ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన వ్యవహారం. దాదాపు ఏడాది కాలంగా పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తోన్న పరిణామం. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అధికారం మాటున జరిగిన దుర్మార్గపు తంతు. అసలు ఇలా కూడా చేయొచ్చా? అని నిఘా వర్గాలనే విస్తుపోయేలా చేసిన ఆధారాలు దొరికిన సంఘటన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశంతో ఒక రకంగా నియంతృత్వ పాలన సాగించిన అధికార యంత్రాంగం.. చివరకు నైతికతను కూడా గాలికొదిలేసింది. ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థనే సమకూర్చుకున్నారు. నిబంధనలు అడ్డురాకుండా.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పని కానిచ్చేశారు. ఈ తతంగానికి సంబంధించి అనుమానం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ కన్నింగ్ దందాకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించింది. కానీ, సూత్రధారులు, పాత్రధారులను విచారిస్తూ కాలం వెల్లదీస్తోంది. ఇప్పటిదాకా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ-1 అయిన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడని, ఆయన తిరిగొస్తేనే ఈ కేసు ముందుకు సాగుతుందని, ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులెవరో, ఆదేశాలు ఇచ్చిన పెద్దాయన ఎవరో బయటకు వస్తారని, అప్పుడు అసలు నిందితులను కటకటాల్లోకి పంపిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్రావు విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా పాస్పోర్టు రద్దు చేసినప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాక నుంచే అరాచకాలు మొదలయ్యాయి. ఆయనకు రక్షణ కోసం శంషాబాద్ విమానాశ్రాయానికి దాదాపు 70 మంది బౌన్సర్లు వచ్చారు. వారు పోలీసులను లెక్క చేయలేదు. మీడియాను కూడా దగ్గరికి రానీయకుండా ఆ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. అయినా పోలీసులు చేష్టలుడిగిపోయారే తప్ప తమ పాత బాస్కు సంబంధించిన బౌన్సర్లను ఏమీ అనలేక పోయారన్న చర్చ జరిగింది. మరుసటిరోజు కోర్టుకు విచారణకు హాజరైన సందర్భంలోనూ సేమ్ సీన్.
వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అత్యంత జుగుప్సాకరం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన అరాచకం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థుల సంభాషణలు వినడానికి, వాళ్ల వ్యూహాలకు కౌంటర్లు రూపొందించడానికే ప్రారంభించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో అత్యంత అమానుష పరిణామాలకు దారి తీసింది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, భార్యాభర్తలు, ప్రియులు, వివాహేతర సంబంధాలు వంటి అనేక అంశాల్లో ఈ ఫోన్ట్యాపింగ్ను ప్రభాకర్రావు అండ్ గ్యాంగ్ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ను అడ్డు పెట్టుకొని కాపురాల్లో కలహాలు సృష్టించారన్న ఆరోపణ లున్నాయి. వివాహేతర సంబంధాల్లో బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ దందాతో.. ప్రేమ వ్యవహారాలనూ సెటిల్ చేశారన్న ప్రచారం కూడా ఉంది ఇక, ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బుల సమీకరణలను పసిగట్టి పోలీసులతో, ఇన్కమ్టాక్స్ అధికారులతో రైడిరగ్లు చేయించి వాళ్లను ఆర్థికంగా దెబ్బతీశారు. అధికారికంగానే కాకుండా.. అనధికారికంగా కూడా దాడులు చేసి.. భారీ మొత్తంలో సంపాదనకు అలవాటు పడ్డారన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. సినీ రంగానికి చెందిన వారి సెల్ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి.. పెద్ద ఎత్తున బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడ్డాయి.
ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రభాకర్ రావు గ్యాంగ్ చివరకు న్యాయవ్యవస్థనూ వదల్లేదన్న ఆధారాలు బయటకు వచ్చాయి. ఏకంగా జడ్జిల ఫోన్ సంభాషణలు కూడా విన్నారన్న ఆనవాళ్లు.. న్యాయ వ్యవస్థను కుదిపాయి. పెద్ద స్థాయిలో అరాచకంగా వ్యవహరించిన ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ చేతికి చిక్కితే దర్యాప్తు ఏ స్థాయిలో ఉండాలి? విచారణ ఏ రకంగా సాగాలి? నిందితుల వెన్నులో వణుకు ఎలా పుట్టాలి? ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న ట్యాపింగ్ బ్యాచ్ టీమ్.. ప్రభాకర్రావు తిరిగొచ్చాడంటేనే ఏ రకంగా వణికిపోవాలి? కానీ, ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా కనిపించడం లేదు. నువ్వూ, నేనూ దోస్త్.. అనే రీతిలో వాతావరణం కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అధికారానికి వచ్చిన కొత్తలో.. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో సాగించిన అరాచకాలపై అంతెత్తున అధికార పక్ష నాయకులు ఎగిసి పడ్డారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. ఆయా అంశాల్లో విచారణ కమిషన్లు నియమించారు. ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే… ఊహించని రీతిలో శిక్షలు వేయిస్తామన్నారు. కానీ, దేనికదే విచారణలు కొనసాగుతున్నాయి. సాగిపోతున్నాయి. అవినీతి, అక్రమాలు పక్కన బెడితే.. నైతికతను వదిలేసి.. విలువలను పాతరేసి.. అనాగరికంగా.. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడితే, రహస్యాలు అనేవి లేకుండా.. అన్నీ బాహాటంగా తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తే.. నిందితులు దొరికినా మీనమేషాలు లెక్కిస్తుంటే ఎవరికి చెప్పుకోవా లంటున్నారు బాధితులు, సామాన్యులు.
ఈ పరిణామాలకు తాజాగా ప్రభాకర్రావు విచారణే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి ఏడాది కాలంగా ఈ కేసులో విచారణాధి కారులు తలమునకలయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్లు చేయించింది వాస్తవమే అన్న ఆధారాలు బయటకు వచ్చాయి. నిందితులు వీళ్లే అన్నది స్పష్టంగా రికార్డుల్లో నమోదయ్యింది. కానీ, పోలీసుల విచారణకు హాజరైన ప్రభాకర్రావు, ఫోన్ ట్యాపింగ్తో తమకేమిటి సంబంధం అని ఎదురు ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన వాళ్లందరూ వృత్తిలో భాగంగా తన దగ్గర పనిచేసిన వాళ్లు మాత్రమేనని, విధి నిర్వహణలో భాగంగా మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్రావు చెప్పినట్లు సమాచారం. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని ప్రభాకర్ రావు స్పష్టంచేసినట్లు సమాచారం. జూన్ 8వ తేదీన అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగివచ్చిన ప్రభాకర్ రావు.. మరుసటి రోజు సిట్ విచారణకు హాజ రయ్యారు. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబీ కార్యా లయంలో హార్డ్డిస్క్ల ధ్వంసంపైనా అధికారులు ప్రభాకర్రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్ఐబీ చీఫ్ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్రావు… ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ హార్డ్డిస్క్లు ధ్వంసం చేసి, కొత్తవి పెట్టమన్నది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించగా… ఆయన నుంచి సరైన స్పందన రాలేదంటున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్రావును ప్రశ్నించారు.‘ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం? ఏయే ఫోన్లు ట్యాప్ చేయాలి? ఎంత కాలం చేయాలి? ఎందుకు చేయాలి? అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలోని సభ్యులుగా ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారు?’ అని ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా అధికారులను విచారించి, వాంగ్మూలాలు నమోదు చేశామని పోలీసులు చెప్పగా… ట్యాపింగ్కు అనుమతి ఇచ్చింది వారేనని.. తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించినట్లు సమాచారం. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత కూడా పలు దశలుగా ప్రభాకర్రావును విచారించారు సిట్ అధికారులు.
ఈ విచారణ తంతు ఇలా సాగుతున్న సమయంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నీచుడని, అతను సామాన్యుడు కాదని, ఎంతో మంది ఉసురుపోసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాదు… ప్రభాకర్ రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యాడన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్న వ్యక్తి ప్రభాకర రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణలో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగ పర్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు.. నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాప్ చేసిన ఘనుడు. అలా చాలా మంది జీవితాలు దెబ్బ తిన్నాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన వ్యక్తి.. ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారు’. అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్రావు ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు.. ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అనే వివరాలు రాబట్టాలి. వాటిని బహిర్గతం చేయాలి. 18 నెలల రాష్ట్ర పాలనలో అవినీతి కేసుల విచారణలో ఏ ఒక్క కేసు విచారణ ముందుకు సాగలేదని బండి విమర్శించారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు విన్పించాలని, ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితులందరినీ అరెస్ట్ చేసి, విచారించారు. కస్టడీలోకి తీసుకొని కూడా ఆధారాలు సేకరించారు. విదేశం నుంచి ఇప్పట్లో తిరిగిరాడనుకున్న ప్రభాకర్ రావు భారత్కు తిరిగొచ్చాడు ఇక….ఈ ఫోన్ ట్యాపింగ్ కన్నింగ్ గాళ్లందరినీ బయటకు తీస్తారా? అసలు సూత్రధారులను కటకటాల్లోకి పంపిస్తారా? తేలాల్సి ఉంది.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068