ఇప్పుడు రెండు పేర్లు మారుమోగుతున్నాయి. ఇప్పటికీ వాటి ప్రతిధ్వనులు వినవస్తున్నాయి.

చీనాబ్‌, ‌మాధవీలత. ఒకటి రైల్వే వంతెన, మరొకటి – ఆ నిర్మాణ కీలక పాత్రధారిణి. ఏమిటి ఆ చీనాబ్‌? ఎవరు ఆ మాధవి?  జమ్ముకశ్మీర్‌లో ఉంది ఆ నిర్మిత వ్యవస్థ. నిర్మాణ ఘనతలో తనదైన ప్రతిభను రంగరించిన మాధవిది తెలుగునాట ఒంగోలు ప్రాంతం. ఆమె ప్రస్తుతం పనిచేస్తోంది బెంగళూరులోని ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌సస్టెయినబుల్‌ ‌టెక్నాలజీస్‌’ ‌విభాగ అధ్యక్షురాలిగా. పలు ప్రాజెక్టులకు నిర్మాణ బాధ్యత వహించారామె. నిర్మిత సంస్థ ‘నార్తర్న్ ‌రైల్వే ఆఫ్కాన్స్’‌కి ఆమె ప్రధాన సలహాదారు. అంటే – తెలుగు మహిళా ఇంజినీర్‌. ‌మేధను సాకారంచేసిన నిపుణ. మన దేశం అనే కాదు…. మొత్తం ప్రపంచంలోనే ఎంతో ఎత్తుగా ఉండే వంతెన ప్రాజెక్టుకు శాస్త్ర, సాంకేతిక బాధ్యత వహించడమంటే మాటలా? పరమోన్నత రీతిన కశ్మీరులోయలోని రైల్వేసేవగా ఈ వంతెనను ఆరంభించిన ప్రధాని మోదీ అన్నట్లు – ఇదొక చరిత్రాత్మక సందర్భం. భారత్‌లో రూపుదిద్దుకున్న మొదటి కేబుల్‌ ‌బ్రిడ్జ్‌గా ఇది ఘనాతి ఘనం. సృజనకు పర్యాయంలా నిలుస్తున్న మాధవీలతను చూస్తే…

‘అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా

పరుగులు తీస్తావు ఇంటా బయటా.

అలుపని రవ్వంత అననే అనవంట

వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా!’

అనే కవితోక్తి తలపులోకి రాక మానదు.

ఎందుకంటే – స్థానికం నుంచి అంతర్జాతీయానికి బాటలు పరచిన శాస్త్రీయ దృక్పథం తనది.  ఎక్కడి పల్లెటూరు-ఏడుగుండ్లపాడు! తన సొంత ఊరు.

ఎక్కడి చీనాబ్‌-‌జమ్ముకశ్మీర్‌లోని రియాసీ ఏరియా!

అత్యధునాతన ఇంజనీరింగ్‌ ‌నేపథ్యాన తెలుగు అతివ! 

మరింత విలక్షణత ఒకటుంది. ఒకటిన్నర దశాబ్దంగా ఆమె సాగించిన పలు విధాల కృషికి ఇదంతా వాస్తవ రూపం.  ఇదంతా జాతీయతా స్ఫూర్తి ఫలితం. ఈ మాట ఆమే అన్నారు!

నిర్మాణ, నిర్వహణలపైనే మాధవికి మక్కువ ఎక్కువ. ఒంగోలు ప్రాంత విద్యాలయాల్లో చదువు సాగింది. సమీప కందుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్‌ ‌కళాశాలలో చదివిన ఆమె శాస్త్ర పరిజ్ఞానంలో ఎప్పుడూ ముందుండేది.

వాయువేగం వంటి ఆలోచన. దాన్ని ఆచరణకు తేవడంలోనూ తానే మిన్న. కాకినాడలోని టెక్నలా జికల్‌ ‌యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇం‌జనీరింగ్‌లో బీటెక్‌ ‌డిగ్రీ. అందునా డిస్టింక్షన్‌లో!

జియోటెక్నికల్‌ ఇం‌జనీరింగ్‌లో ఎంటెక్‌ ‌చదవాలని వరంగల్‌కి వెళ్లారు. ఎంతటి గుర్తింపూ గౌరవాలను సొంతం చేసుకున్నారంటే – స్వర్ణపతకం ఆమెదే! అటు తర్వాత మద్రాసు ఐఐటీ నుంచి డాక్టరేట్‌ అం‌దుకున్నారు డాక్టర్‌ ‌మాధవీలత.

పోస్ట్ ‌డాక్టరల్‌ ‌రీసెర్చి చేసింది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ ‌నుంచి. గువాహటి (గౌహతి)లోనే అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ అయ్యారు. అనంతర క్రమంలో సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి అపార సేవలందించారు.

అలా అలా ప్రొఫెసర్‌ అయ్యారు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో ఎందరెందరికో మార్గదర్శిని అయ్యారు.

సదా ప్రయోగాలు, బోధనలు, శోధనలు. అన్ని సందర్భాల్లోనూ నిర్మాణ పనులపైనే శ్రద్ధ, ఆసక్తి. పునాదులు, గోడల నిర్మాణాలు, కొండలను తొలిచి కట్టడాలు నిర్మించడం గురించే సమయమంతటినీ కేటాయిస్తూ వచ్చారు.

వంతెన పనులకు సంబంధించి ప్రత్యేక దృష్టి ఉంటుండేది. ఎన్నెన్నో పుస్తకాలను చదివారు. ఎందరెందరితోనో సంప్రదింపులు జరిపారు. పరిచయాలను విస్తృతంగా వినియోగించుకున్నారు.

చీనాబ్‌ ‌పనితో ఎలా అనుసంధానం జరిగిందంటే…  చీనాబ్‌ అనేది నది. అక్కడి జమ్ము- బారాముల్లా లైనులో ఉన్న కౌరి- బక్కల్‌ ‌రైలు స్టేషన్ల మధ్య ఏర్పాటైంది వంతెన.

నదీ లోయ ప్రాంతాన ఇది వేలాది అడుగుల మేర విస్తరించి ఉంటుంది. అప్రోచ్‌ ‌బ్రిడ్జిగా రూపు ఏర్పడింది. ఎంతెంతో ఎత్తయిన, ఆర్చి సంబంధమైన వంతెనే ఇది. నిర్మాణ వ్యయం అనేక కోట్ల రూపాయల్లో. నిర్మాణానికి కాలం స్థూలంగా దరిదాపు మూడేళ్లు. ట్రయల్‌ ‌రన్‌ ‌నిరుడు అయింది. ఇదే వంతెనమీద రైలుబండ్ల రాకపోకలు ఈ మధ్యనే మొదలయ్యాయి.

రెండు భాగాలుగా ఉండే వంపు వంతెన. ప్రధాన వంతెన నిర్మాణ బరువు వేలాది టన్నుల్లో! మొత్తం వంతెన ప్రతిపాదిత జీవితకాలం నూట ఇరవై సంవత్సరాల పై మాటే.

మధ్యలో స్టేషన్లు రెండు పదుల సంఖ్యలో. వాటిల్లో ఉధంపూర్‌ – శ్రీ‌నగర్‌ – ‌బారాముల్లా రైల్వే లింక్‌ ‌పరంగా… రత్నిపోరా, అవంతి, అనంత నాగ్‌ ‌తదితరాలు ఉన్నాయి. జమ్మును కశ్మీరులోయతో అనుసంధానించే రైలు సేవల ఆరంభోత్సవాల వేళ, ఈ వంతెనను జాతికి అంకితం చేశారు భారత ప్రధానమంత్రి. దానిమీదనే పరుగులు తీసింది ‘వందే భారత్‌’.

అది జమ్ముకశ్మీరులోని కట్రా-శ్రీనగర్‌ ‌మధ్యన నడిచేది. చీనాబ్‌ ‌నదిపైన రైల్వే వంతెన మీద భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి నడిచారు మోదీ. ఈ వంతెన వాస్తుశాస్త్ర అద్భుతమన్నది ఆయన ప్రసంగంలో ప్రతిఫలించింది.

కాదా మరి? న్యూయార్క్, ‌పారిస్‌ ‌ప్రాంతాలలోని ఎత్తుకట్టడాల కన్నా ఈ వంతెనే ఘనమైంది.ఎంతటి ప్రకృతి విపత్తు ఎదురైనా తట్టుకుంటుంది. భారతావనికి మకుటం జమ్ముకశ్మీరు అయితే, ఈ సరికొత్త రైల్వే వంతెన ఇక్కడి ప్రాంతీయులకు మహా కీలకం. కీలకాన్ని సాకారం చేయడంలో ప్రధాన నిర్మాణ పాత్ర స్వీకరించినందుకే మాధవీలతకు ఇంతింత ప్రత్యేక విశిష్టత.

వంతెన అందరి కళ్లముందూ నిలిచిందంటే, అంతా సంకల్ప బలం.

నేలమీదనే కాదు – నింగిలో ప్రయాణించేవారికీ వంతెన ప్రాంతం అంటే అత్యంత ఆసక్తి. జమ్ముకశ్మీరు లోయలకు ఎగువ నుంచి పయనించే విమానాల్లోని వారందరూ ఆ లోయకు చేరువైనపుడు పులకిస్తున్నారు.  కిటీకీల నుంచి చూసి, పొంగి పరవశిస్తున్నారు. విమానాల్లో నుంచీ అనేకానేక ఫోటోలు తీసి, తెలిసినవారందరికీ మహదానందంగా చేరవేస్తున్నారు.

వీటన్నింటినీ చదివీ, వినీ, సమాచార మాధ్యమాల్లో చూసీ ఎంతగానో సంబరపడుతున్నారు మాధవి. ‘అభివృద్ధి, సంక్షేమం మన లక్ష్యాలు. దేశం వృద్ధి చెందడాన్ని ఎవరూ ఆపలేరు. సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా చేయలేరు. ఉగ్రవాదులు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఏదీ సాధించలేరు. మనదైన భారతీయత చెక్కు చెదరదు ఏనాటికైనా. పురోగమనం కొనసాగుతూనే ఉంటుంది ఎన్నాళ్లకైనా. ఇందులో భాగంగానే ఇప్పుడీ వంతెన ప్రారంభ సందర్భం. నిలిచేదీ గెలిచేదీ జాతీయవాదమే! ఉగ్రవాదం కుప్పకూలక తప్పదు’ అంటూ భావ ఉద్విగ్నతను వ్యక్తపరచారు ప్రసార సంస్థల వారితో.

ఎంతగానో పరిశ్రమించి బాధ్యతలన్నింటినీ ఫలప్రదం చేయడంలో తన బృందం పాత్ర అనంతంగా ఉందంటున్నారు. తన వాయువేగ పనితీరును సందర్భవశాత్తు ప్రస్తావిస్తూ, అంతా కేంద్రం ప్రోత్సాహ ప్రభావమేనని వ్యాఖ్యానించారు. ‘మా నాన్నగారు చిన్నపాటి వ్యాపారం చేస్తుండేవారు. నేను చిన్నగా ఉన్నపుడే, శాశ్వతంగా దూరమయ్యారు. అమ్మ నన్ను తీర్చిదిద్దింది. నా భర్త సాంకేతిక నిపుణులు. ఆయన ప్రేరణ నా వృత్తిగతంగా నన్ను ముందుకు నడుపుతోంది. అంటూ కృతజ్ఞత తెలుపుతుండగానే మందహాసం! ఆ చిరునవ్వులోనే ఎంతో సంతృప్తీ సంతోషాలు.

ఎక్కడో దూరప్రాంతాన, పర్వత ప్రాంతాల నడుమ, విల్లు ఆకారంతో రూపనిర్మాణం చేసుకుంది చీనాబ్‌ ‌వంతెన. నిర్మాణ క్రమంలో ఏళ్ల తరబడి అవరోధాలు ఎదురైనా, భౌగోళిక స్థితిగతులు సంక్లిష్టంగా మారినా, అంతర్గత సంకల్పమే చివరికి గెలిచిందంటారు ఆమె.

ఎప్పుడు తీరిక దొరికినా, ఏదో ఒక పుస్తకం చదువుతుంటారు. తనకు నచ్చిన, తాను మెచ్చిన పదకవితలను వల్లె వేసుకుంటూ ఉంటారు.

‘కళ్లు మూసుకుని రూపకల్పన చేసుకుంటే

ఆకాశం… ఎత్తయిన లోయలా అగుపిస్తుంది!

లోయలో ప్రవహించే నదులు

ఆ గగనంలో కదిలిపోయే మబ్బులా అనిపిస్తుంటుంది!

అట్టగున పడి ఉంటే లోయకు

అంబరాన్ని అంటుకునే అవకాశం

ఏదీ, ఎక్కడా – అనే ప్రశ్నలొస్తుంటాయి.

వీటికి సమాధానం సుస్థిర యధార్థమే చెప్తుంది’

అంటూనే, శాంతి సామరస్య అత్యవసరాన్ని తేటతెల్లం చేస్తుంటారు.

తన భావాల్ని ప్రస్ఫుటపరచే శక్తి మాధవీలత సొంతం. ప్రాజెక్టు నిర్మాణ పనుల తరుణంలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తొలి నుంచీ నవీన యోచనలకు ప్రాధాన్యమిచ్చే ఆ శాస్త్రవేత్త గతంలోనే ఇండియన్‌ ‌జియోటెక్నికల్‌ ‌సొసైటీ నుంచి ఉత్తమ మహిళా పరిశోధన పురస్కృతిని అందుకు న్నారు. అదేవిధంగా దేశంలోని 75మంది మహిళా ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

వనితలకు అవకాశాలు విస్తరింపచేస్తే, అద్భుతాలే జరుగుతాయన్నది ఆమె నినాదం, విధానం. బోధన రంగంలో అనంత పటిమ సాధించి, జాతీయ స్థాయి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

అసాధారణ పనితనానికి నిఖార్సయిన ప్రతీక ఆ వంతెన. దీనివల్ల జమ్ముకశ్మీరు ప్రాంత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా బాగా వేగవంతమవుతుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సులభ సాధ్యంగా మారుతుంది. ఇంతటి బహుళ ప్రయోజక నిర్మాణ పనికి కీలకంగా వ్యవహరించినందుకే… మాధవీలత వనితాలోక స్ఫూర్తి ప్రదాత. ఇంజినీరింగ్‌ ‌వృత్తి వనితల పాలిట కాంతి మాలిక!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE