జ్యేష్ట శుద్ధ త్రయోదశి, 9 జూన్‌ ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం

‘‘‌ధర్మం నశించిపోయింది’’, ‘‘ధర్మచ్యుతి జరుగుతోంది’’ వంటి మాటలు అనుదినం వినిపిస్తున్నాయి. నలువైపులా నైరాశ్యం వ్యాపించి సామాజిక జీవితం అధోగతిపాలై పోతున్నది. గోమాతల హత్యాకాండకు హద్దులేదు. సాధారణ ప్రజాహృదయం భయకంపితయై కింకర్తవ్య విమూఢతవల్ల దిక్కులు చూస్తూన్నది. దేశంలోని ప్రజలంతా బీద సాదలనే భేదం లేకుండా శరణుకై పరితపించారు. పెద్ద పెద్ద హిందూరాజులూ, యోధులూ, సేనానులూ కూడ విదేశీయుల పాదసేవ చేస్తూ జీవితం గడుపుతున్నారు. సమాజ నాయకులూ; బుద్ధిమంతులూ; పరాక్రమవంతులూనని పేరు పొందినవారంతా దాస్యశృంఖాలచే బందీలై, నవాబుల కొలువు కూటాలలో జీవచ్ఛవాల్లా, నిర్జీవ ప్రతిమల్లా, ముసల్మానుల దుశ్శాసనాలకు లొంగి సర్వ విషయాలలోనూ, పూర్తిగా విఫలులై, ఆ వైఫల్య నైరాశ్యాలన్నిటికి, ఉపశమనంగా మహమ్మదీయ సుల్తానుల యెడ భక్తి కుదుర్చుకొని ఊరట చెందుతున్నారు.

ఇలా నలుదిశలా చీకట్లు అలుముకొని యున్న సమయాన ఆశకు కాని, రక్షణకుకాని దారి తెన్నులు కనబడని సమయాన, అటు హిమాలయాల మొదలు, ఇటు కన్యాకుమారి వరకు స్వాతంత్య్ర ఘోష ప్రతిధ్వనిస్తోందా అన్నట్లు (శాలివాహన శక 1549వ సంవత్సరం అక్షయనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమినాడు/ క్రీస్తుశకం 1627 మే నెల) హైందవీ స్వరాజ్యానికి ధార్మిక ప్రాతిపదికలు నిర్మించి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దిన వీరతపస్వి శివాజీ శివనేరి దుర్గాన, జిజాబాయి గర్భాన జన్మించాడు. ప్రాచీన సాంస్కృతిక జీవన స్రవంతిని ఉగ్గుపాలతో రంగరించి పోసి భవిష్యత్తులో దేశాన్నీ, సమాజాన్నీ, స్వర్ణపథాన నడిపించే ఏకైక నాయకునిగా తయారుచేసి మాతృత్వానికి విలువనిచ్చింది జిజాబాయి. ఆమె సామాన్య స్త్రీకాదు, దేశ దాస్య విమోచనానికి, ఆత్మ గౌరవ ప్రతిష్టాపనకు జీవితమును నివాళించిన దేశ సేవిక.

ఆదర్శపురుషుడు

నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల కన్న దారుణ పరిస్థితుల్లో సాహసంతో నిల్చుని పరిస్థితులను జయించి తన ధ్యేయాన్ని సాధించి స్వతంత్ర శంఖారావం పూరించిన శివాజీని నేడు మనం స్మరించుకొందాం. ఆయన తన ప్రాణాలను కోల్పోయిన హుతాత్ముని వలెనో, వీరయోధునివలెనో జీవించలేదు. పరిస్థితులను జయించాలన్న దృఢవాంఛతో తన బుద్ధి చాతుర్యాన్నీ, నడవడికనూ వినియోగించి, ఆదర్శాన్ని సాధించిన మహా పురుషుడాయన. ఆయన హైందవ శక్తిని సృష్టించలేదు. ఆ శక్తి అంతకుముందే పుట్టి ఛిన్నాభిన్నమైన చెల్లాచెదురై పడి ఉంది. ఆ శక్తిని ఒక్కటిగా బంధించి, దేశభక్తిచే పునీతం చేసి; సాక్షాత్తు హైందవ ప్రజల పాలిట దైవంలా ప్రత్యక్షమయినాడు. తన ఉద్యమానికి ఊపిరి ‘‘స్వతంత్ర సాధన’’గా పెట్టుకున్నాడు. తల్లిని పూజించినాడు, తాను పూజలనందినాడు. సంపూర్ణ సంతృప్తితో ‘‘బానిసగా చచ్చి వీరునిగా బ్రతకండి’’ అని దేశానికి సందేశమిచ్చినాడు.

శివాజీ సామ్యవాదియా?

సామ్యవాద నాయకులు కొందరు శివాజీని తమ పార్టీలో చేర్చుకున్నారు. శివాజీ మహారాజు ధర్మ సంస్థాపకుడు కాదనీ, సామ్యవాద విప్లవ నాయకుడనీ నిరూపించడానికి పత్రికలలో వ్యాసాలు రాశారు. శివాజీ మహారాజు వర్గ పోరాటాన్ని ప్రోత్సహించా రనీ, కర్షకులను జమీందారుల బారి నుంచీ, సర్దారుల బారి నుంచీ రక్షించడానికే ప్రయత్నించాడనీ ప్రతి పాదించారు. కాని శివాజీ చేసిన నిజమైన కార్యక్రమం మరుగున పడలేదు. తన ఉద్దేశాన్ని గురించి, కార్యక్రమాన్ని గురించి, ఆయన స్పష్టంగా రాసి ఉంచారు. దానిని సందేహించడానికి వీలులేదు. శివాజీ కర్షకులను (మావళులను) సంఘటితపరచిన మాట వాస్తవమే. కాని 19వ శతాబ్దంలో జన్మించిన కారల్‌ ‌మార్కస్ ‌వ్రాసిన పుస్తకాలను చదివి 17వ శతాబ్దంలో జన్మించిన శివాజీ ‘వర్గపోరాట’ సిద్ధాంతాన్ని అనుసరించి సామ్యవాద సంఘటన చేశాడనడం కానీ, సామ్యవాద విప్లవాలను లేవదీశాడని అనడంకానీ శుద్ధ అబద్ధం. యదార్థం ఒకటి ఉన్నది. శివాజీ జీవితం శంకింపరాని యదార్థం కావడం వల్ల ఏ పార్టీ ఆయనను విడువదలచుకొనలేదు. కానీ నిజమైన ఆయన మహత్తును రూపుమాపడానికే కొన్ని పార్టీలు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కాని ఇలా చేయడం, తమ కండ్లలో తాము దుమ్ముజల్లుకొనడమే. ఆ మహాపురుషుని మరువడానికి, మరిపించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన తన ప్రభావాన్ని దేశానికి కనబరుస్తూనే ఉంటాడు. శివాజీ మహారాజును మొగల్‌ ‌సామ్రాజ్యాన్ని నిరోధించినందుకు ‘మూర్ఖు’డని తిట్టి తీవ్రంగా విమర్శించిన ఒకానొక మహానుభావుడు దేశ విభజన సమయంలో నలువైపులా నిరాశ, అంధకారం కన్పించగా హృదయస్ఫూర్తిగా మేని గగుర్పాటుతో ‘శివాజీ చరిత్రను స్మరించుకొననిచో మన జాతి అభ్యుదయాన్ని పొందజాలదు’ అని అంగీకరించవలసి వచ్చింది.

మానవుని జీవితం, భౌతిక సంబంధమైన విషయాలకే స్థిమితమై ఉందని మార్కస్ ‌దృక్పథం. కాని మానవుడు పశువును బోలిన ప్రాణే అయితే నియమబద్ధమైన జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? తోటివారి కష్టాలను తనవిగా భావించుకొని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడగల చిత్తస్థైర్యం అతనికి ఎలా లభిస్తున్నది? పరోపకారానికై తన సర్వస్వాన్ని సమర్పించాలనే ఉదాత్త భావం అతని మనసులో ఎందుకు జనిస్తున్నది? ఈ ప్రశ్నలకు ‘కమ్యూనిజం’ సమాధానం ఇవ్వలేదు.

బాల్యం

షాహజీ లాంటి విపుల పరాక్రమవంతుడూ, రాజనీతి విశారదుడూ, నిజాం నవాబుకు వారసుడైన ఒక బాలునికి, రాజ్యం ఇప్పించటానికి ఎన్నో సంవత్సరాలవరకు మొగలులతో యుద్ధం చేస్తూ వచ్చాడు. ఒక విదేశీయునికి రాజ్యం ఇపిప్చంచటానికి ఇంత కష్టపడడమా? ఆ విదేశీయుని బదులు తాను రాజు కావడానికో, తన బదులు స్వదేశీయుడగు మరొకనిని రాజుగా చేయడానికో ప్రయత్నించడం శ్రేయస్కరమనే భావమే ఆయనకు స్ఫురించలేదు. తన దేశంలో తన రాజ్యాన్ని నెలకొల్పు కోవాలనే సహజవాంఛ కూడా చచ్చిపోయింది. అప్పటి పరిపాటిననుసరించి తన కుమారుడు కూడా బీజాపూర్‌ ‌దర్బారులో ఒక సర్దారు పదవిలో ఉండాలనీ, నవాబు కృపకు పాత్రుడు కావాలనీ అతడు వాంఛించాడు. దానికై చిన్నతనం నుంచే నవాబు దృష్టిలో తన కుమారుడు ఉండాలని ఒకసారి శివాజీని, పాదుషా దర్శనార్థం షాహజీ తీసుకొనిపోయినాడు. అప్పుడు శివాజీ ఎనిమిదేండ్ల ప్రాయంవాడు. చదువు సంధ్యలు తెలియని ఆ పసితనం లోనే, ప్రపంచం ముందు దేశభక్తికొక పరమాదర్శాన్ని శివాజీ ఉంచాడు. ఆయన ప్రతి రక్తాణువులోనూ దేశభక్తి వెల్లువలా ప్రవహిస్తూ ఉండేది. స్వతంత్ర కాంక్ష గల ఆ బాలవీరునికి బీజాపూర్‌ ‌దర్బారులో ప్రవేశించడానికే ఇష్టంలేదు. దర్బారులో, నవాబు సమక్షాన చేరగానే వంగి సలాం చేయమని శివాజీకి షాజీ సూచించాడు. కాని ఆ నవాబు తనకు రాజుకాడు. కనుక తాను సలాం చేయనవసరంలేదని శివాజీ నమస్కరించలేదు. దీనితో దర్బారులో కలకలం బయలుదేరింది! బీజాపూర్‌ ‌సేనాని అఫ్‌జల్‌ఖాన్‌ ‌నెత్తిపైనున్న రాజు బొమ్మ తెగిపడింది!! బీజాపూర్‌ ‌సుల్తాను సింహాసనం బెణికింది. ఈ బాలుని సాహసానికి ఎందరో విస్తుపోయారు. ఇతడు విప్లవవాది అని కొందరన్నారు. ‘షాజీ కూడా విప్లవవాది ఏమో! కుమారునికి కూడా అలాంటి శిక్షణ ఇచ్చాడేమో’ అని అనేకులు భ్రమపడ్డారు. వాతావరణం అంతా అట్టుడికింది. కానీ శివాజీ మాత్రం తన స్థానం నుంచి చలించలేదు. రాజ్యంలో ఏ బీజాపూర్‌ ‌నవాబు ముందు శివాజీ మోకరిల్లలేదో, ఆ నవాబే అటు తరువాత శివాజీని స్వతంత్ర హిందూ నాయకునిగా అంగీకరించి వినయ పూర్వకంగా తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. ఈ మారు శివాజీ బీజాపూర్‌కు రాజస వైభవంతో, ఏనుగంబారీపై నవాబును కలుసుకోవడానికై వెళ్లాడు. ఇతరులు వచ్చి తనముందు మోకరిల్లడమే తప్ప తాను గద్దెదిగడమనేది ఎరుగని ఆ నవాబు శివాజీ నాహ్వానించేందుకు అమాంతం గద్దె దిగి, ఎదురేగి తనకు తానై శివాజీకి తలవంచాడు. కేవలం తన 50 సంవత్సరాల అల్ప వ్యవధిలో అవిరళ కృషి సల్పి ఆయన ఈ విచిత్రాన్ని చేసి చూపాడు.

సంఘటన వైఖరి

తండ్రితో సరిపడనందున, శివాజీ రాజ్యంలోనే బీజాపూర్‌లో ఉన్న ఇల్లు వాకిలీ విడిచి పూనా పరిసర ప్రాంతాలలోని ‘శివనేరి’ దుర్గాన నివసించాడు. అక్కడే ఆబాల గోపాలాన్నీ కూడగట్టాడు. అనేక గ్రామాలలో పంచాయితీలు నెలకొల్పాడు. మద్య నిషేధాన్ని ఒక వ్రతంగా చేయించగలిగాడు. తానాజీ మాల్‌సూరే, తమ్ముడు సూర్యాజీ, బాజీ ఫకల్కార్‌, ‌నేతాజీ పాల్కార్‌, ‌మోరోపంతు, ఆబాజీ సోన్‌దేవు, జనార్దనపంతు హనుమంతే, ఉదయాజీపవరు మున్నగు వీరులను సమైక్యతా సూత్రంతో ఒక్క త్రాటి మీదకు తెచ్చాడు. ఇలా రేయింబవళ్లు కొండలూ, వాగులూ అని లేకుండా తిరిగి గ్రామీణ ప్రజలను ఏకమొనర్చి వారిలో భాషా, స్వాభిమానమూ, ప్రాంతమూ, కులమూ వంటి సంకుచిత, దురభిమానాలను తొలగించి, హిందూ సమాజ సంస్కృతుల పట్లా, భారతీయ రాష్ట్రం పట్లా, అభిమానాన్ని, గౌరవాన్నీ, ప్రేమనీ జాగృతమొనరించి నూతన హిందూ సామ్రాజ్య ప్రతిష్ఠాపనకు వారిలో త్యాగనిష్ఠా, శ్రద్ధాది భావాలను నిర్మించి తన అడుగు జాడల్లో నడిపించుకొని చరిత్ర గతినే మార్చివేసినాడు.

 ఇంతటి గురుతర కార్యం ఆయన ఎలా చేయగలిగాడు? హృదయంలో అత్యంత ఉద్వేగాగ్ని ఉండేది. కాని ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శించాడు. విజయాన్ని సాధించడానికి అనుసరించవలసిన వైఖరి ఆయనకు కరతలామలకం. శివాజీ శూరుడగు సుక్షత్రియుడు. అయినా ఆయన ఎన్నోసార్లు రణరంగాన్ని విడిచి పారిపోయాడు. పారిపోవటం అనేది బాహ్యంగా చూస్తే పిరికిపందల విషయం లోనూ, వీరుల విషయంలోనూ ఒకటిగానే కన్పిస్తుంది. కాని వారి మనోభావాలు వేరు వేరుగా ఉంటాయి. షాయిస్తఖాన్‌ ‌విశాల సైన్యంతో తన రాజ్యాన్ని జయించ డానికి వచ్చినపుడు, శివాజీ కూడా ఒక్కొక్క దుర్గమే విడిచిపెడుతూ పారిపోయినాడు. ఆ పారిపోవటం చూచి షాయిస్తఖాను ముక్కుమీద వేలువేసుకొన్నాడట (ఆ వేలు తరువాత• శివాజీ కత్తికి బలిఅయింది). ఇంతేకాదు, తన రాజధాని ‘పూజ’ను తన రాజసౌధాన్ని విడిచి పారిపోయినాడు. ఒక్కొక్క కోటలో కనీసం ఆరేడుమాసాలు నిలుచుని పోరాడగల శక్తి శివాజీ సైన్యానికి ఉన్నదని షాయిస్తఖానుకి తెలియకపోలేదు. కాని తన రాకతో శివాజీ పారిపోవటం వల్ల షాయిస్త ఖానుని ఉత్సాహం రెట్టింపయింది. శివాజీ రాజధానిలో, రాజసౌధాలలో ప్రవేశించిన తనకిక ఎదురేమిటని అతడు భావించాడు. వెంటనే శివాజీ రాజసౌధాలలో ప్రవేశించాడు. ఇక ఈ ‘కొండ ఎలుక’కు ఓడించటమెంత? అని అపోహపడ్డాడు. కాని అదే సౌధంలో శివాజీ షాయిస్తఖానుని అయిదువేళ్లను తెగనరికినప్పుడు, తన కుమారుని శవాన్ని సైతం, తీసుకుపోవడానికి వీలు లేక షాయిస్తఖాను భయంతో పారిపోయాడు. అతను అటు పిమ్మట దక్షిణానికి రావటం అంటే వణికిపోయే వాడుట. శివాజీ, షాయిస్తఖాను లిద్దరిలో పారి పోవటం అనే మాటను ఎవరివల్ల ఉపయోగించాలి? చివరకు రణరంగాన్ని విడిచి పారిపోయిందెవరు? షాయిస్త ఖానుని చుట్టూ లక్ష సైన్యం ఉండేది. అంతమందిని ఎదిరించటానికి ఎంత సాహసం కావాలి? శివాజీ యుక్తిపరుడు. సాహసాన్ని ఆయన ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. సాహసం చూసినప్పుడల్లా విజయం తప్పక లభించేది. ‘‘నేను జీవించే ఉంటాను. శత్రువులను ఓడించి తీరతాను. భారతదేశాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆదర్శనీయంగా, దేదీప్యమాన ఉజ్జ్వల కాంతి పుంజంతో పురోగమింప చేసి తీరుతాను. ఇందులో పాప పుణ్యాలకూ, సుఖదుఃఖాలకు సంబంధించిన ఎట్టి సమస్యాలేదు. అంతిమ విజయానికై ఏమైనాసరే చేయడానికి సిద్ధమే’’ ఇదే శివాజీ వైఖరి.

గుణగణాలు

శివాజీ అపార మేధాసంపత్తి గలిగిన యుక్తి రథుడు. యుద్ధనీతిని సమగ్రంగా గ్రహించిన వ్యక్తి . నలువైపులా కన్పించే భయాందోళనలవలన, అశాంతివలన, దండలుడై తన సక్రమ పంథాను విడిచిపెట్టడు. విజయాన్ని కోరుకునే యోధుడు అంతిమ విజయం కోసమే తన సర్వ ప్రయత్నాలు సాగిస్తాడు. అలాంటి వ్యక్తి తన వైఖరిని మార్చుకోడు. విజయం లభించక తప్పదనే అపారమైన విశ్వాసం ఉంటుంది అతనికి. తాను జీవించియుండగానే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. ఆయనలో ఏ గుణాన్ని పరిశీలించినా అది ఆయన గొప్పతనాన్ని వేనోళ్ల చాటడమే కాక మనకు అనుసరణీయంగా భాసిల్లుతూంటుంది.

– డి. సీతారామారావు

(‘జాగృతి’, 23.06.1961)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE