ఇతర మతాల స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో నిమిత్తం లేకుండా, మనోభావాలను గౌరవించకుండా, ఆత్మ గౌరవాన్ని పట్టించుకోకుండా మతం పేరుతో ఉగ్రవాదాన్ని ప్రపంచం మీద రుద్దే దుశ్చర్య ఇప్పుడు ప్రపంచమంతటా కనిపిస్తోంది. ప్రధాన రహదారులు, వాటి పక్క ఉండే కాలిబాటలు ఆక్రమించి నెలల తరబడి సాధారణ పౌరులకు తీవ్ర ఇబ్బంది కల్పించడం మొదలు, కాలిబాటల మీదనే మత ప్రార్థనలు చేయడాన్ని హక్కుగా భావించడం, ప్రపంచమంతటా తమ మాటే నెగ్గాలనీ, తమ మతమే బతకాలన్న ఉగ్రవాద పోకడలకు నిరసనలని పేరు పెట్టడం కూడా ఇటీవలి పరిణామం. ఈ క్రమంలోనే చిరకాలంగా అమలవుతున్న మరొక నీచపు ఎత్తుగడ లవ్‌ ‌జీహాద్‌. ఇతర మతాలలోని బాలికల మీద ప్రేమ వల పన్ని, మతం మార్చి, పెళ్లి చేసుకోవడం ఈ తతంగంలోని పరమ క్రూర, వికృత చేష్ట. ఇందుకు సంబంధించిన కొన్ని వందల ఉదాహరణలు భారతదేశంలో ఉన్నాయి. అందుకే పెళ్లి పేరుతో, ప్రేమ వ్యవహారాల పేరుతో జరుగుతున్న మత, ఉగ్రవాద వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఇంకా మీనమేషాలు లెక్కించడం తగదన్న అభిప్రాయం బలపడుతున్నది.


మతాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించవలసిందంటూ ఒక జంట పెట్టుకున్న వినతిని ఈ అక్టోబర్‌ 30‌న అలహాబాద్‌ ‌హైకోర్టు తోసిపుచ్చింది. వివాహం కోసమే మతం మారాలను కోవడం ఆమోదనీయం కాదన్నదే కోర్టు వారి అభిప్రాయం. ఈ జంటలోని యువతి పెళ్లికి నెలరోజుల ముందే మతం మారింది. నిజానికి ఈ కేసులో యువతి ముస్లిం. 2014లో ఇదే విధమైన తీర్పును అలహాబాద్‌ ‌హైకోర్టు వెలువరించిన విషయాన్ని కూడా న్యాయమూర్తి జస్టిస్‌ ‌మహేశ్‌చంద్ర త్రిపాఠి తాజా తీర్పులో ఉటంకించారు. 2014 నాటి ఆ తీర్పులోని కొన్ని అంశాలు ఎప్పటికీ స్మరణీయ మైనవే. ‘ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడానికే మతం మారడం సరైనది కాదు’ అన్నదే ఆ కీలక అంశం. ఈ రెండు తీర్పులూ కూడా లవ్‌ ‌జీహాద్‌ ‌కట్టడికి సంబంధించిన ఆలోచనకు చట్టరూపం ఇవ్వవలసిన అవసరాన్ని చెబుతున్నాయి. అలహాబాద్‌ ‌హైకోర్టు రెండు తీర్పులు కూడా ఆచితూచి ఇచ్చినవే.

లవ్‌ ‌జీహాద్‌ ‌బెడదను ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఒకటి ఉత్తరప్రదేశ్‌. అం‌దుకే అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు వచ్చిన మరునాడే, నవంబర్‌ 1‌వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌సరైన రీతిలోనే స్పందించారు. లవ్‌ ‌జీహాద్‌ ‌పేరుతో జరుగుతున్న తమాషా పట్ల తమ ప్రభుత్వం కఠినంగా ఉండబో తోందని చెప్పారు. తమ ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఆటలాడుకుందామంటే సాగదని కూడా హెచ్చరించారు. అసలు, లవ్‌ ‌జీహాద్‌ ‌నాటకాలకు తెర దించడానికి ఒక చట్టం తేవాలన్న ఆలోచన ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మొదలయింది. మొదట ఉత్తరప్రదేశ్‌, ‌తరువాత హరియాణా, ఇప్పుడు మధ్యప్రదేశ్‌ ఇం‌దుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నాయి. నవంబర్‌ 1‌న యోగి లవ్‌ ‌జీహాద్‌ను అరికట్టడానికి ఒక చట్టం తేవాలన్న యోచన ఉన్నట్టు ప్రకటించారు. రెండు రోజుల తరువాత మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కూడా ఇదే రీతిలో స్పందించారు. ఈ మధ్యలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌ ‌కూడా ప్రకటించారు. ఖట్టర్‌ ‌ప్రకటన ఒక తాజా దుర్ఘటన నేపథ్యంలో జరిగింది. ఈ అక్టోబర్‌ 26‌న ఫరీదాబాద్‌ ‌లోని (హరియాణా) వల్లభ్‌గఢ్‌లో అగర్వాల్‌ ‌కళాశాల ఎదురుగా, పట్టపగలు జరిగిన దుర్ఘటన అది. నికితా తోమర్‌ అనే హిందూ అమ్మాయిని తౌసీఫ్‌ అనే ముస్లిం యువకుడు వచ్చి కాల్చి చంపేశాడు.అంతకు రెండేళ్ల క్రితమే ఆమెను కిడ్నాప్‌ ‌చేసి మతం మార్చడానికి ప్రయత్నం జరిగింది. మతం మార్చి పెళ్లి చేసుకుంటా ననే ఆ హంతకుడు చెప్పినట్టు తన కుమార్తె తెలియ చేసిందని ఆమె తండ్రి మూల్‌చంద్‌ ‌తోమర్‌  ‌కూతురి అంత్యక్రియల తరువాత సుస్పష్టంగా వెల్లడించారు. ఇదంతా మతస్వేచ్ఛలో భాగమనీ, నిజమైన ప్రేమననీ మీడియా, కొందరు మేధావులు మనకి హితబోధ చేయడమే విచిత్రం. బాధితుల కుటుంబ సభ్యుల మాటకు విలువ లేకుండా చేస్తూ వారికి మరింత వ్యధనే మీడియా మిగుల్చుతున్న మాట నిజం కాదా!

ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం లవ్‌జీహాద్‌ ‌వ్యతిరేక చట్టం గురించిన ప్రయత్నం 2019 నవంబర్‌లోనే ఆరంభించింది. ఆ రాష్ట్ర లా కమిషన్‌ ఒక నివేదికను  ప్రభుత్వానికి సమర్పించి, ఇందుకు అవసరమైన చట్టం తేవాలని సిఫారసు చేసింది. పెళ్లి పేరుతో మభ్యపెట్టి జరిపే మతమార్పిడుల అదుపు, నిరోధానికి ఉద్దేశించి ఈ చట్టం తీసుకురావాలని లా కమిషన్‌ ఉద్దేశం. కానీ ఇందులో ఎక్కడా లవ్‌ ‌జీహాద్‌ అన్నమాట లేదు. ఎందుకంటే ఏదో ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని చట్టం తేవడం తమ ఉద్దేశం కాదని లా కమిషన్‌ ‌ప్రకటించింది. దీని మీద కూడా ఇప్పటికే సణుగుడు ప్రారంభమైంది.

లవ్‌ ‌జీహాద్‌ ‌పేరుతో జరిగే మతాంతర వివాహాలను నిరోధించడానికి చట్టం తీసుకురావాలని కర్ణాటక రాష్ట్ర బీజేపీ కూడా ఒక తీర్మానం ఆమోదించింది. దీనిని కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్షణం ఆలస్యం చేయకుండా వ్యతిరేకించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇలాంటి అంశాన్ని తెర మీదకు తెస్తున్నారంటూ సిద్ధరామయ్య ఒక భీరన సత్యాన్ని వెలుగులోకి తెస్తున్నాను చూడండన్నట్టు వాచాలత ప్రదర్శించారు. నిజానికి కేంద్రం కూడా ఈ దొడ్డిదారి జీహాదీని నిరోధించడానికి ఒక చట్టం తెచ్చే యోచనలో ఉందని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ ‌చెప్పారు.

 దేశంలో కేరళతో పాటు, ముస్లిం మతోన్మాద కార్యకలాపాలకు పేరుమోసిన కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న వాస్తవాలు భయానకంగా, అమానవీయంగా  ఉన్నాయి. ఇలాంటి చట్టం ఒకటి వేగంగా తేవలసిన అవసరం ఎంతటిదో కూడా అవి చెబుతున్నాయి. లవ్‌ ‌జీహాద్‌ ‌పేరుతో వేరే మతాల బాలికలను మతం మారుస్తున్నారన్న ఆరోపణ దేశంలోని చాలా రాష్ట్రాలలో వినిపిస్తున్నది. కేరళ వంటి రాష్ట్రాలలో ముస్లిం మతోన్మాదులు మరీ బరితెగించారు. 2017 నాటి హృదయ అనే హోమియో వైద్య విద్యార్థిని కేసు ఈ పోకడను దేశం తీవ్రంగా పరిగణించక తప్పని స్థితిని కల్పించింది. అఖిల అనే ఆ హిందూ అమ్మాయిని షహీన్‌ ‌జహాన్‌ అనే ముస్లిం యువకుడు ప్రేమించాడట. పెళ్లికోసం మతం మార్చాడు. తమ కుమార్తెను లవ్‌ ‌జీహాద్‌లో భాగంగానే మతం మార్చారని అఖిల తండ్రి కోర్టును ఆశ్రయించారు.

అత్యంత దురదృష్టకర ధోరణి, ఆధునిక మేధో మౌఢ్యం ఈ వివాదంలో పొంగి పొర్లాయి. ‘లవ్‌ ‌జీహాద్‌’ అన్న పదం కొన్ని హిందూ సంస్థలు ప్రచారం చేస్తున్న పదబంధమే కానీ, దానికి న్యాయపరంగా అస్తిత్వం లేదట. ఇప్పటికీ ఈ మాటనే జాతీయ దినపత్రికలు గుడ్డెద్దు చేలో పడిన చందంగా ప్రయోగిస్తున్నాయి. అయితే, కేరళ, మంగళూరు ప్రాంతాలలో 2009 అక్టోబర్‌ ‌నాటికి 4,500 మంది బాలికలను లవ్‌ ‌జీహాద్‌ ‌కోసం ముస్లిం ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారంటూ కేరళ బిషప్‌ ‌కౌన్సిల్‌ ‌బాహాటంగా చేసిన ఆరోపణ మాటేమిటి? సరిగ్గా అలాంటి పదబంధమే ఉపయోగించకపోయినా జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులకే చెప్పిన వివరాల మాటేమిటి? మత మార్పిడి ఉద్దేశంతోనే ఇతర మతాల బాలికలను ముస్లిం ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆ సంస్థ చెప్పింది. హిందూ జనజాగృతి అనే సంస్థ వివరాల ప్రకారం, ఒక్క కర్ణాటకలోనే 30,000 మంది హిందూ బాలికలను ఇస్లాంలోకి మతాంతరీకరణ చేశారు. హిందువులో, హిందూ సంస్థలో ఆరోపణలు చేస్తే అవి పచ్చి నిజాలే అయినా, ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా రూఢి చేసినా, వాటిని పరిగణనలోనికి తీసుకోనవసరం లేదని ఈ కుహనా సెక్యులర్‌ ‌మీడియా ఉద్దేశమా? లవ్‌ ‌జీహాద్‌ను ప్రధానంగా ప్రోత్సహిస్తున్నవి వామపక్ష విద్యార్థి సంఘాలే. ప్రేమ అనుకున్నప్పుడు మతం మారాలన్న ఆలోచనకు చోటెందుకు?

 తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు పౌరులకు ఉంటుందన్న సుప్రీంకోర్టు నిర్ణయం శిరోధార్యమే. కానీ వాస్తవాల మాటేమిటి? కేరళలో బాలికలను మతం మార్చి సిరియా వంటి దేశాలలో ఐసిస్‌ ‌కార్యకలాపాల కోసం పంపుతున్నారన్న కఠోర వాస్తవాల గురించి ఎవరు సమాధానం చెప్పాలి? 1975లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సారాంశాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రలోభం, బలవంతం, వ్యక్తి మనస్సాక్షికి విరుద్ధంగా మతాంతరీకరణ జరగకూడదన్నదే ఆ తీర్పు సారం. కానీ ఇక్కడ ప్రేమ పేరుతో జరుగుతున్నది అదే. మిగిలిన వాస్తవాలను పక్కన పెట్టి ఒక వర్గం మీడియా  వ్యక్తి స్వేచ్ఛ గురించే మాట్లాడుతోంది. తల్లిదండ్రుల, నిఘా వ్యవస్థ మాటకు విలువ ఇచ్చే ఉద్దేశం వీటికి లేదు. పైగా లవ్‌ ‌జీహాద్‌ ‌వివాదంలో హిందూ కుటుంబాలే ఎక్కువ ఎందుకు బలవుతున్నాయో కూడా అవి చెప్పవు.

అహాబాద్‌ ‌హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ముమ్మాటికీ ఆహ్వానించదగినదే. కొన్ని మీడియా సంస్థలు, దొంగ మేధావుల మాదిరిగా తమకు అనుకూలం కాని తీర్పులకు, ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం హిందూ సంస్థల ఉద్దేశం కాదు. ఈ తీర్పులో ఇస్లాం యువతిని పెళ్లి కోసం హిందువుగా మార్చడం సరికాదని (అది కూడా నెలరోజుల ముందు) కోర్టు చెప్పింది. ఇదే హిందూ బాలికల విషయంలోను అమలు కావాలని హిందువులు కోరుతున్నారు. దీని మీద ఎందుకు రాద్ధాంతం? 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చింది. లిలీ థామస్‌ ‌వర్సెస్‌ ‌కేంద్ర ప్రభుత్వ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇది. ఆ కేసు కూడా చిత్రమైనది, వికృతమైనది. ఆ• •సులో వివాహితుడు మరొక వివాహం చేసుకోవడానికి ఇస్లాంను ఆశ్రయించాడు. ఈ దొడ్డిదారిని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర పదజాలంతోనే నిరసించింది. ఏకైక దైవమైన అల్లా ఆశీర్వచనం పొందడమనేది మతాన్ని స్వీకరించడంతోనే సాధ్యమని, మతాన్ని స్వీకరించడం రద్దయితే పెళ్లి కూడా చట్ట విరుద్ధ మవుతుందని ఆ వర్గం చేస్తున్న వాదన ఆమోద యోగ్యం కాదని కూడా అలహాబాద్‌ ‌హైకోర్టు కరాఖండీగా చెప్పింది.

ఇక్కడే మరొక అంశం, అది కూడా పవిత్ర ఖురాన్‌లోని సురా 2, అయత్‌ 221‌లోనిది. ఈ సూత్రం ప్రకారం ఒక మహమ్మ దీయుడు ఒక స్త్రీని తమ దైవం పట్ల విశ్వాసం కలగనంతవరకు పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి ముస్లింను ప్రేమించిన ఇతర మత యువతికీ, లేదా ముస్లిం ప్రేమించిన ముస్లింమేతర యువతికీ మతం మారడం అనివార్యం. అంటే ఇస్లాంను స్వీకరించక తప్పదు. కాబట్టి ప్రేమ అనే అంశమే పరిగణనలోనికి రాదు. దీనిని కోర్టులు పరిశీలించినంతగా మీడియాలో ఒక వర్గం పరిశీలించడానికి ఇష్టపడడం లేదు.  ప్రేమ అనేది ఇస్లాంలో వివాహాన్ని జరిపించే అంశమే కాదు. కానీ హిందూ చట్టాలు ఇలాంటి నిబంధన విధించడం లేదు. ఒక హిందూయేతర యువతి, లేదా యువకుడు అన్యమతస్థులను వివాహం చేసుకోదలుచుకుంటే, అవతలి వారికి హిందూ దైవాల పట్ల విశ్వాసం ఏర్పడినాకే జరగాలని అవి చెప్పడం లేదు. అయితే హిందూత్వం పట్ల విశ్వాసమే లేని హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వారి సంగతేమిటి? అన్న చొప్పదండి ప్రశ్న ఈ మీడియా వేస్తున్నది. ఈ దేశంలో రిజిస్టర్‌ ‌వివాహాల సౌకర్యం కూడా ఉంది. అలా చేసుకోవచ్చు.  చిత్రంగా అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు (ఈ కేసులో) పరిశీలనలు సరిగా లేవన్న వాదనలు వచ్చాయి. అంటే హిందూ యువతులను మతం మార్చి ముస్లింలు పెళ్లి చేసుకున్నప్పుడే లవ్‌ ‌జీహాద్‌ అన్న వివాదం వస్తున్నదనీ, ముస్లిం యువతులు హిందువులుగా మారి, హిందూ యువకుని వివాహం చేసుకున్నప్పుడు ఈ వివాదం రావడం లేదని వారి అంతరంగం కావచ్చు. అయితే, ఇలాంటి వివాహాల గణాంకాలతో ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని కోరవలసిందే.

ప్రపంచ పరిణామాలు మొత్తం ఇస్లాం మతోన్మాదం మీద కళ్లు తెరుస్తున్నా భారతీయ మేధావులు,ఒక వర్గం మీడియా మాత్రం ఇప్పటికీ గాఢ నిద్రపోతోంది. ఈ విష పరిణామంలో కూడా బాధితులైన హిందువులనే తప్పు పడుతున్నది. ఇంత జరుగుతున్నా ముస్లింల వైఖరి సరికాదని, అది మార్చుకుని జన జీవన స్రవంతిలో కలవమని ఏ ఒక్క మేధావీ, ఏ ఒక్క మీడియా సంస్థ ఎందుకు చెప్పరు?

About Author

By editor

Twitter
Instagram