ఇదంతా మే 7వ తేదీన మురిద్కే అనే చోట కనిపించిన దృశ్యం. మురిద్కే లష్కరే తాయిబా ప్రధాన కేంద్రం. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ఎంచుకుని భారత్ చేసిన దాడులలో మరణించిన ముస్లిం ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు మురిద్కేలో కనిపించిన దృశ్యమిది. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు ఎలాంటి సంకోచం లేకుండా హాజరయ్యారు. చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అక్కడ లష్కర్ ఏ తాయిబా కమాండర్ అబ్దుల్ రవూఫ్ కూడా ఉన్నాడు. ఇదంతా మురిద్కేలోని తాయిబా ప్రధాన కార్యాలయం ఆవరణలోనే జరిగింది. భారత సైనిక దళాలు చేసిన దాడులలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అంచనా.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం కలసి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల ప్రపంచం నివ్వెరపోయింది. భారత ప్రముఖులు స్పందించారు. ఉగ్రవాదులకూ, పాకిస్తాన్ ప్రభుత్వానికీ నడుమ ఉన్న బంధానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని భారత విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మే 8న వ్యాఖ్యానించారు.
నిజానికి ఆపరేషన్ సిందూర్ ప్రధాన లక్ష్యం జైష్ ఏ మహమ్మద్, లష్కర్ ఏ తాయిబా జిహాదీ కేంద్రాలు. ఈ రెండు సంస్థలే గడచిన మూడు దశాబ్దాలుగా భారత్ మీద ఉగ్రవాద దాడులు నిర్వహిస్తున్నాయి. ఇందులో లష్కర్ ఏ తాయిబా ప్రధాన కేంద్రం మురిద్కేలో ఉంది. జైష్ ఏ మహమ్మద్ ప్రధాన కేంద్రం బహవల్పూర్లో ఉంది. మురిద్కే కేంద్రంలో వందలాది మందికి ఉగ్రవాద శిక్షణ ఇస్తూ ఉంటారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం ఒక్క పాక్లోనే కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా సౌకర్యాలు కలిగిన కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీనిని హఫీజ్ మహమ్మద్ సయీద్ స్థాపించాడు. ఇందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉంది. ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్న వాస్తవాల ప్రకారం ఇక్కడ చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ప్రాంగణానికి సరిగ్గా మధ్యలో మసీదు నిర్మించారు. గ్రాండ్ ట్రంక్ రోడ్ దగ్గరగా ఎంతో వ్యూహాత్మక ప్రదేశంలో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ నుంచి తక్కువ సమయంలోనే కావలసిన వస్తువులను, మనుషులను అనుకున్న చోటికి పంపవచ్చు.
ఇది మొదట్లో సోవియెట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న జిహాదీలకు మద్దతు ఇవ్వడానికి, అందుకు తగ్గిన తర్ఫీదు అందించడానికి 1980 దశకంలో ప్రారంభించారు. సోవియెట్ రష్యా అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించిన తరువాత దీనికి భారత్ లక్ష్యంగా మారింది. ఈ మలుపు ప్రపంచ చరిత్రలోనే అవాంఛనీయ ఘటన. పోరుకు ప్రపం చంలోని పలు దేశాల నుంచి ముస్లిం యువకులు వచ్చి సోవియెట్ రష్యా మీద పోరాడారు. వీరంతా జిహాదీలే. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ రష్యా నిష్క్రమించింది. కానీ ఆ పోరాటంలో ఉన్న ఏ జిహాదీని స్వదేశం తిరిగి రానివ్వలేదు. వీళ్లనే భారత్ మీదకు పురికొల్పారు. అది ప్రపంచ చరిత్రను కొత్త మలుపు తిప్పింది. పలు ప్రపంచ దేశాలు, ప్రధానంగా భారత్ ముస్లిం ఉగ్రవాదంతో అన్ని విధానాలను మార్చుకోవలసి వచ్చింది. అసలు ప్రపంచ దృష్టి కూడా మారిపోయింది. ఇస్లాం అంటే ఒక రకమైన ఏహ్య భావాన్ని పెంచడానికి ఉగ్రవాదం కారణ మైంది. ఈ కారణంగానే 9/11 దాడుల తరువాత లష్కర్ ఏ తాయిబాను పాకిస్తాన్ నిషేధించింది. దానితో ఇది రూపం, పేరు మార్చుకుని పాత కార్యకలాపాలను కొనసాగించవలసి వచ్చింది. అప్పుడు వేసుకున్నదే జమాత్ ఉద్ దువా అన్న ముసుగు. ముంబై దాడుల కోసం 2008లో ఇక్కడ కొందరు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. వీళ్ల దాడులతోనే 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి దిగిన వాళ్లలో ఒకడైన అజ్మల్ కసబ్ ఇచ్చిన వివరాల ద్వారా ఈ విషయం తెలిసింది. తాయిబా కేంద్రం మొదట అఫ్ఘాన్, చెచెన్యా జిహాదీ ముఠాలతో కూడా పనిచేసింది. 2008లోనే లష్కర్ ఏ తాయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటిం చారు. పాకిస్తాన్ దీనికి మద్దతు ఇవ్వడం వల్ల ఎఫ్ఏ టీ ఎఫ్ జాబితాలో చేరవలసి వచ్చింది. అంటే ఉగ్రవాదానికి నిధులు ఇచ్చినందుకు ఐక్య రాజ్య సమితి వేసే ముద్ర. జమాత్ ఉద్ దవా ముసుగు వేసుకుని ఇది మరింత బలపడింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి 2500 కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 12 ఉగ్రవాద తర్ఫీదు కేంద్రాలు ఉన్నాయి. వీటికి విద్యాకేంద్రాలు, సేవాకేంద్రాలు అన్న ముసుగు ఉంటుంది. లష్కర్ ఏ తాయిబా అంటే శుద్ధి కోసం యుద్దం చేసే సైన్యం అని అర్ధం. డిసెంబర్ 2001 నాటి పార్లమెంట్ దాడి, 2006, 2008 ముంబై దాడులు దీని పనే. 2006లో రైలులో పేలుళ్లు జరిపారు. దానితో 180 మంది చనిపోయారు. 800 మంది గాయపడ్డారు. 2008 దాడిలో 166 మంది చనిపోయారు. ఆ రెండు సంస్థల చరిత్ర అంతా రక్తసిక్తమే. ప్రపంచాన్ని 13వ శతాబ్దం నాటి ఇస్లాం ఛాందసం వైపునకు, 18వ శతాబ్దపు ఔరంగజేబ్ దృష్టి కోణంలోకి తీసుకుపోవాలన్న ఒక భ్రమా జనిత ప్రయత్నంలో ప్రపంచాన్ని ఈ సంస్థలు రక్తసిక్తం చేశాయి.
మురిద్కే లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిరకాలంగా తాయిబా సిద్ధాంత కేంద్రంగా కూడా పేర్గాంచింది. 26/11 దాడుల కోసం అజ్మల్ కసబ్ సహా ఇతర ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చిన కేంద్రం కూడా ఇదే. ఇంకా డేవిడ్ హెడ్లీ, తహవూర్ రాణా వంటివారు కూడా ఇక్కడ నుంచే తర్ఫీదు పొందారు. ఒసామా బిన్ లాడెన్ ఇలాంటి వాళ్ల తర్ఫీదుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూసేవాడు.
జైష్ ఏ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ దాడులలో చనిపోయారు. ఈ సంస్థకు బలమైన అడ్డాగా చెప్పే బహవల్పూరులో ఈ వీరంతా ప్రాణాలు కోల్పోయారు. చుట్టాలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు ఏర్పాట్లు చేసే సహాయకులు కూడా చనిపోయారు.
మురిద్కే- ఆపరేషన్ సిందూర్ దాడులకు లక్ష్యంగా ఉన్న తొమ్మిదింటిలో ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లష్కర్ ఏ తాయిబా నడిపే ఉగ్రవాద శిక్షణ కేంద్రంగానే ప్రపంచానికి తెలుసు. యువకులతో పాటు బాలురకు కూడా ఉగ్రవాద శిక్షణ ఇచ్చి సరిహద్దులు దాటించి భారత్కు చేరుస్తుంది. దీనినే మర్కజ్ అని, మర్కజ్ ఏ తాయిబా అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది ఒక మత బోధనల కేంద్రం. ఇంకా దానధర్మాలకు నిలయం. ఇక్కడ వైద్యాల యాలు, మదర్సాలు, వాణిజ్యకేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలు, చేపల పెంపకం వంటివి అన్నీ కనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక ఎత్తుగడ. ఒక ముసుగు. అసలు కార్యక్రమం అంతా ఉగ్రవాదులను తయారు చేయడమే. ప్రస్తుతం లష్కర్ ఏ తాయిబా అధిపతి హఫీజ్ సయీద్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఒసామా బిన్ లాడెన్ అల్ కాయిదాతో సన్నిహిత సంబంధాలు ఉన్న లష్కర్ ఏ తాయిబా 26/11 సహా భారతదేశంలో జరిగి పలు దాడులతో సంబంధం ఉన్న సంస్థ.
హఫీజ్ మహమ్మద్ సయీద్ లష్కర్ ఏ తాయిబా వ్యవస్థాపకుడు. మురిద్కే మర్కజ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. ఉగ్రవాదుల ఎంపిక, నియామకం, కుట్రల రూపకల్పన, అమలు అన్నింటి వెనుక సయీద్ ఉంటాడు. 1988లో సయీద్ అతని అనుచరులు దీనిని స్థాపించారు. ఈ కార్యకలాపాల కోసమే మురిద్కేలో 200 ఎకరాలు సేకరించారు. అందులో సువిశాలంగా 82 ఎకరాల మేర కార్యాలయం విస్తరించి ఉంది. లష్కర్ ఏ తాయిబాను నిర్వహిస్తుం దనే చెప్పే జమాత్ ఉద్ దవాకు కూడా ఇదే ప్రధాన కేంద్రం. జిహాదీ కార్యకలాపాలకు పటిష్టమైన పునాది ఏర్పరచడమే దీని ఉద్దేశం. ఉగ్రవాదులకు తర్ఫీదు ఇవ్వడం, సిద్ధాంతం పేరుతో మతోన్మాదాన్ని నూరి పోయడం ఈ కేంద్రంలో జరుగుతూ ఉంటుంది. భారత్ మీద చేసే ఉగ్రవాద దాడులకు అన్ని రకాలుగా సాయం చేసేది కూడా ఈ సంస్థే.
ఇస్లామిక్ ఛాందసవాదం శాస్త్ర సాంకేతిక పురోగతిలోని చీకటికోణం వైపే దృష్టి పెడుతుంది. టీవీలను నిషేధించే ఇస్లామిక్ ఛాందసవాదం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే అన్ని మారణాయుధా లను, ముఖ్యంగా తుపాకులను సేకరిస్తుంది. ఆధునిక వైద్యాన్ని ప్రవేశించకుండా అడ్డుకునే ఉగ్రవాదులు రాకెట్ లాంచర్ల కోసం లక్షలాది డాలర్లు ఖర్చు చేశారు. అయినా మురిద్కే కంప్యూటరీకరణ చేసిన మత విశ్వవిద్యాలయంగా చెబుతారు. కాబట్టి కంప్యూటర్ను వ్యవస్థను మధ్య యుగాలలోకి తీసుకువెళ్లేందుకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇదొక కాన్సెంట్రేషన్ క్యాంప్. ఇందులో చేరిన ఏ యువకుడినైనా తర్ఫీదు పూర్తయిన తరువాత మాత్రమే బయటకు అనుమతిస్తారు. సూఫా పేరుతో చేసే బోధనలు మహిళలు, పురుషులకు కూడా ఉంటాయి. ఈ బోధనలు తీసుకున్నవారే తరువాత విద్యార్థులను, యువకులను ఉగ్రవాదం వైపు తీసుకురావడానికి పని చేస్తారు. వీళ్ల బోధనలతో వచ్చిచేరిన దాదాపు వేయి మంది యువకులు ఇక్కడ ఉన్నారు. ఈ సంస్థకు పంజాబ్ ప్రాంత ప్రభుత్వం సహా చాలా సంస్థలు నిధులు కేటాయిస్తాయి. ఉదాహరణకు 2013-2014 సంవత్సరానికి గాను పంజాబ్ ప్రాంత ప్రభుత్వం ‘సేవా, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాల’ కోసం 6,20,000 డాలర్లు కేటాయించింది.
కశ్మీర్ హెరాల్డ్ పత్రిక 2002లో ఈ మర్కజ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. అక్కడ ఫోటోగ్రఫీ ఇస్లాంకు వ్యతిరేక కార్యకలాపంగా భావిస్తారు. కెమేరా, టీవీలు, ఫిలిమ్స్ అన్ని ఇస్లాంకు వ్యతరేకంగానే చూస్తారు. కానీ వాళ్లు ఎవరినైనా చంపి, ఆ హత్యను ప్రపంచం చూడాలని అనుకుంటే మళ్లీ వీడియో తీసి విడుదల చేస్తారు. సందర్శకులు అక్కడ పొగ తాగడానికి వీలులేదు. సంగీతం పూర్తిగా నిషేధం. నిజానికి మర్కజ్ చుట్టుపక్కల ప్రాంతాలను తమ అభిప్రాయాలతో ఏకీభవించేవారితో నింపి, ఇళ్ల నిర్మాణం చేయించి ఒక సామ్రాజ్యంగా రూపొందించే యోచన కూడా అమలవుతున్నది. ఇదంతా ‘శుద్ధ ఇస్లాం’ వైపు ప్రపంచాన్ని నడిపించడానికే. ఇందులో చేరిన దక్షిణా ఆసియా ముస్లిం ఎవరికైనా తరువాత అరబ్ పేరు పెడతారు. అబు జుబేర్ లేదా అబు అలీ వంటి పేర్లు అలా వచ్చినవే. మొదట దౌరా ఎ అమ్ (సాధారణ), తరువాత దౌరా ఏ ఖాస్ (ప్రత్యేక తర్ఫీదు) ఉంటాయి. నిజానికి లష్కర్ ఏ తాయిబా కశ్మీర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ తన ప్రణాళికలోని తొలి దశకు చెందినవి. కశ్మీర్ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తరువాత భారత్ను ఇస్లామీకరించడం తరువాత దశగా నిర్ణయించారు. ఈ విషయం 2002లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఒక నివేదికలోనిది.
ఈ సంస్థకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. దాని పేరు మర్కజ్ ఇర్షాద్. ఇది తాయిబా ఉగ్రవాద ఘనకార్యాల గురించి ఇందులో సగర్వంగా ప్రకటిస్తూ ఉంటుంది. గడచిన 11 సంవత్సరాలలో కశ్మీర్లో జరిపిన జిహాద్లో 14,369 భారతీయ సైనికులను చంపాం అన్నది కూడా అందులో ఉంది. ఈ కాలంలోనే 1,016 మంది లష్కర్ ఏ తాయిబా జిహాదీలు చనిపోయారని కూడా చెప్పుకుంది. 1999లో 12 ఆత్మాహుతి దళాలు కశ్మీర్లో 258 మంది భారత సైనికులను చంపాయని తెలియ చేసింది. 2000 సంవత్సరంలో అల్లా దయవల్ల 98 ఆత్మాహుతి దళాలు 891 మంది భారత సైనికులను చంపాయని వెల్లడించింది. ఇందులో ముగ్గురు కర్నల్ స్థాయి వారని, 10 మంది మేజర్ హోదా కలిగిన సైనికులని, ఒక కమాండెంట్, ఒక కెప్టెన్ ఉన్నారని కూడా లెక్క చెప్పింది.
2002లో కశ్మీర్ హెరాల్డ్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ఆనాటి మర్కజ్ కార్యక్రమాల కోసం అల్ కాయిదా రూ.30 మిలియన్లు ఖర్చు చేసింది. ఇంత ధనం ఎక్కడిది? సౌదీ కోటీశ్వరుడు లాడెన్ ఇచ్చాడనే చెబుతారు. అల్ కాయిదా అతడిదే. మర్కజ్ మసీదు నిర్మాణం కోసం రూ.10 మిలియన్లు కూడా ఇచ్చాడని అంటారు. భారత్ సేనలు దాడి చేసినది ఇలాంటి ముష్కర మూకల స్థావరాల మీద మాత్రమే. ఈ విషయంలో భారత్ చూపిన సమ్యమనం కూడా హర్షణీయమే. జనావాసాల జోలికి పోకుండా కేవలం తొమ్మిది ఉగ్ర శిబిరాల మీద దాడులు చేసింది భారత్. అందులో ఒకటి మురిద్కే. అయినా కొందరు భారతీయులే ఈ దాడులను వక్రీకరించి చెప్పడం చాలా దురదృష్టకరం. సైనిక దాడి పరిష్కారం కాదని కొందరి వాదన. కానీ ఉగ్రవాదులు అడ్డూ అదుపూ లేకుండా అమాయకులను చంపుతున్నారు. భారత సేనలు సంయమనం పాటించాలని సుద్దులు చెప్పేవారు, ఉగ్రవాదులకు కూడా ఒక సందేశం ఇవ్వడం మంచిది. మీ రాక్షసత్వాన్ని ఆపండి అని ఆ దుర్మార్గులకు చెప్పే సాహసం, ఉద్దేశం ఈ మేధావులకు ఉన్నదా?
భారత్ దాడిలో దెబ్బ తిన్న తొలి 9 ఉగ్రమూక స్థావరాలు
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్-పీవోకేలలో నిషేధిత ఉగ్రమూకలు జెయిషే మొహమ్మద్- జేయీఎం, లష్కరే తోయిబా-ఎల్యీటీ, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన 9 కీలకమైన స్థావరాలు, రహస్య స్థావరాలపై దాడి జరిగింది. అవి
- మర్కాజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ (జేయీఎం)
- మర్కాజ్ తాయిబా, మురిద్కె (ఎల్యీటీ)
- సర్జల్, తెహ్రా కలాన్ (జేయీఎం)
- మెహ్మూనా జోయా, సియాల్కోట్ (హెచ్ఎం)
- మర్కజ్ అహ్లే హడిత్, బర్నాలా (ఎల్యీటీ)
- మర్కజ్ అబ్బాస్, కోట్లి (జేయీఎం)
- మస్కర్ రహీల్ షహీద్, కోట్లి (హెచ్ఎం)
- షవాయి నల్లా క్యాంప్, ముజఫ్ఫరాబాద్ (ఎల్యీటీ)
- సైయిద్నా బిలాల్ క్యాంప్, ముజఫ్ఫరాబాద్ (జేయీఎం)
– జాగృతి డెస్క్