దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా హైదరాబాద్కు ఏదో ఒక లింకు ఉండటం అనేది సర్వసాధారణంగా మారింది. అనేకసార్లు ఈ వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఆధారాలు దొరికాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు. కాలం గడుస్తున్నా ఆ పరంపరకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సిందూర్, దాయాది పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు అలముకున్న సమయంలో కూడా హైదరాబాద్లో ఉగ్ర కుట్ర బయట పడింది.
ఆపరేషన్ సిందూర్లో వందమందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చడంతో.. అంతర్జాతీయ ఉగ్రవాదుల ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. సౌదీ అరేబియా ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకొని హైదరాబాద్ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నారు. ఏకంగా ఐసిస్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ పలు దఫాలుగా మీటింగ్లు పెట్టుకోవడం, హైదరాబాద్లో మరోసారి భారీ ఎత్తున పేలుళ్లకు కుట్ర పన్నడం, ఎవరికీ అనుమానం రాకుండా, ఎక్కడా ఆనవాళ్లు దొరికే అవకాశం లేకుండా వేరే రాష్ట్రంలో రిహార్సల్స్ కూడా చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పోలీసులు, కౌంటర్ ఇంటిలిజెన్స్ దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇక, ఈ స్థాయిలో జరిగిన కుట్రలు, వ్యూహాలు, ప్లాన్లపై ఉక్కుపాదం మోపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది.
విజయనగరంలో తీగ లాగితే హైదరాబాద్లో డొంక
ఈ ఉగ్రకుట్రలో భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. ఒకరేమో ఆంధప్రదేశ్లోని విజయనగరంలో ఉంటున్నారు. మరొకరేమో తెలంగాణ రాజధానిలో ఉంటున్నారు. ఇద్దరూ కలిసి మరికొందరిని తమ బ్యాచ్లో చేర్చుకొని ఐసిస్ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం 20 మందిని ఆకర్షించి తమ బ్యాచ్లో చేర్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు సేకరించి పెట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లోనే కాదు.. ఇంటి పక్కన ఉండే వాళ్లకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ, ఇంటలిజెన్స్ వర్గాలు ఈ కన్నింగ్ టీమ్ను పసిగట్టింది. విజయనగరంలో నివసించే సిరాజ్ ఉర్ రెహ్మాన్పై నిఘా పెట్టింది. అక్కడ తీగ లాగితే హైదరాబాద్లో డొంక కదిలింది. మొత్తానికి సిరియా స్లీపర్ సెల్స్ బండారం తెలుగు రాష్ట్రాల్లో బట్ట బయలయ్యింది.
బాంబులు సిద్ధం – రిహార్సల్స్ కంప్లీట్
హైదరాబాద్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టిఫిన్బాక్స్ బాంబులతో పేలుళ్లకు కుట్ర పన్నారు ఈ ఐసిస్ స్లీపర్ సెల్ ఉగ్రవాదులు. వీటికోసం టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. పేలుడు పదార్థాలు తయారీ చేసేందుకు అవసరమైన అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం కూడా కొనుగోలు చేశారు. ఇద్దరు మెయిన్ టీమ్ వ్యక్తులు సహా ఆరుగురు టెర్రరిస్టులు మూడు రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేశారు. సికింద్రాబాద్ బోయగూడలోని కళారంగ్ కాలనీ బస్తీలో మూడు రోజులు మీటింగ్ పెట్టు కున్నారు. అంతేకాదు. పేలుళ్లపై ఆంధప్రదేశ్లోని రంపచోడవరంలో రిహార్సల్స్ కూడా చేశారు. ఈ పేల్లివేతల బాధ్యతలను నలుగురు సభ్యులకు అప్పగించారన ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్ బ్లాస్టింగ్ రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా రంగంలోకి దిగింది.
సొంతంగా ఉగ్రవాద సంస్థ
విజయనగరంలో ఉంటున్న సిరాజ్ఉర్ రెహ్మాన్, సికింద్రాబాద్లోని బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీకి చెందిన సయ్యద్ సమీర్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వారిద్దరు 2018లో హైదరాబాద్ సిటీలో కలిసి చదువుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వారు తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ పయనం ఇప్పుడు సౌదీ అరేబియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో జట్టుకట్టడం, హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నడం దాకా సాగుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన హ్యాండ్లర్లతో ఇన్స్టాగ్రామ్లో వారికి పరిచయం ఏర్పడింది. సౌదీలోని హ్యాండ్లర్ల సూచనలతో వీరిద్దరు అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్-ఏహెచ్ఐఎం’ను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని ముస్లిం యువత, మైనర్లను టార్గెట్ చేశారు. ‘మ్యాజిక్ లాంతర్’ పేరుతో సోషల్మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు. ఉగ్రవాద భావజాలంతో పోస్టులు చేసే వారిని ట్రాప్ చేసేవారు. సౌదీ హ్యాండ్లర్ల సూచనల మేరకు సిరాజ్, సమీర్ కలిసి ఇన్స్టాగ్రామ్లో గ్రూపులు ఏర్పాటు చేశారు.
సిరాజ్ గడిచిన ఆరు నెలల్లోనే పలుమార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చాడు. హ్యాండ్లర్ల వద్ద పేలుడు పదార్థాలను సేకరించడం, బాంబులు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నాడు. సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యులతో ప్రత్యేక టీమ్ తయారు చేశాడు. మొత్తం 20 మందిని ఈ టీమ్లో మెంబర్లుగా చేర్చుకున్నాడు. సిరాజ్ పేలుడు పదార్థాలు సేకరించేలా.. సమీర్ సోషల్మీడియా మానిటరింగ్తోపాటు టీమ్ మెంబర్లకు షెల్టర్ ఇచ్చేలా బాధ్యతలు తీసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన నలుగురితో ఇప్పటికే పేలుళ్లు జరపాల్సిన పలు ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో డమ్మీ బ్లాస్టింగ్స్ చేయడంతోపాటు హైదరాబాద్లోనూ బాంబు పేలుళ్లకు రెక్కీ, రిహార్సల్స్ చేసేందుకు ప్లాన్ చేశారు. హ్యాండ్లర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమ ప్లాన్ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోతామనే అనుమానంతో సిరాజ్.. ఏపీలోని మూరుమూల/దూరప్రాంతాల్లో వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు. గత నెలలో రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పలుమార్లు బ్లాస్టింగ్ రిహార్సల్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశారు. పోలీసులకు అనుమానం రాకుండా అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం సహా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు.
మానవ బాంబులు టార్గెట్
హైదరాబాద్లో పేలుళ్ల కోసం విజయనగరంలో సాగించిన ఉగ్ర కుట్రతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇక, ఈ బ్లాస్ట్కు ఫండింగ్ చేసిందెవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై నిఘా వర్గాలు, ఎన్ఐఏ కూడా ఆరా తీస్తున్నాయి. ఇప్పటిదాకా ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు.. ఇప్పుడు ఎన్ఐఏ సాగిస్తున్న విచారణలో భయంకర విషయాలు బయటకు వస్తున్నాయి. మానవ బాంబులను తయారు చేయడమే సిరాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తమ గ్రూపులో ఉన్న మెయిన్ మెంబర్స్ ఆరుగురితో పాటు.. ఇప్పటివరకు 20 మందిని ఆకర్షించినట్లు నిర్ధారించారు. ఆ ఇరవై మందితో ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇప్పటికే తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురిని ఆకర్షించిన సిరాజ్.. ఇకపై పంజాబ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో నెట్ వర్క్ డెవలప్ చేసేలా స్కెచ్ వేశాడు.
ఈ ఆపరేషన్ మొత్తానికి విజయనగరాన్ని ‘సురక్షిత ప్రాంతం’గా ఎంపిక చేసుకున్నాడు. మొత్తానికి ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది సిరాజ్ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడికి పలువురు సౌదీ బిహారీలతో పరిచయాలు ఉన్నాయని, తన ఆపరేషన్కు అవసరమైన నిధులు సౌదీ అరేబియా నుండి వస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
సుజాత గోపగోని
6302164068, సీనియర్ జర్నలిస్ట్