సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి -9 జూన్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్న రీతి, నీతిని హక్కుల నేతలు (అర్బన్ తీవ్రవాదులుగా ముద్రపడిన వారు) పట్టించుకుంటే పరిస్థితి ఇంతదాకా రాదు. భద్రతాదళాల కాల్పుల విరమణ, చర్చలకు పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ (పీడబ్ల్యూజీఏ) ఇచ్చిన పిలుపును అంగీకరించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజమే..! ‘పంటికి పన్ను, కంటికి కన్ను’ విధానం ఎవరికి సరికాదు. దానిని ఏ నాగరిక సమాజమూ అంగీకరించదు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవలసిందే. అయితే ప్రభుత్వం మావోయిస్టుల్లో ఏ వర్గం (గ్రూప్)తో చర్చించాలి? అందుకు ప్రభుత్వం పెట్టే షరతులను ఆమోదిస్తారా? ఆ వాతావరణానికి కృషి చేస్తారా? అని కొందరి బుద్ధిజీవుల సందేహాలు.
రాజ్యాంగం పట్ల తీవ్రవాదులకు విశ్వాసం ఉండవచ్చు… ఉండకపోవచ్చు. కానీ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వం వారి చర్చల ప్రతిపాదనలను బేషరతుగా ఎలా అంగీకరిస్తుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో చర్చల ప్రహసనాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గాలింపు, కాల్పుల విరమణకు చర్చలు జరపాలని అప్పట్లో ఒత్తిడి వచ్చింది. చర్చలకు వెళ్లాలంటే ఆయుధాలను పక్కన పెట్టాలన్న నాటి ముఖ్యమంత్రుల షరతును పీడబ్ల్యూజీఏ తిరస్కరించింది. ఆ ధోరణి నేటికీ కొనసాగుతోంది. దాని మద్దతుదారుల తీరూ మారలేదు. గాలింపు చర్యలు, ఎదురుకాల్పుల విరమణకు చర్చలు కోరుతున్నవారి నోట ఆయుధాలు అప్పగింత మాట మాత్రం రావడం లేదు. సుమారు దశాబ్దం న్నర క్రితం కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ప్రారంభించి నప్పుడు, ‘పదివేల మందితో కూడిన కోబ్రా దళాలనే కాదు… పద్నాలుగు లక్షల భారత సైన్యాన్ని పంపినా ఎదిరించి నిలుస్తాం’ అనే తీవ్రవాదపక్షం సవాల్ పాలకుల్లో సహజంగానే పంతం పెంచుతుంది.
మావోయిస్టులను చంపే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించే ‘హక్కుల కార్యకర్తల’ వంటి వారు ‘హింసకు పాల్పడే హక్కు మావోయిస్టులకు ఎవరు ఇచ్చారు? అనీ ప్రశ్నించుకోవలసి ఉంటుందని మరోవైపు వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్ తదితరాల్లో మందుపాతర్ల పేలుళ్లలో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోయినప్పుడు – హింస తప్పని, శాంతి చర్చలు జరపాలని ఈ మేధావివర్గం ఎందుకు కోరలేదని పోలీసు శాఖలో అత్యున్నత హోదా నిర్వహించిన కొందరి ప్రశ్న. ఎదురుకాల్పుల్లో మరణాలు, అరెస్టులతో పాటు స్వచ్ఛందంగా లొంగిపోతున్నవారి సంఖ్యా గణనీయంగానే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ‘లొంగుబాటు’కు నేపథ్యాన్ని, అందుకు దారితీస్తున్న పరిణామాలను ఆ ‘మేధావివర్గం’ పరిగణనలోకి తీసుకో(లే) కపోవడంలేదనే మాటా ఉంది. జనానికి ఏదో మేలు చేయాలన్నదే మావోయిస్టుల సంకల్పమైతే, అదే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రశ్నించుకోవాలి. మారుమూల ప్రాంతాలు.. ముఖ్యంగా మన్య గ్రామాలకు అసలే అంతంత మాత్రంగా ఉండే సౌకర్యాలు హింసాత్మక వాతావరణంలో అవీ కొడిగట్టి పోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
పాలనావ్యవస్థలోని లోపాల నుంచే మావోయిస్టు ఉద్యమం పురుడు పోసు కుందని దశాబ్దాల క్రితం ప్రణాళికా సంఘం నియమించిన నిపుణుల బృందం పేర్కొంది. అయితే… పరిస్థితిని చక్కదిద్దాలన్న అనంతర ప్రభుత్వాల ప్రయత్నాలు తీవ్రవాద దుందుడుకు చేష్టలతో ఫలించడం లేదు. ‘భారత దేశానికి అతి పెద్ద అంతర్గత శత్రువు మావోయిస్టు పార్టీయే’ అని పదమూడేళ్ల క్రితం అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించడం, దేశంలో తీవ్రవాద ప్రాబల్యం గల చాలా గ్రామాలకు కనీస సదుపాయాలు కూడా సమకూరడం లేదని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవలి తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో – మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాటేరి గ్రామ పరిస్థితిని మచ్చుకు ప్రస్తావించారు. మావోయిస్టుల హింసతో ప్రభావితమైన ఆ గ్రామం బస్సు సదుపాయానికి కూడా నోచుకోలేదని, ఇటీవల మొదటిసారిగా బస్సును ప్రవేశపెట్టినప్పుడు స్థానికులు మంగళ వాయిద్యాల మధ్య దానికి స్వాగతం పలికారని గుర్తు చేశారు. సామూహిక హింసతో సమాజాన్ని సంస్కరించలేమని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాఉద్యమాలు, సంక్షేమ కార్యక్రమాలతోనే జనసామాన్యానికి లబ్ధి చేకూరుతుందనీ అభిప్రాయపడ్డారు.
ప్రగతి,శాంతి భద్రత అంశాలు ప్రధానంగా తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. వచ్చే ఏడాది (2026) మార్చి 31 తేదీ నాటికి దేశాన్ని తీవ్రవాద రహితంగా మారుస్తామని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటించారు. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గత ఏడాది జనవరిలో ఆపరేషన్ ‘కగార్’ చేపట్టింది. భద్రతాదళాలను మోహరించింది.ఆ దళాలు భారీ సంఖ్యలో డ్రోన్లు, హెలికాప్టర్లను వినియోగించాయి. కర్రెగుట్టలను, ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పట్టి, అబుజ్మడ్లోకి చేరిన భద్రతా బలగాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని కీలక అభయారణ్యాలపై గురిపెట్టినట్లు సమాచారం. ఉగ్రవాద, తీవ్రవాదాలకు చుక్కపెట్టాలన్నది పాలకుల, పాలితుల ప్రబల ఆకాంక్ష. అలా భద్రతా బలగాలు చేపట్టిన చర్యలు చట్ట విరుద్ధమనే అభిప్రాయం జనం నుంచి వ్యక్తం కాకపోవడం కేంద్రానికి మద్దతుగానే భావించాలని మరికొందరి అభిప్రాయం. తీవ్రవాదం పుట్టుకకు కారణాలు ఏమైనా.. సాంకేతికతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు వేగంగా మారుతున్న తరుణంలో కాలం చెల్లిన భావజాలంతో అడవుల బాట పట్టి సాధించేది ఏముంటుంది..? ప్రగతికి అడ్డంకి, ప్రాణహాని తప్ప! అన్నది చాలా మంది విశ్లేషకుల, హితైషుల ప్రశ్న.