ఉంటాము. దానితోపాటు ప్రేమ పెరుగుతుంది. మనం సామాజిక సమరసతను పాటించాలి. అందులో సామాజిక సమరసతను ప్రచారం చేసుకునే ఉద్దేశం లేదు. ప్రత్యక్ష సమాజం వెలుపల రకరకాలవాళ్లు ఉన్నప్పటికీ మేం ఒకదాన్ని ఆమోదిస్తాం. అదేమిటంటే అన్నిరకాల వాళ్లు నాకు మిత్రులు కావాలి. వారు నా కుటుంబానికి స్నేహితులు కావాలి. ఎక్కడైతే మన ప్రభావం ఉంటుందో అక్కడ మందిరం, బావి, శ్మశానం అందరికీ సమానంగా ఉండాలి. ఇది ఆరంభం మాత్రమే. దీనిని మరింతగా విస్తరించాలి. కుటుంబ ప్రబోధనం ఇలాగే ఉంటుంది. ప్రపంచానికి ఉపశమనం కలిగించే మాటలు తరతరాలుగా ఆచరిస్తున్న సంస్కారాల నుంచి వస్తాయి. అవి కుటుంబ సంప్రదాయాల్లో ఉన్నాయి. దేశ ఆచార, వ్యవహారాల్లో ఉన్నాయి. అలాంటి విషయాలపై కూర్చొని చర్చించాలి. ఒక ఏకాభిప్రాయానికి రావాలి. కుటుంబంలో ఆచరించాలి. కుటుంబ ప్రబోధనం అంటే ఇదే. పర్యావరణానికి సంబంధించి ఉద్యమాలతోపాటుగా అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ మనిషి తన ఇంట్లో నీరు వృధాగా పోతోందని చింతించడు. ముందుగా నీటిని ఆదా చేయండి. మొక్కలను నాటండి. ప్లాస్టిక్ను తొలగించండి. ఇలా చేయడంతో అవగాహన పెరుగుతుంది. వ్యక్తిలో ఆలోచన మొదలవుతుంది. ఇది స్వయంగా మీరు చేయండి. మీరు మీ స్వభావాన్ని బట్టి ప్రవర్తించాలి. మనందరం జాతీయత, ‘స్వ’ భావన ఆధారంగా ముందుకు సాగుదాం. మన ఇంట్లో వేష, భాషలు, ఆహార, విహారాలు, పూజ మనవై ఉండాలి. ఇంటి వెలుపల ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా ఆ పని చేయాలి. మన ఇంట్లో మనమే ఉంటాం. అవి ఉంటే వాటి వల్ల సంస్కారానికి కూడా రక్షణ దొరుకుతుంది. మన దేశం స్వావలంబన సాధించాలంటే మనం మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలి. దీన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. అలాగని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిలిపివేయాలని కాదు, సమతుల్యత పాటించాలి. దేశానికి అవసరం అనిపిస్తే అనుకున్న ప్రకారం జరిపించవచ్చు. విదేశాల నుంచి తీసుకురావాల్సి వస్తే తీసుకొని రండి. కానీ మన స్వంత షరతులకు లోబడి ఎవరి ఒత్తిడి లేకుండా అవసరమైన వాటిని విదేశాలనుంచి తీసుకొని రావొచ్చును. ఇవ్వన్నీకూడా స్వీయ ఆచరణతోనే జరుగుతాయి.
చట్టం, రాజ్యాంగం, సామాజిక మర్యాదలకు కట్టుబడి ఉండాలి. స్వయంసేవకులు ఈ ఐదు అంశాలను తీసుకొని ఆ మార్గంలో ముందుకు సాగుతారు. శతాబ్ది సంవత్సరం సంపూర్ణమైన తర్వాత వారు వాటిని శాఖల ద్వారా సమాజంలోకి తీసుకొనివెళతారు. ఇది ఆచరణలోకి వస్తే దాని నుంచి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఒక వాతావరణం అంటూ ఏర్పడిన తర్వాత పరివర్తన వస్తుంది. మున్ముందు చాలా విషయాలు వస్తాయి. అవి ఇక్కడి నుంచే క్రమక్రమంగా మొదలవుతాయి. ఇదీ మా ఆలోచన.
భారతదేశ భాష, సాంస్కృతిక, ధార్మిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘ సమ్మిళితత్వాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది?
సంఘలోకి వచ్చి చూడండి. అన్ని భాషలు, సంప్ర దాయాలకు చెందిన ప్రజలు కలసికట్టుగా ఆనందంతో పనిచేస్తుంటారు. సంఘ పాటలు హిందీలో మాత్రమే కాకుండా అనేక భాషల్లో ఉంటాయి. ప్రతీ భాషలోనూ సంఘ పాటను ఆలపించే గాయకులు, పాటను రచించే కవులు, సంగీతాన్ని అందించేవారు ఉంటారు. అయినప్పటికీ సంఘ శిక్షావర్గల్లో ఇచ్చిన మూడు పాటలను భారతదేశంలో అందరూ ప్రతీ చోటా పాడుతుం టారు. ప్రజలందరూ వారి వారి విశిష్టతలను పదిలపరుచుకుంటూ ఒక్కటైన జాతీయతా గౌరవాన్ని, సంపూర్ణ సమాజం ఐక్యతా భావాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదీ సంఘం అంటే. ఇంతటి వైవిధ్యంతో నిండిన సమాజాన్ని ఒక్కటిగా ఉంచే సూత్రాన్ని మేము అందిస్తాము.
సంఘం సామాజిక సమరసత గురించి మాట్లాడుతుంది. దాని కోసమని పని కూడా చేస్తుంది. కానీ కొంతమంది సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. ఈ రెండిరటి మధ్య తేడాను మీరు ఎలా చూస్తారు?
సమానత్వమనేది ఆర్థికపరమైనది, రాజకీయ పరమైనది. సామాజిక సమానత్వం రావాలి. లేకపోతే వాటికి అర్థం ఉండదు. బంధుభావనే సామరస్యం అవుతుంది. స్వేచ్ఛ, సమానత్వం రెండిరటికీ ఆధారం బంధుభావమే. స్వేచ్ఛ లేని సమానత్వం సంకుచితత్వాన్ని తెస్తుంది. అది స్థిరంగా ఉండాలంటే దానికి సోదరభావం అనే ఆధారం అవసర మవుతుంది. ఈ సోదరభావమే సామరస్యం. అదే సమానత్వానికి ముందస్తు షరతు అవుతుంది. కులతత్వం, అంటరానితనానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పటికీ అసమానత తొలగిపోలేదు. ఎందుకంటే అది మనసులోనే ఉంటుంది కాబట్టి. దానిని మనసులో నుంచి తొలగించాలి. అందరూ మన వారే కాబట్టి మనమందరం సమానమేనని భావిం చాలి. మనం చూడ్డానికి ఒకేలా కనిపించక పోయి నప్పటికీ మనం ఒకరికొకరం చెందినవారం. మనం అనుబంధంతో కట్టుబడి ఉన్నాము. దీనినే సామరస్యం అని అంటారు. ప్రేమభావం, బంధు భావాన్ని కూడా సమరసత అని అంటారు.
సంఘంలో మహిళల భాగస్వామ్యం గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతుంటాయి. దాని గురించి మీరు ఏమి చెబుతారు?
సంఘం ప్రారంభించిన కొత్తలో, 1933 సంవత్సరానికి కాస్త అటూ ఇటూగా మహిళల వ్యక్తిత్వ వికాసం, సామాజిక సంఘటన పనిని రాష్ట్ర సేవికా సమితి ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆ వ్యవస్థ కొనసాగుతోంది. మహిళల కోసమని సంఘం ఈ పని చేయాలని రాష్ట్ర సేవికా సమితి చెప్పినప్పుడు మనం అందులోకి అడుగుపెడతాము. ఇక్కడ ప్రస్తావించాల్సిన మాట మరొకటి ఉంది. అదేమిటంటే సంఘ శాఖా కార్యమ్రాలు పురుషులకు మాత్రమే ఉద్దేశించినవి.
ఆ కార్యక్రమాలను చూడటానికి మహిళలు రావొచ్చు. మహిళలు వస్తున్నారు కూడా. కానీ సంఘ పని దాని కార్యకర్తల మీద ఆధారపడి జరగదు. మన తల్లులు, సోదరీమణులు తలా ఓ చేయి వేసినప్పుడు మాత్రమే సంఘం ముందుకు సాగుతుంది. సంఘ స్వయంసేవక్ ఇంట్లో ఎందరైతే మహిళలు ఉన్నారో వారంతా సంఘంలో ఉన్నారు. వేర్వేరు సంస్థలలో కూడా మహిళలు సంఘ స్వయసేవకులతో కలిసి పనిచేస్తుంటారు. సంఘ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాల్లోనూ వారి ప్రాతినిధ్యం, చురుకైన భాగస్వామ్యం ఉంది. ఈ మహిళలు మొదటిసారిగా భారతీయ మహిళా జగత్తుపై ఒక సర్వే నిర్వహించారు. దీనిని ప్రభుత్వం కూడా ఆమోదించింది. దాని ద్వారా గత సంవత్సరం అతి పెద్ద మహిళా సమ్మేళనం జరిగింది. అందులో లక్షల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ పనులన్నింటికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉన్నాయి. మహిళోద్ధరణను పురుషులు చేయలేరని మేము నమ్ముతున్నాము. మహిళలు తమను తాము ఉద్ధరించుకోగలరు. అందులో అందరి ఉద్ధరణ జరుగుతుంది. అందుకనే మేం వారికి ప్రాముఖ్యం ఇస్తున్నాము. వారు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి వారికి అధికారం ఇస్తున్నాము.
వచ్చే 25 సంవత్సరాలకు ఎలాంటి సంకల్పం చేసుకున్నారు?
సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం, దేశాన్ని సుసంపన్నం చేయడం. అంతకు మించి యావత్ ప్రపంచాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక నిగూఢ విషయం ఉంది. డాక్టర్ హెడ్గేవార్ కాలం నుంచీ ఈ దృక్పథం ఉంది. వారు 1920లో ‘‘భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం మన ధ్యేయం. స్వతంత్ర భారతదేశం ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ విధానం బారి నుంచి విముక్తి కల్పిస్తుంది’’ అని భారత జాతీయ కాంగ్రెస్ చెప్పాలని ఆకాంక్షించారు.
సంఘం ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. భారత్ విశ్వగురువుగా ఎలా అవతరిస్తుంది? కొంత మంది రకరకాలుగా భేదభావాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. దీన్నంతటిని మీరు ఎలా చూస్తారు?
మేము ఏదైతే ప్రక్రియ చేపట్టామో అందులో ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాము. ప్రస్తుతం మనం ఆత్మవిస్మృతి, స్వార్థం, వివక్ష అనే మూడు విషయాలపై పోరాడుతూ ముందుకు సాగుతున్నాము. నేడు సమాజానికి విశ్వాసపాత్రులమైనాము. ఈ ప్రక్రియ మరింతగా ముందుకు సాగుతుంది. సమాజంలోని ప్రజలందరూ అనుబంధాన్ని ఒక ఆలంబనగా చేసుకొని ఒకేరకమైన మానసిక స్థితికి చేరుకుంటారు. ఒకటి, ఒకటి కలిస్తే రెండు అవ్వడానికి బదులు అది 11 అవుతుంది. భారతదేశాన్ని సంఘటితపరిచి, సుసంపన్నం చేసే పని 2047నాటికి మరింతగా విస్తరించి ముందుకు సాగుతుంది. విశ్వవేదికపై సంపూర్ణమైన అర్హతతో అవతరించిన సామరస్యపూర్వకమైన, శక్తిమంతమైన భారత్ను చూసిన ప్రపంచ ప్రజలందరూ దానిని అనుసరించడానికి ముందుకు సాగుతారు. 1992లో మన జ్యేష్ఠ కార్యకర్తల్లో ఒకరు మాట్లాడుతూ ‘‘ఈ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ును చూసి ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు వారి వారి దేశాల్లో తమకంటూ సంఫ్ును స్థాపించుకుంటారు. ఇది యావత్ ప్రపంచ జీవనంలో మార్పును తీసుకొని వస్తుంది’’ అని అన్నారు. ఈ ప్రక్రియ 2047 తర్వాత మొదలవుతుంది. అది పూర్తి కావడానికి వందేళ్ళు పట్టదు. వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల్లో అది పూర్తవుతుంది.
ఈ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని హిందూ శ్రేయోభిలాషులు, సంఘ హితైషులు, దేశ హితైషులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు హిందూ సమాజం మేల్కొనాలి. మనలోని అన్ని విభేదాలను, స్వార్థాన్ని మరిచిపోయి, మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి జీవితాన్ని శాశ్వతమైన హిందుత్వ ధర్మ విలువలు ప్రాతిపదికగా రూపుదిద్దుకోవాలి. తద్వారా శక్తిమంతమైన, నైతిక సంపన్నమైన, అన్ని విధాలుగా సుసంపన్నమైన భారత్ను నిలబెట్టాలి. వ్యవసాయ రంగంలో విప్లవం వచ్చింది. పారిశ్రామిక రంగంలో విప్లవం వచ్చింది. సాంకేతిక రంగంలో విప్లవం చోటు చేసుకుంది. ఇప్పుడిక ధార్మిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. నేను మతం గురించి మాట్లాడటం లేదు. సత్యం, స్వచ్ఛత, కరుణ, తపస్సు ఆధారంగా మానవ జీవితాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. దానికి భారత్ మార్గదర్శనం అనివార్యం. సంఘ పనికి ఉన్న ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనమందరం ‘నేను నా కుటుంబం’ అనే వలయం నుంచి వెలుపలకు రావాలి. మన జీవితాన్ని ఒక ఆదర్శంగా మలచుకోవాలి. తద్వారా చురుకుగా ఉంటూ మనమందరం కలసికట్టుగా ముందుకు సాగడం ఎంతో అవసరం.