కాలమాన, పరిస్థితులకు తగ్గట్టుగా మానవ జీవనశైలి ఎలా మారుతూ ఉంటుందో ప్రపంచానికి పెద్ద చీడలా పట్టిన టెర్రరిజమ్ కూడా అలా తన రూపాన్ని మార్చుకుంటూ విధ్వంసానికి కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి దారుణమైన ఒకటి ఆగ్రో టెర్రరిజమ్. రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేయడానికి ప్రయత్నిస్తున్న ఆగ్రో టెర్రరిజమ్ ఆనవాళ్లు ఇటీవల అమెరికాలో ఇద్దరు చైనీయుల అరెస్టుతో వెలుగులోకి వచ్చాయి.
ఇద్దరిలో ఒకడైన జున్యోంగ్ అనే దుర్మార్గుడు చైనాలో పరిశోధకుడు. మరొకరు యున్కింగ్ జియాన్ అనే అతడి స్నేహితురాలు మిచిగాన్ యూనివర్శిటీ ల్యాబరేటరీలో పనిచేస్తోంది. వీరిద్దరూ చైనీస్ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. అతడేమో పంటపొలాలను పాడుచేసే ఒక విషపూరిత మైన ఫంగస్ను చైనా నుంచి అమెరికాకు అక్రమంగా తీసుకొని వచ్చాడు. యూని వర్శిటీ ల్యాబరేటరీలో ఆ ఫంగస్పై ప్రయో గాలు చేయాలనేది ఉభయుల ప్రణాళిక. అయితే వారి ప్రణాళికను జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణించిన ట్రంప్ అధికార యంత్రాంగం ఇద్దరినీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరెస్టు చేసింది. వారి నుంచి ఫంగస్ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఫంగస్పై పరిశోధనలు జరపడానికిగాను చైనా ప్రభుత్వం ఆ జంటకు భారీగా నిధులు ముట్టచెప్పిందనేది అమెరికా అధికారులు అభియోగం. ఇంతటి ప్రమాదకరమైన ఫంగస్ పేరు ఫసరియిమ్ గ్రమినెరుమ్. అమెరికా దాన్ని ఆగ్రో టెర్రరి జానికి ఊతమిచ్చే ఒక ఆయుధంగా వర్గీకరించింది. ఇది గోధుమ, బార్లీ,మొక్కజొన్న, వరి లాంటి పంటలను తుడిచి పెట్టేస్తుంది. ఈ ఫంగస్ కనుక ఆహారం రూపంలో మనుష్యులు తీసుకున్న పక్షంలో వాంతులు, కాలేయం దెబ్బతినడం జరుగుతుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అంతేకాకుండా వ్యవసాయంపైన ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి దేశాలపై ఈ ఆగ్రో టెర్రరిజమ్ పడగ నీడ ఇప్పటికే పడిందని కొన్ని పరిశోధనా పత్రాలు వెల్లడించాయి.
చట్టాలకు చిక్కని ఆగ్రో టెర్రరిజమ్
క్రిమికారకాలను ప్రయోగించి, పంటపొలాలను ఆయుధాలను మార్చి, పంటలను నామరూపాల్లే కుండా చేయడాన్ని ఆగ్రో టెర్రరిజమ్ అంటారు. ఇది వ్యవసాయాధారిత దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తుంది. దీని లక్ష్యం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆయా దేశాల్లో అనిశ్చితి సృష్టించడం. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని దీన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఆగ్రో టెర్రరిజానికి బోలెడన్ని అనుకూలతలు ఉన్నాయి. ఇది మనుషులు నేరుగా చేసేది కాదు. లక్ష్యం మనుష్యులు అంతకన్నా కాదు. కనుక పంటలు లాంటి మానవరహిత లక్ష్యాలపై జరిగే జీవాయుధ దాడులపై శిక్షలు విధించడానికి అంతర్జాతీయంగా ఇప్పటిదాకా ఎలాంటి చట్టాలు లేవు. దీంతో ఆగ్రో టెర్రరిమ్ సూత్రధారుల అరాచకాలకు అద్దూ అదుపూ లేకుండా పోతోంది.
జపాన్పై అణుబాంబు బదులుగా..
పంటలపై లేదా వ్యవసాయ ఉత్పత్తులపై జీవ ఆయుధాలను ప్రయోగించాలనే ఆలోచన కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్లో బంగాళాదుంప పంటలు లక్ష్యంగా కొలొరాడో బంగాళాదుంప కీచురాళ్లను జర్మనీ ప్రయోగిచింది. అలా ప్రయోగించిన కీచురాళ్లను 1943లో ఇంగ్లండ్లో కనుగొన్నారు. వాటిని విమానాల ద్వారా పంటపొలాల మీదకు విడిచిపెట్టినట్టు తేలింది. జపాన్ కూడా జర్మనీ లాగానే ఆలోచించింది. యుద్ధం కొనసాగే పక్షంలో అమెరికా, సోవియట్ యూనియన్లలో గోధుమ పంటపై దాడికి ఆగ్రో టెర్రరిజాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన జపాన్ చేసిందని మోస్టాగనేమ్ యూనివర్శిటీ వెలువరించిన ఓ పరిశోధనాపత్రం వెల్లడించింది. అలాగని అమెరికా ఏమీ తక్కువ తినలేదు. జపాన్లో వరిపంటను నాశనం చేయడానికి 30 టన్నులకుపైగా విషపూరితమైన ఫంగస్ను పోగు చేసుకుంది. అయితే చివరకు ఆగ్రో టెర్రరిజాన్ని కాదనుకొని జపాన్పై అణుబాంబును ప్రయోగించడానికే అమెరికా మొగ్గు చూపిందని యూనివర్శిటీ పరిశోధనా పత్రం వెల్లడించింది.
భారత్కూ తప్పలేదు
భారతదేశ జీడీపీలో దాదాపు 17 శాతానికి వ్యవసాయరంగం దోహదపడుతుంది. 2011నాటి జనగణన ప్రకారం దేశజనాభాలో 55 శాతం వ్యవసాయం, దాని అనుబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి పంజాబ్, రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కీలకమైనవి. ఇవి మన పొడ అంటే ఏ మాత్రం పడని పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. దీంతో ఆగ్రో టెర్రరిజమ్ తాలూకు ముప్పు కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది 2016లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్డీవో వెలువరించిన ఒక పరిశోధనాపత్రం ముప్పును, దాని విపరిణా మాలను వెల్లడించింది. పత్రం ప్రకారం బాంగ్లా దేశ్లో కనుగొన్న ఓ విషపూరితమైన ఫంగస్ పశ్చిమబెంగాల్లోని రెండు జిల్లాల్లో బైటపడింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్త మయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మూడేళ్లపాటు గోధుమ పంట సాగును నిషేధించాయి. తద్వారా గోధుమ పంటకు చేటు చేసే బాంగ్లాదేశ్ ఫంగస్ వ్యాప్తిని నిరోధించాయి.
అక్కడితో ఆగకుండా పొరుగుదేశానికి ఆనుకొని అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కి.మీ.ల పరిధిలో ఉన్న ఇతర జిల్లాల్లో కూడా గోధుమ పంట సాగుపై నిషేధం విధించాయి. అదే విధంగా 2015లో ఒకానొక వైరస్ పాకిస్తాన్లో పత్తిపంటను పెద్ద ఎత్తున నాశనం చేసింది. అది దక్షిణ పంజాబ్లో పెద్ద ఎత్తున తెల్లదోమ వ్యాప్తి చెందడానికి దారి తీసింది. దీంతో రెండింట మూడు వంతుల పంట దెబ్బ తింది. ఆ కారణంగా నష్టం 63 కోట్ల డాలర్ల నుంచి 67 కోట్ల డాలర్ల మధ్య వచ్చింది. కనీసం 15 మంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని డీఆర్డీవో పరిశోధనా పత్రం పేర్కొంది. ఇంత భారీగా నష్టపరిచిన వైరస్ ఆనవాళ్లు భారత్లో మునుపెన్నడూ లేవని దర్యాప్తులో తేలింది. అయితే వాటి మూలాలు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్నాయి. అక్కడి వెహారి, ముల్తాన్లలో రెండు పత్తి పంట పరిశోధనా సంస్థలకు ఈ వైరస్ కోసమని ప్రయోగాత్మకంగా పత్తి మొక్కలను పెంచుతున్నారని నిరూపితమైంది.
– జాగృతి డెస్క్