జూన్ 21, 2025న 11వసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ప్రపంచం సిద్ధమవుతున్నది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన కృషి, పరిణామాల ఫలితంగా ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడానికి ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (డిసెంబర్ 11,2014) నిర్ణయించింది. ఇందుకు అమెరికా సహా 177 దేశాల మద్దతు లభించింది. ఆ తరువాత నుంచి యోగ, సూర్య నమస్కారాల గురించి ఒక్కసారిగా ప్రపంచం చర్చించడం ఆరంభించింది. జూన్ 21, 2015 నుంచి యోగా దినోత్సవం ప్రపంచమంతటా అమలులోకి వచ్చింది. భారతీయ సనాతన ధర్మం లేదా జీవనం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగ/సూర్యనమస్కారాలు. ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో, ఆరోగ్యకర వాతావరణంలో కలిపేందుకు ఆధునిక యుగంలో ఇది నాందీవాచకం కాగలదని ఎక్కువమంది నమ్ముతున్నారు. యోగ, సూర్య నమస్కారాలు అవిభాజ్యాలు. సూర్య నమస్కారాలు లేని యోగాను ఊహించలేం. సూర్య నమస్కారాలకు ఉన్న శాస్త్రీయత అద్భుతం. విశేషమైన చరిత్ర కూడా ఉంది. ఈ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యనమస్కారాల ఘనత ఎంతటిదో చెప్పడానికి ఇది మరొక ప్రయత్నం.
సూర్యారాధన మానవ నాగరికత పురుడు పోసుకున్న క్షణాల నుంచి కనిపిస్తూనే ఉంది. కానీ భారతదేశంలో సూర్యారాధనకు విశిష్ట స్థానం ఉంది. అందులో శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక దృష్టి కలసి ఉన్నాయి. ప్రతి వేకువలోను సూర్య భగవానుడికి ప్రణమిల్లే ఒక సంప్రదాయం కొన్ని శతాబ్దాల పాటు భారతభూమి మీద విలసిల్లింది. ఆర్ష వాఙ్మయకర్తలు సూర్యుడి గురించి ఒక పరవశంతో ప్రస్తావించారు. పురాతన సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన, నాగరికత కలిగిన గ్రీస్, ఈజిప్ట్, స్కాండినేవియా వంటి దేశాలలోను సూర్యుడి ఆరాధన ఉంది. ఇంకా చెప్పాలంటే దేశీయమైన సాంస్కృతిక సంపద గణనీయంగా ఉన్న అన్ని దేశాలు తమదైన పంథాలో సూర్యుడిని ఆరాధిస్తూనే ఉన్నాయి. రుగ్వేదంలో ఒక శ్లోకంలో చక్కని భావం ఉంది. తన సప్తాశ్వాలను రథానికి పూన్చి సూర్యుడు లోకం నిండా వెలుగులు నింపేందుకు ఎంత సహజంగా ఉదయిస్తాడో, సమున్నత మానవులు త్యాగాలు చేయడానికి అంతే సహజంగా ముందుకు వస్తారు అంటుంది ఆ శ్లోకం. శరీరాన్నీ, మనసును లేదా బుద్ధినీ ఆధ్యాత్మిక స్పర్శ కలిగిన విశిష్ట వ్యాయామంతో ఏకం చేసే ప్రక్రియ సూర్యనమస్కారమని తొలి నుంచి హిందూ జీవనం ప్రకటిస్తూనే ఉంది. ఇందుకు ఉచ్చ్వాసనిశ్వాసాలను క్రమబద్ధం చేస్తారు. అదే యోగా. యోగాభ్యాసం, సూర్య నమస్కారాలు వేర్వేరు కాదు. సూర్య నమస్కారాలు లేని యోగాభ్యాసాన్ని ఊహించలేం కూడా. గురుశిష్య బంధం యోగాభ్యాసంలోనే ఉంటుందని కూడా మనవారు విశ్వసించారు. ఆంజనేయస్వామి మొదట సూర్యుని ద్వారా సూర్య నమస్కారాలు అభ్యసించాడని కథనం. అటు పురాణ ప్రశస్తి, ఇటు శాస్త్రీయ దృక్పథం సూర్యనమస్కారాలకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలై ప్రాణం పోస్తున్నాయి.
పురాణాలలో ప్రస్తావన
సూర్య ఆరాధన ప్రస్తావన మన పురాణాలలో విశేషంగా కనిపిస్తుంది. ఆ విద్యను కేవలం ఆధ్యాత్మిక చింతనగా పరిచయం చేయలేదు. శాస్త్రీయ దృక్పథానికే పరిమితం చేయలేదు. సమున్నత ధ్యేయ సాధనకు మనిషిని సమాయత్తం చేసే చోదకశక్తిగా వాటిని దర్శింపచేశారు. వేదాలలో సరే, శ్రీమద్రామా యణం యుద్ధకాండలో సూర్యుడి ప్రస్తావన ‘ఆదిత్య హృదయం’ పేరుతో వస్తుంది. ఒకదశలో శ్రీరాముడంతటి వానికి కూడా రావణునితో యుద్ధం చేయలేనన్న శంక బయలుదేరింది. అప్పుడు దేవతలు అగస్త్య మహర్షిని వేడుకోవలసిందని సూచించారు. అగస్త్యుడు వచ్చి ఒక్కటే బోధించాడు. సూర్య భగవానుడిని ప్రార్ధించమన్నాడు. ఫలితమే ‘ఆదిత్య హృదయం’ అనే మహోన్నత, మహిమాన్విత శ్లోకావళి. ఇది పఠించిన తరువాత రాముడు శక్తి మంతుడై రావణుడిని ఓడిరచాడు. రామాయణ శ్లోక అక్షరాలతో జనించిన గాయత్రి మంత్రం కూడా చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లమనే ప్రార్ధిస్తుంది. యజుర్వేదంలోని తైత్తరీయ ఆరణ్యకం లోను సూర్య నమస్కారాల ప్రస్తావన ఉంది. ఇన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో చాలాచోట్ల, ప్రధానంగా దక్షిణ భారతంలో సూర్య నమస్కారాలు చేసే సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. కాల పరీక్షకు నిలిచిన ఆరోగ్యం సూత్రమిది.
తాత్త్వికత
సౌర కుటుంబానికి కేంద్ర బిందువు సూర్యుడు. సూర్య భగవానుడు అనంత శక్తికి ప్రతీక కూడా. రవి గాంచని ప్రదేశమే లేదు. సూర్యుడి వెలుగులో భూమి పరిఢవిల్లుతూ ఉంటుంది. సూర్యుడు లేకుంటే సృష్టి లేదు. భూమి మీద జీవకోటికి మనుగడ లేదు. జీవులు తీసుకునే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి సూర్యరశ్మితో సంబంధం ఉన్నవే. సర్వ జీవుల పట్ల సమాన దృష్టి కలిగినవాడు సూర్యుడు. సహస్ర కిరణుడికి జాతి, మత, ప్రాంత అంతరాలు లేవు. అలాంటి ప్రత్యక్షదైవం కేంద్రంగా భారతీయత రూపొందించుకున్న మహోన్నత వ్యాయామ ప్రక్రియ సూర్య నమస్కారాలు. కానీ సూర్య నమస్కారాలంటే కేవలం శారీరక వ్యాయామం అనుకుంటే ఘోర తప్పిదమే అవుతుంది. నిర్దుష్టమైన ప్రాణాయామం, ఆసనాల ద్వారా చేసే ఆధ్యాత్మిక సాధన. బుద్ధి లేదా మనసులో వచ్చే ఒడుదుడుకులపై దృష్టి సారించడం, అదుపులో ఉంచుకోవడానికి దోహదం చేయడం ఈ సాధన లక్ష్యం. సూర్యనమస్కారాలలో ఉండే అన్ని ఆసనాలు లేదా భంగిమలు ప్రకృతి పట్ల మానవుడికి ఉండవలసిన లోతైన ఆరాధనను, మమేకత్వాన్ని ప్రతిబింబించేవే. పర్యావరణంలోని జీవజాలంతో యోగ సాధకునికి ఉండే సామరస్యాన్ని ఆవిష్కరించేవే. శరీరం ఖలు ధర్మసాధనం అంటారు. మానవుడు ఏమి సాధించాలన్నా, తాను నివసిస్తున్న భూమి కోసం, ప్రకృతి కోసం, సాటి మనిషి కోసం ఏమి సృష్టించాలన్నా, సమాజానికి ఉపయోగ పడాలన్నా ఆరోగ్యం ప్రధానం. అంతేకాదు, దేహమే దేవాలయం అన్నారు. అది పవిత్రమైనదిగా భావించుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ప్రధానమో, పవిత్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మనసునీ, శరీరాన్నీ బలంగా ఉంచుకోవడం మనిషి కనీస కర్తవ్యం. భౌతికంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగాభ్యాసాన్ని అనునిత్యం ఆశ్రయిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అసలు యోగాభ్యాసం ప్రధాన ప్రయోజనమే మెదడును చురుకుగా, శరీరాన్ని మృదువుగా ఉంచడం. దీనితోనే ఆరోగ్యవంతమైన జీవన శైలి సాధ్యమవుతుంది. ఒక విధంగా మనసుకీ, హృదయానికీ ఇదొక అనుసంధాన ప్రక్రియ. సూర్యనమస్కారాలు అటు శరీరాన్ని సరళంగా ఉంచడంలోను, ఇటు మనసును ఆధ్యాత్మిక సాధనకు సిద్ధంగా ఉంచేదిగాను చేస్తాయి. అందుకే సూర్యనమస్కారాలు శరీరాన్నీ, బుద్ధినీ కూడా అదుపులో ఉంచే గొప్ప ప్రక్రియగా పేరు పొందాయి. ఆ రెండిరటిని సమన్వయం చేసే సాధనగా యోగ రుజువైంది. వివేక జ్ఞానాన్ని సాధించేందుకు యోగా బోధన ఉపకరిస్తుంది. ఇంకా లోతైన భావం కూడా ఇందులో చూసినవారు ఉన్నారు. యోగా అనేది వ్యక్తి ఆత్మకూ, విశ్వాత్మకూ మధ్య బంధాన్ని కలిపేదే అంటారు. యోగాలో భాగమైÑ ఆసనం, ప్రాణా యామం, మంత్రం, ధ్యానం అనే వాటి సమ్మేళనంతో ఉండే ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక సాధన మార్గంగా సూర్య నమస్కారాలు ఖ్యాతి చెందాయి. కారణాలు లోతుగా తెలియక పోయినా, ఒక ఏడాదిలో నెలలు పన్నెండు, సూర్యనమస్కారాలలో వేసేవి పన్నెండు ఆసనాలే.
ప్రకృతితో మమేకత్వం
మానవుడికి తాను కూడా ఈ ప్రకృతిలో భాగం మాత్రమేనన్న స్పృహ కావాలి. ఈ ప్రకృతీ తానూ వేర్వేరు కాదన్న విశాల దృష్టి ఉండాలి. ఇంతటి మహోన్నత భావనలకు ప్రతీకలే సూర్య నమస్కారాలలోని భంగిమలు. ప్రణామాసన, హస్త ఉత్థానాసన, పాదహస్తాసన, అశ్వసంచ ఆసన, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసన వంటివి సూర్య నమస్కారాలలో వేస్తారు. ప్రతి ఆవృత్తానికి ఒక మంత్రం పఠిస్తారు. బుద్ధి, శరీరాల మధ్య సమన్వయానికి గడచిన 3000 ఏళ్లుగా భారతీయులు సాగిస్తున్న సాధనలోని సారాంశం స్థూలంగా ఇదే. స్థిర చిత్తం, స్వీయ నియంత్రణ, ప్రశాంతత ఆ సాధన ధ్యేయం. జీవితం మీద యోగ సాధకుడి దృక్పథాన్ని మార్చే శక్తి దీనికి ఉంది. అన్నింటికీ మించి మానసిక ఒత్తిడి నివారణకు పరమౌషధం ఇదేనని రుజువైంది. ఒత్తిడి తగ్గడమే బుద్ధి, శరీరాల సమన్వయానికి బాగా తోడ్పడుతుంది. ఈ సాధననే ఇప్పుడు పాశ్చాత్య దేశాల వారు కాంప్లిమెంటరీ అల్టర్నేటివ్ మెడిసిన్ పేరుతో అభ్యసిస్తున్నారు.
ఇలియెట్ గోల్డ్బెర్గ్ అనే శాస్త్రవేత్త తన పుస్తకం ‘మోడ్రన్ పాత్’లో ఒక అంశాన్ని ప్రతిపాదించాడు. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం కేవలం చర్చ కోసమే. ఈ ప్రతిపాదనే అంతిమ సత్యం కాదు. సూర్య ఆరాధన మహారాష్ట్రలో ఆరంభమైందని ఆయన అంటాడు. ఎందుకంటే ఆధునిక భౌతిక సంస్కృతి అక్కడే ఊపిరి పోసుకుందని ఆయన వాదన. దీనికి కారణం అక్కడ స్మార్త పంచాయతన విధానం ఉండడమేనని కూడా చెప్పాడు. ఆ విధానంలో శివుడు, విష్ణువు, దేవి, గణేశ్లతో పాటు సూర్య ఆరాధనకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది. ఇతడి వాదనకు బలం చేకూర్చే రీతిలో మరొక జనాభిప్రాయం కూడా అక్కడ ఉంది. సూర్య నమస్కారాలు హిందూ నిత్య జీవన శైలిలో ఉంటాయి. హిందూ ధర్మోద్ధరణకు కంకణం కట్టుకున్న శివాజీ మహరాజ్ కాలంలో సూర్య నమస్కారాలు పునర్ వైభవం సంతరించుకున్నాయని జనశ్రుతి. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్ధ రామదాస స్వామివారు అనేక అఖాడాలను (వ్యాయామ శాలలు) నిర్వహిస్తూ ఉండేవారు. వాటిలో సూర్య నమస్కారాలు ప్రత్యేక అంశంగా సాధన చేసేవారు. సాంస్కృతిక మానవ పరిణామ శాస్త్రవేత్త జోసెఫ్ ఎస్ అల్టర్ ఒక సిద్ధాంతం ముందుకు తెచ్చాడు. భారతీయ మల్లయుద్ధంలోని కొన్ని కొన్ని ‘పట్టు’ల మూలాలు సూర్య నమస్కారాలలో కనిపిస్తాయంటాడాయన. అందుకే యోగ, సూర్యనమస్కారాలు పాఠశాలలలో క్రమం తప్పకుండా సాధన చేయించేవారు.
ఆధునిక కాలంలో…
సూర్య నమస్కారాలకు విశేష ప్రాచుర్యం తెచ్చిన వారిలో స్వామి కైవల్యానంద ఒకరు. యోగ, సూర్య నమస్కారాలను అవిభాజ్యంగా చూస్తూ, ఒకే భౌతిక సంస్కృతిలోని అంశంగా ఆయన భావించారు. కానీ తరువాత ఆయన అభిప్రాయం మార్చుకుని యోగ, సూర్య నమస్కారాలు వేర్వేరు అని ప్రచారం చేయడం ఆరంభించారు. దీనిని తిరుమల కృష్ణమాచార్య వంటివారు తిరస్కరించారు. 1933లో కృష్ణమాచార్య మైసూరులోని జగమోహన్ భవనంలో యోగా బోధించేవారు. అప్పుడు జరిగిన సాధనలో సూర్య నమస్కారాలు, యోగం కలిసే ఉండేవని మార్క్ సింగల్టన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. నిజానికి మైసూరు సంస్థానానికి ఒక ప్రత్యేకత చరిత్రలో ఉంది. దేశీయమైన భౌతిక శిక్షణను గుర్తించిన ఘనత ఆ సంస్థానం ప్రభుత్వానిదే. 1919లోనే ఆ ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. సూర్య నమస్కారాలు, యోగా తరగతులు నిర్వహించేవారని రికార్డులు తెలియచేస్తు న్నాయి. యోగాభ్యాసానికి ప్రాచుర్యం తెచ్చేందుకు కృష్ణమాచార్య ఆ విద్యను కొంత సరళం చేశారని కూడా ఈ రికార్డులు చెబుతాయి.
ఆధునిక సూర్య నమస్కారాల పితగా ఔంద్ (మహారాష్ట్ర) సంస్థానాధీశుడు భావనరావ్ శ్రీనివాసరావ్ పంత్ ప్రతినిధిని పేర్కొంటారు. బ్రిటన్కు చెందిన లూయీ మోర్గాన్ అనే ఆమెతో కలసి భావనరావు సూర్యనమస్కారాలకు లౌకిక పునాది కల్పించారు. ఆరోగ్యానికి పది సూత్రాలు (1928) అంటూ ఆయన ప్రారంభించిన ఉద్యమానికి సూర్య నమస్కారాలే కీలకం. మోర్గాన్ దృష్టి వేరు. ఆమె సూర్య నమస్కారాలను ఇంగ్లండ్లో పరిచయం చేసినా, అది ‘‘ఫిట్నెస్’’ కోసమే. అందుకే అక్కడ ఆ రోజులలో మధ్య తరగతి మహిళలు ఎక్కువగా సూర్య నమస్కారాలకు ఆకర్షితులయ్యారు. భావనరావ్ మంత్రోచ్ఛాటనతో ఆసనాలు వేసేవారు. మోర్గాన్ కేవలం ఆసనాలు వేసేవారు. ‘సూర్య నమస్కార’ పేరుతో భావనరావ్ 1908లో ఒక పుస్తకం రాశారు. తన తండ్రి అర్ధ శతాబ్దం పాటు సూర్య నమస్కారాలను అభ్యసించారని అందులో పేర్కొన్నారు. అంటే 1870 ప్రాంతం నుంచి ఆయన సాధన చేసేవారు. నిజానికి భావనరావ్ పంత్, కైవల్యానంద ఇద్దరూ కూడా విదేశీ భౌతిక విద్యను భారతదేశంలో సాధన చేయడానికి బద్ధ వ్యతిరేకులు. ఆ భావన వారికి జాతీయభావం నుంచి జనించింది. తరువాతి కాలాలలో పట్టాభి జోయిస్, బీకేఎస్ అయ్యంగార్, స్వామి శివానంద సూర్య నమస్కారా లను విశేషంగా ప్రచారం చేసినవారిలో ఉన్నారు.
సమున్నత ప్రయోజనాలు
ఉదయిస్తున్న సూర్యుడికీ, లేదా సాయం వేళ అస్తమిస్తున్న సూర్యుడికీి అభిముఖంగా నిలిచి సూర్య నమస్కారాలు చేయడం సంప్రదాయం. కానీ సాధారణ వాతావరణంలో కూడా చేస్తారు. మారిన జీవన శైలిలో ఇది తప్పడం లేదు. అయినా సాధారణ వ్యాయామశాలలలో ఉపయోగించే ఎలాంటి పరికరంతోను పని లేకుండా చేసే వ్యాయామం యోగా లేదా సూర్య నమస్కారాలు. ఇవి ఒక సంపూర్ణ వ్యాయామ ప్రక్రియ. సూర్యుడి ముందు వేకువనే నిలిచి వ్యాయామం చేయమని సూచించడంలోనే గొప్ప పరమార్ధం ఉంది. సూర్యుడు ఉదయించగానే ప్రసరించే కిరణాలతో మానవదేహానికి ఎన్నో మేళ్లు కలుగుతున్నాయి. దేహంలోని జీవగడియారం లయ తప్పకుండా పనిచేస్తుంది. డీ విటమిన్ ఉత్పత్తి అవుతుంది. ఎలాంటి కలత లేకుండా హాయిగా నిద్రపడుతుంది. భావోద్వేగాలు సమతూకంలో ఉంటాయి. దేహంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. రోజంతా చురుకుదనం ఉరకలు వేస్తుంది. ఎలాంటి జన్యుపరమైన కారణం లేని పక్షంలో ఊబకాయంతో బాధపడేవారు రోజులో తొలి సూర్యకిరణాల ప్రభావంతో బరువు తగ్గే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
సూర్య నమస్కారాలలో 12 భంగిమలు లేదా ఆసనాలు ఉంటాయి. ఏ ఆసనమైనా పరిపూర్ణంగా ప్రదర్శించాలంటే సునిశిత నైపుణ్యం అవసరం. కాస్త నిశిత దృష్టితో పరిశీలిస్తే ప్రతి ఆసనం అందమైన శిల్ప భంగిమను తలపునకు తెస్తుంది. చాలా చిత్రంగా ప్రతి ఆసనం ఈ భూమ్మీద నివసించే ఒక జంతువును ప్రతిబింబిస్తూ ఉంటుంది. ముందు అనుకున్నట్టు ప్రకృతీ, తాను వేర్వేరు కాదని యోగ సాధకుడు భావించవలసి ఉంటుందని చెప్పడమే ఆసనాల లక్ష్యమని నిశ్చయంగా చెప్పవచ్చు. అంటే ప్రకృతిలోని అద్భుత సౌందర్యాన్ని ఆసనాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. సూర్య నమస్కార యోగాలో శరీరంలోని కండరాలు, లెగమెంట్లు, జాయింట్లు సాగుతాయి. తద్వారా బలోపేతమవు తాయి. సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేసే వారి అనుభవం ఏమిటి? కండరాల పటిష్టత, వెన్ను సరళం కావడం. రక్త ప్రసరణ, ప్రాణవాయువు సరఫరా మెరుగు పడతాయి. బ్లాకేజులు తగ్గి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. సూర్య నమస్కారాలలో ప్రతి ఆసనం ప్రత్యేకమైన ఉచ్చ్వాస నిశ్వాసాలతో చేస్తారు. లయబద్ధమైన వ్యాయామం వల్ల ఊపిరితిత్తులలోకి రక్త ప్రసరణ, ప్రాణవాయువు రాకపోకలు సజావుగా ఉంటాయి. క్రమం తప్పని సూర్య నమస్కార సాధన అధిక శరీర బరువును తగ్గిస్తుంది. ఆసనాలు వేగంగా వేయడం వల్ల ఉదరం వద్ద కండరాలు సాగుతాయి. జీవ ప్రక్రియ మరింత శక్తిమంతమవుతుంది. సరైన రక్త ప్రసరణ వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. శిరోజాలు బలంగా ఉంటాయి. జఠరాగ్ని పెరగడానికి సూర్య నమస్కారాలు గొప్పగా ఉపకరిస్తాయి. అంటే ఆకలికి లోటుండదు. నరాల వ్యవస్థలో సమతుల్యత సాధ్యమై, ఒత్తిడి తగ్గుతుంది. సూర్య నమస్కారాలు స్త్రీలలో బహిష్టు ప్రక్రియను క్రమబద్ధం చేస్తాయి. కొందరిలో కనిపించే నెలవారి శూలపోటును తగ్గిస్తాయి. అందరిలోను సరైన నిద్ర వ్యవస్థను సరి చేయగలవు. నిద్రలేమితో బాధపడేవారు సూర్య నమస్కారాలతో ఉపశమనం పొందుతారు. పిల్లలు ఏడు లేదా ఎనిమిదేళ్ల వయసు నుంచి సూర్య నమస్కారాలు చేయవచ్చు. వారికి కూడా శారీరక పటుత్వమే కాకుండా, మానసికంగా బలంగా ఉండేందుకు అవి దోహదపడతాయి. అయితే వీటిని మొదటి గురు ముఖంగా లేదా అనుభవజ్ఞుల సమక్షంలో సాధన చేయడం మంచిదన్న మాట నిజం.
ఎన్నో ఆధారాలు
క్రీస్తుశకం 7వ శతాబ్దంలో హర్షవర్ధనుని ఆస్థానకవి మయూరుడు సూర్య శతకం రచించి కీర్తితో పాటు, చూపును కూడా సంపాదించుకున్నాడని చరిత్ర. భవభూతి రచించిన మాలతీ మాధవంలో సూత్రధారుడు పాపపరిహారానికి యశోలాభానికి సూర్యుడిని ఆరాధించినట్టు వర్ణిస్తాడు. ఇట్టి చారిత్రక ఘట్టములు అనేకం కనిపిస్తాయి. వేద వాజ్ఞయంలో రుగ్వేదంలో మహా సారమంత్రాలు అరవై అయిదు రుక్కులు, యజుర్వేదంలోని 130 అరుణ మంత్రాలు సూర్యోపాసన ప్రాధాన్యం వివరించేవే. వేదాలలోనే కాకుండా, వ్యాస భగవానుడి భవిష్యత్ పురాణంలో బ్రహ్మపర్వంలో సప్తమీ కల్పంలో సూర్య మహాత్మ్య వర్ణన, సౌర ధర్మ వర్ణన వంటివి కనిపిస్తాయి. మార్కండేయ పురాణంలో సూర్యావిర్భావం సవితృ స్తుతి భాస్కరారాధన ఉన్నాయి. సూర్య నమస్కార యోగ వ్యాయామం చేసేవారికి అన్ని రోగాలు పోతాయన్నది జగమెరిగిన సత్యం. అశక్తులైన వారు సూర్య నమస్కారాలు చేసిన వారు ఇచ్చిన మంత్రజలం తీసుకున్నా శారీరక పీడలు తొలగుతాయని నమ్ముతారు.
(జాగృతి/ 13.1.1969)
ఆత్మ విస్మృతికి కూడా ఔషధమే!
ఔంద్ సంస్థానాధీశుడు రాజా భావన్రావ్ శ్రీనివాసరావ్ పంత్ ప్రతినిధి (1868-1951) యోగాభ్యాసంలో సూర్య నమస్కారాలను పరాయి ప్రభుత్వం ఇచ్చిన పరిమిత స్వేచ్ఛలో సార్వభౌమాధికారాన్ని జ్ఞప్తికి తెచ్చే శారీరక, మానసిక వ్యాయామ ప్రక్రియగా భావించారనిపిస్తుంది. అదొక మానసిక టెక్నిక్ మాత్రమే కాదు, రాజకీయ వ్యూహంగా కూడా ఆయనకు కనిపించింది. సూర్య నమస్కారాలను సాధన చేయడం అంటే సార్వభౌమాధికారం దిశగా ఆలోచన చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సూర్య నమస్కార యోగ ఔంద్ సంస్థానంలో రాజకీయ, విద్య, ఆర్థిక, సామాజిక రంగాల ప్రముఖలందరినీ ఆకర్షించింది. పుణేకి 150 కిలోమీటర్ల దూరంలోని ఔంద్ సంస్థానంలో గతంలో సార్వత్రిక ఓటు హక్కు, ఉదారవాద, ప్రజాస్వామిక రాజ్యాంగం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, బహిరంగ కారాగార విధానం అమలులో ఉండేవి. నేటి మహారాష్ట్రలోని సతారా, సాంగ్లీ జిల్లాలలోను, ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉన్న 72 గ్రామాలతో ఈ సంస్థానం ఏర్పడిరది. ఇలాంటి సామాజిక నేపథ్యాన్ని సూర్య నమస్కారం అన్న పదం మరింత చైతన్యవంతం చేసిందని అర్థమవుతుంది. భావన్రావు సూర్య నమస్కారాలను సంస్థానంలోని పాఠశాలలు అన్నింటిలోను, న్యాయ వ్యవస్థలోను పరిపాలనా వ్యవస్థలోను తప్పనిసరిగా అంశంగా అమలు చేశారు. నిజానికి రాజ్యాంగ వ్యవస్థ పర్యవేక్షణలో ఉండే ప్రజాస్వామిక వ్యవస్థ కోసం ఆయన 1939 ప్రాంతంలోనే తన రాజరికాన్ని త్యజించారు. అంటే సంస్థానాల విలీనానికి చాలా ముందే, రాజ్యాంగం అమలులోకి రావడం కంటే ఎంతో ముందే భావన్రావ్ భారత భవిష్యత్కు, పార్లమెంటరీ వ్యవస్థకు ఒక దిక్సూచిగా నిలిచారు.
సూర్య నమస్కారాలకు భావన్రావ్ కల్పించిన ప్రాచుర్యం చరిత్ర విస్మరించడం సాధ్యం కాదు. ఆయన కృషి అంత విశిష్టమైనది. సూర్య నమస్కారాల సాధన గురించి, ప్రక్రియ గురించి వివరించే 11 నిమిషాల మూకీ/లఘుచిత్రాన్ని 1928లోనే ఆయన నిర్మించారు. ఈ చిత్రాన్ని బ్రిటిష్ ఇండియా అంతటా ప్రదర్శించారు. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హిందీ, ఇంగ్లిష్ భాషలలో యోగా ఘనతను, శాస్త్రీయ దృక్పథాన్ని ఈ చిన్న చిత్రం నాడు విశ్వానికి వెల్లడిరచింది. స్వయంగా రాజాయే ఇందులో నటించారు. 1938లో యోగా గురువుగా ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న కృష్ణమాచార్య కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇందులో తొమ్మిది గజాల చీరలతో స్త్రీలు కూడా సూర్య నమస్కారాలు చేసే సన్నివేశాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఆధునిక సూర్య నమస్కారాలకు భావన్రావ్ను ఆద్యునిగా చెబుతున్నప్పటికీ, ఈ సూర్య నమస్కారాలు తనకంటే ముందే మహారాష్ట్రలో ఉన్నాయని ఆయన తన గ్రంథంలో సవినయంగా అంగీకరించారు.
ఇస్లాం – యోగ
సూర్యుడిని ఒక దైవంగా భావించే బలమైన భావన హిందూధర్మానికే పరిమితం. సూర్యుడి వెలుగును మాత్రం అన్ని మతాలు గుర్తించాయి. క్రైస్తవులు వెలుగును దేవుని రూపంగానే చూశారు. సూర్యుడినే దైవంగా భావించలేదు. ఇస్లాం సూర్యుడిని అల్లా సృష్టిగా భావించింది. యూదులు కూడా దైవంగా భావించరు. అంటే సూర్యుడిని ఆకాశంలో ఒక చుక్కగా లేదా నక్షత్ర మండలంలోనే ఒక నక్షత్రంగా మాత్రమే ఈ మతాలు పరిగణిస్తాయి. సూర్య నమస్కార యోగాను కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి. కొన్ని అభ్యంతరం వ్యక్తం చేశాయి. యోగ, సూర్య నమస్కారాలు ఇచ్చే ఫలితాలను అంగీకరిస్తూనే, అందులోని హిందూత్వ కోణం కారణంగా దూరం పెట్టిన దేశాల వారు, వ్యక్తులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లింలలో ఛాందసవాదులు యోగాకు దూరంగా ఉండాలని ఆదేశించారు. కానీ యోగా గురించి ఇస్లాం ప్రపంచానికి శతాబ్దాల పరిచయం ఉందని చరిత్ర చెబుతుంది. ఇందుకు సంబంధించి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చక్కని సమాచారం ఇచ్చింది.
అబూ అల్ రేహాన్ మహమ్మద్ ఇబన్ అహ్మద్ అల్ బెరూనీ (అల్బెరూనీ) ముస్లిం చరిత్రలో ప్రఖ్యాతుడు. తత్త్వవేత్త, స్వయంగా చరిత్రకారుడు, గణితశాస్త్రవేత్త కూడా. మహమ్మద్ ఘజనీ ఆస్థానానికి వన్నె తెచ్చిన వానిగా కీర్తి ఉంది. ఇతడు భారతదేశంలో 12 ఏళ్లు ఉన్నాడు. తరువాత కితాబ్ అల్ హింద్ లేదా తహకిక్ ఇ హింద్ (భారతదేశ చరిత్ర) రాశాడు. ఆ పుష్కరకాలం అతడు సంస్కృతం, ఖగోళశాస్త్రం, ఇతర శాస్త్రాలు నేర్చుకున్నాడు. 11వ శతాబ్దంలో భారతదేశ సామాజిక, సాంస్కతిక వాతావరణం ఎలా ఉందో వర్ణించాడు. తహకిక్ ఇ హింద్ గ్రంథంలో అతడు తరుచు పతంజలి యోగ శాస్త్రం గురించి ప్రస్తావించడం గమనార్హం. పతంజలి యోగసూత్రాలకు అప్పుడు లభ్యమైన ఒక వ్యాఖ్యానాన్ని తాను అరబిక్లోకి అనువదించానని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఈ అనువాదం 1922లో ఇస్తాంబుల్ పురావస్తు భాండాగారంలో బయటపడిరది కూడా. అల్బెరూనీ తన పుస్తకంలో మంచి సాహిత్య శైలితో యోగసూత్రాలను పరిచయం చేశాడు. ఇదంతా ఒక ఎడారిలో పతంజలి, మరొక యోగి కలసి నడుస్తూ సంభాషిస్తున్న తీరులో ఆయన రచించాడు. ఆ కాలంలో యోగసూత్రాల మీద వెలువడిన కొన్ని ఇతర భాష్యాలూ, వ్యాఖ్యానాల గురించి కూడా అల్బెరూనీ ప్రస్తావించాడు. చిత్రంగా ఆ వ్యాఖ్యానాలలో, భాష్యాలలో ఉన్న కొన్ని భాగాలు తరువాత లభ్యం కాలేదు. పతంజలి సూత్రాలకు అల్బెరూనీ అనువాదం పేరు ‘బాధా నివారణకు భారత పతంజలి పుస్తకం’. కాబట్టి విదేశాలకు వెళ్లిన పతంజలి యోగసూత్రాల అనువాదాలలో మొట్టమొదటిది అల్బెరూనీ రాసినవే అవుతాయి. అయినా కొన్ని భారతీయతతో ముడిపడి ఉన్న సంస్కృత పదాలకు సరైన అరబిక్ పదాలు లభ్యం కాక తడబడ్డాడన్న అభిప్రాయం కూడా ఉంది.
యోగా వంటి ఒక ప్రక్రియ గురించి, అందుకు సంబంధించి సంస్కృత భాషలో రాసిన సూత్రాలను అంత శ్రమించి అరబిక్లోకి అనువదించడం అంటే, భారతీయ జీవనం గురించి ముస్లిం ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతోనే అయి ఉండాలని విమర్శకులు అంటారు. అయితే ఇతర దేశాలకు భారతీయ శాస్త్ర పరిజ్ఞానం పరిచయం కావడం అల్బెరూనీతోనే మొదలు కాలేదు. ఖగోళశాస్త్రం, గణితం వంటి కొన్ని అంశాలు అప్పటికే ముస్లిం దేశాలకు పరిచయం అయ్యాయి. ఖగోళశాస్త్రానికి సంబంధించి బ్రహ్మగుప్తుని గ్రంథాలు, వైద్యానికి సంబంధించి చరకుని, వాగ్భటుని గ్రంథాలు ముస్లిం ప్రపంచానికి తెలుసు. ఇస్లాంలోనే సూఫీ తెగ హఠయోగం మీద ఆసక్తి కలిగి ఉండేది. దీనిని చర్చించిన సంస్కృత గ్రంథం అమృతకుండ అరబిక్, పర్షియన్, తుర్కిష్, ఉర్దూ భాషలలో అనువాదాలు ఉన్నాయి.
– జాగృతి డెస్క్
ఎలా చేయాలి?
సూర్య నమస్కారాలు చేసే సమయంలో నిటారుగా, ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. కొద్ది నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు (ఱఅష్ట్రaశ్రీవ – వఞష్ట్రaశ్రీవ) చేయాలి.
- నమస్కారాసనం (నిశ్వాస)
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి.
- హస్త ఉత్థానాసనం (ఉచ్ఛ్వాస)
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపునకు వెనుకకు వంచాలి. ప్రారంభ దశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి కాళ్లు వంచకూడదు.
- పాదహస్తాసనం (నిశ్వాస)
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్లను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు. అలా కాకుంటే మెడ పట్టేసే ప్రమాదముంది.
- అశ్వసంచలనాసనం (ఉచ్ఛ్వాస)
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే స్తంభింప చేయాలి.
- సంతులాసనం (నిశ్వాస)
కాళ్లు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
- సాష్టాంగ నమస్కారం (శ్వాస పట్టి ఉంచాలి)
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్లు, రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి, నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
- సర్పాసనం (ఉచ్ఛ్వాస)
శ్వాసను పీల్చి, తలను వెనుకకు వంచాలి.
- పర్వతాసనం (నిశ్వాస)
ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులు నేలమీద ఆనించి, నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
- అశ్వసంచలనాసనం (ఉచ్ఛ్వాస)
నాలుగవ స్థితివలెనే కుడి పాదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడిచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి.
- పాదహస్తాసనం (నిశ్వాస)
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ల దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.(ూ్aఅసఱఅస్త్ర ఖీశీతీషaతీస దీవఅస జూశీంవ)
- హస్త ఉత్తానాసనం (ఉచ్ఛ్వాస)
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
- నమస్కారాసనం (నిశ్వాస)
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.
సూర్య నమస్కారాలలో మొత్తం 13 ఆవృతాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక ఆవృతం పూర్తవుతుంది. ప్రతీ ఆవృతంలోనూ సాధకులు 12 ఆసనాలు వేస్తారు.
సూర్య నమస్కార మంత్రాలు
ప్రారంభ శ్లోకం:
ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృత శంఖచక్రః ॥
- ఓం మిత్రాయ నమః
- ఓం రవయే నమః
- ఓం సూర్యాయ నమః
- ఓం భానవే నమః
- ఓం ఖగాయ నమః
- ఓం పూష్ణే నమః
- ఓం హిరణ్యగర్భాయ నమః
- ఓం మరీచయే నమః
- ఓం ఆదిత్యాయ నమః
- ఓం సవిత్రే నమః
- ఓం అర్కాయ నమః
- ఓం భాస్కరాయ నమః
- ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః
ఈ శ్లోకంతో సూర్య నమస్కారాలు పూర్తవుతాయి.
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వన్తి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే॥