శ్రీమహావిష్ణువు సుప్రసిద్ధ దశావతరాలలో కూర్మావతారం అ‘ద్వితీయం’. క్షీరసాగర మథనం క్రతువు ఫలించేందుకే స్వామి ఈ అవతరాన్ని ధరించాడు. ఈ అవతారానికి విశ్వానికి ఆధారభూతుడు, సకల సృష్టికర్త అనే అర్థాలూ ఉన్నాయి. సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు విధాతకు ఆదికూర్మ రూపంలోనే దర్శనమిచ్చాడని పురాణవాక్కు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు శ్రీకూర్ముడు ఆవిర్భవించాడు. అష్టాదశ పురాణాల్లో ఒకటైన కూర్మ పురాణాన్ని శ్రీమహావిష్ణువు పృష్ఠ (వీపు)భాగంగా చెబుతారు. ఈ అవతారం గురించి వింటే సకల పాపాలు హరిస్తాయని (కూర్మావతారం చ సంశ్రుతం పాపనాశనమ్) అని అగ్నిపురాణం వివరిస్తోంది.
దుర్వాస ముని శాపకారణంగా ఇంద్రుని సర్వసంపదలు, నిజప్రతాపాలు మటుమాయ మయ్యాయి. ఫలితంగా దనుజుల చేతిలో ఓటమి పాలు కాసాగారు. తమకు విజయసిద్ధి, మృత్యుభయ నివారణ కోసం దేవతలు శ్రీహరిని శరణు వేడారు. అమృతపానంతో పరిస్థితి చక్కబడుతుందని, అందుకు క్షీరసాగరాన్ని మథించాలని హితవు చెప్పాడు దేవ దేవుడు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా అమర్చుకున్నారు దేవతలు. శ్రీహరి సలహాపై పాలకడలిని చిలికే పక్రియకు దేవతలు,దానవులు సహకారాన్నీ తీసుకున్నారు. అయితే సాగర మథన సందర్భంలో మందర (కవ్వం)అడుగున ఏ ఆధారం లేకపోవడంలో అది నీట మునిగిది. అవసరమైనప్పుడు తనను తాను సృష్టించుకుంటాననే వాక్కును అనుసరించి శ్రీహరి సుందర కూర్మరూపుడుగా అవతరించి మందరాన్ని వీపున మోసి మథన పక్రియను పరిపూర్ణం చేశాడు.‘జలధి గడవ సేయు శైలంభు గవ్వంబు.. సిరియు, సుధయు బడయు శ్రీవల్లభుడు దక్క నొరుడు శక్తిమంతుడొకడు గలడె? (సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి, లక్ష్మిని, అమృతాన్ని సంపాదించడానికి శ్రీహరియే శక్తిమంతుడు) అన్నారు పోతన కవీంద్రుడు. శ్రీహరి మళ్లీ మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు పంచి, వారిని బలోపేతులను చేశాడు. దానవ వినాశనానికి కారకుడయ్యాడు.
సూక్ష్మంగా పరిశీలిస్తే, పాలసంద్ర మథన ఘట్టంలో ఆధ్యాత్మిక, వేదాంత అంశాలు అవగత మవుతాయి. ‘ప్రతివారిలోని మంచిచెడులు దేవ దానవులు. బుద్ధి అనే మందర పర్వతాన్ని కవ్వంగా, అహం అనే వాసుకుని తాడుగా చేసుకుని మనసు అనే సాగరాన్ని చిలికితే జ్ఞానామృతం వెలువడుతుంది’ అని కైవల్యోపనిషత్ పేర్కొంటోంది. వేదాంత సాగర మథనంతో మోక్షమనే అమృతం సిద్ధిస్తుందని శంకరభగవత్పాదులు వ్యాఖ్యానించారు. కూర్మం సర్వాధిష్టాన భగవత్ స్వరూపంగా, స్థితప్రజ్ఞతకు, దృఢచిత్తానికి సంకేతంగా, కాలానికి ప్రతీకగా చెబుతారు పండితులు. కూర్మం (తాబేలు) సంకల్ప రహితంగా ఉన్నప్పుడు నీటిలో స్తంభించి ఉంటుంది. అది తన అవయవాలను లోనికి ముడుచు కొని స్థిరంగా ఉన్నట్లే, మానవులు, లౌకిక విషయాల నుంచి సర్వేంద్రియాలను మరల్చినప్పుడు, జీవనయానంలో మందరమంతటి భారాన్ని కూడా సులువుగా భరించగలడనే సందేశాన్ని ఇస్తోంది. పట్టుదలతో ప్రయత్నిస్తే, తప్పక ఫలితం సిద్ధిస్తుందనేందుకు క్షీర సాగర మథనం ఘట్టం ఒక నిదర్శనంగా చెబుతారు. ఈ విషయంలో తొలుత దేవతలు సందేహించారట. ప్రయత్నమంటూ మొదలు పెడితే, అవసరమైతే దైవం సహకరిస్తుందనేందుకు కూర్మనాథుడు ఆవిర్భావమే ఉదాహరణ.
కూర్మం వెన్నులో మేష, వృషభ రాశులు, తలలో మిథున, కర్కాటకాలు, శరీరం ఆగ్నేయంలో సింహరాశి, దక్షిణ ఉదర భాగంలో కన్య, తుల రాశులు, ఎడమవైపు కుంభరాశి నైరుతిలో వృశ్చికం, తోకపై ధనుస్సు, వాయవ్యంలో మకర, ఈశాన్యంలో మీన రాశి ఆక్రమించి ఉంటాయని చెబుతారు.
ఆంధప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల మధ్య కూర్మనాథుడు వెలశాడు. ఈ ఆదికూర్మ క్షే•త్రం నెలవైన శాలిహుండం కొండను ‘కూర్మాద్రి’ అనీ వ్యవహరిస్తారు. పద్మ, బ్రహ్మ పురాణా లలో దీని గురించి విపులంగా వర్ణిత మైంది.ఈ క్షేత్రం వైష్ణవ, శైవ సంప్రదాయాల సమ్మేళనం. ఇది వైష్ణవ ఆలయమైనా దాని చుట్టూ ఐదు శివాలయాలు (సుందరేశ్వర, కర్పూరేశ్వర, కోటేశ్వర, హాటకేశ్వర, పాతాళసిద్దేశ్వర) ఉన్నందున ఈ ప్రదేశాన్ని పంచ లింగాత్మక క్షేత్రమనీ వ్యవహరిస్తారు. ఇక్కడి పుష్కరి ణిని చక్రతీర్థం, కూర్మగుండం, శ్వేతగుండం అంటారు. అందులో అవతరించిన మహాక్ష్మి ‘శ్రీకూర్మనాయిక’గా పూజలందుకుంటున్నారు. ఈ పుష్కరిణిని ‘మోక్ష స్థానం’గా వ్యవహరిస్తారు. నదీతీరాలలో మాదిరిగా ఈ పుష్కరిణిలో అస్తి నిమజ్జనం చేస్తారు. అవి సాలగ్రామాలవుతాయని ప్రతీతి. ఈ కోనేరులో మాఘ శుక్ల చవితి నాడు గంగాగమన యాత్ర జరుగుతుంది. కూర్మనాథుడు శనీశ్వరునికి అధిదేవత కనుక ఈ ఆలయం దర్శనంతో శని దోష నివారణ అవుతుందని చెబుతారు. త్రేత, ద్వాపరయుగాలలో లవకుశులు, బలరాముడు, ఈ యుగంలో శంకరభగవత్పాదులు, భగవద్రామానుజులు, చైతన్య మహాప్రభువు సహా ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి.
ఆదిశంకరులు తమ ఆరాధనలో నుంచి ప్రసాదించిన సుదర్శన సాలగ్రామమూర్తిని మూల వరుల వాల భాగంలో నేటికీ దర్శించుకోవచ్చని శ్రీభాష్యం వారు తెలిపారు. అసోంలోని గువాహిటి లోనూ కూర్మనాథ ఆలయం ఉంది.
‘బ్రహ్మాండకోటి పరిపూర్ణ మహోదరాయ
క్షీరాబ్ధి నిర్మదన మందర ధారకాయ
విశ్వాత్మనే సకల లోకసముద్ధరాయ
కూర్మావతార సతతం భజతే నమోస్తు’
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్