పంచాయతీ వ్యవస్థలు రానురానూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్థానిక స్వపరిపాలన, స్వరాజ్యం వంటివి కానరాకుండా పోతున్నాయి. దేశంలోని పంచాయతీలను పట్టించుకోవలసిన విధంగా పట్టించుకుని ఉంటే దేశం ఏనాడో ఆర్థికాభివృద్ధి సాధించి ఉండేదని, ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠంగా పరిఢవిల్లేదని ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జాతీయ స్థాయి పంచాయతీ అధ్యక్షుల సమావేశం జరిగింది. రాజ్యాంగం ప్రకారం దేశంలో మూడంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇందులో మూడవ వ్యవస్థగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు ప్రాధాన్యమేమీ లేదని, పంచాయతీలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఈ సమావేశం అభిప్రాయ పడింది. అధికారాల వికేంద్రీకరణకు సంబంధించిన సంస్కరణల్లో భాగంగా పంచాయతీల కోసం 73వ రాజ్యాంగ సవరణ, మునిసిపాలిటీల కోసం 74వ రాజ్యాంగ సవరణ చేపట్టడం జరిగింది. స్వయం పాలన, స్థానిక ప్రజాస్వామ్య సూత్రాలే లక్ష్యంగా పంచాయతీలను, పురపాలక సంఘాలను అభివృద్ధి చేయాలన్నది ఈ సవరణల అంతిమ ఉద్దేశం. ఈ సవరణలు జరిగి ఏళ్లూ పూళ్లూ గడిచిపోతున్నా పంచాయతీలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఈ మూడవ అంచె విషయంలో 16వ కేంద్ర ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) కొన్ని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
నిజానికి, రాజ్యాంగంలో చేసిన రెండు సవరణల ప్రకారం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే, ఆర్థిక సంఘాలు ఇప్పటికీ ఈ రెండు వ్యవస్థలనూ కలిపి స్థానిక సంస్థలుగానే పరిగణిం చడం వల్ల మూడంచెల ప్రభుత్వ వ్యవస్థకు అర్థం లేకుండా పోతోంది. ఈ రెండు సంస్థల సమస్యలు విభిన్నమైనవి.
అందువల్ల ఆర్థిక సంఘాలు పంచాయతీలను, పురపాలక సంఘాలను ఒకే గాటన కట్టకుండా వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాం గంలో ఈ సవరణలు జరిగి మూడు దశాబ్దాలు దాటినప్పటికీ, పంచాయతీల ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టికి వీటి నుంచి అందుతున్న సేవలు ఎటువంటివో ఇంతవరకూ ఎవరూ అంచనా వేయలేదు. పంచాయతీల ఆదాయ వ్యయాల పరిస్థితి ఏమిటో, అవి ఏ మేరకు పురోగతి సాధించాయో కూడా ఎవరూ ఇంత వరకూ మదింపు చేయలేదు.
మూడంచెల వ్యవస్థ మృగ్యం
పాశ్యాత్య దేశాలు కూడా రాష్ట్రాల సమాఖ్య సూత్రాలనే పాటిస్తాయి కానీ, రాష్ట్రాల సమాఖ్యలో పంచాయతీలకు స్థానం ఉండదు. భారతదేశంలో మాత్రం రాష్ట్రాల సమాఖ్యతో పాటు, మూడంచెల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారాల వికేంద్రీకరణలో భాగంగా ఇక్కడ గ్రామసభలు కూడా ఏర్పడ్డాయి. వాటికి కూడా ఆర్థిక ప్రాధాన్యాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాల మదింపు ఉంది. కానీ, వాటిని ఆర్థికాభివృద్ధిలో భాగంగా పరిగణించడం లేదు. నిజానికి, పంచాయతీలు కూడా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చు. సామాజిక న్యాయం కోసం ప్రయత్నించవచ్చు. స్థానిక ప్రజాస్వామ్యానికి అవసరమైన పక్రియలు, పద్ధతులను పెంపొందించు కోవచ్చు. ఇటువంటివి ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి.
అయితే, దేశంలోని అత్యధిక శాతం పంచాయ తీలు స్వయం పాలన సంస్థలుగా పనిచేయడం లేదు. కేవలం ప్రభుత్వాల ఏజెంట్లుగా మాత్రమే పనిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో పంచాయతీ రాజ్ సంస్థలు భాగం కానే కాదు.
ఈ రెండు రాజ్యాంగ సవరణలను బట్టి పంచాయతీలు, పురపాలక సంఘాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా, కేంద్ర ఆర్థిక వ్యవస్థలో కూడా అంతర్భాగమని అర్థం అవుతూనే ఉంది. అయితే, ఈ వాస్తవాన్ని ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ పక్షమూ గుర్తించడం లేదు. కేంద్ర ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా క్రమబద్ధంగా పంచాయ తీల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అటు కేంద్ర ఆర్థిక సంఘం, ఇటు రాష్ట్ర ఆర్థిక సంఘం పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, పంచాయతీలకు ఇవ్వాల్సి నంత ప్రాధాన్యం ఇచ్చిన పక్షంలో దేశంలో చిన్న పట్టణాలు, గ్రామాల స్థాయిలో ప్రాథమిక అవసరాలు తీరిపోవడంతో పాటు, అవి ఆర్థికంగా కూడా పరిపుష్టం అయ్యేవి. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు సమన్వయంతో పని చేస్తూ ఉంటే సహకార సమాఖ్య పెంపొందేది. తాగునీరు, ప్రాథమిక విద్య వంటి మౌలిక సదుపాయాలు ప్రతి పౌరుడికీ అందడానికి అవకాశం ఉండేది.
స్వపరిపాలనకు ప్రాధాన్యం
వికేంద్రీకరణకు సంబంధించిన సంస్కరణలు పురోగతి చెందాలన్న పక్షంలో వీటిలో తరచూ మార్పులు, చేర్పులు అవసరం. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను పునర్మించాలని 11, 12వ ఆర్థిక సంఘాలు సిఫారసు చేశాయి కానీ వాటిల్లో ఎక్కడా పంచాయతీలకు అవకాశం కల్పించలేదు. పంచాయ తీలకు స్థానిక కేటాయింపులు ఉండాలని, పనితీరును బట్టి కూడా ఆర్థిక కేటాయింపులు జరపాలని, వీటికి కూడా ఒక ఆడిటింగ్ వ్యవస్థ ఉండాలని, ఒక పర్యవేక్షణాధికారిని నియమించాలని, పంచాయతీల స్థాయిలో కూడా ఆస్తి పన్ను వసూలు చేయాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది. కానీ అటు వంటివేవీ అమలుకు మాత్రం నోచుకోలేదు. కొన్ని రాష్ట్ర ఆర్థిక సంఘాలు పంచాయతీలకు ప్రాధాన్యం ఇవ్వడం, వాటిని అభివృద్ధి చేయడం వంటి విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సిఫార్సులను అవి అరకొర సిఫార్సులుగా, నిర్దిష్టమైన సూచనలు లేనివిగా కొట్టి పారేస్తున్నాయి.
వికేంద్రీకరణకు సంబంధించిన సంస్కరణల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక పట్టాన సమన్వయం కుదరడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలోనూ, ఇప్పుడూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ, నిధుల విషయంలో పంచాయతీలకు అధికారాలివ్వడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యకలాపాలను, అధికారాలను, నిధులను, నియామకాలను పంచాయతీలకు అప్పగించడానికి ఒప్పుకోవడం లేదు. ఒక్క గుజరాత్ ప్రభుత్వం మాత్రమే కొద్దో గొప్పో ఈ మార్గదర్శకత్వా లను పాటించడం జరిగింది. విచిత్రమేమిటంటే, కొన్ని రాష్ట్రాలు పంచాయతీలకు పోటీగా కొన్ని సంస్థలను సృష్టించి, వాటిని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకుని, వాటికి నిధులివ్వడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించిన ఈ పోటీ సంస్థలు స్థానిక పాలనను, స్థానిక ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి.
ప్రభుత్వాలతో సమస్యలు
పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పడి స్థానిక సంస్థల తరఫున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. శాసన సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఇటువంటి అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ప్రాధాన్యాన్ని పక్కన పెట్టి అనేక సంస్థల ద్వారా పంచాయతీల్లోని గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతోంది. నిజానికి ఈ పోటీ సంస్థలేవీ స్థానిక ప్రజల ఆశయాలకు, అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడం లేదు. గత మూడు దశాబ్దాల నుంచి ఈ పోటీ సంస్థలే పంచాయతీల్లో రాజ్యమేలు తున్నాయి. మొదటి నుంచి పంచాయతీ సంస్థలు, స్థానిక సంస్థలను బలహీనపరచడానికే ప్రభుత్వాలు కృషి చేయడం శోచనీయం. పంచాయతీలు ఆర్థికంగా బలంగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సమస్య లుండవు. ఆర్థికంగా పరిపుష్టం అయ్యేవి. ప్రభుత్వ ఖజానా మీద ఒత్తిడి తగ్గేది. గ్రామ సీమల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరిగేది. ప్రభుత్వాలు కేవలం తమ ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం కోసం పంచాయతీ వ్యవస్థకు సమాధి కడుతున్నాయి. పంచాయతీలతో పోలిస్తే పురపాలక సంఘాలు ఆర్థికంగా శక్తిమంతంగా ఉంటున్నాయి.
పంచాయతీలకు తమ ఆదాయాన్ని తామే సృష్టించుకునే అవకాశం కల్పించడం చాలా అవసరం. దేశంలో అనేక పంచాయతీలకు ఆస్తి పన్ను వసూలు చేసే అధికారం లేదు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆస్తి పన్ను వసూలు చేయడమన్నది లేనే లేదు. పంచాయతీ సంస్థలు తమను తాము నిర్వహించుకోవడానికి అవసరమైన నిధుల్లో పది శాతం నిధులను కూడా పొందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు తమ మీద ఆధారపడి ఉండేలా చేసుకుంటున్నాయి. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం, స్వయం పాలన వంటివేవీ ఉండడం లేదు. స్థానిక సంస్థలకు, పంచాయతీ సంస్థలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడడం అనేది సుదూర కాలంలో ఎక్కడా కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడానికి, ఆర్థిక అధికారాలను పంచుకోవడానికి 16వ ఆర్థిక సంఘం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను, మార్గదర్శకాలను రాష్ట్రాలు రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక, సామాజిక కోణాల్లో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పంచాయతీలను పరిపుష్ఠం చేయడానికి ఆర్థిక సంఘాలు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంసిద్ధంగా ఉన్నాయి. ఈ ఆశయం ఫలించడం అవసరం. ఇది జరిగే పక్షంలో దేశ ప్రజాస్వామ్యానికి దీనినొక గొప్ప విజయంగా భావించవచ్చు.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్