మన పవిత్ర భారతదేశంలో ఎన్నో నదులున్నాయి. ప్రతి నదికీ ఒక వైశిష్ట్యం ఉంది. ఒక పురాణ గాథ ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రదేశాలలో ఎన్నో మహిమాన్విత తీర్థాలు, క్షేత్రాలు, ఆశ్రమాలు, వింతలు, విశేషాలు ఉంటాయి. కానీ, నదీగర్భంలో అంటే నది లోపల ఒకే ప్రదేశంలో సహస్ర శివలింగాలుండడం చాలా అరుదైన విషయంగా పరిగణించవచ్చు. ఆ పుణ్య నది- ‘శాల్మ’. మనలో చాలామంది గంగ, యుమున, సరస్వతి, గోదావరి, నర్మదా అంటూ ఈ నదులనే పునః-పునః దర్శిస్తుంటాం. కానీ మన పవిత్ర భారతదేశంలో అలాంటి ఇంకెన్నో పవిత్ర నదులున్నాయని.. అవి మనకు అందుబాటైన దూరంలో ఉన్నా వాటిని దర్శించడానికి అంత ఉత్సాహం చూపం. వాటి గురించి ఎప్పుడో తప్ప మననం కూడా చెయ్యం. ఉదాహరణకు ఒరిస్సాలోని ప్రాచీ నది, మధ్య భారతంలోని తాపీ నది, తమిళనాడులోని తామ్రపర్ని నది మొదలగునవి. ఎంతో పవిత్రత కలిగిన ఇంకా ఎన్నెనో.
అలాంటి కోవలోకే చెందిన నది శాల్మల పేర్కొనవచ్చు. శాల్మలా నది బేడ్తి నది ఉపనదిగా పేర్కొంటారు. ఈ నది ఉత్తర కర్ణాటకలో సిర్శి పట్టణం దగ్గర ఉంది. ఈ ప్రదేశాన్ని సహస్ర లింగ అంటారు. ఈ నది, ఈ ప్రదేశం శివారాధకులు అత్యంత ఇష్టమైన నదీ ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నదీ పరివాహక ప్రాంతం పూర్తిగా రాతి శిలలతో కూడి ఉంటుంది. ఈ ప్రదేశంలో దాదాపు 1000కి పైగా శివలింగాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఎదురుగా నందీశ్వరులతో కొన్ని నదీ గర్భం లోనూ, కొన్ని నది గట్టున కూడా దర్శనమిస్తాయి. ఒకేచోటున సహస్రలింగాలను దర్శించవచ్చు. ఇంకా వివిధ దేవతామూర్తులను కూడా అక్కడక్కడ ఈ రాతి శిలలపై చెక్కారు. నదిలో సహస్ర లింగాలు ఒకే చోట చెక్కబడి ఉండటం బహుశా ఇక్కడేనేమో!
ఈ నదిలోని లింగాలన్నీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తరువాత, నీరు తగ్గినప్పుడు మే మాసం వరకు బయటకు కన్పిస్తాయి. అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులకు సహస్ర లింగ దర్శనం ఒక ఆధ్యాత్మిక అపూర్వానుభవంగా మిగిలిపోతుంది. లేకపోతే నదిలో ఒకేచోట సహస్ర లింగాలు ఎక్కడ కనిపించగలవు? ఇది ఒక మానవ నిర్మిత అద్భుతమే కదా! కనులకు ఆధ్యాత్మిక విందే కదా! అంతే కాక ఈ సహస్ర లింగాల మీద నుంచి పారే నీటికి రోగాలను నయం చేసే గుణం ఉందని నమ్ముతూ స్థానికులు ఈ నదిలో స్నానం చేయడానికి అధిక సంఖ్యలో వస్తారంటారు. శాల్మలా నదిలో సహస్ర లింగాలు ఉండడం వెనుక ప్రచారంలో ఉన్న ఐతిహ్యం: క్రీస్తు శకం 16-17శ తాబ్ద కాలంలో సిర్సి రాజు సదాశివరాయవర్మ తన ఆధ్యాత్మిక విశ్వాసంతో నదిలో ఈ సహస్ర శివలింగాలను చెక్కించాడట. ప్రతి శివలింగం ముందు ఒక నంది ఉండడం విశేషం. అలాగే తనకు సంతానం కలిగిన ఆనందంలో నదిలో ఈ సహస్ర లింగాలను చెక్కించాడన్న సమాచారం కూడా ప్రచారంలో ఉంది. కాలాంతరంలో నీటి ఆటుపోట్లకి గురై ఈ లింగాలు కొంత అరిగినా వాటి ఆధ్యాత్మిక శక్తి, వైభవం అపురూపం. కాలం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కానీ కాలాంతరంలో జరిగే ఇలాంటి అద్భుత ఘట్టాలు ప్రకృతిలో చాలాకాలం నిలిచి ఉంటాయనడానికి శాల్మలా నది సహస్ర లింగ ప్రదేశం తార్కాణం.
ఇన్ని లింగాలను ఎవరు ఎలా చెక్కగలిగారు… ఏమాశించి? పారుతున్న నదిలోని రాళ్లలో శివలింగాలను చెక్కగలగడం అదిన్నూ ఇంచుమించు ఒకే రకంగా చెక్క గలగడం శిల్పులకు ఎలా సాధ్యమైంది? పోనీ నీళ్లు లేనపుడు ఎండాకాలంలో శిలలు బయట పడినప్పుడు చెక్కారా అంటే మండుటెండలో కరుకు రాళ్లను మలచడం ఎలా సాధ్యమైందనే సందేహాలు వస్తాయి కదా! ఇదే అద్భుతం. ఆనాటి శిల్పుల దైవ భక్తికి, రాజాజ్ఞ మీద ఉన్న గురి. ఇక్కడ ఒక మాట చెప్పుకోక తప్పదు. భగవంతుడు ప్రకృతినేర్పరచి మానవునికందిస్తే మానవుడు ఆ భగవంతునికి కృతజ్ఞతా పూర్వకంగా తను కూడా కొన్ని వస్త్రాలు నేసి ప్రకృతికి సమర్పించి భగవంతుని రుణం తీర్చుకుంటాడు. ఆ వస్త్రాల వల్ల ప్రకృతికి మరింత వన్నె చేకూరుతుంది. అలాంటి ప్రయత్నమే చేసి రాజా సదాశివరాయ వర్మ ఈ సహస్ర లింగాలతో ఒక చక్కటి వస్త్రాభూషణాన్ని ప్రకృతికి సమర్పించాడన్నది వాస్తవం. ఒక శివలింగం ప్రతిష్టించి ఆ లింగానికి నిత్యం జలాభిషేకానికి ఒక ధారా పాత్రను అమర్చవలసి ఉన్న సందర్భంలో సహస్ర లింగాలను చెక్కించి వా•కి నిరంతరము జలాభిషేకం ప్రకృతి సిద్ధంగా జరిగేటట్లు సహస్ర లింగాలను పారే నీటిలో చెక్కించిన ఆ రాజు సదాశివరాయవర్మ ఎంతటి పుణ్యత్ముడో కదా! ఇంతటి మహిమాన్విత నదీ ప్రదేశాన్ని సర్వులూ దర్శించి కృతార్థులవ్వాలని ఆశిద్దాం.
అన్ని నదులకు వలెనే శాల్మలకి కూడా కొన్ని రకాల బెడదలు సిద్ధమయ్యాయి. 2014 నుంచి ఈ నది రక్షణ కోసం చుట్టుపక్కల గ్రామాల వారు ఉద్యమించారు. బెడ్తీ నది మీద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెబితే అందుకు వారు నిరాకరించారు. ఆ సంవత్సరం వందలాది మంది పాదరక్షలు కూడా వేసుకోకుండా ఆ నదితీరంలోకి వచ్చి పూజలు చేశారు. ‘ఈ నదిని కలుషితం చేయాలంటే మేం అంగీకరించం’ అని ఒక పెద్ద బోర్డు కూడా రాసి పెట్టారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ నదిలోనే గణేశపాల ద్వీపం ఉంది. ఇదే పశ్చిమ దిశగా పశ్చిమ కనుమలలోకి ప్రవహించే బేడ్తీ నదిలో సంగమిస్తుంది.
జై శాల్మలా నదీమాతా… జై పరమేశ్వరా
మహావాది రామకృష్ణ