‘శర్మిష్ట గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమెరికాలో యూనివర్శిటీ నుంచి బహిష్కరణకు గురైన మేఘా వేమూరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు. పాలస్తీనా మీద దాడి చేస్తున్న ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకోవడం మీద నిలదీసిన తెలుగు మూలాలున్న విద్యార్థినిని బహిష్కరిస్తే ఎందుకు మాట్లాడడం లేదు..’ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ను ఓ వామపక్ష విశ్లేషకుడు ప్రశ్నించారు. ఆ విశ్లేషకుడి మాటలు వింటే ‘‘నాజీ పార్టీలో గోబల్స్ తర్వాత అంత ప్రాపగాండ మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ చేసుండరు’ అన్న ఓ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. యువత నక్సలిజంలో చేరడానికి వామపక్ష మేధావుల ప్రభావమే కారణమన్నది వాస్తవం. అలా వామపక్ష ప్రభావితురాలే మేఘా వేమూరి అయి ఉండవచ్చు. ముందుగా మేఘ గురించి తెలుసుకుందాం..
జాతీయ మీడియా సమాచారం ప్రకారం… భారతీయ మూలాలు గల తెలుగు కుటుంబానికి చెందిన విద్యార్థిని మేఘా వేమూరి. అమెరికాలోని జార్జియాలో ఆల్ఫారెట్టాలో పుట్టి పెరిగిన వేమూరి ఆల్ఫారెట్ట హై స్కూల్లో చదివారు. మేఘా 2021లో మసాచుసెట్స్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో చేరి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె క్లాస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మే 29న జరిగిన కార్యక్రమంలో ఆమె పాలస్తీనాకు మద్దతుగా ఎర్రటి కెఫియే అనే సాంప్రదాయ స్కార్ఫ్ ధరించి, పాలస్తీనా అనుకూల ప్రసంగం చేయడంతో పాటు విశ్వవిద్యాల యాన్ని విమర్శించారు.
మే 30న జరగాల్సిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రారంభోత్సవంలో ఆమె మార్షల్గా ఉండాల్సి ఉంది. కానీ ఆమెతో పాటు కుటుంబాన్ని కూడా కళాశాల క్యాంపస్ నుంచి నిషేధిస్తూ మిట్ ఛాన్సలర్ మెలిస్సా నోబుల్స్ ప్రకటించారు. భావస్వేచ్ఛ హక్కును తాము అంగీకరిస్తున్నప్పటికీ యూనివర్శిటీ వేదికను రాజకీయ నిరసన కార్యక్రమానికి వాడుకోవడాన్ని వర్శిటీ అధికారులు తప్పుబట్టారు.
ఇజ్రాయెల్పై దాడి.. కిడ్నాప్..
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించి అవగాహన లోపం కానీ, లేక తప్పుడు ప్రచారాలను వాస్తవంగా భ్రమిస్తూ కానీ మేఘ ఉండాలి. 2023 అక్టోబర్ 7న స్థానికులు ఉత్సవం జరుపుకుంటున్న వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు పేల్చి ఇజ్రా యెల్లో చొరబడి కాల్పులు జరిపి అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 1200 మంది పైగా మృత్యువాతపడ్డారు. వారిలో వందలాది మంది ఇజ్రాయిలీలు, అనేక మంది విదేశీయులతో పాటు భద్రతా దళాల సిబ్బంది ఉన్నారు. 251 మంది ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను బందీలుగా తీసుకువెళ్లారు. ఇప్పటికీ 58 మంది బందీలుగా ఉన్నారన్న వాస్తవం గుర్తించాలి.
వివస్త్రను కారులో తిప్పుతూ…
ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదుల అకృత్యాలు నాటి పత్రికల్లో పతాక శీర్షికలుగా వచ్చాయి. ఆ వార్తలు ఆందోళన, ఆవేదన కలిగించాయి. కనిపించిన వారిని కాల్చి చంపుతూ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఓ మహిళ బట్టలు చించేసి.. వివస్త్రను చేసి కారులో తీసుకుని వెళ్లారు. తమ చేతుల్లో ఉన్న ఆయుధాలను చూపిస్తూ వీడియోలు తీసుకుంటూ పాశవికంగా ప్రవర్తించారు. వివస్త్ర మహిళ చేతులు వెనక్కు కట్టి కారులో పడేసి ఆమెను కాళ్లతో తొక్కుతూ తన్నుతూ సాగిన వీడియో ఆవేదనకు గురి చేసింది. పసిపిల్లలను కూడా కాల్చి చంపేశారు. సైనికులను బందీగా చేసుకుని వారిని నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వీడియోలు బయటికి వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలే ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు అక్కడి ఎన్జీవో ‘ఇజ్రాయెల్ వార్ రూమ్’ పేరుతో ట్విటర్లో వెల్లడించింది. ఇజ్రాయెల్లో అపహరణకు గురైన మహిళల ఫొటోలను కూడా ట్విటర్లో ఉంచింది. కావాలనే హమాస్ ఉగ్రవాదులు ఎక్కువ మంది మహిళలను అపహరించినట్లు తెలుస్తోందని పేర్కొంది. వారిపై అత్యాచారం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాయని స్పష్టం చేసింది.
బందీల విడుదల
గాజా స్ట్రిప్లో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలు సజీవంగా ఉన్నట్లు హమాస్ సాయుధ విభాగం గత నెలలో ఒక వీడియోను విడుదల చేసింది. 2023 అక్టోబరు దాడి సమయంలో వారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇజ్రాయెల్ సైన్యం బందీలను విడిపించిన ప్రాంతంలో 2014 యుద్ధంలో మరణిం చిన ఇజ్రాయెల్ సైనికుడి అవశేషాలు లభ్యమయ్యాయి. గాజాలో ఇంకా 58 మంది బందీలుగా ఉన్నారు.
ఎందుకీ సానుభూతి?
‘వారు యుద్ధం ప్రారంభించారు, మేం ముగిస్తామని’ నెతన్యాహు ఘటన జరిగిన వెంటనే పేర్కొన్నారు. నాడు ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడి నేటికీ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకూ 54,418 మంది మరణించగా, 1,24,190 మంది గాయపడ్డారని, గత 10 వారాల్లోనే 3,901 మంది మరణించినట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం అంతానికి ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది.
ఈ దాడిలో ఉగ్రవాదుల అడ్డాగా ఉన్న గాజాలో పలువురు అమాయకులూ మరణిస్తున్నారు. వారి పట్ల సానుభూతి కనబర్చే మేధావులు, ర్యాలీలు నిర్వహించే ప్రజాసంఘాల నాయకులు, వారి ప్రసంగాలకు ప్రభావితమయ్యే మేఘ వంటి వారు ఏ రోజయినా అమాయక మహిళలను కిడ్నాప్ చేసి బందీలుగా ఉంచి అఘాయిత్యాలకు పాల్పడిన హమాస్ ఉగ్రవాదుల చర్యలను తప్పుబట్టారా? బేషరతుగా బందీలను విడిచిపెట్టాలని ర్యాలీలు నిర్వహించారా? దాడి జరిగిన రోజు వివస్త్రగా హింసకు గురైన ఆ అమాయకురాలి కోసం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారా? హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం సంతాప సభ నిర్వహించారా? ఇజ్రాయెల్లో చనిపోయిన చిన్నారులు, పౌరుల ప్రాణాలకు విలువలేదా? వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ విశ్లేషకుడు, ప్రొఫెసర్లపై ఉంది. ట్రంప్ వాచాలత్వంతో పోల్చి మేఘకు వాక్ స్వాతంత్య్రంగా పేర్కొనడంలో ప్రొఫెసర్ స్థాయి, విలువ తెలుస్తోంది.
మానవత్వం అంటే ఏమిటి?
‘గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. ఇప్పటికే మరుభూమిగా మారిన గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గాజాకు సరుకులు అందే అన్ని మార్గాలను ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా మూసి వేసింది. చరిత్రలో అతిపెద్ద మానవ విషాదంగా పశ్చిమాసియా భూభాగంలో గాజా ఇప్పుడు కనిపిస్తున్నది. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమానికి స్త్రీలు, పిల్లలు కూడా బలికావడం ఒక ఎత్తయితే, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వారికి తాగేందుకు నీరుకూడా లేదు. రఫాలో నిర్వాసితులను ఆదుకునేందుకు అమెరికా మద్దతుతో సహాయ కేంద్రాన్ని తెరిచినా, అక్కడి పరిస్థితులను అదుపు చేసే మిషతో ఇజ్రాయెల్ దళాలు వారిపై కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి…’ అంటూ కన్నీరు మున్నీరయ్యే మానవతావాదులు, ఇంకా హమాస్ చెరలో మగ్గుతున్న వారి కోసం ఎందుకు నోరు విప్పరు. ‘సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే’ అని పవన్ అన్నట్టు, మానవత్వం కూడా ఒకవైపే ఉండకూడదు. అలా ఉంటే అది మానవత్వం కాదు.. దానవత్వమవుతుంది.
మేఘను ఎందుకు సమర్ధించాలి?
శర్మిష్టకు, మేఘకు పోలిక ఎందుకు? శర్మిష్ట క్లిష్ట సమయంలో తన దేశం కోసం గళం విప్పింది. తనను తీర్చిదిద్దిన విద్యాసంస్థ నిర్వహించే ఒక వేడుకలో ఆ సంస్థను అప్రతిష్టపాల్జేసింది మేఘ. హిందూ మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన ముష్కరుల దుశ్చర్యను తప్పుపట్టింది శర్మిష్ట. అమాయక మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి వివస్త్రను నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేసిన ఉగ్రవాదులను సమర్ధించింది మేఘ. ఏ కోణంలో చూసినా ఇద్దరూ భిన్న ధ్రువాలే! బాధితుల తరపున శర్మిష్ట, తప్పు చేసినవారి తరపున మేఘ. పోలిక ఎక్కడ? ‘పాలస్తీనా మన రాక కోసం వేచి ఉందనడం ద్వారా తోటి విద్యార్థులకు ఆమె ఏం సందేశం ఇస్తోంది. అందుకే మేఘ మాట్లాడడం పూర్తయిన వెంటనే, మిట్ అధ్యక్షురాలు సాలీ కార్న్బ్లుత్ ఆ వేదిక మీద నుంచే, ‘తాము భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం.. కానీ ప్రస్తుత కార్యక్రమం గ్రాడ్యుయేట్ల గురించి’ అని చెప్పారు. పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడుతున్నట్లుగా కూడా ఆమె తమకు తెలియజేయలేదని మిట్ ప్రతినిధులు చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇక్కడే కాదు, ఆమెను నమ్మి ఏ సంస్థ అయినా కీలక, నాయకత్వ బాధ్యతలు అప్పగించగలదా? విశ్వసనీయత, విలువల్లేని ఆమెను ఎలా విశ్వసించ గలరు? తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా మేఘా తీరు ఉందన్నది వాస్తవం. భారతీయ మూలాలున్న ఆమె, బాంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలపై జరిగిన మారణకాండ గురించి ఎందుకు మాట్లాడ లేదో ఆ విశ్లేషకుడు చెప్పగలడా? ఆ వామపక్ష విశ్లేష కుడి వంటి వారు తప్ప ఇతరులెవరూ మేఘను సమర్ధించరు. శభాష్ శర్మిష్ట అని మరోసారి అనాల్సిందే!
చివరి మాట…
ఇంతకీ శర్మిష్టపై కేసు పెట్టిన వజహత్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హిందువులను, హిందూ దేవతలను అసభ్యపదజాలంతో దూషిస్తూ అతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని కోల్కతా పోలీసులకు శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ ఫిర్యాదు చేసింది. 1500 కిలోమీటర్లు వెళ్లి శర్మిష్టను అరెస్టు చేసిన కోల్కతా పోలీసులకు వజహత్ఖాన్ కనిపించడం లేదట. అతనిపై మూడు రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయి. మరి వజహత్ఖాన్ గురించి మాట్లాడతారా ఈ పక్షవాత విశ్లేషకులు! తప్పని చెబుతారో.. చట్టం తన పని తాను చేస్తుందంటారో!
హేమచందర్ కొలిపాక
సీనియర్ జర్నలిస్ట్,