– దత్తాత్రేయ హోసబలే, సర్‌ ‌కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌

‌దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. దేశం వివిధ అడ్డంకులను, సంక్షోభాలను అధిగమిస్తూ, 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్య్రం పొందిన వెంటనే విభజన జరిగి, ఆ వెనువెంటనే హింసాకాండను, ఆ తర్వాత సరిహద్దు దాడులను ఎదుర్కొంది. అయితే ఈ సవాళ్లు ఏవీ మన దేశ శక్తిసామర్థ్యాలను హరించలేకపోయాయి. ఆ సవాళ్లన్నింటినీ దేశం సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసుకుంది. విభజన, దండయాత్ర తర్వాత మన దేశ పౌరులు 1950లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకొని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించిన తీరును ఈ రోజు మనం ఊహించుకుంటే ఓ అద్భుతంలా అనిపిస్తుంది.


1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతాలైన గోవా, దాద్రా నగర్‌ ‌హవేలీ, హైదరాబాద్‌, ‌పుదుచ్చేరిలను స్వతంత్ర భారతంలో విలీనం చెయ్యడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రజల దృఢ సంకల్పం, పోరాట పటిమ, నైతిక బలం కారణంగా లక్ష్యాన్ని సాధించగలిగాం. కొన్నేళ్ల క్రితమే రాజకీయ స్వాతంత్య్రం పొందిన దేశం ఇవన్నీ ఇంత త్వరగా ఎలా సాధించ గలిగింది? అన్న ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. తన పైన ఎన్ని దాడులు జరిగినప్పటికీ, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా భారతీయ సమాజం, తన ఐక్యతా సూత్రాన్ని మాత్రం మరచిపోలేదు. మనం భారతదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని పరిశీలిస్తే, ఆ పోరాటం దేశంలోని నగరాలు, గ్రామాలు, అడవులు, పర్వతాలు, తీరప్రాంతాలలో… ఇలా అంతటా సాగిందని తెలుస్తుంది. సంథాల్‌ ‌తిరుగుబాటు, దక్షిణాది వీరుల సాయుధ పోరాటం ఇలా అన్ని సంఘర్షణల్లోనూ ఒకే భావం కనిపిస్తుంది. ప్రజలందరూ స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. తమకు మాత్రమే కాదు, యావత్‌ ‌సమాజానికీ, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం లభించాలని వారు కోరుకున్నారు. స్వాతంత్య్రం కోసం భారతీయ సమాజం ఎలాంటి త్యాగాలనైనా చేయడానికి, అన్ని రకాల మార్గాలనూ అనుసరించడానికి సిద్ధపడింది. ఆ కారణం చేతనే ఒక్క భారత్‌లోనే కాక లండన్‌, ‌యూఎస్‌, ‌జపాన్‌లలో కూడా ప్రయత్నాలు జరిగాయి. లండన్‌లోని ‘ఇండియా హౌస్‌’ ‌భారత స్వాతంత్య్ర పోరాటానికి ఒక ప్రధాన కేంద్రంగా మారింది.

భారత స్వాతంత్య్ర ఉద్యమం చాలా విస్తృతమైనది. అది దేశంలోని ప్రజల మధ్య గల భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి, దేశ ప్రజలందరినీ ఏకం చేసింది. ఈ ఘనత ఏ ఒక్కరికో సొంతం కాదు. అసంఖ్యాకులైన నాయకులు సాగించిన ఉద్యమమది. అందరి లక్ష్యం ఒక్కటే. అది.. స్వాతంత్య్ర సాధన. ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి పేర్లు మనకు తెలుసు. కొందరి పేర్లు తెలియదు.

స్వాతంత్య్రానంతరం దేశాన్ని వైభవ దిశగా నడిపించాలని ప్రజల మనసులలో ఆలోచన ఉన్నా దానికి రాజకీయ నాయకత్వంపై ఆధారపడలేదు. అందుకే, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎమర్జెన్సీ రూపంలో దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ ప్రజలు దానిని ఎదుర్కొని ఉద్యమించారు.

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి మనం సాధించాల్సిన లక్ష్యాలేమిటి? అనే విషయాన్ని ఈ అమృతోత్సవాల సందర్భంగా మనం ఆలోచించాలి. ప్రపంచమంతా ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు అస్థిరత నెలకొన్న ఈ తరుణంలో, ఒక దేశంగా మన ముందున్న లక్ష్యాలేమిటి? అని విశ్లేషించుకోవాలి. గత దశాబ్ద కాలంలో మనం ఎన్నో విజయాలను సాధించామనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని పౌరులకు ఆరోగ్యం, గృహనిర్మాణం, ఆర్థిక సమృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించే విషయాలలో భారతీయ సమాజం సశక్తమవుతోంది. దేశ పౌరులు సాధికారత పొందుతున్నారనే విషయాన్ని తెలియపరుస్తాయి. కరోనా సమయంలో అతి తక్కువ సమయంలో అత్యంత చౌకైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మేధస్సు భారతీయులది. ప్రపంచం మొత్తానికి సహాయం చేసి కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాం. అనేక రకాల సంక్షోభాల స్థితిలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది.

ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ, మనకెదురయ్యే బాహ్య, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటూ, వాటిని శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో సమరసత ఎంత బాగుంటే సమాజం అంత బలంగా ఉంటుంది కనుక దాని సాధనకోసం మరింత ప్రయత్నించాల్సి ఉంది. దేశం స్వయం సహాయకంగా ఉన్నప్పుడే శక్తిమంతమవుతుంది. పెరుగుతున్న జనాభా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా దేశీయ పరిశ్రమలు, సంస్థలను ప్రోత్సహించవలసి ఉంది.

 స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు పూర్తయిన తరుణంలో దేశ విధాన స్థాపన ప్రస్తుత ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. అలా లేనట్లయితే, దానిని ఎలా మార్చవచ్చో కూడా ఆలోచించాలి. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ విషయంలో సామాన్యుడు తనకు తాను అసౌకర్యంగా, అసహాయుడుగా భావించుకునే పరిస్థితులు చాలానే చూస్తున్నాం. దానిని నివారించే దిశలో న్యాయం, పాలన సాధారణ పౌరులకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా చేయగలగాలి.

దేశం తన పటిష్టమైన అంతర్గత వ్యవస్థతోనే ప్రపంచ సవాళ్లను ఎదుర్కో గలుగుతుంది. అంతర్గత వ్యవస్థ పటిష్టత కేవలం దేశ ఆర్థిక, సామాజిక శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ అంతర్గత వ్యవస్థ పటిష్టతకు పరిష్కార మార్గం.

About Author

By editor

Twitter
Instagram