ప్రపంచ సుందరిమణుల పోటీలు హైదరాబాద్లో మే 7వ తేదీ నుంచి మే 31 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. 108 దేశాలకు చెందిన అందాల భామలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. అంతేనా? అంటే.. వాస్తవానికి కూడా అంతే అన్నట్లుగా నడిచింది.రూ. వేల కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగమంతా దాదాపు నెల రోజుల పాటు ఈ పోటీలకు సంబంధించిన టాస్క్లలోనే నిమగ్నమైపోయారు. ఎవరేం చేశారంటే అరకొర సమాధానాలే తప్పితే.. ఈ సువర్ణావకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారా? అంటే.. కాదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. •ఈ పోటీలు ప్రభుత్వానికి పెనుభారంగా మారాయే తప్ప చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనం కలిగిందా? అంటే.. సాక్షాత్తూ ప్రభుత్వంలోని వారే మనస్ఫూర్తిగా అంగీకరించలేని పరిస్థితి. పైగా మొదటినుంచీ పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరమైన అంశంలోనూ విదేశంలోని కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్యత ఎదురవుతోంది. ఈ పోటీల్లో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందా? లేదంటే రన్నరప్గా నిలిచిందా? కాదంటే చతికిల పడిందా? అన్న విశ్లేషణ తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్లో మిస్ ఇండియా పోటీలు జరుగుతున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్లో ఓ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసింది. ‘‘దేశం అంతా యుద్ధ వాతావరణం… కానీ నయా నీరో రేవంత్ మాత్రం మిస్ వరల్డ్ అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడు! సిగ్గు! సిగ్గు!!’’ అనేది ఆ ట్వీట్ సారాంశం. దానికో డిజైన్డ్ ఇమేజ్ జత చేశారు. పైన యుద్ధం డిజైన్, కింద మిస్ వరల్డ్ పోస్టర్. మధ్యలో ఫిడేల్తో రేవంత్ రెడ్డి. ఓ పక్క భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో అలజడి జరుగుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రోమ్ నగరం తగులబడు తుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న లొసుగు దొరికినా సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తోన్న బీఆర్ఎస్ పార్టీ మిస్వరల్డ్ పోటీల ప్రారంభంలోనే ఈ ప్రచారం మొదలెట్టింది. వాస్తవానికి బీఆర్ఎస్ చేసిన ఈ పోలిక సరిగ్గా అతకలేదు. సర్కారుపై నిందలు వేయాలన్న ఆత్రుత తప్పితే అందులో సారం లేదన్నది మామూలుగానే నెటిజన్లకు అర్థమైపోయింది. అధికారం కోల్పోయి నప్పటినుంచీ బీఆర్ఎస్లో అసహనం పెరిగిపోయింది. పార్టీ ముఖ్యనేతలు తమ అసహనాన్ని సోషల్ మీడియా టీమ్లతో జనాల్లోకి వదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంత దీటుగా కాకపోయినా అడపా దడపా తమ సోషల్ మీడియా టీమ్లను ఉసిగొల్పుతోంది.
ఖర్చులో సగం – ఆదాయంలో ఎగనామం :
72వ మిస్వరల్డ్ పోటీల కోసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పోటీల నిర్వహణ చివరిదశకు వచ్చే నాటికి రూ.57 కోట్లుగా ప్రకటించింది. ఈ మొత్తంలోనూ మిస్ వరల్డ్ సంస్థ సగం భరిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ పోటీలకు సంబంధించి వచ్చిన ఆదాయం మొత్తం ఆ సంస్థకే చెందుతుంది. ఆదాయం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఇవ్వడం లేదని ఆ సంస్థ చెబుతోంది. అంటే.. ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఇటువైపు మరలిన దశలో నిర్వహణ ఖర్చుల కంటే పలు రెట్లు ఎక్కువగా ఆదాయం సమకూరు తుందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం కోణంలో చూస్తే.. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించేందుకే ఖజానాలో డబ్బు లేదని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి అందాల పోటీల నిర్వహణకు మాత్రం రూ. కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తీవ్రస్థాయిలో నిరసన ఎదురయ్యింది. మరోవైపు చూస్తే.. ఈ పోటీలపై రాజకీయ రచ్చ నడిచింది. రాష్ట్రం అప్పుల్లో అల్లాడుతుంటే అందాల పోటీల కోసం రూ.కోట్లు ఖర్చు అవసరమా? అని విపక్షాలు నిలదీశాయి.
ఈ పోటీలను కవర్ చేసేందుకు దాదాపు 3 వేల మంది ప్రపంచ మీడియా ప్రతినిధులు హాజరయ్యారని చెబుతున్నారు. దేశ విదేశాల నుంచి హాజరైన ప్రముఖులు, అతిథులు, అందగత్తెలకు శంషాబాద్ విమానాశ్రయంలోనే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగతం పలికారు. పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమై, హైటెక్స్లో ముగింపు వేడుకలు జరిగాయి. పోటీదారులు రాష్ట్రంలోని పలు చారిత్రక, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల సందర్శనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ బుద్ధవనం, హైదరాబాద్ చార్మినార్లో హెరిటేజ్ వాక్, లాడ్ బజార్లో షాపింగ్, యునెస్కో గుర్తింపు పొందిన యదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత గ్రామ, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, వరంగల్ వేయిస్తంభాల గుడి, కాకతీయుల కోట, మహబూబ్నగర్ పిల్లలమర్రి, హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన, తెలంగాణ సచివాలయంలో డ్రోన్ షో వీక్షణ వంటి పలు కార్యక్రమాలను రూపొందించారు. ‘ఈ పోటీల నిర్వహణను పూర్తిస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే వేదికగా మార్చుకుంటాం. అందుకే ప్రత్యేకంగా పర్యటనలు ఏర్పాటు చేశాం. ప్రధానంగా విదేశీ సంస్థలు, ప్రముఖులు, ప్రతినిధుల ముందు ప్రదర్శనలతో తెలంగాణ వైభవాన్ని, ఘనతను చాటి, పెట్టుబడులకు గల అవకాశాలను వాళ్ల మనస్సుల్లోకి చొప్పించగలుగుతాం’ అని ప్రభుత్వం ప్రకటనలు చేసింది.
అధికారుల అలసత్వం?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిస్ వరల్డ్ పోటీల్లో ప్రభుత్వ పెద్దలు ఆశించిన రీతిలో కార్యాచరణలేదని అంతర్గత పరిణామాలను బట్టి తెలుస్తోంది. అనుకున్న రీతిలో స్పాన్సర్షిప్లు రాబట్టడంలో పలువురు అధికారులు వైఫల్యం చెందారని ప్రభుత్వం భావించింది. అందుకే పోటీలు జరుగుతుండగానే పర్యాటక శాఖ నుంచి పలువురు అధికారులను బదిలీ చేసింది. పెట్టుబడులు ఆకర్షించడం, విదేశీ టూరిస్టులను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చేసిన సూచనలను కొందరు సరిగా పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిను స్పాన్సర్ల పట్ల ఒకరిద్దరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు భావించిన ప్రభుత్వం వారిపై వేటు వేసినట్లు చర్చ జరిగింది.
మిస్ ఇంగ్లండ్ ప్రకంపనలు
ఇక…మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ పెద్ద బాంబు పేల్చింది. చార్మినార్ వద్ద హెరిటేజ్వాక్, చౌమహల్లా ప్యాలస్లో డిన్నర్ తర్వాత మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ అర్థాంతరంగ పోటీల్లో నుంచి వైదొలిగింది. స్వదేశానికి వెళ్లిన తర్వాత ఊహించని ఆరోపణలు చేసింది. ఈ మిస్ వరల్డ్ పోటీలు అనాసక్తిగా ఉన్నాయని, పోటీదారులతో వ్యవహరించే ధోరణి అభ్యంతరకరంగా ఉందని, నిర్వాహకుల వైఖరి నచ్చలేదని, అందుకు పోటీల నుంచి తప్పుకున్నానని వ్యాఖ్యానించింది. మిస్ వరల్డ్ పోటీలలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ రాలేదని, అందుకే తాను పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. అల్పాహార సమయంలో, ప్రైవేటు ఈవెంట్స్ జరుగుతున్న సందర్భంలో డబ్బు, హోదా ఉన్న పురుషులు, స్పాన్సర్ మధ్య నిరంతరం మేకప్ మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి డ్రస్సులే వేసుకోవాలని చెప్పడం వేశ్యను తలపించేలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మిస్ వరల్డ్ నిర్వహణ, ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు యూకే ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపించింది. మిస్ వరల్డ్ పోటీల్లో ఈ పరిణామం అత్యంత వివాదాస్పదంగా నిలిచింది.
అయితే, ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలను వ్యాఖ్యలను నిర్వాహకులు ఖండించారు. తన తల్లి అనారోగ్యం అంటూ పోటీ మధ్యలోంచి తిరిగి వెళ్లిపోయిన మిల్లా మాగీ.. అక్కడికి వెళ్లిన తర్వాత అనుచిత ఆరోపణలు చేస్తోందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.
మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటైంది. సభ్యులు ముగ్గురు ప్రపంచ సుందరి పోటీదారులను వ్యక్తి•గతంగా కలసి, ‘పోటీలు జరిగే తీరుతో పాటు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరి నుంచైనా సమస్యలు ఎదురవుతున్నాయా?’ లాంటి వివరాలు సేకరించారు.
విచారణ పక్రియను వీడియోలుగా రికార్డు చేశారు. మిల్లా మాగీ ఆరోపించిన రోజు ఆమె పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు పాల్గొన్నారు? ఆరోజు ఆమెతో ఆ టేబుల్ దగ్గర కూర్చున్నవాళ్లు ఎవరు? తదితర పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మిల్లా మాగీ ఆరోపణలు వాస్తవం కాదని విచారణ బృందం ప్రభుత్వానికి నివేదించింది.
రామప్ప వద్ద వివాదం:
రామప్ప దేవాలయం సందర్శన సమయంలోనూ నిర్వాహకుల తీరుపై వివాదం చెలరేగింది. ప్రపంచ సుందరి పోటీదారులు రామప్ప దేవాలయం సందర్శించిన సమయంలో కాళ్లు కడుక్కునేందుకు ఇత్తడి చెంబు ఇచ్చారు. అయితే, ఒక వీడియోలో ఓ యువతి.. మిస్ వరల్డ్ పోటీదారు కాళ్లు నాప్కిన్తో తుడిచిన దృశ్యం వైరల్ అయ్యింది. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించంతో పాటు సోషల్ మీడియాలో విమర్శించింది. నెటిజన్లు కూడా మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హీనమైన చర్య. యావత్ మహిళా లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అంటూ పోస్టులు చేశారు. అయితే, ఈ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాస్తవానికి మే 14వ తేదీన కొందరు పోటీదారులను పోచంపల్లికి, మరికొందరిని వరంగల్ వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప గుడికి తీసుకెళ్లారు. వరంగల్ లో రెండు జట్లుగా విడదీసి వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయానికి తీసుకెళ్లారు. వీరంతా సంప్రదాయ చీరకట్టులో వెళ్లారు. రామప్ప, వేయి స్తంభాల ఆలయాలకు వెళ్లిన సమయంలో నీళ్లతో కాళ్లు కడుక్కునేందుకు ఇత్తడి పళ్లెం, చెంబు వంటి ఏర్పాట్లు చేశారు. గైడ్ ఇస్తున్న సూచనలకు అనుగుణంగా పోటీదారులు కాళ్లు కడుక్కుంటూ, ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. ఈ సమయంలో కొందరు చెంబులో నీళ్లతో ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూస్తూ కనిపించారు. ఇంకొందరు తోటి వారిని చూస్తూ కాళ్లు కడుక్కున్నారు. అయితే, స్థానిక మహిళా వలంటీర్లు కొందరు పోటీదారుల పాదాలపై చెంబుతో నీళ్లు పోస్తూ కనిపించారు. రామప్ప ఆలయ సంఘటనలో ఆ వాలంటీర్ ఉత్సాహం మినహా స్థానికులతో అంద గత్తెల కాళ్లు కడిగించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రపంచ సుందరి పోటీలు రాష్ట్రానికి అంతర్జా తీయ గుర్తింపును తెచ్చిపెట్టాయంటోంది ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించామని, పెట్టుబడులు కూడా రాబోతున్నాయని చెబుతోంది. పోటీలను పురస్కరించుకొని హైదరాబాద్లో హోటళ్లు, రవాణా రంగం కిటకిటలాడాయి. నగర సుందరీ కరణ, నగరం రోడ్ల మీద పెయింటింగ్లు, కళా ఖండాల రూపకల్పన, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లకు ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేసింది. అదే సమయంలో చాలా సంక్షేమ పథకాలకు సంబం ధించిన చెల్లింపులు లబ్ధిదారులకు చేరకపోవడం, ఇటు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు పెద్దమొత్తంలో ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు చేయడం విమర్శలకు దారి తీసింది.
సుజాత గోపగోని,
సీనియర్ జర్నలిస్ట్, 6302164068