ఆం‌ధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ ‌పంపిణీ విధానాన్ని రద్దు చేసింది. రేషన్‌ ‌దుకాణాల ద్వారా బియ్యం పంపిణి కార్యక్రమాన్ని జూన్‌ ఒకటి నుంచి ప్రారంభించింది. ఇంటింటికి రేషన్‌ ‌పేరుతో కొనుగోలుచేసిన  మొబైల్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌యూనిట్స్ ‌వాహనాల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వంపై భారంగా మారడం, ఈ వాహనాల ద్వారా బియ్యాన్ని నల్లబజారుకు  తరలించారనే ఆరోపణలతో ప్రభుత్వం ‘ఇంటింటి పంపిణీ’ వ్యవస్థను  రద్దు చేసింది.

రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలు రేషన్‌ ‌కార్డులు కలిగి ఉండగా, 29,796 రేషన్‌ ‌షాపుల ద్వారా సరుకులు అందిస్తారు. పునరుద్ధరించిన దుకాణాల వద్దే సరుకుల అందజేత పక్రియ కింద ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సరకులు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు 15వ తేదీలోపు ఎప్పుడైనా తమకు తీరిక దొరికినప్పుడు సమీపంలోని ఏ రేషన్‌ ‌షాపు వద్దకైనా వెళ్లి బియ్యం తీసుకోవచ్చు. ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా రేషన్‌ ‌దుకాణాలు తెరిచే ఉంటాయి. రేషన్‌ ‌షాపులకు రాలేని దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ ‌డీలర్లు వారి ఇళ్ల వద్దకే సరుకులను అందిస్తారు.

నిర్వహణ వైఫల్యం – దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వం కార్డుదారుల్లో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కచ్చితత్వంతో కూడిన తూకం, నాణ్యమైన సరఫరా విధానం కోసం తూకం యంత్రాలు, ఈ-పోస్‌ ‌మిషన్లను అనుసంధానం చేసి పంపిణీ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు 2020 వరకు ప్రభుత్వ రేషన్‌ ‌దుకాణాల్లోనే బియ్యం సరఫరా చేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం దీనిని సొంత లాభానికి వాడుకుంది. ఇంటింటికి నేరుగా బియ్యం సరఫరా చేస్తామని చెప్పి మరో అవినీతి వ్యవహారానికి తెరతీసింది. కొందరు అబ్ధ్దిదారులను ఎంపిక చేసి వారికి బ్యాంకు రుణంతో 9,260 వాహనాలను ఇప్పించి వారికి సబ్సిడీతో పాటు నెల జీతంగా రూ.27 వేల చొప్పున ఇస్తూ ఇప్పటి వరకు రూ.1,860 కోట్లు ఖర్చుచేసింది. అయినా ఈ వాహనాల ఏర్పాటు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇంటింటికీ సరకులు సరఫరా చేయకుండా.. ఎక్కడో వీధి చివర్ల వాహనాన్ని నిలపడంతో ‘డోర్‌ ‌డెలివరీ’ కాస్తా ‘స్ట్రీట్‌ ‌డెలివరీ’గా మారింది. వాహనం ఎప్పుడు వస్తుందోనని పనులు మాని పడిగాపులు కాయాల్సి వచ్చేది. వాహనం వచ్చినప్పుడు కార్డుదారులు అందుబాటులో లేకుంటే ఇక ఆ నెలకు సరుకులు పొందే అవకాశం కోల్పోయినట్టే. లేదా వాహనం ఎక్కడుందో అంటూ వీధుల వెంట తిరగాల్సిన దుస్థితి. వరుసగా మూడు నెలలు రేషన్‌ ‌తీసుకోకపోతే కార్డులు రద్దయిపోతాయన్న భయంతో కూలిపనులు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరీ రేషన్‌ ‌వాహనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అందరికీ పంపిణీ చేయకపోవడంతో మిగిలిపోయిన బియ్యాన్ని కూడా పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు రాసుకుని కాజేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు కిలో పది రూపాయల చొప్పున రేషన్‌ ‌వాహనాల నిర్వాహకులే కొనుగోలు చేసి…. అవే వాహనాల్లో అక్రమ రవాణా చేసిన ఉదంతాలూ బయటపడ్డాయి. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర పోర్టుల ద్వారా అలా వేలాది టన్నులు తరలిపోయాయి. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ ‌బియ్యం చెలరేగిపోయింది.

ప్రభుత్వంపై ఆర్థ్ధిక భారం

ఇంటింటికీ రేషన్‌ ‌పంపిణీ… రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారంగా పరిణమించింది. 9,260 రేషన్‌ ‌వాహనాల కొనుగోలుకు సంబంధించిన బ్యాంకు వాయిదాలు, వడ్డీల భారం, జీతాల చెల్లింపు… మూడేళ్లలో దాదాపు రూ.1860 కోట్లు ఖర్చుపెట్టారు. వాహన నిర్వాహకులకు ప్రతినెలా రూ.27వేలు జీతం చెల్లించాలి. ఇంత చేసినా లబ్ధిదారులకు మేలు జరుగుతోందా..అంటే అదీ లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే, ప్రభుత్వం ఇంటింటికి సరకుల పంపిణీ వ్యవస్థను రద్దు చేసింది. అదే సమయంలో… వాటి డ్రైవర్లు ఇబ్బంది పడకుండా ఆ వాహనాలపై ఉన్న బ్యాంకు రుణ బకాయిలను సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుంది. ఆ వాహనాలు పూర్తిగా డ్రైవర్ల సొంతం కానున్నాయి. వాటి ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

70 వేల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం సీజ్‌

‌వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ ‌బియ్యం అక్రమంగా బయటి మార్కెట్‌కు తరలిపోయాయని, కూటమి అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖ నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘాల్లో స్పష్టమైంది. కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులకు వేల టన్నుల బియ్యం తరలింపు బట్టబయలైంది.మంత్రి నాదేండ్ల మనోహర్‌ ఆదేశాల మేరు విజిలెన్స్ అధికారులు చేసిన దాడులల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 70 వేల మెట్రిక్‌ ‌బియ్యం పట్టుబడ్డాయి. దళారులు రేషన్‌ ‌కార్డుదారులపై కిలోకు రూ. 10 నుంచి రూ.14 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటిని ప్రాసెస్‌ ‌చేసి, అధిక ధరకు విక్రయించేవారు. ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారు. ఆయా దేశాల్లో ఈ బియ్యం కిలో వందకు పైగా అమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేస్తోంది. రేషన్‌ ‌దుకాణాల ద్వారా పంపిణీ చేయడం వల్ల అక్రమ రవాణాను అరికట్టవచ్చని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. రేషన్‌ ‌దుకాణాల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్‌ ‌కోడ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని భావిస్తోంది. ఇక నుంచి రేషన్‌ అ‌క్రమ ఎగుమతులు జరగకుండా అన్ని రేవుల్లోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు మంత్రి మనోహర్‌ ‌చెప్పారు. రేషన్‌ ‌మాఫియాకు ఎక్కడికక్కడ చెక్‌ ‌పెట్టామన్నారు. సబ్సిడీ బియ్యం ఎగుమతిదార్లపై పీడీ యాక్ట్ ‌నమోదు చేస్తున్నామన్నారు. కాకినాడ రేవుతో పాటు నెల్లూరు జిల్లా తడ, కృష్ణపట్నం పోర్టుల వద్ద భద్రత పెంచామన్నారు.

వీరికి ఇంటివద్దేకే బియ్యం

రేషన్‌ ‌షాపులకు రాలేని దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ ‌డీలర్లు వారి ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15.6లక్షల మంది దివ్యాంగ కార్డుదారులు ఉన్నట్లు గుర్తించారు. వారికి రేషన్‌ అం‌దించాల్సిన బాధ్యత రేషన్‌ ‌దుకాణదారులదే. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్‌ ‌గ్రూప్‌ ఏర్పాటు చేశారు.

సరుకుల పంపిణీ జరిగిన వెంటనే గ్రూప్‌లో సంబంధిత ఫొటోలను అప్‌లోడ్‌ ‌చేయాల్సిన బాధ్యత దుకాణదారులదే. భవిష్యత్‌లో రేషన్‌ ‌దుకాణాలను మినీ మాల్స్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తృణ ధాన్యాలను కూడా పంపిణీ చేస్తామంటోంది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలను పేద కుటుంబాలకు అందుబాటులోకి తెస్తామని, తద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

వాడటం లేదు కాని తీసుకుంటున్నారు

ఆహార హక్కు కింద పేదలకు కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని అందిస్తోంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కిలోకు రూ.43 ల వరకు ఖర్చుచేస్తున్నాయి. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం రూపాయికే ఈ బియ్యాన్ని అర్హులకు అందచేస్తోంది. అయితే ఈ బియ్యాన్ని తీసుకుంటున్నవారిలో అత్యధిక శాతం  వినియోగించడం లేదు. బయట కిలో రూ. 10 నుంచి 14 లకు అమ్మేస్తున్నారు. బయట 26 కిలోల బస్తాను రూ.1,400 లకు కొంటున్నారు. రేషన్‌ ‌బియ్యం రుచికరంగా ఉండటం లేదని వీరంటున్నారు.

మంచి నాణ్యత గల బియ్యం ఇస్తే అమ్ముకునే అవసరం ఉండదని కొందరు అభిప్రాయపడు తున్నారు. ఈ బియ్యం తినని వారికి దాని విలువకు సరిపడా డబ్బును ఖాతాల్లో నేరుగా వేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా లబ్ధిదారులు ముందుకు రాలేదు. బియ్యం తీసుకోకుంటే ఎక్కడ రేషన్‌ ‌కార్డులు రద్దుచేస్తారేమోనని భయపడటమే దీనికి కారణం. ఇప్పుడు మరల కూటమి ప్రభుత్వం ఇదే మాటను చెబుతోంది. లబ్దిదారులకు డబ్బులు వేసేస్తే బియ్యం కొనుగోలు, నిల్వ, గిడ్డంగి, రవాణా, పంపిణి ఖర్చులు ఉండవు. దాంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE