జస్టిస్‌ ‌కపర్దీవాలా, మహాదేవన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్‌ 2‌న రాష్ట్రపతికి, గవర్నర్‌కు బిల్లులపై కాలపరిమితిని విధించిన విషయం తెలిసిందే. శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ‌మూడు నెలల్లోగా, రాష్ట్రపతి నాలుగు నెలల్లోగా కచ్చితంగా తేల్చాలని ఉత్తరువు జారీ చేసింది. కాగా తమిళనాడు గవర్నర్‌ ఆమోదించని 10 బిల్లులకు తానే ఆమోద ముద్రవేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ప్రకారం అంతిమ నిర్ణయం తమదేనని ధర్మాసనం నొక్కి వక్కాణించింది. ఇలాంటి నిర్ణయం ఐదుగురు సభ్యులు కలిసి తీసుకోవాలన్న సూత్రాన్ని తుంగలో తొక్కింది. అదే ఇప్పుడు కొంపమీదికి వచ్చింది.

రాష్ట్రపతి ముర్ము 201 అధికరణను అధిగమించి ధర్మాసనం కాలపరిమితి నిర్ణయించవచ్చా? అని ఉన్నత న్యాయస్థానాన్ని సవాల్‌ ‌చేశారు. ఈ సందర్భంగా 14 ప్రశ్నలు వేశారు.

  1. అధికరణ 200 కింద గవర్నర్‌ ‌రాజ్యాంగపరమైన విచక్షణ మాటేమిటి?
  2. గవర్నర్‌ ‌మంత్రివర్గం నిర్ణయానికి కట్టుబడి ప్రవర్తించాలా?
  3. గవర్నర్‌కు 200 అధికరణ ప్రకారం విచక్షణ అధికారం న్యాయమేనా?
  4. గవర్నర్‌కు కాలపరిమితిని న్యాయస్థానం నిర్ణయించవచ్చా?
  5. రాష్ట్రపతికి 201 అధికరణ ఇచ్చిన అధికారం న్యాయసమ్మతమేనా?
  6. ధర్మాసనం 201 అధికారాన్ని నియంత్రించ వచ్చునా?
  7. రాష్ట్రపతి 143 అధికరణ రీత్యా ధర్మాసనం సలహా కోరవచ్చునా?
  8. న్యాయస్థానాలు 200,201 అధికరణలను త్రోసిరాజనవచ్చా?
  9. 142 అధికరణకు రాష్ట్రపతిని, గవర్నర్‌ను త్రోసిరాజనే అధికారమున్నదా?
  10. శాసనసభ 200 అధికరణ ప్రకారం గవర్నర్‌ అధికారాన్ని అధిగమించి శాసనం అమలు పరచవచ్చా?
  11. 145 (3) అధికరణ ప్రకారం తుది నిర్ణయం చేపట్టడానికి ఐదుగురు సభ్యుల ధర్మాసనం కావాలి కదా?
  12. 142 అధికరణ విధి విధానం నిర్ణయమే కాక, నిర్ణయాత్మకమైన చర్యలు, ఉత్తర్వులు ఇవ్వదగునా?
  13. ఉన్నత న్యాయస్థానం 131 అధికరణ ప్రకారం వ్యాజ్యం లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలలో జోక్యం చేసుకోవచ్చునా?
  14. రాష్ట్రపతి 143 అధికరణ ప్రకారం న్యాయ స్థానం సలహా తీసుకోవాలా?

ఏప్రిల్‌ 8‌న, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్‌ ‌చంకలు గుద్దుకున్నారు. తనకు ప్రతికూలమైన తీర్పురాగానే శాపనార్థాలు, నీలి ఆరోపణలు చేసిన సదరు ముఖ్యమంత్రిగారు, ఇది కేంద్రం రాష్ట్రాల హక్కు హరించే పన్నాగం అని వాపోవడం విడ్డూరం. తమిళనాడు ముఖ్యమంత్రికి ఇది అనుకోని, ఎదురు చూడని శరాఘాతం. ఏ ఎండకు ఆ గొడుకు పట్టడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ప్రధానమంత్రి మోదీ తమిళనాడుకు విచ్చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి, సనాతన ధర్మాన్ని, సెంగోల్‌ని గౌరవించని తమిళనాడు మంత్రులు, ఆ రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పాలించి, నిలువునా అవినీతిలో ముంచేశారు. దేశం క్లిష్టపరిస్థితి స్టాలిన్‌కి ఇప్పుడు గుర్తుకు రావడం కడు విచిత్రం!

న్యాయవ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్‌కు బిల్లుల విషయంలో కొన్ని షరతులు విధించడానికి ఇటీవలి కాలంలో కొందరు న్యాయమూర్తులు చర్చకు ఆస్కారమిచ్చేలా తీర్పులను వెలువరించారు.ఒక ధర్మాసనం పాకిస్థాన్‌ ‌న్యాయవ్యవస్థను ఉదాహరణగా తీసుకుని, దేనికైనా పరిమితులు ఉండి తీరాలి అని తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ప్రకారం అపరిమితమైన అధికారంతో రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఆంక్షలు విధించింది. రాజ్యాంగం చట్టసభకు, న్యాయసభకు, ప్రభుత్వానికి సమానమైన ప్రతిపత్తిని ప్రకటించింది. ప్రజాపాలనకు రాజ్యాంగమే దారిదీపం. ప్రజాప్రతినిధులు చట్టసభలో నిర్ణ యించిన విధి విధానాలపై న్యాయస్థానాలు చట్ట పరిధిలో సూచనలు చేయాలి. చట్టాన్ని అమలుపరిచే అధికారం ప్రభుత్వంపైనే ఉంటుంది.

ప్రజాస్వామ్యంలో ఇది ప్రాథమిక సూత్రం. ఇందుకు విరుద్ధంగా తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన 10 బిల్లులను గవర్నర్‌ను త్రోసిరాజని, కేవలం ద్విసభ్య న్యాయపీఠం చెల్లుబాటులోనికి తేవడం ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని కొందరి అభిప్రాయం. ఉపరాష్ట్రపతి జగదీశ్‌ ‌ధన్‌కడ్‌ ఈ ‌చర్యను అత్యయిక రాజ్యాంగ చర్య అని, అణుక్షిపణి అని ఆక్షేపించారు. విపక్షాలు విరుచుకుపడినా ప్రజాభిప్రాయం ఉపరాష్ట్రపతివైపే మొగ్గు చూపింది.

కొన్ని వింతైన తీర్పులు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. ఒక యువకుడు ఒక యువతి పైటలాగి, పైజామా నాడీ ఊడలాగినా అది లైంగిక దాడి కాదని, యువకుడు పారిపోయాడు కాబట్టి నేరస్తుడే కాదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరొక న్యాయమూర్తి ఒక అడుగు ముందుకు వేసి అమ్మాయి వక్షంపైన చేయివేసినంత మాత్రాన అది లైంగిక నేరం కాదనడం సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.

ఒక న్యాయమూర్తి ఇంట కరెన్సీ కట్టలు తెప్పలుగా బయటపడ్డాయి. న్యాయవ్యవస్థ కాలుకదపలేదు. సరికదా పెదవైనా విప్పలేదు. ఉన్నత న్యాయస్థానం ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేసింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ‌ఖన్నా పదవీ విరమణకు ముందుగా కమిటీ ఒక నివేదిక అందించింది.  న్యాయమూర్తి నేరానికి తగిన ఆధారాలున్నాయని అభిశంసించి, బహిరంగ విచారణ చేపట్టాలనే ఉత్తర్వు జారీ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి కట్టుబడ•కపోతే, దేశ సంక్షేమం, సార్వభౌమత్వం, భద్రత ప్రమాదంలో పడతాయి. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ‌ఖన్నా పదవీ విరమణ సందర్భంలో, ప్రఖ్యాత న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి, కపిల్‌సిబల్‌ ‌మాట్లాడుతూ ‘‘మీ తండ్రిగారు రగిలించిన మైనారిటీ తీర్పు అనే న్యాయజ్వాలను తమరు సముజ్వల పరిచారు’’ అని చాటడం ఈ వ్యాసానికి కొసమెరుపు.

– నిరామయ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE