భారత్‌లో సిక్కిం 22వ రాష్ట్రంగా విలీనమై మే 16 నాటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌లోని పాలిజార్‌ ‌స్టేడియం, మనన్‌ ‌కేంద్రంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిక్కిం పూర్వ సంప్రదాయాలు, భారత్‌లో విలీనం తర్వాత సాధించిన అభివృద్ధిని వెల్లడించే రీతిలో కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రధాని నరేంద్రమోదీ సిక్కిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తమాంగ్‌ ‌సింగ్‌, ‌సిక్కిం సమున్నత చరిత్రను, భారత్‌లో విలీనమయ్యేవరకు ఈ హిమాలయ దేశ ప్రస్థానాన్ని మననం చేసుకున్నారు.

నిజానికి 1947 నాటికి సిక్కిం భారత్‌ ‌రక్షణలో ఉండే దేశం మాత్రమే. అప్పటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వంతో సిక్కిం రాజుకు కుదిరిన ఒప్పందాల నేపథ్యంలో, దేశంలోని ఇతర సంస్థానాల మాదిరిగా, ఇండియన్‌ ‌యూనియన్‌లో కలిసిపోవడానికి అంగీకరించలేదు. నాటి ఉపప్రధాని సర్దార్‌ ‌పటేల్‌, ‌బి.ఎన్‌.‌రావులు సిక్కింను దేశంలో కలిపేసుకోవాలని కోరినా అందుకు నెహ్రూ అంగీకరించలేదు. సిక్కిం, నేపాల్‌, ‌భూటాన్‌ ‌లను తటస్థ దేశాలుగా పరిగణిస్తూ, యథాతథ స్థితి కొనసాగించాల్సిందేనని నెహ్రూ స్పష్టం చేశారు. దీంతో విలీన ప్రతిపాదన నిలిచిపోయింది.

పావులు కదిపిన అమెరికా

1950లో భారత్‌-‌సిక్కింల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రక్షణ, విదేశీవ్యవహారాలు, కమ్యూనికేషన్‌ ‌రంగాలను మనదేశం నిర్వహించేం దుకు, మిగిలినవి సిక్కిం రాజు (చోగ్యాల్‌) అధీనంలో కొనసాగేలా ఒప్పందంపై నాటి ప్రధాని జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, సిక్కిం పదకొండవ చొగ్యాల్‌ (‌సిక్కిం భాషలో చొగ్యాల్‌ అం‌టే రాజు అని అర్థం) పాల్డెన్‌ ‌తొండుప్‌ ‌నమ్‌గ్యాల్‌లు సంతకాలు చేశారు. 1971 పాకిస్తాన్‌ ‌యుద్ధంలో బాంగ్లాదేశ్‌ ఆవిర్భవించడంతో , పాక్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఇందుకు ప్రతిగా సిక్కింలో పావులు కదపడం మొదలుపెట్టింది. చొగ్యాల్‌ ‌పాల్డెన్‌ ‌తొండుప్‌ ‌నమ్‌గ్యాల్‌ ‌భార్య పేరు హోప్‌ ‌కూక్‌. ఈమె అమెరికన్‌. ఈ ‌నేపథ్యంలో ఈమె ద్వారా అమెరికా సిక్కింలో తన పలుకుబడిని పెంచుకోవడానికి యత్నిస్తున్నదన్న వార్తలు రావడం భారత్‌ను కలవరపరచింది. అమెరికా ప్రభావంతో భూటాన్‌ను ఉదాహరణగా చూపిస్తూ తమ దేశానికి మరింత స్వేచ్ఛ, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కావాలని పాల్డెన్‌ ‌తొండుప్‌ ‌నమ్‌గ్యాల్‌ ‌డిమాండ్‌ ‌చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లకు నాటి ఇందిరాగాంధీ ముఖ్యకార్యదర్శి పి.ఎన్‌. ‌హక్సర్‌ ఎం‌తమాత్రం లొంగలేదు. తర్వాతి కాలంలో కాజీ డోర్జీ నాయకత్వంలో సిక్కిం నేషనల్‌ ‌కాంగ్రెస్‌ (ఎస్‌ఎన్‌సీ) రాచరిక పాలన అంతానికి, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు నిర్వహించింది. ఇదేసమయంలో భారత్‌లో విలీనం కావాలన్న డిమాండ్‌ను ప్రధానంగా ముందుకు తీసుకురావడం విశేషం. దీంతో రాజ భవనం, ‘రాజకీయ కార్యాలయం’ (నేటి రాజ్‌భవన్‌) ‌మధ్య తీవ్ర పోరాటం కొనసాగింది. రాచరికం పోవాలని డిమాండ్‌ ‌చేస్తున్న సిక్కిం కాంగ్రెస్‌ ‌సహా అన్ని ప్రతిపక్షాలకు భారత్‌ ‌మద్దతు లభించింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజల్లో కూడా రాచరికం పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. 1973నాటి తొలినాళ్లలో రాచరికానికి నిరసనగా వేలాది మంది గ్రామీణులు స్టేడియంకు చేరుకున్నారు. రాచరికం పోయి, అందరికీ సమాన హక్కులతో కూడిన ప్రజాస్వామ్యం రావాలన్న వారి ఆకాంక్షలకు నార్‌బహదూర్‌ ‌ఖటివాడా నాయకత్వం వహించారు. గాంగ్‌టక్‌లో అప్పట్లో పదివేల కుటుం బాలు మాత్రమే నివసించేవి. కానీ రాచరిక పాలనకు వ్యతిరేక ఉద్యమంతో వేలాది గ్రామీణులతో రాజధాని కిటకిట లాడిపోయేది. ఇలాంటి నిరసనను ఎన్నడూ చూడని సిక్కిం పోలీసులు విస్తుపోయేవారు. ఒకపక్క రహస్య రాజకీయ సమాలోచనలు, మరోపక్క ప్రజల నిరసనతో గాంగ్‌టక్‌లో ఉద్రిక్త వాతావరణం. ఎట్టకేలకు మే 8, 1973న సిక్కిం రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, భారత్‌ ‌తరపున దివంగత కె.ఎస్‌. ‌బాజ్‌పాయ్‌లు ఒక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. మరుసటి ఏడాది సిక్కింలో ఎన్నికలు జరిగాయి. తర్వాత ఏడాది అంటే 1975 ఏప్రిల్‌ ‌లో నిర్వహించిన రిఫరెండంలో 97 శాతం మంది భారత్‌లో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. అదే ఏడాది మే 16న చేసిన రాజ్యాంగ 36వ సవరణతో సిక్కిం 22వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగానికి 371ఎఫ్‌ అధికరణాన్ని చేర్చి, సిక్కింకు ప్రత్యేక నిబంధనలను వర్తింపజేశారు. సిక్కింకు ఏప్రిల్‌ 26,1975 ‌న రాష్ట్ర హోదా రాగా, సవరణ ద్వారా మే 16న ఆమోదించారు.

371ఎ అధికరణం ప్రకారం…

విలీన సమయంలో సిక్కిం ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, లీగల్‌ ‌వ్యవస్థలకు రక్షణ ఉంటుంది. రాజ్యాంగంలోని 170వ అధికరణం కింద సిక్కిం అసెంబ్లీ లో 30 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. రాష్ట్రానికి ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. రాష్ట్ర గవర్నర్‌కు శాంతిభద్రతలు, సమానత్వం, అభివృద్ధి బాధ్యతలను అప్పగించారు. 1975కు ముందు అమల్లో ఉన్న చట్టాలు, అక్కడి కోర్టులు ఇచ్చిన తీర్పులు కొనసాగుతాయి. ఒకవేళ వీటిల్లో మార్పులు అవసరమైతే అందుకు పార్లమెంట్‌•కే ఆ అధికారం ఉంటుంది. విలీనం తర్వాత రెండేళ్లలోగా ఇక్కడి చట్టాల్లో మార్పులు చేయడానికి లేదా కేంద్ర చట్టాలను ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. 1961లో రిజిస్టరయిన సిక్కిం జాతీయులు మాత్రమే భూములపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. వీరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అర్హులు. నిజమైన సిక్కిం ప్రజలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే 2023లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ‘సిక్కిమీయులు’’ అనే పదానికి మరింత విస్తృత నిర్వచనం ఇవ్వడం వివాదానికి దారితీసింది.

సిక్కిం గురించి…

సిక్కిం దేశంలోనే రెండో అతిచిన్న రాష్ట్రం కాగా హిమాలయ రాష్ట్రాల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఇది. 7096 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా గల రాష్ట్ర జనాభా 6 లక్షలకు పైబడి ఉంటారు. 81.4 శాతం అక్షరాస్యత నమోదైంది.అ క్కడ సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. అత్యున్నత పర్వతశిఖరం కాంచన్‌జంగ ఈ రాష్ట్రం లోనే ఉంది. ఇక్కడి ఖంగ్‌చన్‌జొంగా నేషనల్‌ ‌పార్క్‌ను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ పార్క్ ‌రాష్ట్రంలోని 35% భూభాగంలో విస్తరించి ఉండటం విశేషం.ఉత్తర-ఈశాన్య దిక్కుల్లో టిబెట్‌, ఆగ్నేయాన భూటాన్‌, ‌పశ్చిమబెంగాల్‌, ‌పశ్చిమాన నేపాల్‌ ‌సరిహద్దులుగా కలిగి ఉంది. సిలిగురి కారిడార్‌కు సరిహద్దున బాంగ్లాదేశ్‌ ఉం‌డటం గమ నార్హం. సిక్కిం అనేక భాషలు, బహు జాతీయులతో కూడి ఉంది. రాష్ట్ర అధికార భాషలు వరుసగా ఇంగ్లీషు, నేపాలీ, భూటియా, లెప్చా. గురుంగ్‌, ‌లింబు, మగర్‌, ‌ముఖియా, నెవారీ, రాయ్‌, ‌షెర్పా, మాంగ్‌ ‌భాషలను అదనపు అధికార భాషలుగా పరిగణిస్తారు. విద్యాసంస్థల్లో ఇంగ్లీషు బోధిస్తారు. ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా ఇంగ్లీషులోనే రూపొందిస్తారు. రాష్ట్రంలో హిందువులు మెజారిటీలు కాగా బౌద్ధులు మైనారిటీలుగా వున్నారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులు వ్యవసాయం, పర్యాటకం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి.

సిక్కిం రాజ్య స్థాపన…

17వ శతాబ్దంలో నంగ్యాల్‌ ‌వంశ రాజులు సిక్కిం రాజ్యాన్ని స్థాపించారు. ఈ రాజ్యాన్ని బౌద్ధ-మతగురువులే (లామాలు) పాలించారు. రాజులుగా కొనసాగిన వీరిని ‘చొగ్యాల్‌’ అని వ్యవహరి స్తారు. సాధారణ శకం 7వ శతాబ్దం నుంచి సిక్కింపై టిబె•న్ల ప్రభావం అధికం. అప్పట్లో సిక్కింలోని అత్యధిక ప్రాంతాలను ‘లెప్చా’, ‘లింబర్లు’, ‘మగర్లు’ పరిపాలించారు. ప్రముఖ బౌద్ధ సన్యాసి పద్మ సంభవుడు (ఈయన్నే రింపోచి అనికూడా వ్యవహరి స్తారు) సా.శ.8వ శతాబ్దంలో సిక్కింలో పర్యటించిన సందర్భంగా ఇక్కడ బౌద్ధాన్ని స్థాపించారని చారిత్రక కథనం. రాబోయే శతాబ్దాల్లో సిక్కింలో రాచరిక పాలన వస్తుందని కూడా ఆయన భవిష్యవాణి వినిపించారని ఈ కథనం వెల్లడిస్తోంది. సరిగ్గా ఆయన చెప్పినట్టుగానే సా.శ.14వ శతాబ్దంలో జరగడం విశేషం. స్థానిక కథనం ప్రకారం తూర్పు టిబెట్‌లోని ఖాన్‌ ‌ప్రాంతాన్ని పరిపాలించే ఖయే బుమ్‌సా అనే రాజుకు ఒకసారి కలలో దివ్యవాణి ఇచ్చిన సందేశం మేరకు, అక్కడినుంచి దక్షిణ ప్రాంతానికి వస్తాడు. అయితే ఆయన తర్వాత ఐదోతరానికి చెందిన ఫున్‌త్స్వాంగ్‌ ‌సంగ్యల్‌ 1642‌లో సిక్కిం రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. సిక్కింలోని చారిత్రక పట్టణం యుక్సిమ్‌కు చెందిన మూగ్గురు ప్రముఖ లామాల్లో ఈయనను ఒకరుగా పరిగణిస్తారు. బ్రిటిష్‌ ‌వారు వచ్చే వరకు ఈ వంశ రాజులే సిక్కింను పాలిస్తూ వచ్చారు. 1700 సంవత్సరంలో చొగ్యాల్‌ ‌తన పిన్ని కుమార్తె (వీరికి తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు)కు సింహా సనంలో భాగం ఇవ్వడానికి నిరాక రించడంతో ఆగ్రహంతో రగిలిపోతుంది. ఈమె సహాయంతో భూటానీలు అదే ఏడాది సిక్కింపై దాడిచేసి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత టిబెటన్లు, ఈ భూటానీయులను తరిమివేసి మళ్లీ చొగ్యాల్‌ ‌పాలనను స్థాపించార••. 1717-1733 మధ్యకాలంలో పశ్చిమం నుంచి నేపాలీలు, తూర్పు నుంచి భూటానీయులు సిక్కింపై పెద్దఎత్తున దాడులు కొనసాగిస్తారు. 1791లో సిక్కింకు మద్దతుగా చైనా తన సైన్యాలను పంపి, టిబెట్‌ను గూర్ఖాల (నేపాలీలు) నుంచి కాపాడుతుంది. ఆవిధంగా గూర్ఖాలు ఓటమిని చవిచూడటంతో, సిక్కింపై చైనాకు చెందిన క్వింగ్‌ ‌పాలకుల నియంత్రణ మొదలైంది. 1814-16 మధ్య జరిగినా ఆగ్లో-గూర్ఖా (నేపాల్‌) ‌యుద్ధంలో, సిక్కిం రాజులు బ్రిటిషర్లకు మద్దతుగా పోరాడారు. ఈ స్నేహం ఫలితంగా నేపాల్‌లోని కొన్ని భూభాగాల ను బ్రిటిష్‌వారు సిక్కిం రాజులకు అప్పగించారు. 19వ శతాబ్దంలో సోవియట్‌ ‌రష్యా, బ్రిటన్‌ ‌మధ్య తీవ్రస్థాయి విరోధం కొనసాగింది. ఈ కాలంలో చైనాకు చెందిన క్వింగ్‌ ‌రాజులు, బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం, సిక్కింను అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణిం చడం మొదలైంది. ఇదే కాలంలో టిబెట్‌పై చైనా ఆధిపత్యాన్ని బ్రిటిషర్లు అంగీకరించలేదు. దీంతో బ్రిటిష్‌వారు ఉత్తరంగా తమ సామ్రాజ్యాన్ని విస్తరిం చడం మొదలుపెట్టారు. ఆ విధంగా బ్రిటిష్‌ ‌సైన్యాలు టిబెట్‌లోకి ప్రవేశించాయి. ఇన్ని రాజకీయ పరిణా మాలు జరుగుతున్నా, నాటి ఈస్ట్ ఇం‌డియా కంపెనీ సిక్కింను ఆక్రమించుకోవాలనుకోలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా సంబంధాలను కొనసాగించింది. 1861లో వీటి మధ్య కుదిరిన ‘తుమ్‌లాంగ్‌’ ఒప్పందాన్ని అత్యంత కీలకమైందిగా పరిగణిస్తారు. సిక్కింకు, రక్షణ కల్పించే అధికారాన్ని బ్రిటిష్‌కు దఖలు పరచిన ఒప్పందమిది. దీంతో సిక్కింను ఆక్రమించుకోకుండానే, బ్రిటిషర్లు దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కలిగించు కోవడం మొదలైంది. చొగ్యాల్స్‌ను కొనసాగించినా, బ్రిటిష్‌ ‌ప్రభుత్వం తన ఏజెంట్‌ను అక్కడ నియమించి, వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచేది. 1904లో కుదిరిన ‘లాషా కన్వెన్షన్‌’‌తో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం సిక్కింపై తన పట్టును మరింత బిగిం చింది. 1959లో దలైలామా టిబెట్‌నుంచి పారి పోయిన తర్వాత, భారత్‌-‌చైనాలు సిక్కింను వ్యూహా త్మక ప్రాంతంగా పరిగణించడం మొదలు పెట్టాయి. చైనా అధీనంలోని చుంబు లోయ భారత్‌ ‌గుండెపై పెట్టిన కత్తిలాంటిదని అప్పటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యా నించడం గమనార్హం. 1962 చైనాతో జరిగిన యుద్ధ సమయంలో భారత సైన్యం, సిక్కిం ద్వారా ప్రవేశించే మార్గాలను మూసివేసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం అనుసరించిన ఈ వ్యూహం విజయవంతమైన ఫలితంగా చైనా సైన్యాలు సిక్కింలోకి ప్రవేశించలేక పోయాయి.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE