తెలుగు, తమిళం తోబుట్టువులు. అందువల్ల భాషా సాహిత్యాల మధ్య దగ్గరి చుట్టరికంలో ఆశ్చర్యం లేదు. ‘నిన్న మొన్నటి చుట్టరికం కాదిది. ఎన్నో యేండ్లుగా పెనవేసుకున్నదిది’ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ‘కన్నయ’ గీతంలో ప్రేయసి కన్నమ్మను గురించి చెప్పిన పై పాదం తెలుగు తమిళ సాహిత్యాల మధ్య ఉన్న సంబంధానికి అక్షరాల వర్తిస్తుంది. ఈ భాషల మధ్య సాహిత్యపరంగా నెలకొన్న బంధం ప్రశస్తమైనది, ప్రాచీనమైనదీను.
తెలుగు సాహిత్యానికి శ్రీకారం చుట్టిన నన్నయ్య పేరు తమిళంలో నన్మై, నన్నర్. తమిళ సాహిత్యంలో అతి ప్రాచీనయుగంగా భావించే సంగమ యుగంలో నన్నన్ అనే ఓ సామంతరాజు ఉన్నట్లు తెలుస్తుంది. నన్నయ్య అంటే మంచివాడని అర్థం. తమిళ్ అనే మాటకు నిఘంటువులో కనిపించే అర్థం ‘మాధుర్యం’.
తమిళ పండితులు కొందరు తమి+ఇళ్ = ప్రత్యేకము+స్వతంత్రము అయిన భాష అని, తేను రైతమిళ్ (తేనె వలె తీయని తమిళం)అని పేర్కొన్నారు. తమిళ నిఘంటుకర్త పింగళ ముని ఇలా పేర్కొన్నాడు ఇనిమైయుం (మాధుర్యం) నీరిమైయుం (సంస్కరించబడింది). తమిళ శబ్దానికి మాధుర్యం అనే అర్థం రాగా, తెలుగు వలె తమిళం కూడా తీయని భాషని స్పష్టమవుతున్నది.
ప్రాచీన తమిళులు సముద్రాల మార్గంలో విదేశా లతో వర్తక వాణిజ్యాలు సాగించారు. ఆ రోజుల్లో కోర్కై, ముసిరిన్, (క్రాంగనూరు) పుహార్ (కావేరి పూం పట్టణం) మొదలైనవి ప్రసిద్ద రేవు పట్టణాలు. ఈ పట్టణాలను తమిళంలో తురైముగములు అంటారు. తురై ముగములు గల దేశం గనుక ద్రావిడ మనే వ్యవహరం ఏర్పడి ఉండవచ్చును. తురైవీడు అనే అరవ మాటను సంస్కరించగా ద్రావిడ శబ్దం ఏర్పడినట్లు భావించారు. తమిళం నుండి ఏర్పడిన భాషలకు ద్రావిడ భాషలు అనే పేరు కలిగింది.
తమిళం ప్రాచీన భాష. తెలుగు, కన్నడ భాషలలో సంస్కృత వాణి విహరించినంత స్వేచ్చగా తమిళంలో విహరించలేదు. ‘‘మహా భారతం’’ తెలుగు, కన్నడ సాహిత్యంలో వెలసిన ప్రాచీన కావ్యం. రామ చరితం మలయాళ సారస్వతంలో వెలసిన ప్రాచీన కావ్యం. కాని తమిళ సాహిత్యంలోని తొలి రచనలు స్వతంత్రాలు.
ఒకానొకప్పుడు తమిళం భారతదేశంలోనే కాక అసీరియా, బాబిలోనియా, మొదలైన దేశాలలో ప్రచారంలో ఉండేదనీ, ఇటలీలోని టాస్కనీలో వాడే భాష తమిళ మాండలికమని చెప్పవచ్చును. సుమారు 20 వేల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో వాడుకలోనున్న భాషలు చాలావరకు తమిళానికి సన్నిహితంగా ఉండేవనీ, ఈనాడు ఉత్తర భారతదేశంలో ఉన్న భాషలు ఆర్యభాషా కుటుంబానికి చెందినవని చెప్పినప్పటికి, ఒకప్పుడవి తమిళానికి సన్నిహితంగా ఉండేవని పి.టి.శ్రీనివాస అయ్యంగార్ అభిప్రాయం.
తమిళ సాహిత్య చరిత్రను కొందరు ఇలా యుగ విభజన చేశారు. 1.సంగ కాలం 2.సంగమునకు తరువాతి కాలం 3. పల్లవుల కాలం, 4. చోళుల కాలం, 5. నాయకరాజుల కాలం 6. ఐరూపా వారి కాలం, 7. ఆధునిక కాలం. వీటిలో సంగమ సాహిత్య కాలం ప్రధానమైనది. ఇఱైనార్ అనే కవి అందించిన ‘అగప్పొరుల్’ గ్రంథానికి రాసిన వ్యాఖ్యానంలో సంగం ప్రశంస మొదటిసారి కన్పిస్తుంది. ఇఱైనార్ అంటే భగవంతుడు. కనుక ఈ గ్రంథాన్ని శివుడే రాశాడని నమ్ముతారు.
దక్షిణా పథంలో పల్లవ భూపతులు రాజ్యాధి కారం చేసేవారు, శైవ వైష్ణవ మతాలు బహుళ ప్రచారంలో ఉండేవి. కాని సంగమ వాఙ్మయంలో జైన బౌద్ద మత ప్రశంస, తమిళ రాజ్యానికి చెందిన చేర, చోళ, పాండ్య మహీపతుల ప్రశంస కన్పిస్తాయి.
సింహళ ద్వీప చారిత్రక గ్రంథం ‘మహా వంశం’ ప్రకారం ఆ దేశ మన్నీడు గజ బాహు చక్రవర్తి (కీ।।శ 17-93) వంజి పట్టణంలో కణ్ణకీ దేవికి ఆలయం నిర్మించిన సెంగుట్టవాన్ సమకాలికుడు. ఇతని తమ్ముడైన ఇళంగో కణ్ణకి కథను అభివర్ణించే సిలప్పదికార కావ్యం రాశాడు. దీనిని బట్టి సంగమ యుగం మొదటి శతాబ్దికి మునుపే ప్రారంభమైందని భావించవచ్చు.
కవి సమూహాలను సంగం అనవచ్చును. ఇట్టివి మూడు సంగాలు వర్ధిల్లినాయి. అవి తలైచ్చంగం (తొలి సంగం) ఇడైచ్చంగం (మధ్య సంగం) కడైచ్చంగం (కడ సంగం). కావ్యాలలోని బాగోగులను నిర్ణయించి సత్కావ్య నిర్ణయం చేయడమే సంగం కవులు పని. ఆ విధంగా సంగం కవుల ఆమోదముద్ర పొందిన రచనలే ప్రచారం లోకి వచ్చేవి.
తొలి సంగం మధురా నగరంలో జరిగింది. ఇందులో 549 మంది కవులు ఉండేవారనీ శివుడు, మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అగత్తియన్ (అగస్త్యుడు) మున్నగువారు సభ్యులని నమ్ముతారు. ఈ సంగం 4,440 సంవత్సరాలు వర్ధిల్లినదట. ఆ తరువాత మధురానగరం సముద్రంలో కలిసి పోయినట్లు చెబుతారు. పరిపాడల్, ముదువారై, మురుకురుకు మొదలైన కృతులు ఈ కాలంలో వెలుగులోనికి వచ్చినట్లు చెబుతారు. వీటిలో అగస్త్యుడి ‘అగత్తియం’ ముఖ్యంగా పేర్కొనదగినది. దీనిని ఆధారంగా చేసుకొని తొలి కప్పియర్ ‘తొలి కప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం రాశారని తెలుస్తున్నది. కాని అగత్తియంలో12000 సూత్రాలు ఉండేవనీ, కాని కొన్నే లభిస్తున్నాయని అంటారు. దొరికిన వాటితో భవానంద పిళ్ళ్తై ఒక పుస్తకం ప్రకటించారు.
మహేశ్వరుడు పాణినికి సంస్కృత వ్యాకరణం, అగస్త్యునికి తమిళ వ్యాకరణం ప్రసాదించినట్లు ఓ ఐతిహ్యం. శివజ్ఞానముని అనే ప్రాచీనుడు తన ‘కాంచిప్పాయరం’ గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు, ‘‘సంస్కృత భాషను పాణినికి ప్రసాదించి, దానికి తుల్యమైన ద్రావిడభాషను కుడ మునికి నేర్పారు. కుడ ముని అంటే అగస్త్యుడు. కనుక పాణిని కాలానికి చెందినవాడు, పొదియల్ పర్వతం మీద నివసించినవాడు అయిన అగస్త్యుడే తమిళ మహర్షి అనీ అతడే తమిళ వ్యాకరణం ప్రసాదించాడనీ పండితుల నమ్మకం. ఈ కారణంతోనే అగస్త్యుడు తమిళ భాషా జనకుడని కీర్తి గడించాడు. తమిళ భాషను అగస్త్యం అని కూడా వ్యవహరిస్తారు (అగత్తియన్ వయన చెణ్జొల్ అరణంగు). ఆ మహానీయుని ప్రతిభా విశేషం వలనే తమిళనాడులో కావేరి ప్రవహించసాగిందని ఐతిహ్యం. ఈ విధంగా నాడు-నేడు అగస్త్యుడు తమిళులకు ఆరాధ్యుడైనాడు. ఇండోనేషియా, కంబోడియా మొదలైన ప్రదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందాడు. ఆయనకు ఆలయాలు సైతం నిర్మించారు.
మధ్య సంగం కపాడపురంలో వర్ధిల్లింది. అగస్త్యుడు, తొల్కాప్పియనార్ ఈ సంగంలో విలసిల్లిన పండితులు. ఇందులో మొత్తం 59 మంది కవులు ఉండేవారని తొల్కాప్పియం మా (మహా) పురాణంగా విలసిల్లింది. తొల్కాప్పియం కర్త తొల్కాప్పియార్ మధురా నగరానికి దక్షిణంగా ఉన్న తొల్కాప్పియ క్కుడిలో జన్మించినట్లు కొందరి తలంపు. ఇతడు జైన మతావలంబీకుడు. అగస్త్యుని 12 మంది శిష్యుల్లో ప్రముఖుడు. తొల్కాప్పియనార్పై సంస్కృత వాఙ్మయ ప్రభావమున్నట్లు కన్పిస్తున్నది. పాణినీయమునే గాకుండా పతంజలి మహాభాష్యం, మనుస్మృతి, భరతశాస్త్రం మొదలైన గ్రంథాలను కూడా ఆయన సంప్రదించినాడని ఎస్.వైయాపురి పిళ్ళై నిర్ధారించారు.
తొల్కాప్పియం కామం, తత్సంబంధమైన విషయాలు, యుద్ధ తంత్రాలు, రహస్య సాంసారిక ఛందస్సు, కావ్య వస్తువు, లోకోక్తులూ ప్రయోగాలు అనే భాగాలున్నాయి. వీటిలో తమిళుల సామాజిక జీవన విధానం వర్ణితం. తొల్కాప్పియానికి నచ్చినార్, కినియార్ వంటివారు వ్వాఖ్యానాలు రాశారు. కాని ఏ సందర్భంలోనూ తమిళ-సంస్కృతములకు జన్య జనక సంబంధం చెప్పలేదు.
కడ సంగమం 1850 సంవత్సరాలు వర్ధిల్లినది. ఇందులో 49 మంది కవులు ఉండేవారనీ, 449 గ్రంథాలు పరిశీలించారని చెపుతారు. ఈ సంగానికి అధ్యక్షుడు నక్కీరుడు. తిరుక్కురళ్ రాసిన తిరువళ్లువార్ ఈ కాలంలోని వాడు. పత్తుప్పాట్టు, ఎట్టుత్తొగై, పదినెణ్ కీళ్ కణక్కు మొదలైన గ్రంథాలు ఈ కాలంలోనివే.
ఒక ప్రాచీన తమిళ పండితుడు తిరుక్కురల్ను ప్రశంసిస్తూ, ‘ఆవగింజను తొలిచి తిరువళ్లువార్ అందులో సప్త సముద్రాలను చొప్పించాడు’ అన్నారు. తిరువళ్లువార్కు చిరకీర్తిని తెచ్చి పెట్టిందీ గ్రంథం. సర్వ జనీనమూ, సర్వకాల సమ్మతమూ అయిన ఈ నీతి గ్రంథంలోని సూక్తులు సహజ సుందరాలు. అందువల్ల ఈ గ్రంథాన్ని ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లోనికి అనువదించుకున్నారు. కూరల్ను తెలుగులోనికి అనువదించినవారు కనుపర్తి వెంకటరామ విద్యానంద నాథులు, చొక్కం నరసింహులు నాయుడు, పూతపట్టు శ్రీరాములు, మరింగంటి జగ్గన్నశాస్త్రి, శొంఠి శ్రీపతిశాస్త్రి ప్రభృతులు. దీనిలో రాజ్యాంగ విధానం, కోశ పద్దతి, పాలకులు-పాలితులు వంటి అంశాల గురించి, మరోవైపు ప్రేయసీ- ప్రియుల గురించి, రహస్య ప్రణయం, వియోగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. దీనినే తమిళ వేదమని కూడా పిలుస్తారు. ఉదాహరణకు:
‘‘జనకుండు మున్ను నోచిన నోము పంట
తనయుడై కర్మకున్ దగి పుట్టునింట’’
‘‘పూని ద్రాక్షాసవం బానగా తీపి
కాని ప్రేమ రసమ్ము కనినంత తీపి’’
తిరువాళ్లువార్ తరువాత పేర్కొనదగిన వారు కవయిత్రి అవైయారుని. ఈమె ఆల్తి చూడి, కొండ్రై వేందన్ సల్వళి మొదలైన లఘు రచనలు చేసినట్లు చెబుతారు. నన్డ్రి మఱవేల్ (చేసిన మేలు మరువకు), అన్నైయుం పితావుం మున్నందయ్వం (తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవములు), ఐమిట్టు యుణ్ (ఒకరికి పెట్టి ఆపై తిను) ఆమె రచనలు. నేటికి తమిళుల జిహ్వాగ్రాన నిలిచి ఉన్నాయి.
ఈ కాలం నాటి సంకలన కృతులలో ప్రశస్త ములనదగినవి, ‘‘అగనానూఱు’’ ‘‘పుఱనానూఱు’’, అగనానూఱు. ‘అగం’ అంటే ప్రేమ, అది నిష్కల్మషమైనది, ఏక మనస్కులైన నాయికా నాయకులు ఆనంద పరవశులై వ్యక్తీకరించే మధురానుభూతిని అగం అనవచ్చు. పాండ్య భూపతి ఉగ్ర పెరువళది సమాదరణమున రుద్ర శర్మన్ అనే పండితుడు ఈ కృతిని సంకలనం చేశాడు.
పుఱనానూఱు, ఇది చారిత్రక కావ్యం. తమిళ రాజత్రయం అని పిలిచే చేర, చోళ, పాండ్య వంశీయుల గురించి, వారి సామంతులను గురించీ ఆనాటి వీరయోధులను గురించీ ఎన్నో విషయాలు కళ్లకు కట్టనట్లుగా వివరించారు. భారతం సంతరించిన పెరుం దేవనార్ అనే కవి చేసిన దైవస్తుతి గీతంతో పుఱనానూఱు ప్రారంభమవుతుంది.
కరికాల చోళుని చేతిలో చేరరాజు పరాజితుడై సమర భూమిలోనే ప్రాణ త్యాగం చేశాడు. దీనిపై ఓ కవి చేర దేశీయుల దుస్థితిని ఎంతో దయనీయంగా వర్ణించాడు.
నినదించవు విజయ బేరు లింక
వినిపించవు తుర్యారవములు
కలకలలాడవు పాలకుండలు
కమ్మని తేనెను ఎవ్వరు గ్రోలరు
కర్షక స్వాములు పట్టరు హలములు
బయళ్లలో గుమికూడరు ప్రజలు
కొండలచాటున క్రుంకిన సూర్యునివలె
పరాజితుడైన మా రాజసింహుడకటా!
ఆనాడు యుద్ద భూమిలో అసువులు కోల్పోవడమే కీర్తి హేతువు.
సంగమ కవులు చాలావరకు పద రచనలు చేశారు. వైద్య గ్రంథాలు కూడా కొన్ని వెలుగులోనికి వచ్చాయి. ఆ కవులలో పలువురు బ్రాహ్మణేతరులు. కవి పండితులకు రాజాశ్రయం లభించేది. కవయిత్రులు కూడా కొందరు వర్ధిల్లారు. సంగమయుగం నాటి గ్రంథాలలో నీతి బోధకాలే ఎక్కువ.
మూలం:
- తమిళ విందు బై చల్లా రాధాకృష్ణ శర్మ పేజీ 1 టు 3
- తమిళ సాహిత్య చరిత్ర బై చల్లా రాధా కృష్ణ శర్మ పేజి.1 టు 26.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు