సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు వైశాఖ బహుళ చతుర్దశి

26 మే 2025, సోమవారం – అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతీయులు ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ప్రపంచ ప్రజలు ఎలా భావిస్తున్నారు? ప్రపంచంలో ఏ మూల ఎవరికి కష్టం వచ్చినా వాళ్లు సుఖంగా వచ్చి భారత్‌లో వాలిపోవచ్చునని గాఢంగా నమ్ముతున్న చాలామంది మేధావులు, లాయర్‌ల దృష్టికోణం ఏమిటి? వాళ్ల గతాన్ని పరిశీలించకుండా భారత పౌరసత్వం కట్టబెట్టాలని వాదించేవారిది కుట్ర కాదా? వీటికి చాచి చెంపకాయ వేసినట్టు సమాధానం ఇచ్చింది భారత అత్యున్నత న్యాయస్థానం. భిన్నత్వంలో ఏకత్వం అంటే వివిధ జాతులు, వర్గాల వారు ఇక్కడ ఉండవచ్చు. కానీ వాళ్ల వాళ్ల దేశాలలో నేరాలు చేసి వచ్చిన వాళ్లు ఆ భిన్నత్వానికి వారసులు కాలేరు. ఇక్కడి ప్రజల మధ్య చిచ్చుపెట్టి, జనాభా సమీకరణాలను మార్చడమే ధ్యేయంగా బారులు తీరుతున్న వారు కూడా భిన్నత్వాన్ని గౌరవించే వారు కాబోరు. ఇది నిరంతరం రుజువవుతూనే ఉంది. భారతదేశం భారతీయులది. ఇక్కడే పుట్టి పెరిగిన వారిది. ఇంకా చెప్పాలంటే, భారత్‌ కచ్చితంగా నా మాతృదేశమని మనసా, వాచా నమ్ముతున్న వారిది. దీనికి మినహాయింపులు ఉండవు. ఉండరాదు. అందుకే ‘భారత్‌ ధర్మసత్రమేమీ కాదు. ఇక్కడే 140 కోట్ల మంది జనం సతమతమవుతున్నారు, శరణార్థులకు ఆశ్రయం ఇస్తూ పోవడానికి ఇది ధర్మసతర్ర కాదు’ అని సాక్షాత్తు సుప్రీంకోర్టు మే 19న ఒక కేసులో వ్యాఖ్యానించింది. ఓట్ల కోసం కొందరు, బుజ్జగింపు రాజకీయాలలో భాగంగా కొందరు, ఉదారవాదం పేరుతో దేశ విచ్ఛిత్తిని బాహాటంగా కోరుకునే కొందరు.. అడగని వాడిదే పాపం, ఈ దేశంలో ఎవరికైనా ఆశ్రయం ఇవ్వవలసిందేనని డబాయిస్తున్నారు.పైగా అది మానవత్వం అంటున్నారు.

దేశ భద్రత, సార్వభౌమాధికారం, వైవిధ్యం వంటి ప్రత్యేక లక్షణాలు ఎప్పుడు సుస్థిరంగా ఉండగలుగుతాయి? దేశ పౌరుల సమున్నత దృష్టితోనే భద్రంగా ఉండగలుగు తాయన్నదే అందుకు సమాధానం. ఈ దృష్టిని హక్కుల పేరుతో, అంతర్జాతీయవాదం పేరుతో, మానవత్వం పేరుతో వక్రీకరిస్తున్నారు చాలామంది. రొహింగ్యాలకు ఈ దేశంలో ఉండే హక్కు ఉందని భావించే వరకు, సుప్రీంకోర్టులో వాదించే వరకు ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. అందుకు సుప్రీంకోర్టు చీవాట్లు కూడా పెట్టింది. మైన్మార్‌లో రొహింగ్యాలకు రక్షణ లేదు కాబట్టి, ప్రాణహాని ఉన్నది కాబట్టి భారత్‌లో నివసించే హక్కు సహజంగానే ఉంటుందన్నదే ఆ న్యాయవాదుల వాదన. వీళ్లే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఢల్లీిలో ధర్ణా చేసిన రైతులను వెనకేసుకొచ్చారు. ముస్లిం ఉగ్రవాదుల హక్కుల గురించి గొంతు చించుకుంటు న్నారు. మావోయిస్టుల హక్కుల రక్షణ కోసం అర్ధరాత్రి సుప్రీంకోర్టును లేపేస్తారు.

భారత్‌ ధర్మసత్రం కాదు అంటూ గొప్ప సత్యాన్ని జాతి ముందుకు సుప్రీం కోర్టు ఏ కేసు కారణంగా తెచ్చింది? లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)తో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా 2015లో తమిళనాడులో అరెస్టయిన శ్రీలంక దేశీయుడు పెట్టుకున్న పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. ఈ పిటిషన్‌ మీద జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె. వినోద్‌చంద్రన్‌ ధర్మాసనం మే 19న విచారణ చేపట్టి నిర్మాణాత్మకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ శ్రీలంక వాసి దోషిగా తేలడంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద పదేళ్ల శిక్ష పడిరది. తరువాత 2022లో మద్రాస్‌ హైకోర్టు ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. పైగా శిక్షాకాలం పూర్తి కాగానే భారత్‌ను విడిచిపోవాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలోనే ఉండాలని కూడా హైకోర్టు ఆదేశించింది. సరిగ్గా వీటినే అతడు సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. 2009 నాటి శ్రీలంక యుద్ధంలో ఎల్‌టీటీఈ సభ్యుడిగా పోరాటం చేసినందున ఆ దేశంలో తనను బ్లాక్‌ గెజెటెడ్‌గా పరిగణించారు. కనుక శ్రీలంకలో తనకు ప్రాణహాని ఉంది. అతని భార్య అనారోగ్యంతో ఇక్కడే ఉంది. కుమారుడికి పుట్టుకతోనే హృద్రోగం ఉంది. కాబట్టి ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని అతడు కోరుతున్నాడు. ఈ వాదనను ఎలాంటి మినహాయింపు లేకుండా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా త్రోసిపుచ్చారు. శ్రీలంక కాకపోతే, మరొక దేశం వెళ్లవచ్చు. అంతేతప్ప ఇక్కడ మాత్రం ఉండే వీలులేదు అని తెగేసి చెప్పారు న్యాయమూర్తి. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి శరణార్థుల కార్డులు ఉన్నా కూడా పట్టించుకోనక్కర లేదు. అక్రమంగా దేశంలో ఉన్నవారందరినీ తిప్పి పంపవలసిందేనని అత్యున్నతస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమ మతోన్మాదంతో, దుండగీడుతనంతో మైన్మార్‌ను అతలాకుతలం చేసి, బౌద్ధ భిక్షువుల చేతిలో చావు దెబ్బతిని దేశం వదిలి పారిపోయి వచ్చిన రొహింగ్యాలకూ ఇదే దేశం కావాలి. శ్రీలంక తమిళ ఈలం ఉగ్రవాదికీ ఈ దేశమే కావాలి. ఇక భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న పాకిస్తాన్‌కు ముష్కరులను పంపడానికి కనిపించే ఏకైక దేశం భారత్‌ మాత్రమే.

ఈ దేశం ధర్మసత్రం కాదు అంటూ అర్ధశతాబ్దంగా చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఆర్‌ఎస్‌ఎస్‌. ఈ దేశ భిన్నత్వాన్ని కాపాడడమంటే నానాజాతి హంతకులతో, నేరగాళ్లతో, కిరాయి హంతకులతో దేశాన్ని నింపేయడం కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చిరకాలంగా మొత్తుకుంటున్నది. ఇప్పుడు సరిగ్గా అదే భాషలో అత్యున్నత న్యాయస్థానం  ఆ వాస్తవాన్నే ప్రకటించింది. దేశ భద్రత, దాని చారిత్రక, సామాజిక రాజకీయ విలువలు భద్రంగా ఉండాలని కోరడం చాదస్తం కాదు. అలా కోరడంలో భ్రమలేమీ లేవు. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు దొంగ ‘శరణార్థుల’ ముష్కరత్వం నుంచి తమ తమ ఉనికినీ, సంస్కృతినీ కాపాడుకోవడానికి నానా ఇక్కట్లు పడుతున్నాయన్నది నిష్ఠురసత్యం. శరణార్థుల పేరుతో సాగే విధ్వంసకారుల మోహరింపునకు మానవత్వం ఒక ముసుగు. ఉదారవాదం ఒక వేషం. ప్రజాస్వామ్యం ఒక దొడ్డిదారి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE