అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పదునైన ఆయుధాలు, మన త్రివిధ దళాల అత్యాధునిక శిక్షణ, అంకితభావం అన్నీ కలసి నేడు భరతమాతను నాలుగవ అత్యంత శక్తిమంతమైన దేశంగా సగర్వంగా నిలిపాయి. పటిష్టమైన త్రివిధ సాయుధాల దళాలు మన స్వంతం. భారత మిలటరీలో 1.45 మిలియన్ల ఆక్టివ్ సైనికులు, 1.15 మిలియన్ల రిజస్వ్ రక్షణ బలగాలు, 2,229 ఏయిర్ క్రాఫ్టులు, 4,201 యుద్ధ ట్యాంకులు, స్వదేశీ తేస్/అర్జున్ లాంటి ‘మేక్ ఇన్ ఇండియా’ ట్యాంకులతో కూడిన ఆయుధ సంపత్తి, నిరంతరం దేశ రక్షణలో సిద్ధంగా ఉన్నాయి, భారతావనిని అభేద్యమైన దేశంగా నిలుపుతున్నాయి. అయినా కొన్ని పరిస్థితులను అనువుగా చేసుకుని పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్ను నాలుగున్నర దశాబ్దాలుగా ఇరకాటంలోకి నెడుతున్నది.
‘‘గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్-2025’’ ప్రకారం, 145 దేశాల మిలటరీ పవర్ ఆధార జాబితాలో భారత్ది 4వ స్థానంగా నిర్ణయించారు. రక్షణశాఖలో సుశిక్షితులైన త్రివిధ బలగాల సంఖ్య, అణ్యాయుధ సామర్థ్యం, స్వదేశీ ఆయుధ పరిజ్ఞానం, అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి, దేశ ఆర్థిక పరిస్థితి, సహజ భౌగోళిక స్థానం, రక్షణశాఖ బడ్జెట్, లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ సామర్థ్యం, అందుబాటులో ఉన్న విలువైన సహజ వనరులు లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్-2025ను రూపొందించారు. నేడు అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ అత్యంత బలమైన భద్రతా వ్యవస్థగా మన భారత్ నిలువగా సౌత్ కొరియా, యూకె, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇటలీ దేశాలు తొలి 10 స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉన్నది.
అతి తక్కువ మిలటరీ సగటు వయసు కలిగిన దేశంగా భారత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అత్యంత బలమైన ఆర్మీ, దేశ అధిక జనాభా, సాయుధ వాహనాలు, రహదారులు, బొగ్గు ఉత్పత్తి, లేబర్ ఫోర్స్ లాంటి వనరులు అత్యధికంగా కలిగిన 2వ దేశంగా భారత్ నిలబడింది. అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్ ధైర్యంగా నిలబడింది. మొబైల్ ఆర్టిలరీ ఫీల్డ్ గన్స్, నావల్ ఏయిర్ క్రాప్ట్ క్యారియర్స్ ఫ్లీట్ బలం, పర్చేజ్ పవర్ పారిటీల్లో 3వ స్థానంలో భారత్ నిలుస్తున్నది. మొత్తం మిలటరీ ఏయిర్ క్రాఫ్టులు, ఫైటర్ ఏయిర్ క్రాఫ్టులు, ట్రాన్స్పోర్ట్ ఏయిర్ క్రాఫ్టులు, హెలీకాప్టర్లు, నావల్ వార్షిప్ డిస్ట్రాయర్లు, టోటల్ రైల్వే కవరేజ్, డిఫెన్స్ బడ్జెట్ రంగాల్లో ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో ఉన్నది మన భారత్.
భారత ఆర్మీలో 21 లక్షల సైనికులు/సిబ్బంది, ఏయిర్ ఫోర్స్లో 2 లక్షలు, నానికా దళంలో 1.42 లక్షల సైనికులు ఉన్నారు. ఈ త్రివిధ దళాలకు తోడుగా బలమైన పారామిలటరీ బలగాలు కూడా ఎల్లవేళల సిద్ధంగా ఉన్నాయి. భారత అమ్ముల పొదిలో 5000 కిమీ రేంజ్ కలిగిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మెయైల్స్, సబ్-మెరైన్ బాలిస్టిక్ మెసైల్స్, ఏయిర్-లాంచ్ క్రూజ్ మెసైల్స్, అత్యంత బలమైన అగ్ని-5 మిసైల్స్ లాంటివి మన దేశ రక్షణ బలాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. క్షిపణి వ్యవస్థలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్, 5వ తరం అస్త్రా ఏయిర్-టు-ఏయిర్ మిసైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఏయిర్ ఆకాష్ మెయైల్స్ లాంటివి భారత రక్షణ శక్తిని మరింత పెంచుతున్నాయి. మన వైమానిక దళంలో ఏయిర్-టు-ఏయిర్/ఏయిర్-టు-సర్ఫేస్ సుఖోయ్ ఫైటర్ ఏయిర్ క్రాఫ్టులు, 300 కిమీ రేంజ్ కలిగిన రఫేల్ ఫైటర్ జెట్లు మన వైమానిక భద్రతకు రక్షణ కల్పిస్తున్నాయి.
భారత నావికా దళంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఏయిర్ క్రాప్ట్ క్యారియర్, ఐఎన్ఎస్ కోల్కతా డిస్ట్రాయర్, అత్యాధునిక హెవీ వెయిట్ వరుణాస్్ర టార్పెడో లాంటివి నావికాదళం చేతుల్లో ఉన్నాయి. మన భూతల యుద్ధ క్షేత్రంలో అర్జున్ బ్యాటిల్ ట్యాంకులు, పినాకా రాకెట్ లాంచర్లు, ధనుష్ ఆర్టిలరీ హొవిడ్జర్, అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, నాగ్ మెసైల్ క్యారియర్, పి-8ఐ నెప్ట్యూన్, టి-90ఎస్ భీష్మా, ఫాల్కన్ ఎవాక్స్ హెచ్చరిక వ్యవస్థ, ఐఎన్ఎస్ చక్రా లాంటివి మన త్రివిధ దళాల శక్తిని మరింతగా పెంచుతున్నాయి. వీటికి తోడుగా సర్ఫేస్-టు-ఏయిర్ లాంగ్ రేంజ్ ఏయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన ప్రతిష్టాత్మక ఎస్-400 రక్షణ వ్యవస్థ మనకు బలీయమైన రక్షణగా నిలుస్తున్నది. భారత ఆర్మీ జవానుల చేతుల్లో అత్యాధునిక 9ఎంఎం ఆటో పిస్టల్, ఏకె-203, విధ్వాంసక్ రైఫిల్, 12 బోర్ గన్స్, ఇన్సాస్ రైఫిల్, 7.62ఎంఎం మెషిన్ గన్స్ లాంటివి కూడా మన జవానుల బలానికి తోడుగా నిలవడం జరుగుతోంది.
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఏయిర్ ఫోర్స్, ఇండియన్ నావల్ సర్వీసులు శక్తిమంతమైన ఆయుధాలను, డిఫెన్స్ వ్యవస్థలను కలిగి సైనిక సంఖ్యలో అత్యధిక శక్తివంతమైన దేశంగా నేడు భారత్ ప్రపంచ దేశాల ముందు సగర్వంగా, ఆయుధాలు చేత పట్టుకొని, తలెతుకొని, విజయ దరహాసంతో ధైర్యంగా నిలబడుతున్నది. ఆపరేషన్ సిందూర్ 2.0 తర్వాత పూర్తి స్థాయి యుద్ధమే జరిగితే కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజుల్లో పాకిస్తాన్ నేలమట్టం కావడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం ఖాయమని మన త్రివిధ దళాల బలాలు రుజువు చేస్తున్నాయి.
ఆయుధ సంపత్తి విషయంలో పాకిస్తాన్కూ, భారత్కూ హస్తిమశకాంతరం. కానీ పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదమే ఆయుధంతో భారత్ను ఇరకాటంలో పడవేస్తున్నది. దీని వెనుక కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచ రాజకీయాలు, సమీకరణాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. అయినా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంది. భారతదేశాన్ని ఏలిన ఉదారవాద, సెక్యులర్ పార్టీ అండతో ఇది వీరంగం వేస్తూనే ఉంది. నిజానికి పాక్ను ఏకాకిని చేయడం అంటే, అది పెంచి పోషిస్తున్న ముస్లిం ఉగ్రవాదం ఇస్లాంకే ఎంత చేటు చేస్తున్నదో చెప్పడం. ఆ విషయంలో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి పులి మీద స్వారీలా ఉన్నది. అది ఉగ్రవాదం అనే ఆ పులిని దిగలేదు. పాకిస్తాన్ను పాలించదలచిన ఏ నాయకుడైనా కశ్మీర్ కేంద్ర బిందువుగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బలపరచవల సిందే. కాబట్టి పాక్కు బుద్ధి చెబితే ఇస్లామిక్ ఉగ్రవాదం చతికిలపడుతుంది.
ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. అకారణ చట్టవ్యతిరేక హింసాత్మక, ప్రమాదకర, విధ్వంసక ఘటనలకు పాల్పడి ప్రజల్లో భయాం దోళనలా కల్పించడాన్ని ఉగ్రవాదం అని పిలుస్తాం. అగ్రరాజ్యం అమెరికా నుంచి నిరుపేద దేశాల వరకు అంతటా ఉగ్రవాద దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మానవీయతను మట్టుపెట్టడమే ఉగ్రవాదుల లక్ష్యం. అశాంతి రేపడమే వారి అభిమతం. ఉగ్రవాదం అంటేనే విధ్వంసం, వినాశనమని ఉగ్ర మూర్కులు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా 2023లో 21,596 మంది, 2022లో 21,957 మంది, 2021లో 23,712 మంది, 2020లో 29,326 మంది, 2019లో 26,273 మంది, 2018లో 32,864 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తం అయ్యిందని గత హింసాత్మక చరిత్ర రుజువు చేస్తున్నది. అన్ని దేశాలు ఉగ్ర కోరల్లో చిక్కి విలవిల్లాడడం చూస్తున్నాం. గత శతాబ్ద కాలంలో జరిగిన పలు ముఖ్య ఉగ్ర దాడుల వివరాలను చూస్తే ఉగ్ర విషకోరలు ఎంత ప్రమాద కరమో అవగతం అవుతుంది. 1920లో న్యూయార్క్ వాల్ స్ట్రీట్ ఉగ్రదాడుల్లో 40 మంది, 1946లో జెరూసలెం బాంబు దాడుల్లో 91 మంది, 1961లో పార్సియన్ గల్ఫ్లో 238 మంది, 1978లో ఇరాన్ సినిమా రెక్స్ ఫైర్ఫాక్స్ 470 మంది, 1983లో బీరూట్ లెబనాన్లో 307 మంది, 1988లో స్కాట్లాండ్లో 270 మంది, 1992లో అర్జంటీ నాలో 242 మంది మరణించారు. 1993లో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ఆరుగురు మరణించగా 1,042 మంది గాయపడ్డారు, 1994లో రువాండాలో 1,139 మంది, 1997లో అల్జీరియాలో జరిగిన వివిధ దాడుల్లో 1200లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998లో టాంజానియాలో 224 మంది, 1999లో రష్యాలో 307 మంది అమాయకులు ఉగ్రవాదుల దాడుల్లో కన్ను మూశారు. 2001లో ఆంగోలాలో 252 మంది, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన అల్ కాయిదా దాడుల్లో 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002లో ఇండోనేషియాలో 204 మంది, 2007లో ఇరాక్లో 796 మంది 2014లో ఇరాక్లో 1,700 మంది, 2014లో ఇరాక్లో 953 మంది, 2017లో అఫ్ఘానిస్తాన్ కారు బాంబు దాడుల్లో 150 మంది, 2019లో శ్రీలంకలో 259 మంది, 2020లో ఇథియోపియా 766 మంది, 2022లో నైజీరియాలో 200 మంది, 2023లో పాకిస్థాన్లో 101 మంది, 2023లో ఇజ్రాయిల్లో 1,207 మంది, 2024లో ఇరాన్లో 105 మంది, 2025లో అమెరికాలో 15 మంది, 2025లో భారత్లో 26 మంది అమాయకులు లేదా భద్రతా దళాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో నిండు ప్రాణాలు కోల్పోయారు.
ఇస్లామిక్ ఉగ్రవాదానికి గురై తీవ్రంగా నష్టపోయిన దేశం భారత్. మన దేశ చరిత్రలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు సర్వసాధారణం అయ్యాయి. భారత్లో 2007 నుంచి 2017 వరకు ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన 12,002 దాడుల్లో 19,866 మంది అమాయకులు లేదా భద్రతా దళాలు మరణించగా, 30,544 మంది గాయపడ్డారు. భారత్లో ఉగ్రవాదులు జరిపిన ముఖ్యమైన దాడుల్లో 1993లో జరిగిన ముంబాయి దాడుల్లో 257 మంది, 2001లో పార్లమెంట్పై దాడిలో ఐదుగురు, 2006లో జరిగిన ముంబాయి రైలు దాడుల్లో 209 మంది, 2008 ముంబాయి బాంబు దాడుల్లో 166 మంది, 2016 జమ్ముకశ్మీర్ ఊరి దాడుల్లో 19 మంది సైనికులు, 2019 పుల్వామా దాడుల ఘటనలో 40 మంది సైనికులు, 22 ఏప్రిల్ 2025 పెహల్గావ్ దాడుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పెహల్గావ్ దుర్ఘటన తర్వాత ఇక ఏ చిన్న ఉగ్రదాడులూ భారత్లో జరిగినా, దానిని యుద్ధంగా భావిస్తామని భారత్ పేర్కొనడం సముచితం. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించా ల్సిందే. ఉగ్రవాదుల్ని నిర్దయగా అంతం చేయాల్సిందే.
అభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తున్న ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ, ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేస్తూ, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో దౌత్య సంబంధాలను తుంచుకొని కఠిన చర్యలు తీసుకోవలసిందే.
భారత 6వ ప్రధాని రాజీవ్ గాంధీని 21 మే 1991న తమిళనాడు, శ్రీపెరంబుదూర్ నగరంలో ఉగ్ర దళాల బెల్ట్ బాంబులు దాడుల్లో మరణించడం మనకు తెలుసు. ఈ దుర్ఘటనకు గుర్తుగా ప్రతి ఏట 21 మే రోజున దేశవ్యాప్తంగా ‘‘జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినం’’ లేదా ‘‘నేషనల్ ఆంటీ-టెర్రరిజమ్ డే’’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఉగ్రవాద దుష్ప్రభావాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతకు శాంతియుత సన్మార్గం చూపడం, ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించడం, ఉగ్రవాదంపై సదస్సులు/చర్చలు/విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, ప్రపంచ శాంతి/ఐక్యత/మతసామ రస్యాలను నెలకొల్పడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2025 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం ఇతివృత్తంగా ‘‘ఉగ్రవాదం వద్దు, శాంతి సహజీవనమే ముద్దు’’ అనే నినాదాన్ని తీసుకోవడం జరిగింది.
నేటి యువత దృష్టిని ఉగ్రవాదం నుంచి దూరం చేయడం, వారిలో దేశభక్తిని రగల్చడం, జాతీయ సమైక్యత ప్రయోజనాలను వివరించడం, ప్రేమ పునాదిగా పౌర సమాజం ముందుకు సాగడం, ఉగ్ర దాడుల్లో గాయపడిన వారికి ఆపన్నహస్తం అందిం చడం, శాంతియుత సహజీవనానికి రాచబాటలు వేయడం ప్రస్తుత కర్తవ్యంగా భావించాలి. ఉగ్ర వాదాన్ని మట్టుబెట్టి, మానవీయతను ఆలింగనం చేసు కుందాం.
‘‘సే నో టు టెర్రరిజం : సే ఎస్ టు పీస్’’
కెప్టెన్: డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
ఎన్సిసి కంపెనీ కమాండర్ (రి)