మావోయిస్టులను చంపే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఏ హక్కుల కార్యకర్త నోరు విప్పినా ఇదే అంటున్నాడు. భారత రాజ్యాంగం మీద నక్సలైట్లకి నమ్మకం లేకపోవచ్చు. కానీ నమ్మకం ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోం మంత్రి ఈ హత్యాకాండను ఎలా అనుమతిస్తారు? ఈ మాటలతో గొంతు చించేసుకుంటున్న అర్బన్ నక్సల్స్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆపరేషన్ కగార్ను గిరిజనుల మీద గురి పెట్టారు, చంపుతున్నది కూడా గిరిజనులనే అన్న పచ్చి అబద్ధం కంటే నీచమైనది ఈ ప్రశ్న.
ప్రజా కోర్టు, జన్ అదాలత్ పేరుతో ఈ ‘అన్నలు’ లేదంటే మావోయిస్టులు ఎంతమందిని చంపారు? ఆ పేరుతో మావోయిస్టులు ఎంతమంది చేతులు కాళ్లూ, నరికారు? ఎంతమందిని పాయింట్ బ్లాంక్ దూరం నుంచి కిరాతకంగా చంపారు? మావోయిస్టుల మృతదేహాల ఫోటోలు చూస్తే పాయింట్ బ్లాక్ దూరం నుంచి కాల్చినట్టు ఉందని గగ్గోలు పెడుతున్నవారు అక్కడ మావోయిస్టుల అఘాయిత్యాల గురించి మాట్లాడరేం! ఘనత వహించిన ప్రజాకోర్టుల గురించి అర్బన్ నక్సల్స్ ఎందుకు మాట్లాడలేదు? ఎవరూ ప్రస్తావించరేం! పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో, వర్గ శత్రువు పేరుతో అనేక మంది ప్రజాకోర్టులో నిలబెట్టి ఘోరంగా చంపారు, నక్సల్స్. వీరిలో అత్యధికులు గిరిజనులే.
ఏ విధంగా చూసినా, ప్రజా కోర్టుల శిక్షల ద్వారా చనిపోయినవారి సంఖ్యతో పోలిస్తే, నక్సల్స్కు, భధ్రతా బలగాలకు మధ్య జరిగే కాల్పులలో మరణించే గిరిజనుల సంఖ్య చాలా తక్కువ. ఈ పక్రియ యావత్తు పరమ హింసాత్మకంగా, దారుణంగా, మధ్య యుగాల నాటి ఆటవిక న్యాయ విచారణను మరిపిస్తుంది. తుపాకీ చేతబట్టిన ఎవడో నాయకుడు ఒకరిని చూపించి, ఇతడు దోషి అని, ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి అని ప్రకటిస్తాడు. దానిని బట్టి శిక్ష అమలవుతుంది. సాధారణంగా తుపాకీ చేతనున్న వాడి మాటే నెగ్గుతుంది. ఇక శిక్షలు- తల నరకడం, కాళ్లు చేతులు నరకడం, గుంజిళ్లు తీయించడం వరకు అనేకం.
డిసెంబర్ 8, 2015న ఈ అంశం లోక్సభలో చర్చకు వచ్చింది. ఆ ఒక్క సంవత్సరమే దేశంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న కొన్నిచోట్ల 32 ప్రజాకోర్టులు నిర్వహించారని హోంశాఖ సహాయ మంత్రి ఏటీ నానాపాటిల్ తెలియచేశారు. ఇదే అంశం మార్చి 2,2016న రాజ్యసభలో చర్చకు వచ్చింది. గడచిన మూడేళ్లలో నక్సల్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో ప్రజాకోర్టులు నిర్వహించారు. వారి దృష్టిలో నేరం చేసిన 53 మందిని చంపారు (ది హిందు, మార్చి 13, 2016). కేంద్ర హోంశాఖ తెలియచేసిన సమాచారమే ఈ పత్రిక వెలువరించింది. ఈటీవీ భారత్ మరింత సమాచారం ఇచ్చింది. ప్రజాకోర్టులు లేదా జన్ అదాలత్ల పేరుతో నక్సల్స్ ఎవరినైనా, దేనికైనా శిక్షించగలరు. 1970 దశకంలో భూ వివాదాల కోసం ప్రారంభమైన జన్ అదాలత్లు 1980 నాటికి వికృతరూపం దాల్చాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ, పీపుల్స్ వార్ వేర్వేరుగా ఉన్నప్పుడు తమ దళ సభ్యులను కూడా ప్రజా కోర్టులలో దారుణంగా శిక్షించేవారు. నేరం రుజువైందని అనిపిస్తే కాళ్లు చేతులు నరికేవారు. ఈ కోర్టుల అరాచకంగా చూడలేక, వాటిలో పాల్గొనడానికి స్థానిక గిరిజనులు భయపడేవారు. ఇటీవలి కాలం (2010)లో ప్రజాకోర్టులు ఎక్కువయ్యాయని కేంద్రం ప్రకటించింది.
ప్రజల ముందే మనుషులను దారుణంగా చంపుతున్నారని నాటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం చెప్పారు. ఇది అక్టోబర్ 2,2010న ఇండియన్ ఎక్స్ప్రెస్ వెలువరించిన వార్త. ఎన్డీటీవీ నవంబర్ 14, 2021న వెలువరించిన ఈ వార్త ప్రకారం అంతకు ముందు రోజు నక్సల్స్ బిహార్లోని గయలో ప్రజాకోర్టు నిర్వహించారు. ఇద్దరు పురుషులను, ఇద్దరు మహిళలకు ఉరి శిక్ష వేసి అమలు చేశారు. మోన్బార్లోని వారి ఇంటిని డైనమైట్లతో పేల్చేశారు. తాజాగా, సెప్టెంబర్ 15,2024న ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన వార్త ఇంకా ఘోరమైనది. ఛత్తీస్గఢ్లోనే గొండపల్లి (సుక్మా జిల్లా) గ్రామానికి తాత్కాలిక ఉపాధ్యాయునిగా వచ్చిన దోడి అర్జున్ అనే పాతికేళ్ల యువకుడిని నక్సల్స్ పోలీస్ ఇన్ఫార్మర్ అనుమానంతో కొట్టి చంపేశారు.
ఎలాంటి విచారణ లేకుండా, ఆధారాలు చూడకుండా, అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునేది జన్ అదాలత్. ఈ కోర్టులో ఒకేసారి 16 మందికి మరణ దండన విధించి, అమలు చేసిన ఉదంతం ఛత్తీస్గఢ్లోనే జరిగింది. హన్స్ ఇండియా (మార్చి 2, 2016) వెలువరించిన ఈ వార్త చదివితే జుగుప్స కలుగుతుంది. నారాయణపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్లకు శిక్ష పేరుతో కొందరిని రప్పించారు. 16 మందికి నేరం ‘రుజువయ్యాక’ మరణ దండన విధించారు. ఈ సంగతి పోలీసులే తెలియచేశారు. ఇందులో 13 మంది భౌతికకాయాలను వెంటనే బంధువులకు అప్పగించలేదని కూడా ఆ వార్త వెల్లడించింది. ప్రజాకోర్టుల రక్తదాహం గురించి వందలలో వార్తలు వెలువడినాయి. నిజాయితీ ఉన్న అర్బన్ నక్సల్స్, అంటే హక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, నక్సల్స్ అనుకూల మీడియా, యూట్యూబర్లు ఈ ప్రజా కోర్టుల గురించి కనీసం ప్రస్తావించాలి.
– జాగృతి డెస్క్