జలం జీవనం, జలం సర్వప్రాణినాం ఉద్భవితే।

జలం సర్వస్య మూలం, జలం సర్వమయం చ॥

నీటి ప్రాముఖ్యం తెలియచేస్తుందీ శ్లోకం. మానవాళి మొత్తం నదీతీరాల వెంటే సాగుతోంది. నాగరికత, నగరాలూ వెలసి ఒక నూతన ప్రపంచానికి పునాది వేసినవి నదులే. భారతదేశానికి పేరు ఇచ్చింది కూడా సింధు ( ఇండస్‌ ) నది మాత్రమే. ఇండియాకు గుర్తింపు కూడా ఇండస్‌ నదులతోనే అని అర్ధం అవుతుంది. మన జాతీయగీతంలో ‘పంజాబ్‌, సింధు, గుజరాత, మరాఠా, వింధ్య, హిమాచల, యమునా, గంగా’ అని మనం స్పష్టంగా  పాడతాం. ఒక విధంగా మన జాతీయగీతం మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.

సిన్ధుః జీవనదా శుభా, వహతి శక్తిమయం జలం।

పావనీ పుణ్యదా నిత్యం, రక్షతు భారతం సదా॥

అంటే సింధు శక్తి సంపన్నం. సదా భారత్‌ను రక్షిస్తుంది అని అర్థం. పూర్వ కాలంలో సింధు నది పరాయి ఆక్రమణ దారులకు ఒక జల రక్షణ కవచంలాగా ఉండేది. సింధు నది, దాని ప్రభావం, భారత్‌ పాక్‌ మధ్య సంధికి లేదా పాకిస్తాన్‌ భారత్‌లో విలీనానికి ఎలా ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం.

సింధు నదికి ప్రధానంగా ఆరు ఉపనదులు (ఇండస్‌, చీనాబ్‌, జీలమ్‌, రవి, బియాస్‌, సట్లెజ్‌). భారత భూభాగం హిమాలయాలలో మొదలయి భారత్‌లోని లద్దాక్‌, జమ్మూ, కశ్మీర్‌, హిమాచల్‌, పంజాబ్‌ మీదుగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిట్‌, పాకిస్తాన్‌ లోని పంజాబ్‌, తర్వాత సింధు ప్రాంతంలో ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతమే ఇండస్‌ వాలీ నాగరికతకు, భారతదేశ పునాదికి మూలం.

సింధు (ఇండస్‌) నదీజలాల సామర్థ్యం

రుగ్వేదంలోని 10వ మండలంలో సింధునది గురించిన స్తోత్రం:

త్వం సిన్ధో సరస్వతీ కుబేర ఇవ వాజినీ ।

అస్మే ధేహి శ్రవో బృహత్‌ ॥ (సింధు  సరస్వతీ లాంటి , కుబేరుని వంటి ధనవంతురాలివి.మాకు గొప్ప ఖ్యాతి, శౌర్యం ప్రసాదించు.)

ప్రతి ఏడాది హిమాలయాల నుండి  సింధు నది ద్వారా దాదాపు 6700 -7700 (టీఎంసీ) జలాలు ప్రవహిస్తాయి.

అందులో దాదాపు 75% – 80%  భారత్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుండి ఉత్పత్తి అవుతుంటే, పాకిస్తాన్‌లో కేవలం 20-25%, అది కూడా కేవలం రుతుపవనాల ఆధారిత వర్షాధారిత నీరు మాత్రమే ఉంది. ఉదాహరణకు మొత్తం గోదావరి, కృష్ణ నదుల నీటి ప్రవాహం కేవలం 6000 టీఎంసీ నీళ్లు. పెహల్గావ్‌ ఉదంతం తరువాత సింధు నదీ జలాల విషయంలో భారత్‌ పాక్‌ మధ్య ఉన్న ఒప్పందం వార్తలలోకి వచ్చింది.

సింధు జలాల ఒప్పందం

1)    1960 ప్రపంచ బ్యాంక్‌ మధ్య వర్తిత్వంతో భారత ప్రథమ ప్రధాని నెహ్రు పాకిస్తాన్‌ అధ్యక్షుడు ‘ఫెయిల్డ్‌’ మార్షల్‌ ఆయూబ్‌ ఖాన్‌ కరాచీలో ఈ ఒప్పందం చేసుకున్నారు.

2)     దీని ప్రకారం భారతదేశానికి 15%, పాకిస్తాన్‌కు 85% నీరు కేటాయించారు.

3)    తూర్పు నదులు రవి, బియాస్‌, సట్లెజ్‌ భారత్‌కు, పడమర ఉన్న ఇండస్‌, చీనాబ్‌, జీలమ్‌ పాకిస్తాన్‌ దేశానికి దక్కాయి.

4)     భారత పడమర నదులను కేవలం విద్యుదుత్పా దనకే ఉపయోగించాలి.

5)     భారతదేశం తూర్పు నదులను వాడుకోకుండా 10 సంవత్సరాలు పాకిస్తాన్‌కు ఆటంకం లేకుండా నీళ్లు ఇవ్వాలి.

6)  పాకిస్తాన్‌లో ఇండస్‌ నది మీద ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాల్వలు కట్టుకోవడానికి భారతదేశం 62 మిలియన్‌ పౌండ్స్‌ విరాళంగా ఇవ్వాలి.

7)  రెండు దేశాల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఒప్పందం కొనసాగాలి.

8)     పాకిస్తాన్‌ అనుమతి లేకుండా ఇండియా ఇండస్‌ మీద ఎలాంటి ప్రాజెక్టు కట్టగూడదు.

విస్మయం కల్గించే విషయం

1)      1948 లో పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ప్రేరేపిత ట్రైబల్‌ ఆర్మీ కొంత జమ్ము, కశ్మీరు, గిల్గిట్‌ బాల్తిస్తాన్‌ ఆక్రమించుకున్నాయి

2)     సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంతో ఇంకా జటిలమైంది.

3)    ఇండియా ఇండస్‌ పరివాహక ప్రాంతంలోని పై భాగానే ఉన్నాం కనుక, పాకిస్తాన్‌ భారత్‌ మీద ఆధారపడి ఉంది. అవసరం పాక్‌ది, ఇండియాది కాదు.

4)    ముందుచూపు లేకుండా 75% పరివాహక ప్రాంతం భారత్‌లో ఉన్నప్పటికీ, నీటి మీద 85% హక్కు పాకిస్తాన్‌కు కల్పించడం హాస్యాస్పదం

5)  అప్పుడు భారతదేశమే చిప్ప పట్టుకొని అనేక దేశాల దగ్గర ‘‘భవతి భిక్షాం దేహి’’ అని అడుక్కునే రోజులలో 62 మిలియన్‌ పౌండులు పాకిస్తాన్‌కు ఇండస్‌ నది మీద ( పాకిస్తాన్‌లో) ప్రాజెక్టులు కట్టుకోవడానికి విరాళంగా ఇచ్చిన ఘనత మన జవాహర్‌లాల్‌ నెహ్రూది. ఉదాహరణకు 62 మిలియన్‌ పౌండులకు 1960లో 154.42 మెట్రిక్‌ టన్నుల బంగారం వచ్చేది (అప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వ కేవలం 200-300 మెట్రిక్‌ టన్నులు). ఇప్పుడు ఉన్న ధర గ్రాము. రూ. 9606. ఆ ప్రకారం చూస్తే రూ. 1,46,899.75 కోట్లు(1.46 లక్షల కోట్లు) నెహ్రూ పాకిస్తాన్‌కు విరాళం ఇచ్చారు. ఇది మొత్తం 10 విడతలలో వెళ్లింది.

పాకిస్తాన్‌ మీద సింధునది ప్రభావం

90% వ్యవసాయం, 5.2 కోట్ల ఎకరాలకు సాగు నీరు, (గోధుమ, వరి, పత్తి, చెరుకు), టెక్స్‌టైల్‌ పరిశ్రమ (60% ఎగుమతుల వాటా), సిమెంట్‌, ఎరువుల తయారీ, 7000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, జీడీపీలో 30% వాటా, మత్స్య సంపద, 15 కోట్ల మందికి తాగునీరు సరఫరా, భూగర్భ జలాల పెంపు ఇవన్నీ సింధునది ద్వారానే జరగాలి. ఒక విధంగా చెప్పాలంటే మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు, పాకిస్తాన్‌ ఆయువుపట్టు సింధు జలాలలో ఉంది.

భారత్‌`సింధు: 1) 2.3 కోట్ల ఎకరాలకు (పంజాబ్‌, హిమాచల్‌, జమ్ము కశ్మీర్‌, రాజస్థాన్‌)కు నీటి సరఫరా. 4300 మెగావాట్ల హైడ్రో పవర్‌ ఉత్పత్తి. ఇండస్‌ జలాలలో కేవలం 15-20% మాత్రమే భారత్‌ వాడుకుంటుంది.

సింధు జలాలు సంధికి దోహదపడవచ్చా ?

సింధు జలాలు చాల శక్తిమంతమైనవి. అందులో దాదాపు 50,000 మెగావాట్ల విద్యుత్‌ దాగి ఉంది. అందుకే సింధు నది గురించి రుగ్వేదంలో

నదీనాం శ్రేష్ఠా సింధురే గర్జతే ఇంద్రవత్‌ శుభా

సరస్వతీమపి త్యజ్య సింధుం వందే మహాజలమ్‌` అన్నారు. అంటే సింధు నది అత్యంత శ్రేష్టమైనది, ఇంద్రుడిలా యుద్ధంలో గర్జిస్తోంది, సరస్వతి కంటే తేజోవంతమైనది, ఈ మహత్తరమైన నదికి నేను నమస్కరిస్తున్నాను.

అందుకే సింధు నది సంధి విషయంలో శ్రీకృష్ణ రాయబారానికి మించిన ఆయుధం కాగలదు.

భారత్‌ సింధు అభియాన్‌ మొదలు పెట్టాలి

1) భారత్‌ సింధుజలాల పూర్తిగా వినియోగానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టాలి. వియన్నా కన్వెన్షన్‌ ఆన్‌ ట్రీటీస్‌ (ఆర్టికల్‌ 60) ప్రకారం ఇండస్‌ ఒప్పందం రద్దు లేదా పునఃపరిశీలన అధికారం భారత్‌కు ఉంది. చీనాబ్‌, ఇండస్‌, జీలమ్‌ నదులపై భుర్సార్‌ డ్యామ్‌, ఉర్జ్‌ మల్టీ పర్పస్‌ డాం, సవాల్కోట్‌, జిస్పా, పాకాల కోట్‌, రాట్లే, కిరు డ్యాములు నిర్మాణం కూడా వెంటనే ప్రారంభించాలి. ఇండస్‌ మీద శయోక్‌, నుబ్రా గ్లాసియల్‌ కాంట్రల్‌ డ్యామ్‌ నిర్మాణం చేసి, నూతనంగా జమ్ము, కశ్మీర్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో 2.5 కోట్ల ఎకరాల సాగు నీటి సరఫరాకు శ్రీకారం చుట్టాలి. ప్రధానంగా ఇంటర్‌ బేసిన్‌ లింక్‌ క్యానల్స్‌, టన్నెల్స్‌ అవసరం.

2) జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అత్యల్ప ఖర్చుతో, సింధుజలాల నుండి దాదాపు 20,000 అదనపు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దానికి రాట్లే, పాకుల్‌ , కిరు, కీర్తయి, బూర్సుర్‌, క్వార్‌, సవాల్‌ కోట్‌, దుంకర్‌, తమాషా ప్రాజెక్టులను పూర్తి చేయాలి.

3) ఖర్చు ఎంత? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయటానికి దాదాపు రూ.2.5 – 3.5 లక్షల కోట్లు అవుతుంది. భారత్‌ పాకిస్తాన్‌తో ఒక నెల యుద్ధం చేస్తే ప్రత్యేక్ష, పరోక్ష ఖర్చు దాదాపు రూ. 5-8 లక్షల కోట్లు అయ్యేది.

భారత్‌ సంపూర్ణ వినియోగం, పాక్‌ సమస్యలు

1)    90% పాకిస్తాన్‌ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, తాగునీరు ఇండస్‌ నది మీద ఆధారపడి ఉంది. కాబట్టి సింధు జలం లేకుంటే తీవ్రమైన సాగు, తాగునీటి సమస్య ఉత్పన్నం కావడం తథ్యం.

2)      పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధు ప్రాంతం నీటి ఎద్దడితో ప్రాంతాల మధ్య పోరాటాలు మొదలు అవుతాయి.

3)       90% పాకిస్తాన్‌ సైన్యం పంజాబ్‌ ప్రాంతం వారు కాబట్టి, సైన్యం మీద పూర్తి వ్యతిరేకత మొదలవుతుంది.

4) పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిపోతుంది

5)       అనివార్యంగా పాకిస్తాన్‌ భారతదేశాన్ని సంధికి ప్రాధేయ పడవలసిన అవసరం వస్తుంది.

6)       పాకిస్తాన్‌లో పంజాబ్‌, సింధ్‌, బెలూచిస్తాన్‌, నార్త్‌ వెస్ట్‌ ఫ్రంట్‌ల మధ్య విబేధాలు, పాకిస్తాన్‌  నాలుగు ముక్కలుగా విడిపోయే అవకాశం.

సంధి ఎలా ఉండాలి?

1) పాక్‌ ఆక్రమిక కశ్మీరును భారత్‌లో శాంతి యుతంగా కలపటం. లేదా పాకిస్తాన్‌ భారత్‌లో విలీననానికి అంగీకరించడం.

2)      ముఖ్యమైన టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించడం.

3)   పాకిస్తాన్‌లోని అణ్వస్త్రాలను అంతర్జాతీయ అణు సంస్థకు అప్పగించడం లేదా పాకిస్తాన్‌ దుస్సాహసం చేస్తే ఆపరేషన్‌ సిందూర్‌ పూర్తి స్థాయిలో అమలు చేయడం.

ఇందులో కచ్చితంగా సింధు నది జలాలు సంధికి లేదా పాకిస్తాన్‌ అనే శిశుపాల సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది. అది అమృతోత్సవం 2047, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలకు లేదా అంతకు ముందే జరిగే అవకాశం ఉంది. దానికి భారత్‌ ఆర్థికంగా ఇంకా బలపడాలి. అందుకు 140 కోట్ల భారతీయులు ‘అఖండ భారత్‌’ స్థాపనకు సింధు ‘జలశక్తిని’ సద్వినియోగం చేసుకోవాలి.

– డా. బూర నరసయ్య గౌడ్‌, మాజీ ఎంపీ – భువనగిరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE