ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి దశ, దిశ. పాలనా పగ్గాలు చేపట్టడం అంటే కత్తి మీద సాము. రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి బాధ్యత. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత స్వభావం వేరు. కానీ, ముఖ్యమంత్రిగా ఒక నాయకుడి హావభావాల మొదలు వ్యాఖ్యలు, వ్యవహారశైలి… రాష్ట్రంపై ప్రభావం చూపుతాయి.రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతూనే… ప్రజల యోగక్షేమాలు చూడాలి. లేనిపోని భయాలు సృష్టించకుండా.. అవసరమైతే సమాజంలో ధైర్యాన్ని, భరోసాను నింపే ప్రయత్నం చేయాలి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన ప్రకటలను రాజకీయ, ఉద్యోగవర్గాల్లో దుమారం రేపాయి. ఆయనకు రాజనీతిజ్ఞత కొరవడినట్లు కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ‘అత్తమీద కోపం దుత్తమీద’ అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం ప్రజాపాలనను అయోమయంలో పడేసేలా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ ‌రెడ్డి గత కొంత కాలంగా బహిరంగ సభల్లో, అధికారిక సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటిస్తున్న అభిప్రాయాలు వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి.అవి అటు అధికారవర్గాల్లో అసంతృప్తికి కారణమవుతుండగా.. ఇటు.. ప్రజల్లోనూ భయం రేకెత్తించేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి..

ముఖ్యమంత్రి ఇంతకు మునుపు ఐఏఎస్‌ అధికారులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులెవరూ ప్రభుత్వ పెద్దలకు సహకరించడం లేదని, ముఖ్యమంత్రిని అయిన తనకు, మంత్రిమర్గ సహచరులకు కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారన్న ధోరణిలో ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొంటూ పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి అధికారుల సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. అవి అధికార వర్గాలను విస్తుపోయేలా చేయడంతో పాటు.. ప్రజల్లోనూ సందిగ్ధం లేవనెత్తింది.

ఇక, ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ము్య•మంత్రి రేవంత్‌ ‌రెడ్డి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రకంపనలు సృష్టించాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలూ ముప్పేట దాడి చేసేందుకు దారితీశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్న స్థాయిలో ఆయన అన్ని వర్గాల నుంచి ఆగ్రహానికి ఊతమిచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెల్లడించే క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు చెరోవైపు ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసుకొని దాడికి దిగాయి.

రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. జీతాలు ఆలస్యం అవుతుండటం, కరవు భత్యాల చెల్లింపులో జాప్యం, పింఛన్‌ ‌బకాయిలు పేరుకు పోవడంతో /ఆ సంఘాలు పోరుబాటను ఎంచుకున్నాయి. ఇక సమరమే.. అని ప్రకటనలు చేశాయి. దీంతో, ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఉద్యోగుల అవిధేయతను ప్రస్తావిస్తూ.. ఈ సమరం ప్రభుత్వంపై కాదని, ప్రజలపై చేస్తున్నదిగా భావించాల్సి వస్తుందన్నారు. ‘‘నన్ను కోసినా ఈ రాష్ట్రానికి రూ. 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులకు మాత్రం రూ. 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి. ఏ పథకం ఆపాలి? బోనస్‌ ‌తీసుకుందామా? విద్యుత్‌ ‌సబ్సిడీ తీసివేయాలా? వంద రూపాయల పెట్రోల్‌ ‌రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా? ఏం చేద్దాం చెప్పండి…’’ అంటూ ఆవేశంగా స్పందించారు. ‘ఈ స్థితిలో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రాష్ట్రం దివాలా తీస్తుంది. అప్పు కూడా పుట్టట్లేదు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్‌ ‌కోరితే కూడా ఇవ్వట్లేదు. దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా తయారైంది’ అని రేవంత్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాళా తీసిందన్న వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులకు తోడు.. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు స్పందించాయి. దీంతో రాష్ట్రంలో ‘పొలిటికల్‌ ‌వార్‌’ ‌మొదలయ్యింది. రేవంత్‌ ‌రెడ్డికి పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్‌ ‌రాజీనామా చేయాలని మూకుమ్మడిగా డిమాండ్‌ ‌చేశాయి.

బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పదేళ్ల పాలనను విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌ ‌రెడ్డి.. ఇప్పుడు తమకు అదే పరిస్థితి ఎదురుకావడంతో ఉద్యోగులను, ప్రజలను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయని, పెన్షన్‌ ‌బకాయిలు చెల్లించాలంటూ చేసే పోరాటాన్ని ‘ప్రజలపై యుద్ధం’గా చిత్రించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ‘కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యం నింపుతారా? రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసు కదా?’’అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌నిలదీశారు. రేవంత్‌ ‌వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని, ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వ్యాఖ్యానించారు.

 దివాళా తీసింది తెలంగాణ కాదని, కాంగ్రెస్‌ ‌పార్టీ అని బీజీపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నెలకు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. దివాళా తీసిందని ఎలా అంటారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని, ఇప్పటికీ దేశంలోనే రాష్ట్రమని ఆయన అన్నారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అంటూ ప్రశ్నించారు.

బీజేపీ మరో ఎంపీ కె.లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ,‘గద్దెనెక్కిన తర్వాత సమ్మెలు వద్దు, ఆందోళనలు చేయొద్దు అనడం ఎలా?’ అన్నారు. హామీలు ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసగించారని, అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్నారని, బాధ్యతారాహిత్యానికి నిదర్శని మండిపడ్డారు.

అటు బీఆర్‌ఎస్‌… ఈ ‌పరిస్థితులను ప్రధానంగా తనకు అనుకూలంగా మలచుకోవడానికి సిద్ధమవుతోంది. రేవంత్‌ ‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అబద్ధాలు చెబుతున్నారని, ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటినే ఉద్యోగులు అడుగుతున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేత కె.తారక రామారావు అన్నారు. ఎన్జీఓల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, ఆ సంగతి రేవంత్‌రెడ్డికి తెలియదని అన్నారు. వేల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను అవమానించే విధంగా రేవంత్‌ ‌మాట్లాడుతున్నారని, పరిపాలన చేతకాక కాడి పడేశాడని విమర్శించారు. రాష్ట్రానికి తండ్రిలాంటి ముఖ్యమంత్రే సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో నాయకత్వ లోపం తెలంగాణకు శాపమన్నారు. ‘ఎక్కడైనా దొంగను దొంగే అంటారు. దొంగ అని తెలిసినా కూడా పార్టీలోకి తీసుకొని సీఎం చేసిన దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్‌’ ‌వ్యక్తిగతం విమర్శలకు దిగారు. రేవంత్‌కు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని, ఆయన రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాప ణలు చెప్పాలని మాజీ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదని, ఆయనకే పాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయని విమర్శలు చేశారు. విపక్షాల విమర్శలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. అప్పుల విషయంలో నిజాలను ప్రజలకు కాకపోతే ఇంకెవరికి చెప్పాలని ప్రశ్నించారు. అప్పులపై వాస్తవాలను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లెక్కలతో సహా చెబితే.. గుండాగిరీ చేస్తూ తప్పును ఒప్పు చేయాలని బీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నించింది వాస్తవం కాదా? అని అడిగారు.

 తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉందని అనుకున్నామని, తీరా చూస్తే అది రూ.8 లక్షల కోట్లు అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని అన్నారు. ‘అప్పుల కింద ప్రతి నెలా దాదాపు రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. నిరుపేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూళ్లను నిర్మిస్తున్నాం. షో పాలిటిక్స్ ‌చేయడం ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదన్నారు.

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒక్క విషయం మాత్రం తేలింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారు కావడానికి కారణం బీఆర్‌ఎస్‌ అని ఎస్టాబ్లిష్‌ ‌చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికే బూమరాంగ్‌ అయ్యిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం ప్లానింగ్‌ ‌కరువై సీఎం రేవంత్‌ ‌క్లీన్‌బౌల్డ్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE