భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నాయకుడు సర్దార్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 1971లో 90 వేల మంది పాక్ సైన్యం భారత్కు లొంగిపోవడంతో బాంగ్లాదేశ్ ఏర్పడిందని, ఇప్పుడు పాకిస్తాన్లో మళ్లీ అలాంటి పరిణామాలే ఏర్పడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై దాడుల మొదలుకావడంతో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న బీఎల్ఏ ఆశలు ద్విగుణీకృతమైనాయి. భారత్, బీఎల్ఏ బలగాలు పాకిస్తాన్ బలగాలపై ఏకకాలంలో విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున పాక్ సైనికులు మృతి చెందుతున్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులతో పాక్ సైనికులు చాలా ప్రాంతాల నుండి తోకముడవడంతో వేర్పాటువాదులు పాకిస్తాన్ పతాకాలను తొలగించి తమ జెండాలను రెపరెపలాడిస్తూ ఆ దేశ సార్వభౌమత్వానికి గట్టి సవాలు విసురుతున్నారు.
పెహల్గావ్లో పర్యాటకులపై అమానుష దాడికి మూల్యం చెల్లిస్తున్న పాకిస్తాన్ భారత్తో పాటు బలూచిస్తాన్•తో కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కశ్మీర్లో వేర్పాటువాద కుట్రలు సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోయే దుస్థితిలో పడింది. ఆపరేషన్ సిందూర్తో దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్న పాకిస్తాన్కు పక్కలో బలింలా తయారైన బలూచిస్తాన్తో ఆందోళన రెట్టింపయ్యింది. భారత్తో ఎదురయ్యే పరాజయాల కంటే భవిష్యత్లో దేశం ముక్కలు కానున్న పరిస్థితులే పాకిస్తాన్ను నిద్రలేకుండా చేస్తున్నాయి. దీర్ఘకాలికంగా ప్రత్యేక బలూచిస్తాన్లో పాకిస్తాన్ జాతీయ పతాకాలను తొలగించి బలూచి స్తాన్ జెండాలు ఎగరేస్తుండడంతో పాక్ పాలకులు అక్కడ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. సొంత దేశంలో పరిస్థితులు చక్కదిద్దుకోలేని పాకిస్తాన్ భారత్పై కాలుదువ్వి ఇంటా, బయటా అభాసుపాలవుతున్నది.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాలు పాకిస్తాన్కు అంకుశాలుగా మారుతు న్నాయి. 2016లో ఉరిలో, 2019లో బాలాకోట్లో ఉగ్రదాడులను ఉసిగొల్పడంతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్తో భంగపడినా పాకిస్తాన్ గుణపాఠం నేర్వలేదు. గత ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా కశ్మీర్లోని పెహల్గావ్లో మతం పేరి• పర్యాటకులను హత మార్చడంతో యావత్ భారతదేశం రగిలిపోయింది. దేశ రక్షణను పటిష్టపరుచుకోవడంతోపాటు, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత్ ఐక్యరాజ్య సమితి యాక్ట్ 51 ప్రకారం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడి చేసి వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో నానాయాగీ చేయాలని చూసిన పాకిస్తాన్కు సానుకూలత రాలేదు. భారత్ దాడులపై ఇతర దేశాల మద్దతు కూడగట్టడంలో విఫలమైన పాకిస్తాన్ ఇదే సమయంలో పుండు మీద కారంలా బలూచిస్తాన్ రూపంలో అంతర్గతంగా కూడా పోరాడాల్సి వచ్చింది.
బలూచిస్తాన్ నిరసనలు, ఉగ్రవాదుల దాడుల వెనుక విదేశీ హస్తం, ప్రధానంగా భారత్ ప్రోత్సాహం ఉందని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవు. బీఎల్ఏ ఉద్యమం భారత్ సృష్టి కాదు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉండేది. గిరిజన పాలన ఉండేది. స్వాతంత్య్రం అనంతరం దేశ విభజనలో భాగంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం అయింది. ఈ నిర్ణయంపై అప్పుడే బెలూచి స్తాన్లో వ్యతిరేకత వచ్చి తమను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేసినా వారి ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ పాలనలో బలూచిస్తాన్ వివక్షకు గురికావడంతో అక్కడి ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకు పెరిగి ఇప్పుడు ప్రత్యేక దేశంగా ఏర్పడాలనే కోరిక బలపడింది. ఇందులో భాగంగా అక్కడ నిరసనలు, ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. బలూచీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ పాక్ పరిపాలకులు సాగించిన దమననీతి ఇప్పుడు ఆ దేశానికి గుదిబండగా మారింది.
ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన బలూచిస్తాన్• పాకిస్తాన్తో కలిసి ఉండేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. ఇక్కడ బలూచీ తెగదే ఆధిపత్యం. నైరుతిలో పాకిస్తాన్, ఆగ్నేయంగా ఇరాన్, దక్షిణాదిన అఫ్ఘానిస్తాన్ ఉన్నాయి. బలూచీ వాసుల్లో 50 శాతం మంది పాక్లోని బలూచీ ప్రావిన్స్లో, 40 శాతం మంది సింధ్లో, కొంత మంది పాక్లోని పంజాబ్ ప్రాంతంలో ఉంటారు. పాకిస్తాన్ జనాభాలో వీరు 3.6 శాతం. పాకిస్తాన్ అవతల ఇరాన్, అఫ్ఘాని స్తాన్లో 2 శాతం ఉన్నారు. పాకిస్తాన్లో విస్తీర్ణంలో అతిపెద్దదైన బలూచిస్తాన్ జనాభాలో మాత్రం తక్కువ ప్రజలున్న రాష్ట్రం. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44 శాతం ఉన్నా, వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5 శాతం. పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకపోవడంతో భూమి నిరుపయోగంగా ఉంది. స్థానికుల• పాకిస్తాన్ ప్రభుత్వ వివక్షపై అసంతృప్తిగా ఉన్నారు.
ఖనిజ సంపద, సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలకమైన ప్రాంతం. బలూచిస్తాన్•లో బంగారం, వజ్రాలు, వెండి, రాగి వంటి విలువైన వనరులున్నా ఇక్కడి ప్రజలు మాత్రం నిరుపేదలుగానే మిగిలిపోయారు. పాకిస్తాన్తో అంటకాగే చైనా ఇక్కడ వనరులను దోచుకోవాలనే దుర్బుద్దితో పాగా వేయగా స్థానికులు అనేకమార్లు అడ్డుకున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో బలూచిస్తాన్• కీలకమైంది. పాకిస్తాన్ అండతో అభివృద్ధి పేరుతో తమ ప్రాంతాన్ని చైనా దోచుకుంటుందనే ఆగ్రహంతో బలూచిస్తాన్•లో పలుమార్లు చైనా అధికారులు, కార్మికులపై దాడికి పాల్పడిన ఘటన లున్నాయి. చైనా చేపట్టిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచీల ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చింది. దీనిని స్థానికుల అభిమతానికి విరుద్ధంగా చైనా నిర్మించింది. అభివృద్ధి పరంగా తమ ప్రాంతంపై పక్షపాతం చూపిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి సహజ సంపదను ప్రణాళికబద్దంగా చైనాకు అప్పగిస్తుం డడంతో స్థానికుల్లో పాక్ పాలకులపై ఆక్రోశం రెట్టింపయ్యింది. బలూచిస్తాన్ తిరుగుబాటుకు పాకిస్తాన్ పాలకులు కారణమైతే, అందులో కొంత చైనా వ్యవహార తీరు ఉంది.
1947లో బ్రిటిష్ పాలకులు స్థానికుల ఆశయానికి విరుద్ధంగా తమను పాకిస్తాన్లో విలీనం చేసినప్పుడే బలూచిస్తాన్లో వేర్పాటువాదానికి బీజం పడింది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఒక్కటి చారిత్రకం. రెండు దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న పంజాబీల రాజకీయ ఆధిపత్యం. పాకిస్తాన్ ఏర్పాటు నుండి అసంతృప్తిగా ఉన్న బలుచిస్తాన్లో వేర్పాటువాద బృందంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బలూచిస్తాన్• లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 2000 సంవత్సరం నుండి పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, చైనా దేశస్తులపై దాడులు చేస్తుండడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. లష్కరే బలూచిస్తాన్, బలూచిస్తాన్ లిబరరేషన్ యునైటెడ్ ఫ్రంట్ వంటి సంస్థలు కూడా బీఎల్ఏకు తోడయ్యాయి. బలూచిస్తాన్కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాన్ని ఈ వేర్పాటు వాదులు కోరుతున్నారు.
బలూచిస్తాన్లో అశాంతికి, అల్లర్లకు పాకిస్తాన్ ప్రభుత్వం దమనకాండతో పాటు ఆ దేశ సైనికులు, ఐఎస్ఐ కూడా కారణం. ఉద్యమిస్తున్న విద్యార్థులను, మేధావులను నిర్బంధిస్తూ వారి గొంతు నొక్కుతున్నారు. బీఎల్ఏను పాకిస్తాన్ ప్రభుత్వం దోషిగా నిల బెట్టడంతో అమెరికా, చైనా దేశాలు ఆ సంస్థను నిషేధించాయి. తమపై పాకిస్తాన్ అరాచకాలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ మద్దతుదారులు ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టి పాకిస్తాన్ ప్రభుత్వం వైఫల్యాలతో పాటు చైనా ఆక్రమణలను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. అమ్నెస్టీ ఇంటర్నే షనల్ లెక్కల ప్రకారం 2011 నుండి దాదాపు పది వేల మంది బలూచిస్తాన్ ప్రజలు అదృశ్యమయ్యారు.
బలూచిస్తాన్లో తిరుగుబాటును అరికట్టలేని పాకిస్తాన్ తన చేతగానితనాన్ని భారత్, అఫ్ఘానిస్తాన్ దేశాలపై నెట్టుతుంది. ఆ ప్రాంత ప్రజల సమన్యల పరిష్కారానికి చొరవ తీసుకోకుండా అక్కడ జరుగు తున్న హింసాత్మక ఘటనలపై భారత్ను విమర్శి స్తుంది. ముఖ్యంగా 2016 నుండి ఇండియా హస్తం ఉందని కొత్త పల్లవి అందుకుంది. ఇందుకు కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందు బలూచిస్తాన్పై భారత్ ఆచితూచి వ్యవహరించేది. ఇప్పుడు భారత్ వైఖరి మారింది. బలూచిస్తానీయుల దార్శనికత, ఆకాంక్ష, అవసరాలను గుర్తించాలనే భావనతో మోదీ 2016 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున మాట్లాడుతూ నాకు బలూచిస్తాన్, గిల్గిత్, పీఓకే ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వం తమ ఉద్యమానికి తోడ్పాటు అందిస్తుందని బలూచిస్తాన్ ఎంతో కాలంగా ఆశలు పెట్టుకుంది. వారు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో భారత్ పేరున్న ప్లకార్డులను ప్రదర్శిస్తుండడంతో పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. అయితే భారత్ దేశం మాత్రం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎక్కడైనా ఏ రూపంలోనైనా హింసాత్మక ఘటనలను భారత్ ఎప్పుడూ సమర్థించదు. ‘శత్రువుకు శత్రువుకు మనకు మిత్రుడు’ అంటూ బలూచిస్తాన్కు భారత్ ప్రత్యక్షంగా మద్దతివ్వాలని డిమాండ్లు వస్తున్నా మన దేశం ఏ మాత్రం తొందరపడడం లేదు.
పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలూచిస్తాన్లో 2000 సంవత్సరం నుండి ప్రారంభమైన హింసాత్మక ఘటనలతో మృతుల సంఖ్య భారీగానే ఉంది. అక్కడి హింసాత్మక ఉద్యమంపై యావత్ ప్రపంచ దేశాల నుండి పాకిస్తాన్పై ఒత్తిడి రావడంతో ఆ దేశ పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు భారత్ నుండి ఎదురవుతున్న చావుదెబ్బతో పాక్ చేతులెత్తేయడంతో బలూచిస్తానీయులు దీన్ని ఒక అవకాశంగా మల్చుకుంటూ పాకిస్తాన్ సైనికులపై పెద్త ఎత్తున దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్లో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ సైనిక బలగాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఘటనలతో బలూచిస్తాన్ ప్రావిన్స్ అంతటా భయం, అనిశ్చితితో ప్రజలకు రక్షణే లేకుండా పోయింది. బలూచిస్తాన్లో మూడింట ఒక వంతు బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. పలు పట్టణాలు, గ్రామాలు వారి అధీనంలోకి వచ్చాయి.
జమ్ము కశ్మీర్లో ఒకలా, బలూచిస్తాన్లో మరోలా ద్వంద్వనీతితో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్తో అతలాకుతలమవు తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సమయం చూసి దెబ్బకొట్టేలా కాచుకొని కూర్చున్న బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు వ్యూహాత్మకంగా సాగుతూ దెబ్బతీస్తున్నారు. ప్రత్యేక బలూచిస్తాన్ కోసం దీర్ఘకాలికంగా శాయాశక్తులా పోరాడుతున్న బలూచి స్తానీయులు తమ ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి ముక్కలయ్యే అవకాశాలున్నాయి. 1971 యుద్దంతో బంగ్గాదేశ్ను జారవిడుచుకున్న పాకిస్తాన్ 2025లో ఆపరేషన్ సిందూర్తో బలూచిస్తాన్ను కూడా కోల్పోతుందో లేదో వేచి చూడాలి.
– శ్రీపాద