సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు, కెరీర్ గ్యాప్ అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఈ అడ్డంకిని అధిగమించగలుగుతున్నది కేవలం 1 శాతం మంది మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన 99 శాతం ఉద్యోగాలు రాక, భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది వారి తల్లిదండ్రులకు కూడా తీరని వేదనను కలిగిస్తోంది.
సాఫ్ట్వేర్ కంపెనీలు నియామక ప్రక్రియలో ఏటా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో ఈ సమస్య మరింత జటిలమవుతోంది. కోవిడ్-19 మహమ్మారికి ముందు, కంపెనీలు మూడు సంవత్సరాల వరకు కెరీర్ గ్యాప్ ఉన్నవారిని కూడా ఫ్రెషర్లుగా పరిగణించి ఉద్యోగాలు ఇచ్చేవి. కానీ 2024 నుంచి ఈ నిబంధనను రెండు సంవత్సరాలకు కుదించారు. కొన్ని కంపెనీలు అయితే ఈ గ్యాప్ను కేవలం ఒక సంవత్సరానికే పరిమితం చేశాయి. అంతేకాదు, మరికొన్ని సంస్థలు కేవలం ఆ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఫ్రెష్ అభ్యర్థులుగా పరిగణిస్తున్నాయి. ఈ కఠిన నిబంధనలు తల్లిదండ్రులకు తెలిసేసరికి, వారి పిల్లల ఉన్నత విద్య పూర్తయి, ఉద్యోగ వేటలో విలువైన సమయం గడిచిపోతోంది. ఉద్యోగం రాదని తెలిసినప్పుడు తల్లిదండ్రులు, వారి పిల్లలు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ఇంటికొకరు లేదా ఇద్దరు ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండటం చూసి తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. లక్షలాది కుటుంబాలు తమ గుండెల్లో ఈ దావానలాన్ని దాచుకుని జీవిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య భవిష్యత్తులో సమాజాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది.
ఏటా 2 లక్షల మంది పోటీ
సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఏటా సుమారు రెండు లక్షల మంది అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ సంఖ్యలో బీటెక్, సిఎస్సి, ఐటీ చదువుతున్న 50 వేల మంది విద్యార్థులు, అలాగే ఎఐ,-మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంట సీిఎస్సీ అనుబంధ కోర్సులు చదువుతున్న మరో 20 వేల మంది ఉన్నారు. అంతేకాకుండా, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి ఇతర ఇంజినీరింగ్ విభాగాల నుండి సుమారు 20 వేల మంది విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు. వీరందరితో పాటు, ఎంసీఏ చదివిన 10 వేల మంది, బీఎస్సి కంప్యూటర్ సైన్స్, బీసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన లక్ష మందికి పైగా అభ్యర్థులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం పోటీలో ఉన్నారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నప్పటికీ, కనీసం ఒక శాతం మందికి అంటే 2 వేల మందికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు. చాలా కళాశాలల్లో జరుగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జిల్లాలోని మొదటి, రెండు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో జరిగే క్యాంపస్ నియామకాలు కొంతవరకు నిఖార్సుగా జరుగుతున్నప్పటికీ, చాలా కళాశాలల్లో జరిగే రిక్రూట్మెంట్లు బోగస్గానే కనిపిస్తున్నాయని ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులు చెబుతున్న దాని ప్రకారం, తమను ఎంపిక చేసిన సంస్థలు రెండేళ్లు గడిచినా ఉద్యోగాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలు సాఫ్ట్వేర్ కంపెనీలతో ఉత్తుత్తి క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి, అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి మాయ చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం కొన్ని కళాశాలలకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఇదే విధమైన ధోరణి నెలకొందని తెలుస్తోంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రియల్-టైమ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ?
ప్రస్తుతం కళాశాలల్లో బోధించే అంశాలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసేటప్పుడు అవసర మయ్యే నైపుణ్యాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వాస్తవానికి, కళాశాలల్లో సెమిష్టర్ విధానంలో ఒక కోర్సును ఆరు నెలల పాటు బోధించినప్పటికీ, విద్యార్థులు దాని నుండి నేర్చుకునేది దాదాపు సున్నా అని చెప్పొచ్చు. బీటెక్ పూర్తయిన తర్వాత కూడా చాలా మంది విద్యార్థులకు ఆయా అంశాల్లో సరైన నైపుణ్యం ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం, కళాశాలలకు, విద్యార్థులకు సరైన నైపుణ్యాన్ని అందించాలనే స్పృహ లేకపోవడమే. కళాశాలలు కేవలం పెద్ద పెద్ద జీతాలు వస్తాయని ప్రచారం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నాయి తప్ప, విద్యార్థుల నుంచి వసూలు చేసే భారీ ఫీజులకు తగిన న్యాయం చేయడం లేదు. కనీసం సాఫ్ట్వేర్ కంపెనీలలో రిక్రూట్మెంట్లు ఎలా జరుగుతాయి? ఇంటర్వ్యూలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి నైపుణ్యాలు అవసరం? వంటి విషయాలపై కూడా విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడం లేదు. సరైన మార్గదర్శకత్వం పొందిన ఒకరిద్దరు విద్యార్థులు మినహా, చదువులేని కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. వారికి సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్ల ఉద్యోగ వేటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, కళాశాలలు తమ బోధనా పద్ధతులను మార్చుకొని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
శిక్షణ పేరిట దందా
సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడానికి, చాలా మంది అభ్యర్థులు హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సరైన ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల నాణ్యమైన శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లక తప్పడం లేదు. ఆరు నెలల కోర్సులకు దాదాపు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రతి నెలా హాస్టల్ ఖర్చుల కోసం మరో రూ. 10 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఇంత ఖర్చు చేసి కోర్సులు పూర్తి చేసినప్పటికీ, అక్కడ కూడా ఉద్యోగాలు లభించడం లేదు. కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్లోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే, ఖర్చు భరించలేని వారు ఇళ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏటా 50 వేల మందికి పైగా విద్యార్థులు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్కు వస్తున్నారు.
జాబ్ గ్యారెంటీ పేరుతో రూ. లక్షలు వసూలు
ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని, కొన్ని సంస్థలు ‘‘జాబ్ గ్యారెంటీ’’ పేరుతో విపరీతంగా ప్రచారం చేసుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నాయి. అభ్యర్థుల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసి, ఆ తర్వాత వారికి కొన్ని కఠినమైన పరీక్షలు పెడుతున్నాయి. ఆ పరీక్షలలో పాస్ అవ్వలేదనే సాకుతో రిక్రూట్ మెంట్లకు పంపడం సాధ్యం కాదని చెప్పి తప్పించుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలలో ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. పేరుకు ‘‘లైవ్ క్లాసులు’’ అని చెప్పినప్పటికీ, చాలా వరకు రికార్డెడ్ క్లాసులు ప్రసారం చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో కనీసం ఐదు వందల మందిని చేర్చుకుని, వారికి కేవలం రికార్డెడ్ క్లాసులు వినిపిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఈ మోసపూరిత కార్యకలాపాల వల్ల విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, కొన్ని సంస్థలు వినూత్న మోసాలకు తెరలేపుతున్నాయి. అలాంటి ఒక సంస్థ, ఏకంగా రూ. 3.50 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తూ, అందుకు బదులుగా విద్యార్థులకు నెలకు పది వేల రూపాయల స్టైఫండ్ ఇస్తామని, ఆరు నెలల తర్వాత ఉద్యోగం కల్పిస్తామని ప్రచారం చేసుకుంటోంది. ఈ ఆకర్షణీయమైన మాటలు నమ్మిన కొందరు తల్లిదండ్రులు, తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించిన డబ్బును కట్టేసి పిల్లలను ఈ సంస్థలో చేరుస్తున్నారు. అయితే, ఈ సంస్థ వందల కొద్దీ విద్యార్థులను చేర్చుకుంటున్న తీరు చూస్తుంటే, గతంలో భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసి దుకాణం ఎత్తేసిన అనేక మోసపూరిత సంస్థల జాబితాలో ఇది కూడా చేరుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే, ఆ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తమ విలువైన సమయాన్ని, కష్టార్జితాన్ని భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్న యువతకు, ఇలాంటి మోసపూరిత సంస్థలు మరింత నైరాశ్యాన్ని కలిగించి, ఆర్థిక భారాన్ని మోపుతాయి. ఈ తరహా మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ హామీలు ఇచ్చే సంస్థల విశ్వసనీయతను క్షుణ్ణంగా పరిశీలించాలి, పూర్వ విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలి. ఒప్పందాలను జాగ్రత్తగా చదవాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి మోసపూరిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి, తద్వారా నిరుద్యోగ యువత మోసపోకుండా కాపాడాలి. లేనిపక్షంలో, నిరుద్యోగులకు తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.
కెరీర్ గ్యాప్ ప్రమాదం
సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగోలా నైపుణ్యాలను నేర్చుకుని, ఇంటర్వ్యూలకు హాజ రయ్యేలోపే రెండు సంవత్సరాల కెరీర్ గ్యాప్ వచ్చేస్తోంది. దీనివల్ల వారికి ఫ్రెషర్లుగా ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. ఇది వారిని తీవ్ర నిరాశలోకి నెట్టేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఏటా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఈ కెరీర్ గ్యాప్ కారణంగా ఉద్యోగాలు పొందలేక ఆగిపోతున్నారు. ఈ సంఖ్య చూస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది. సంవత్సరానికి 2 లక్షల మంది అదనంగా చేరుతున్నారు. ఇలా రానురాను ఈ సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలకైతే కనీసం ఒక నిర్దిష్ట వయసు వరకు ఎంపికలు జరుగుతాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 34 ఏళ్ల వరకు వయసు పరిమితి ఉంటుంది. బ్యాంకులు, రైల్వేల వంటి వాటికి 28 లేదా 30 ఏళ్ల వరకు వయసు పరిమితి ఉన్నప్పటికీ, సాఫ్ట్వేర్ రంగంలో దేశం మొత్తం చదివే అభ్యర్థులకు కెరీర్ గ్యాప్ను కేవలం రెండేళ్లకే పరిమితం చేయడం వారి జీవితాలను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. ఈ కెరీర్ గ్యాప్ సమస్య కుటుంబాల్లో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తోంది. ప్రతి గ్రామంలోనూ వందల సంఖ్యలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. తమ పిల్లలు ఉన్నత విద్య చదివి, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండటం చూసి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోంది. ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే, అది కేవలం విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా, మొత్తం సమాజ స్థిరత్వాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి తీవ్రమైన సామాజిక సమస్యలు ప్రభుత్వాలనే దించేసే ప్రమాదం ఉందని గుర్తించి, సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ గ్యాప్ నిబంధనలపై పునరాలోచించి, నిరుద్యోగ యువతకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్