సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు జ్యేష్ట బహుళ పంచమి – 16 జూన్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భరతమాత అనే భావన రాజకీయాలకు అతీతమైనది. సైద్ధాంతిక వివాదాలకు కేంద్ర బిందువు కాకూడనిది. ఇది గుర్తించమని కేరళ గవర్నర్‌ విశ్వనాథ్‌ రాజేంద్ర అర్లేకర్‌ జూన్‌ 8న పిలుపునిచ్చారు. మనమంతా ఒకే తల్లి బిడ్డలమని ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరారు. ఆ మాత భరతమాత. ఇలాంటి పిలుపు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఒక అవాంఛనీయ వాతావరణంలో గవర్నర్‌ ఆ పిలుపునిచ్చారు. కారణం వామపక్షాలు. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కి బాత్‌ కార్యక్రమం ఆధారంగా నిర్వహించిన క్విజ్‌ విజేతలకు బహుమతి ప్రదానం, పర్యావరణదినం కోసం రాజ్‌భవన్‌లో జూన్‌ 5న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ఉత్సవంలో భరతమాత చిత్రపటం పెట్టారు. దీనికే వామపక్షాలు రెండూ నీచమైన రీతిలో గందరగోళం లేవదీయాలని ప్రయత్నిస్తున్నాయి. కేవలం భరతమాత పటం పెట్టినందుకు జరుగుతున్న ఆ అల్లరి జాతిని ఆలోచింపచేస్తుంది.

 జూన్‌ 5 నాటి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి, సీపీఐ నేత పి. ప్రసాద్‌ హాజరు కావలసి ఉంది. కానీ ఆయన బహిష్కరించారు. కారణం` ఆ కార్యక్రమంలో భరతమాత పటం పెట్టడమే. భరతమాత పటం ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపయోగిస్తుంది కాబట్టి బహిష్కరిస్తున్నట్టు బాహాటంగానే ప్రకటించాడు ప్రసాద్‌. ఇందుకు ప్రతిగా వేరేచోట జాతీయ పతాకం ఎగురవేసి, మొక్కలు నాటాడు. గవర్నర్‌ నివాసంలో ఉపయోగించిన పటం రివాజుగా ఉపయోగించేది కాదనీ, అందుకే తొలగించమని కోరామనీ, అందుకు గవర్నర్‌ నిరాకరించినందువల్లనే కార్యక్రమాన్ని బహిష్కరించామనీ కూడా ప్రసాద్‌ దాచకుండానే చెప్పాడు. భరతమాతకు ప్రతీక జాతీయ పతాకం కాబట్టి పర్యావరణ దినోత్సవానికి రాష్ట్ర మంతటా జాతీయ జెండానే ఎగురవేస్తారట. భరతమాత అనే కొత్త సంప్రదాయాన్ని రుద్దడానికి చూడడం రాజ్యాంగ విరుద్ధమని, జాతి వ్యతిరేకమని కూడా సీపీఐ నాయకులు నోరు పారేసుకున్నారు. గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు రాజ్యాంగం ముఖ్యమో, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు ముఖ్యమో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్‌ విశ్వం తాఖీదు లాంటిది ఇచ్చాడు. వీరి చరిత్ర పరిజ్ఞానం చూస్తే రోతగా లేదా! గవర్నర్‌ కార్యక్రమానికి పోటీగా సచివాలయంలోని దర్బార్‌హాలులో పోటీ కార్యక్రమం నిర్వహించి అమర్యాదకు నిర్వచనం చెప్పారు.

భరతమాత అనే ప్రతీకకు రాజ్యాంగబద్ధత లేదు కాబట్టి, అందుకు సంబంధించి కేంద్రం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి వామపక్ష కూటమి ప్రభుత్వం గవర్నర్‌ చర్యను ఆమోదించబోదని, అదే ప్రభుత్వ విధానమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ మాట్లాడాడు. మత సిద్ధాంతాల ప్రచార కేంద్రంగా రాజ్‌భవన్‌ మారకూడదంటూ ఒక ఉచిత సలహా పడేశాడు. భారతమాత భావనకు తాము వ్యతిరేకం కాకపోయినా, గవర్నర్‌ పెట్టిన చిత్రపటం ఒక సిద్ధాంతానికి సంబంధించినది కాబట్టి అంగీకరించలేమంటున్నాడు గోవిందన్‌.

‘భరతమాత ఎవరో కేరళ గవర్నర్‌ స్పష్టం చేయాలి’ అంటూ తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా రంగంలోకి దిగిపోయారు. దేశభక్తి అంటే ఏమిటో ఆర్‌ఎస్‌ఎస్‌ దగ్గర నుంచి తాము నేర్చుకోనక్కరలేదు అంటూ వాచాలత ప్రదర్శించారు. వాళ్లు అనగా, సీపీఐ వారి భరతమాత వ్యవసాయ క్షేత్రాలలో శ్రమిస్తూ ఉంటుందట. జల్‌, జంగిల్‌, జమీన్‌కు రక్షణ అట. పాఠశాలల్లో, కర్మాగారాలలో పనిచేస్తుందట. సైన్యం, భద్రతాదళాలకు సేవలందిస్తుందట. మరి మీ భరతమాత ఎవరు అంటున్నాడు రాజా. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రోద్యమంలోనే లేదంటూ పాచి పాటే పాడాడు. 1942లో చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇలా నోరేసుకు పడిపోవడం వామపక్షవాదులకి మామూలే. అయినా ఇంత హఠాత్తుగా ఎర్రదండుకు భరతమాత ఎందుకు గుర్తుకొచ్చినట్టు?

 భరతమాత చిత్రపటం రాష్ట్రంలో వివాదానికి దారి తీయడం విచారకరమని గవర్నర్‌ అనడం సబబే. ఆ రెండు పక్షాలకీ ఏ విషయం మీద వివాదం లేవదీస్తున్నామో కూడా స్పృహ లేదు. మనం మన కన్నతల్లిని వివాదాలలోకి లాగుతామా అని గవర్నర్‌ ప్రశ్నించడం అందుకే. కేరళ వామపక్ష రాజకీయాలంటే జుగుప్సకు చిరునామా. హిందూ వ్యతిరేకత మాటున, భారత వ్యతిరేకత అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భరతమాత చిత్రపటం మీద రగడ వెనుక ఉన్నది అదే. హిందూత్వం మీద ఈ రీతిలో ద్వేషం కక్కుతున్నారు. చాలా సందర్భాలలో కాంగ్రెస్‌ కేరళ శాఖ వీటితో పోటీ పడుతూ ఉంటుంది. కేరళ అంటే ముస్లిం మతోన్మాదానికి ఆయువు పట్టు. కాబట్టి బుజ్జగింపు రాజకీయాలూ ఉంటాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావనలోని భరతమాత సర్వేజనా సుఖినోభవంతు అన్న సమున్నత సిద్ధాంతంలో ఉంది. ఒక్క కుక్క అయినా ఆకలితో మిగిలి పోకుండా తృప్తిగా జీవించాలన్న వివేకానంద భావనలో భరతమాతను దర్శిస్తాం. ఒక వర్గం మరో వర్గం సంఘర్షించుకోమని చెప్పకుండా, అంతా సామరస్యంగా ఉండాలన్న వసుధైవ కుటుంబకం చింతనలో భరతమాతను దర్శించుకోగలం. అంతేతప్ప విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలలో, ఆ సిద్ధాంతాల పడికట్టు పదాలలో మాత్రం భరతమాత కనిపించదు. మా భరతమాతది మట్టివాసన. వక్రభాష్యాలకీ, వాగాడంబరాలకీ అతీతమైనది ఆ మహా మాతృ మూర్తి. భరతమాత అనే భావనను గౌరవించాలన్న చట్టం లేదు. అందుకే గౌరవించడం లేదని ఈ మాజీ సోవియెట్‌ రష్యా భక్తులు, వర్తమాన చైనా భక్తులు లా పాయింట్లు లాగుతున్నారు. ఇది చాలు వీళ్ల మెదళ్లు ఎంత కుళ్లిపోయాయో చెప్పడానికి! అమ్మను గౌరవించాలనీ, మాతృభూమికి ప్రతీక అయిన రూపాన్ని మన్నించాలని చెప్పడానికీ చట్టాలు కావాలా?

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE