జూన్‌ 4 – పీడిత బాల్యానికి స్వేచ్ఛ దినోత్సవం

తెలుగునాట ఒక ఊళ్లో ఏడాది కిందట

ఎనిమిదేళ్ల బాలికను బలాత్కరించాడు ఓ దుర్మార్గుడు!

ఫిర్యాదు చేసేందుకు ఆ బాధిత కుటుంబం పోలీసు ఠాణాకు వెళ్తే

‘ఎలా తెలుసు? కళ్లు లేవు కదా!’ అన్నారు అక్కడి అధికారులు!!

ఇందులో – పీడిత ఆ అమ్మాయి అయితే

పీడకుడు ఆ ఒక్కడు కాదు; ఆ అన్నవాళ్లతో కలిపి అంతా పీడకులే!

న్యాయం చేసేదెవరు? ధర్మం ఎటు పోయింది? చట్టం ఇంకెక్కడుంది? బాలలు అంటే బాలురు, బాలికలు.

జాతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా వారి కోసం ఉత్సవాలు. దిన, వార, పక్ష, మాస, వార్షికం పేరిట ఎన్నెన్నో నిర్వహణలు.

జూన్‌ నాలుగున : పీడిత బాలలను స్వేచ్ఛాఛత్రంలోకి తెచ్చే దినోత్సవం. అలా తెచ్చేదెవరు? ముక్కుపచ్చలారని పిల్లల జీవితాల్ని కర్కశంగా కబళించే హింసోన్మాదుల తాటతీసి ఊరి గుమ్మానికి కట్టే గండర గండ వ్యవస్థ ఎక్కడుంది?

అదిలింపులు, బెదిరింపులు, నానా రకాల వేధింపులు, దాడులు, అత్యాచారాలు, ఆపై క్రూర హత్యలు!

కర్ణాటకలో ఈ మధ్య ఒక బాలిక మీద ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నిందితుల్లో ఒకడు పోలీసు అధికారి కుమారుడు.

మరో ప్రాంతంలోని బస్టాండు ఆవరణలో ఓ దుండగుడు మానసిక అస్వస్థురాలిపైన లైంగిక దాడికి దిగాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల సమీపంలో ఒక అమ్మాయిపై అత్యాచారం, గొంతు నులిమి చంపి, ఆ మృతదేహాన్ని నది దగ్గరికి తరలించి, తాడుతో రాయికి కట్టి, నీళ్లలోకి విసిరేశారు కరడు గట్టిన నేరగాళ్లు.

తెలంగాణలోని మహానగరంలో చదువుకునేం దుకు నడిచి వెళ్తున్న బాలికను కొంతమంది పోకిరీలు అడ్డగించి దౌర్జన్యం చేశారు. బ్లేడ్‌లతో విరుచుకుపడిన వాళ్ల నుంచి ఏదోవిధంగా తప్పించుకున్న ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ప్రాణాల్ని కాపాడుకుంది.

ఈ కొన్ని సంఘటనలు మనకు ఏం చెప్తున్నాయి?

సమాజంలో పీడన ఎన్నో విధాలు. ఇంటా బయటా ఆడపిల్లలకు రక్షణ కరవు. పీడిరచేవాళ్లలో పెద్ద వయస్కులు, కొందరు సాటి బాలురూ ఉంటు న్నారు. శారీరక, మానసిక వైకల్యమున్న బాలికల పరిస్థితి నానాటికీ దయనీయం. పీడన ఎక్కడ ఏ రూపంలో ఎదురవుతుందో కనీసం ఊహించలేక పోతున్నాం.

పోలీసుల్లో కొందరి తీరు పీడనను విస్తరింప చేస్తోంది. వాళ్ల ఉదాసీనం, లెక్కలేనితనం, స్పందన రాహిత్యం పీడితుల్ని మరింత హింసిస్తోంది.

నేరానికి తగిన శిక్షలు పడటమనేది ఎప్పుడో కానీ జరగని వైనం.

పగలూ, రాత్రీ అని లేకుండా, లోపలా వెలుపలా అని కాకుండా, నడి రోడ్డు మీదనే దురాగతాలకు దిగజారుతున్నారంటే – వాళ్లు మనిషి రూపమృగాలు. పరమ కఠోరంగా దండిస్తే తప్ప ఆ మదం అణగదు.

చట్టాలు తగినన్ని లేవా అంటే` ఉన్నాయి. ఉన్నవాటిని కఠినంగా అమలు చేసినా, పీడకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.

లైంగిక హింస నుంచి పిల్లలను కాపాడే చట్టం ఉంది. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌ (పోక్సో). మన దేశంలో ఈ చట్టం చేసి ఇప్పటికి పుష్కరకాలం దాటింది.

బాల్య వివాహాలు తెచ్చే అనర్థాలు అనేకం. బాలికలకు పలు సందర్భాల్లో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిలువరించడానికే దరిదాపు ఇరవైఏళ్ల కిందటి – బాల్య వివాహాల నిరోధక చట్టముంది.

పలు రూపాలు సంతరించుకున్న శిక్షాస్మృతి ఎలాగూ ఉంది మన దేశంలో. కొన్ని సెక్షన్లు ఇంకెంతో బలోపేతమయ్యాయి.

పని ప్రదేశాల్లో యువతులకు లైంగిక వేధింపులు ఎదురైనపుడు పరిరక్షణ కలిగించే చట్టం సరేసరి.

వీటితోడు ప్రత్యేక చట్టాలూ, నిబంధనలూ. ఫలానా నెంబరుకు ఫోన్‌చేస్తే తక్షణ స్పందన లభిస్తుందంటూ హెల్ప్‌లైన్లు.

ఇన్ని కట్టుదిట్టాలు ఉంటున్నప్పటికీ – జాతీయస్థాయిన ఉన్న బ్యూరో (నేర గణాంకాల నమోదు సంస్థ) ప్రకారం ఒక్క ఏడాదిలోనే 1,62,449 కేసులు నమోదయ్యాయి.

అంతర్జాతీయంగా చూస్తే – ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ లెక్కలు అనుసరించి దిగ్భ్రాంతికర వాస్తవాలు ఈ మధ్యనే బయటపడ్డాయి.

భారత్‌లో 10-14 నడుమ వయస్కుల్లో 10శాతం, 15-19 ఏళ్లలోపువారిలో 30శాతం ఆడపిల్లలు లైంగిక హింసకు గురవుతున్నారు.

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ` బాల్యంలో అత్యాచారం/ లైంగిక వేధింపుల బారిన పడిన అమ్మాయిల సంఖ్య లక్షల్లో. ఈ దారుణాలన్నీ మానవీయత అనే పదానికే పెను కళంకం తెస్తున్నా యని యునిసెఫ్‌ (ఆరంభంలో ఇది యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌. ఇప్పుడు స్థూలంగా ‘బాలల అత్యవసర నిధి’) నిరుడు తీవ్ర ఆందోళన ప్రకటించింది. పిల్లల సంరక్షణే తక్షణ లక్ష్యం కావాలని పిలుపునిచ్చింది అన్ని దేశాలకీ. చట్ట సంబంధ రక్షణ గురించి విశదీకరిస్తూ భారత చట్టాలను సవివరంగా ఉదాహరించింది.

స్వాతంత్య్ర అనంతరం నుంచి – 1956, 1961, 1971, 1984, 1986,1987,1997, 2005, 2013, 2018, 2022. ఈ సంవత్సరాల్లోని చట్టాలతోపాటు ప్రత్యేకించి మహిళా కమిషన్‌ ఏర్పాట్లు.

చట్ట నిబంధనలకు తోడు` ముందు జాగ్రత్త చర్యలతో పీడనను ఏ విధంగా నిరోధించవచ్చో యూరోపియన్‌ కమిషన్‌ విపులీకరించింది. పని ప్రదేశాల్లో హింస ఏ రూపంలో ఉన్నా అరికట్టేలా స్థానిక ఫిర్యాదు స్వీకరణ కమిటీలు కీలకపాత్ర వహిస్తాయంది.

భావోద్వేగపరంగానూ బాలికలను వేధించడం కొన్ని దేశాల్లో పరిపాటిగా మారింది. వారు అనుభవిస్తున్న వేదన, పడుతున్న పీడన నిజంగా అనూహ్యంగా ఉంటోంది!

యుద్ధ సమయాల్లో, అనంతర కాలంలో కూడా అధిక సంఖ్యలో బలవుతోంది పిల్లలే! యుద్ధ పీడిత ప్రదేశాల్లో ఎన్నెన్నో కారణాలలో కుటుంబాల నుంచి విడిపోవాల్సి వస్తోంది బాలికలు. సంఘర్షణలు, ప్రతీకార దాడులు, ఊహాతీత పరిణామాల మూలంగా ప్రధానంగా అమ్మాయిలు భవిష్యత్తును కోల్పోతున్నారని ఐరాస నివేదిక జూన్‌ నాలుగోతేదీన వెల్లడిచేసింది. అప్పటి నుంచీ సంవత్సరాల తరబడి ఏటా నిర్వర్తిస్తున్నారు ఈ విముక్త దినోత్సవాన్ని.

ఇదే తరుణంలో నాలుగు దశాబ్దాల నాటి లెబనాన్‌ యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. అప్పట్లో పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌, ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు భీకరంగా తలపడ్డాయి. అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిందీ, పీడనకు లోనైందీ అన్నెం పున్నెం తెలియని బాలలే! ఇది పెనువిషాదమంటూ జూన్‌ నాలుగునే తీర్మాన ప్రకటన చేసింది ‘సమితి’ సర్వప్రతినిధి సభ.

బాలలు, అందునా బాలికలకు సురక్షిత వాతావరణంలేని దేశాలు: పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, మొజాంబిక్‌, వియత్నాం, చైనా, నైజీరియాలతోపాటు మరికొన్ని.

రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణా మాలనూ గమనిద్దాం. అది ముగిసి ఇప్పటికి దశాబ్దాలు దాటింది. అప్పట్లో వనితలు, ముఖ్యంగా బాలికలపైన ఎన్నెన్ని అఘాయిత్యాలు! కొన్ని దేశాల ఆక్రమిత ప్రాంతాల్లో పరమ ఘోరాలు జరిగి పోయాయి. మొత్తం సమాజ వ్యవస్థే ఛిన్నాభిన్నంగా తయారైంది ఆనాడు.  ‘సంక్షుభిత వాతావరణంలోని ఏ పిల్లలైనా భయంకర  క్షోభతో తల్లడిల్లిపోతారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు నాడు యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరీన్‌.

ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, మరికొన్ని దేశాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా తయారయ్యాయి. వాటి దీర్ఘకాలిక ప్రభావాలు ఇప్పటికీ మనసునంతటినీ పీల్చి పిప్పి చేస్తూనే ఉన్నాయి.

దశాబ్దాలు దాటినా, సంవత్సరాలు గడుస్తున్నా, రోజులు పరుగులు తీస్తున్నా పీడకుల లక్షణాలు అవే! నిరసన తీవ్రతలు మటుకు ఎప్పటికప్పుడు పెల్లుబుకు తున్నాయి.

దేశీయంగా ఉదాహరణ మరొకటి : అది రాజస్థాన్‌. ఆ సంవత్సరం 1992. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే వందమంది అమ్మాయిలు సామూహిక అత్యాచారాలకు గురయ్యారన్న సమాచారం పెను సంచలనం రేపింది. అవి ` వివిధ సందర్భాలు. ప్రతిస్పందించిన ప్రభుత్వ యంత్రాంగం లోని శాఖలన్నీ రంగంలోకి దిగాయి. ఆ కుటిల నేరగాళ్లను పట్టుకునేందుకు అంతటా గాలించాయి. న్యాయవ్యవస్థా తన పాత్రను పరిపోషించింది.

మొత్తాన్నే జల్లెడపట్టారు. దుండగులను కటకటాల వెనక్కి నెట్టారు. తొమ్మిదిమందికి అత్యంత కఠిన శిక్ష విధించారు. నేరగాళ్లలో ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలినవాళ్లమీద విచారణ సాగుతూ వస్తోంది. దండన ఎలా ఉండాలి? వెన్నులో అణు వణువునూ వణికించాలి. న్యాయం ఎంత త్వరగా జరిగితే, పీడిత కుటుంబాలకు అంతటి ఊరట. పౌర సమాజం వేగంగా స్పందించి, సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ జాలు విదిల్చి కదం తొక్కితే – ఎంతటి ఘోర నేరమైనా తుత్తునియలవు తుంది. ఆడపిల్లను ఏడిపించాలన్న ఊహ రావా లంటేనే వాడి గుండె దడదడలాడిపోతుంది. అటువంటి న్యాయం, ధర్మం, చట్టం కావాలి ఎప్పుడూ.

వెంటనే ఫిర్యాదు చేయగలిగిన మానసిక స్థైర్యం, సార్వత్రిక సహకారం ఎప్పటికీ అత్యవసరమే. సంఘటనకు స్పందన, న్యాయవిచారణ, శిక్షల విధింపు, సామాజిక బహిష్కరణలు ఎంత వేగం పుంజుకుంటే అంతగా ఊరట పొందగలుగుతుంది పీడిత హృదయం. కోరాల్సిందీ, వెంటనే ఆశించా ల్సిందీ కేవల సానుభూతిని కాదు. కార్యాచరణ వ్యవస్థ బలవత్తరమైతేనే, ఎంతటి ఎటువంటి హింస అయినా అంతమవుతుంది. భద్రత ఉండాల్సింది చేతల్లో!

ఉడికే నొసళ్లు

ఉరికే పిడికిళ్లు

తూగే ఆకాళ్లలో

మండుతుండే ఆ కళ్లలో

ఎన్నో తుపానులు!

పీడిత ఆగ్రహిస్తే నేలనేలంతా కదిలిపోతుంది. పసితనం నిరసిస్తే దురాలోచన కుప్పకూలుతుంది. చివరికి మానవత్వమే గెలిచి తీరుతుంది.

బాల్యాన్ని కాపాడిల్సింది సమాజమే!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE