‘‘జగత్తుకు మూలం చిన్న పరమాణువని ఎంతో పూర్వం కణాద మహర్షి చెప్పాడు. గ్రీకు తత్త్వవేత్త డెమోక్రాటీస్ జగన్మూలం పరమాణువు అనే అన్నాడు. పూర్వ రుషులు పరతత్త్వ జ్ఞానానుభవం సహాయంతో ఖగోళ, గణిత, వైద్య, రసాయన, శస్త్ర, శాస్త్రాలను మనకు ప్రసాదించారు. వారు ధ్యాన సమాధి సాధనల ద్వారా మానవాళికి శాంతి సౌభాగ్యాలను కూర్చారు. సూర్యమండలం చుట్టూ ఇతర గ్రహాలున్నట్లు చిన్న ఉదజని అణు మధ్య భాగంలో ప్రోటాను; దానిచుట్టూ విద్యుత్ పరమాణు సంచలనం ఉన్నాయి. నున్నగా మనకి కనిపిస్తున్న బల్ల యదార్ధంగా నున్నగా లేదు. సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే, ఈ కర్రలో ఎంతో వేగంతో అనేక విద్యుత్ పరమాణువులు పనిచేస్తున్న సంగతి తెలుస్తుంది. అయినా మన దృష్టికి ఆ కర్ర ఒక మొద్దువలె కన్పిస్తున్నది. చిన్న పరమాణువులలో గొప్ప శక్తి ఉంది. ఈ పరమాణువుల మధ్యగల అన్యోన్య ఆకర్షణ, తీవ్రశక్తి ప్రభావాలతో సామరస్యాన్ని గ్రహిస్తే సామాన్య మానవులకు రాయి వలె కనిపించిన ఈ మూర్తిలో శ్రీరామకృష్ణ పరమహంస దివ్య కాళీమాతను దర్శించారు. అనంత పరతత్త్వాన్ని కూడా ధ్యాన సమాధుల ద్వారా మనం గ్రహించి సృష్టి రహస్యం, జీవిత రహస్యాల అనుభూతిని పొంది ఉభయత్రా పురోగమించాలి. ఈ విశాల ప్రపంచ నర్తనం స్వీయ ఇచ్ఛ లేకుండానే జరుగుతున్నది. అలాగే పరమాణు వులు తీవ్ర వేగంతో తమ ఇచ్ఛ లేకుండానే పనిచేస్తు న్నాయి. మన హృదయ స్పందన, రక్త ప్రసరణ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జీర్ణక్రియ మన ఇచ్ఛ లేకుండానే భగవధేచ్ఛ •చేత జరుగుతున్నాయి.
ఈశ్వరసర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా (గీత 18-61)
(ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అతర్యామి) మాయచేత సమస్త ప్రాణులు యంత్రము నారోహించిన వారివలె (కీలు బొమ్మలవలె) తిప్పుచూ సమస్త ప్రాణుల హృదయ ములందు వెలయుచున్నాడు.) కనుక అహంకారం, సోమరితనం వీడి సర్వం భగవంతుని ఇఛ్ఛ వల్లనే జరుగుతున్నదని తెలుసుకోవాలి. మనమందరం భగవత్ స్వరూపులమే కనుక పరస్పరానురాగం, ఐకమత్యం, సౌభ్రాతృలు కలిగి సర్వేశ్వరుని అనుగ్రహం పొంది ఇహపర శాంతి, సౌభాగ్యాభ్యు దయాలను, జన్మసార్థకతను సాధించాలి.’’
ఒక మహా తత్త్వం ఇమిడి ఉన్న ఈ ఉపన్యాసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేది పాలెం అనే చిన్న గ్రామంలో ఇచ్చారు ఒక మహనీయుడు (1-4-1952). ఆధ్యాత్మిక చింతన, శాస్త్రజ్ఞానం ఏదో ఒక బిందువు వద్ద కరచాలనం చేసుకోవడం గొప్ప సత్యమన్న ధ్వని ఇందులో గమనించవచ్చు. ఆ ఉపన్యాసం ఇచ్చిన ఆ వ్యక్తి ఆ రెండింటిని దర్శించినవారే కూడా. పేరు జ్ఞానానంద. ఇంకొక కోణం నుంచి కూడా ఆయనను పరిచయం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుని దర్శించిన అణుశాస్త్రవేత్త.
‘ఏకో గోత్రే స భవతి పుమాన్ య: కుటుంబాన్ భిభర్తి’ (ఒక గోత్రంలో వంశోద్ధారకుడైన ఒక్కొక్క మహా పురుషుడు ఉద్భవిస్తాడు) అంటాడు కవికుల గురువు కాళిదాసు. జ్ఞానానంద గొరగనమూడి (ఉమ్మడి పశ్చిమ గోదావరి, భీమవరం దగ్గర) గ్రామంలో బహు సంపన్న కుటుంబంలో జన్మించారు (5-12-1896). సీతమ్మ, భూపతిరాజు శ్రీరామ రాజు జననీజనకులు. వ్యవహార నామం లక్ష్మీ నరసింహరాజు (జ్ఞానానంద). ఆధ్యాత్మిక సత్యాల కోసం మొదలైన ఆయన ప్రయాణం శాస్త్రవిజ్ఞానం వైపు సాగింది.
మంగిపూడి వీరయ్య సిద్ధాంతి అక్షరాభ్యాసం చేయించిన అనంతరం వీరవాసరంలోని సూరంపూడి సీతారామయ్య సంరక్షణలో జ్ఞానానందను ఉంచారు. గురువుగారికి తణుకు బదిలీ కాగా, తాను వెళ్లి ‘కోతుల మేడ’ అని పిలిచే ఇంట్లో ఉన్నారు. అక్కడే ముదిగంటి జగన్నశాస్త్రితో స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో తణుకుకు మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక స్వామి శ్రీకృష్ణభగవానుని మంత్రోపదేశం చేశారు. తరువాత ఎస్.ఎస్.ఎల్.సి. కోసం జ్ఞానానంద నరసాపురం టేలర్ హైస్కూలులో చేరారు. ఒకసారి తండ్రి మద్రాసు కంటి డాక్టరు దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడే అడయార్లో అనిబిసెంట్ను కలిశారు రాజు. వీరికి మోగల్లులోని యోగి రామరాజు అంటే అభిమానం. ఆ యోగి కాశీలో హఠయోగం నేర్చుకున్నారు.”the light of Asia” (Edwin Arnold) పుస్తకం ఆయనను ప్రభావితం చేసింది. ఎస్.ఎస్.ఎల్.సి. ఉత్తీర్ణులు కాకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని బాల్యమిత్రుడు వీరన్న, రాజు నిర్ణయించుకున్నారు. రాజు జీవితంలో ఇదొక మలుపు. నిజంగానే ఇరువురు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్ష తప్పారు. కానీ జ్ఞానానంద మాత్రమే ఇల్లు వదిలి పారిపోయారు, ముందు అనుకున్నట్టే కలకత్తా.
తండ్రి రామరాజు ఆదేశం మేరకు వీరన్న కలకత్తా చేరుకొని బేలూరు మఠంలో రాజును చూశాడు. కానీ తిరిగి రావడానికి రాజు అంగీకరించలేదు. బేలూరు మఠం స్వామీజీ శ్రీ శివానంద అనుమతితో మొత్తానికి ఇంటికి వచ్చారు. అప్పుడే వివాహం చేశారు. ఎంతజెప్పినా వినక మళ్లీ 14.12.1917లో మరోసారి రాజు ఇల్లు వదిలి నేపాల్ బయలుదేరారు.
రామరాజు గారి సమీప బంధువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివేవారు. రాజు బెంగాలీ సాధువుల గుంపులో ఈయనకు కనిపించారు. పూర్ణానంద శిష్యుడయ్యాడు. పూర్ణానంద ఒక పక్షం రోజులు స్వగ్రామం వెళ్లడానికి రాజుకు అనుమతి నిచ్చారు. గొరగనమూడిలో ఒక కుటీరం నిర్మించారు. ఇక్కడే “Man to Budda” అనే పద్యకావ్యాన్ని వ్రాశారు. తరువాత “Through the path of Silence” అను ఆంగ్ల పద్యం రాశారు. మళ్లీ 1922 మార్చిలో స్వగ్రామం వదిలి కలకత్తా మీదుగా కాశీకి చేరి తపో నియతితోనున్నారు. నేపాల్ వెళ్లి బుద్ధుడు తపస్సు చేసిన ప్రాంతాలలో తపస్సు చేయ నిశ్చయిం చారు. నేపాల్ దగ్గర జయనగర్లో గంగానది ఉపనదిని దాటాలి. ఈతకు దిగి కొట్టుకుపోయారు. కానీ దైవకృప. బతికి బయట పడ్డారు. బిహార్లోని ముజఫర్పూర్కు చెందిన యుద్ధ విక్రమార్కుడు అనే సంపన్నుడు వేటకు వచ్చి మలేరియా జ్వరంతో ఉన్న రాజును చూశాడు. అతడు జ్ఞానానందను తీసుకొని ఇంటికి తెచ్చి పై అంతస్తులో ఒక గది ఏర్పాటు చేశాడు. క్రిందిగదిలో విద్యార్ధులు “Gregory and Hardly” ఫిజిక్స్ పుస్తకంలో ప్రొబ్లమ్ రాక కుస్తీపడుతుంటే జ్ఞానానంద జవాబు రాసి ఇచ్చారు. మరుసటిరోజు ఢి•ల్లీ చేరుకుని యమునా నది ఒడ్డున ఒక కుటీరంలో ఉన్నారు. దగ్గర్లో హర్డింజ్ లైబ్రరీలోని Plato “the Republic” నాలుగు సంపుటాలు నెలరోజుల్లో పూర్తి చేశారు.
తరువాత అబూలోని రఘునాథ మందిరంలో లక్ష్మీనరసింహరాజు తన పేరును జ్ఞానానందగా మార్చుకున్నాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు దేహస్మృతి పూర్తిగా పోయేది, శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలోనే కాలము గడిచినట్లుండి తన్మయుడనై శరీరస్మృతిని మరచెడివాడను (పే.65) అని తన అనుభవాలను ఆత్మకథలో చెప్పారాయన. ఇక్కడ శరశ్చంద్రజీ పరిచయం అయ్యాడు. ఆయన గొప్ప సాధకుడు. తనను సాధన విధానమడగ్గా “You are already in the lap of God” (ఇప్పటికే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు). నీకు చెప్పాల్సిందేమీ లేదు’’ అనే వారు. అక్కడ నుండి కశ్మీర్ వెళ్లడానికి రైలు టిక్కెట్టు తీసుకున్నారు. అప్పుడే జలియన్వాలా బాగ్ దురంత జరిగింది. అందువలన వీరిని రైలు నుండి దించారు. అయితే లాహోర్ వెళ్లి అక్కడ నుంచి కశ్మీర్ చేరుకున్నారు. కశ్మీర్లోని జాడీపూరాలో తీవ్ర సాధనతో భగవద్భావములు, నిరంతర ధ్యానం వలన సాయంత్రానికి ఒడలు తెలియని స్థితికి వచ్చారు. ఇంకొన్ని అనుభవాల తరువాత 24-12-1924న గొరగనమూడి చేరారు. తిరిగి ఏప్రిల్ 1925న అబూకు (నఖీతలాబ్) చేరి పూర్ణ సూత్రములు రాయాలని సంకల్పించారు. ధ్యానం చేస్తూ అందులో వచ్చే అనుభూతులను సూత్రబద్ధం చేశారు.
పూర్ణ సూత్రముల గ్రంథాన్ని జర్మనీలో అచ్చు వేయించాలన్న తలంపు కలిగింది. వెంటనే పాస్పోర్టులు సిద్ధం చేసుకున్నారు. 17 రోజుల్లో ఇటలీ చేరుకుని అక్కడనుండి డ్రెస్డన్ (జర్మనీ)లో ప్రొ।। బూట్నర్ను కలిశారు. వారి కోరిక మేరకు పూర్ణసూత్రాల మీద 150 ఉపన్యాసాలు ఇచ్చారు. జ్ఞానానంద ‘‘దేశకాలం’’ (Time and Space) యిచ్చిన ఉపన్యాసంతోనే ప్రొ।। డెంబర్ పరిచయ మయ్యారు. ఆయన విద్యాశాఖామంత్రికి పరిచయం చేశారు. ఆయన పరీక్షించి ఉపన్యాసాలు వినేందుకు అంగీకరించారు. డా।।టేష్మన్ అనే ట్యూటర్ను పెట్టుకుని జర్మన్ భాషతో పాటు భౌతికశాస్త్రం నేర్చుకున్నారు. 1927 అక్టోబరులో ఎంట్రెన్స్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన చేసేందుకు అనుమతి సాధించారు. రోజుకు 14 లేక 15 గంటలు పరిశోధనలో గడిపేవారు. ఒకసారి తోటి స్కాలర్ అజాగ్రత్త వల్ల విద్యుదాఘాతం తగిలింది. భారత్కు వచ్చి వైద్యం చేయించుకున్నారు. టెహ్రీన్ రాజాగారి సహాయంతో మళ్లీ జర్మనీ చేరుకొనే సరికి హిట్లర్ ప్రభుత్వం వచ్చింది. తన పాత గైడ్ ప్రొ।। డెంబర్ యూదు జాతీయుడు గనుక అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు. కాబట్టి ప్రాగ్ (జెకోస్లావేకియా) నగరం వెళ్ళి ప్రొ।। డొలేషక్ దగ్గర పిహెచ్.డి.కి చేర నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే డ్రెస్డన్కు సుభాష్చంద్రబోసు వైద్యం నిమిత్తం వచ్చారు. ఆయనే జ్ఞానానందను భోజనానికి ఆహ్వానించారు. ఈ విషయం మోడరన్ రివ్యూలో వచ్చింది.
‘‘ఎక్స్రే స్పెక్ట్రోస్కోపి’’ మీద పరిశోధనలు జరిపి అనేక వ్యాసాలు రాశారు. 3 నెలల్లో ఫిజిక్స్లోని అన్ని శాఖలలోనూ పరీక్షకు కూర్చుని డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ప్రాగ్ యూనివర్శిటీ డి.ఎస్.సి. డిగ్రీని 1936లో ప్రదానం చేసింది. తిరిగి 1936 నవంబరులో బొంబాయి చేరి, అక్కడ నుండి టెహ్రీన్ రాజుగారి సలహా మేరకు యూరోప్ వెళ్లాలని నిర్ణయించారు. ఈ లోగా ‘‘మ్యూనిక్ ఒడంబడిక ’’ జరిగింది. దీని ప్రకారం జెకొస్లావేకియాలోని సూడిటాన్ లాండ్ జర్మనీ వశమైంది, దానితో ఇంగ్లండ్ పయనమై విక్టోరియా స్టేషన్కు చేరుకున్నారు. రేడియో ఎక్స్రే పై పరిశోధనకు వీలవుతుందా అని సర్ జేమ్స్ ఛాడ్విక్ (న్యూట్రాన్ను కనుగొనిన మహనీయుడు నోబెల్ గ్రహీత)కు లేఖ రాశారు జ్ఞానానంద. ఛాడ్విక్ ఆయనను లివర్పూల్కు రప్పించారు. ప్రయోగశాల చుట్టూ జ్ఞానానందతో రెండు గంటలు తిరిగి ‘నీ ఇష్టమైన పరిశోధన చేయవచ్చు’’నని చెప్పారు. ఇక్కడే హైవాకు రాశారు. దీన్ని పూర్తి చేయడానికి 17 మాసాలు పట్టింది. 1940 చివరకు ఈ పుస్తకం పూర్తయింది. ఛాడ్విక్ చాలా సంతోషించాడు. ఈ థీసిస్కు 1940 జూన్లో అవార్డు ప్రదానం జరిగింది. హైవాకు పుస్తకం పూర్తి కాగానే లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 1941లో పెలో ఆఫ్ ది ఇన్సీట్యూట్ ఆఫ్ ఫిజిక్స్గా ప్రకటిం చారు.
ప్రపంచమంతటా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అదే సమయంలో భారతదేశ నాయకులు ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమం సాగిస్తున్నారు. ఆ సమయంలో 5000 మంది మృతి చెందారనే వార్త వచ్చింది. జ్ఞానానంద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లండ్లో ఉద్రేక పూరిత ఉపన్యాసాలు ఇచ్చారు. దీనితో జ్ఞానానంద జాతీయవాది అని గుర్తించి ఆయనకు టెహ్రీ మహారాజు నుండి వచ్చే ద్రవ్యాన్ని నిలిపివేశారు. ఛాడ్విక్ జ్ఞానానందను చూడటానికి కూడా ఇష్టపడలేదు.
అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ ప్రొ।। లిండ్సే ఎక్స్రే స్పెషలిస్ట్. ఆయన ఆహ్వానం మేరకు డిసెంబర్ 25, 1944న అమెరికా చేరి సోలోనాయిడ్ కాపర్ వైర్తో బీటారే స్పెక్టోగ్రాఫ్ నిర్మించారు. అప్పుడే 1947లో భారత్కు స్వతంత్రం వచ్చింది. తేది.15-12-1947లో పండింట్ నెహ్రూ ఆహ్వానం మేరకు నేషనల్ ఫిజికల్ లేబరేటరీ (ఎన్.పి.ఎల్)లో పరమాణు శాస్త్ర పరిశోధన హెడ్గా బాధ్యతలు స్వీకరించారు. తన పరిశోధనలు జరుగుతూ ఉండగానే 1939లో పశివేదల గ్రామంలో ‘చిదానందాశ్రమం’ స్థాపించి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.
జ్ఞానానందకు 24.04.1954న ప్రమాదవశాత్తు కాలుజారి తుంటి, మోచేతి ఎముకలు విరిగాయి. వైద్యం కోసం విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పటల్లో చేరారు. నాటి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డా।। వి.ఎస్.కృష్ణ జ్ఞానానందను కలిసి యూనివర్శిటీలో తాము ప్రారంభించబోయే విద్యుత్ పరమాణు పరిశోధనా విభాగానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించవలసిందని కోరారు. ఆ మేరకు 15-10-1954న ‘గౌతమి ప్రొఫెసర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి, ఎందరో విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు సెప్టెంబరు 21, 1969వ తేదీన విశాఖలో పరమదించారు. వారి జ్ఞాపకార్థం ఆంధ్ర విశ్వకళా పరిషత్లో జ్ఞానానంద నూక్లియర్ ఫిజిక్స్ లేబోరేటరీ’ నిర్మించారు.
‘యోగులు నడిచిన మార్గమిది, లోకము లేలిన దుర్గమిది, శాశ్వత శాంతులు స్వర్గమిది, భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది’ – సిరివెన్నెల.
మూలం:
- శ్రీమత్ స్వామి జ్ఞానానంద చరితామృతము, స్వామి ప్రజ్ఞానంద.
- ముదిగంటి జగ్గన్న శాస్త్రి రాసిన లేఖ తేది.06.08.1971.
- మంతిన గోపాల్రాజు లేఖ 16.11.1971.
- వారణాసి రామబ్రహ్మం లేఖ 01.09.1971.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు