మార్చి 3 తెలుగువారి తొలి ఇంజనీర్‌ ‌వీణెం వీరన్న జయంతి

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

పేరు కోసం కాకుండా ప్రజాసంక్షేమానికి పాటుపడిన తెలుగువారి తొలి ఇంజనీర్‌. ‌రాజమహేంద్రవరం కేంద్రంగా మహాభారత ఆంధ్రీకరణలో నన్నయకు నారాయణభట్టులా, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్ధర్‌ ‌కాటన్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. ‘శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా గోదావరి ఆనకట్టను అపూర్వ ఘనకీర్తితో పూర్తి చేయలేకపోయేవాడిని. వారికి జీవితమంతా రుణపడి ఉంటాను’ అని అపర భగీరథుడుగా మన్ననలు అందుకుంటున్న కాటన్‌ అన్న మాటలు వీరన్న వ్యక్తిత్వానికి దక్కిన అపూర్వ గౌరవం. వీరన్న వారసులు నీటిపారుదల శాఖలో సేవలు అందించినప్పటికీ తమ పూర్వికుని గురించి ఎక్కడా గొప్పగా చెప్పుకున్నట్లు కనిపించదు.

వీణెం కొల్లయ్య, వీరరాఘవమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో మొదటి వాడిగా 1794 మార్చి 3వ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించిన వీరయ్య అక్కడే ప్రాథమిక విద్యను, మచిలీపట్నంలో ఉన్నత పాఠశాల విద్య, కలకత్తాలో ఓవర్సీస్‌ ‌విద్య (వ్యవసాయం, నీటిపారుదల, ఇంజనీరింగ్‌, ‌రహ దారులు, భవనాలు, కళలు, సైన్స్… ఏడు అంశాలతో కూడిన కోర్సు) అభ్యసించారు. మద్రాసులో ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందారు.

గోదావరి పరీవాహక ప్రాంత పరిశీలనకు తొలిసారిగా (1840) వచ్చిన కాటన్‌కు స్వాగతం పలికినప్పటి నుంచి కడవరకు వీరన్న కలిసే ప్రయాణించారు. ఆయనకు సహాయకుడిగానే కాకుండా కుడిభుజంగా, ఆత్మీయుడిగా మెలిగారు. తన కంటే వయసులో సుమారు పదేళ్లు పెద్దయిన వీరన్నను కాటన్‌ ‌సహోద్యోగిగా కాకుండా అన్నలా గౌరవించారట. రాజమహేంద్రవరం నుంచి గోదావరి పుట్టుక ప్రాంతం త్య్రంబకం వరకు, రాజమహేంద్రి నుంచి గోదావరి సంగమం వరకు ఎగువదిగువ ప్రాంతాలను కాలినడకన, గుర్రాలపై ప్రయాణించారు. కాటన్‌ అనారోగ్య కారణాలతో లండన్‌, ఆ‌స్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట పనులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా సమర్థంగా నిభాయించుకు వచ్చారు. ఆనకట్ట పనుల విషయంలో అవినీతికి ఆస్కారం కానీ, ఒక ప్రాణ నష్టం కానీ లేకుండా అప్రమత్తతను పాటించారు

 శ్రామికులకు స్ఫూర్తి

గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణ పనులకు స్థానికులు ముందుకు రాకపోవడంతో వీరన్న ఒడిశా, బెంగాల్‌ ‌రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలను రప్పించారు. ఎద్దుల బండ్లు, గుర్రాలు తప్ప ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని కాలంలో అంత•మందిని సమీకరించడం అపూర్వ సన్నవేశం. ఆయన శ్రామికుల పట్ల చూపుతున్న వాత్సల్యం, పనిగురించి ఇస్తున్న తర్ఫీదు, వేతనాల చెల్లింపు తీరు గురించి విని గోదావరి పరీవాహక ప్రాంతవాసులతో పాటు కృష్ణా, గుంటూరు మండలాలకు చెందిన వారు ఆనకట్ట పనులకు వచ్చారు. వీరన్న పూర్వికులకు, సోదరులకు మన్యం ప్రాంతవాసులతో గల పరిచయాలతో వారినీ కూడగట్టారు. ఇలా ‘జలయజ్ఞాని’కి దాదాపు పదివేల మందిని సమకూర్చుకున్నారు.

శ్రామికులకు ఆసరా

ఆనకట్ట నిర్మాణ శ్రామికుల సంక్షేమానికి కాటన్‌కు చెప్పి సకల చర్యలు తీసుకున్నారు. వారి కోసం గోదావరి తీరంలో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులలో అనుభవం లేని వారికి ప్రత్యేక తర్ఫీదునిస్తూ ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. పనిచేసిన రోజులకే వేతనం అనే విధానాన్ని పక్కనపెట్టి పని చేయని రోజుకు (ఆదివారం) కూడా దినభత్యం చెల్లించే ఏర్పాటు చేశారు. అదీ ముందు రోజు (శనివారం) సాయంత్రమే. ‘జాతికి అన్నం పెట్టే ఆనకట్ట నిర్మాతలను పస్తులపాలు చేయకూడదని, కష్టానికి ప్రతిఫలం చెల్లించాల’న్న వీరన్న సానుభూతి వైఖరి కార్మికులలో అంకితభావాన్ని మరింత పెంచింది. పనులకు సంబంధించి కారణాంతరాల వల్ల ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి రెండుసార్లు (1848, 1851) సకాలంలో నిధులు రాకపోయినా పనులు నిలిచి పోకుండా అధికారులు, కార్మికులు పరస్పరం సహ కరించుకున్నారు.

వృత్తి పట్ల వీరన్న నిబద్ధత, అంకితభావం, శ్రమశక్తికి ప్రతిఫలంగా ఆయనకు మరేదైనా మేలు చేయాలని విక్టోరియా మహారాణి, ఈస్ట్ ఇం‌డియా కంపెనీకి కాటన్‌ ‌చేసిన సిఫారసు మేరకు ఆ ప్రభుత్వం ‘రాయ్‌బహదూర్‌’ ‌బిరుదు ప్రదానం చేసింది. ఆనకట్టకు 20 కిలోమీటర్ల దూరంలోని మెర్నిపాడు గ్రామ ఆదాయాన్నీ ఆయనకు దఖలు పరుస్తున్నట్లు విక్టోరియా మహారాణి ప్రకటించారు.

గోదావరి ఆనకట్ట నిర్మాణం పూర్తయినా (1852 మార్చి 31) మరో దశాబ్దన్నర కాలం..అంటే తుదిశ్వాస వరకు ఆ ప్రాంతంలోనే నివసించారు. ధవళేశ్వరం హెడ్‌ ‌లాక్‌ ‌క్వార్టర్స్ ‌వద్దే ఎక్కువ సమయం గడిపారు. అధిక శ్రమ, విపరీతమైన ఎండతాకిడితో పచ్చకామెర్ల వ్యాది •బారినపడి తమ 73వ ఏట 1867 అక్టోబర్‌ 12‌వ తేదీన కన్ను మూశారు. ఆయన అంతిమ కోరిక మేరకు హెడ్‌లాక్‌ ‌ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారం నిర్వహించి, చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేశారు.

అవిభక్త మద్రాసు రాష్ట్ర తొలితెలుగు సభాపతి బులుసు సాంబమూర్తి (1940)లో కాటన్‌ ‌విగ్రహం వద్ద చెక్కించిన వీరన్న వివరాలు తెలిపే శిలాఫలకం 1986 వరదలకు దెబ్బతింది. రచయిత, చరిత్ర కారుడు బీఎస్‌ ‌సాయిగణేష్‌ ‌దానిని పునరుద్ధరించగా, వీరన్న వర్ధంతి నాడు (2014 అక్టోబర్‌ 12)అప్పటి రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ ఆవిష్కరించారు.

About Author

By editor

Twitter
Instagram