భారత్ మాతాకి జై.. జయహో భారత్ అంటూ హోరెత్తిన దేశభక్తి నినాదాలు.. రెపరెపలాడిన మువ్వెన్నెల జెండాలు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో జరిగిన తిరంగా ర్యాలీలకు ప్రజలు పోటెత్తారు. పిల్లలు, పెద్దలు, యువతీయువకులు.. మాజీ సైనికులు, రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు.. ఒక్కరేమిటి..సరిహద్దుల్లోని భారత జవాన్లకు మద్దతుగా తరలివచ్చారు. భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మే 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరంగాయాత్రలు జరిగాయి.
మన దేశం దాయాదిదేశం పాకిస్థాన్ దుందుడుకు చేష్టలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల అన్నివర్గాల వారు తిరంగయాత్ర నిర్వహించారు. జాతీయ జెండాను గౌరవించడం, దేశభక్తిని, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, సైనికులకు మద్దతుగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ఈ యాత్ర లక్ష్యం. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర బందర్ రోడ్లోని పీవీపీ మాల్, వివంతా హోటల్ మీదుగా బెంజ్ సర్కిల్ వరకు చేరుకుంది. రెండున్నర కిలోమీటర్ల మేర సాగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలు, ప్రజలు పాల్గొని తమ జాతీయ భావాలను చాటారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, తెలుగుదేవం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతీయ పతాకాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు. శత్రుదేశం దుశ్యర్యపైల మన దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై మద్దతు తెలిపారు. మన దేశ చర్య ‘మన దేశం ఒకరి జోలికి వెళ్లదు.. ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావుదెబ్బ కొడతాం’అని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమత్వం చాటి చెప్పే విధంగా దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు వీక్షకులను ఉర్రూతలూగించాయి.
ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మాణాత్మక నాయకత్వాన్ని ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొనియాడారు. భారత సైన్యానికి సంఘీభావం తెలిపారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి పౌరుడిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని, ఇది దేశ ఆత్మను ప్రతిబిం బిస్తుందని అన్నారు. ఈ ఆపరేషన్లో మన సైనికులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, దేశశక్తిని చాటారని కొనియాడారు. ‘‘మహిళల నొసట సిందూరాన్ని తుడిచే వారికి ఇది గట్టి సమాధానం’’ అని, ఉగ్రవాదులు భారత్పై కన్నెత్తి చూడలేరని హెచ్చరించారు. భారతదేశం యుద్ధం కోరుకోదని, కానీ దాడులకు గట్టిగా సమాధానం ఇస్తుందని, ఉగ్రవాదులకు ఇదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ, ఇటువంటి ఘటనలను ఇకపై సహించబోమని అన్నారు.
సరిహద్దుల్లో రాత్రింబవళ్లు దేశాన్ని కాపాడే సైనికుల ధైర్యం, త్యాగాన్ని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ వంటి జవాన్ల త్యాగాన్ని స్మరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువతను చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ భారత్లో శాంతిని భగ్నం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తోందని, భారత్ పురోగతిని ఓర్వలేక• పోతోందని విమర్శించారు. దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా భాగస్వాములు కావాలని, ఐక్యత, దేశభక్తితో దేశాన్ని రక్షించాలని, అభివృద్ధి చేయాలని కోరారు.
ఆర్థికంగా శక్తిమంతమవుతున్న భారత్ను చూసి ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శించారు. భారత్లో జరిగిన ఉగ్రదాడులన్నింటి వెనుక పాకిస్తాన్ ప్రమేయ ముందని ఆరోపించారు. వారికి దేశాన్ని పాలించుకునే సామర్థ్యం లేక అభివృద్ధి చెందుతున్న మనదేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
దేశ విభజన నాటి నుంచి ముంబై దాడులు సహా అనేకం జరిగాయని, భారత అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతోందని అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోదీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇది కొత్త భారతం అనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మురళీ నాయక్ వంటి వీరులు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
అంతర్గత భద్రతకు భంగం కలిగితే సహించ బోమని, తాము ఎదురు దాడికి దిగితే ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఆపరేషన్ సిందూర్తో మన సైనిక బలగాలు స్పష్టం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. గతంలో సైనికులు మరణిస్తే బేల చూపులు చూసిన నేలలో 2014 నుంచి బలమైన నాయకత్వం వచ్చి దీటైన సమాధానం చెపుతోందన్నారు. ఈ చర్య రాష్ట్రానికి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ నివాళి అని అన్నారు. ప్రధాని చేపట్టిన చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ సింధు జలాలను వదలాలంటూ లేఖ రాసిందంటే మనం చేపట్టే చర్యలు ఎలా ఉంటాయనేది ప్రపంచానికి స్పష్టమైందని అన్నారు.
దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు దుష్టశక్తులు ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ, కుట్రలు పన్నుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపమాక హైవే జంక్షన్ నుంచి నక్కపల్లి వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతాయని ఆమె హెచ్చరించారు. పాకిస్థాన్కు గట్టి బుద్ది చెప్పి, భారత్కు విజయాన్ని అందించిన త్రిదళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ తీరంలో తిరంగా యాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. జాతీయ జెండాలు చేపట్టి కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీచ్ రోడ్డు పార్కు హోటల్ వద్ద ఈ యాత్రను కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభిస్తూ, పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్కు మరిచిపోని గుణపాఠం చెప్పామన్నారు. ఇందుకు యుద్ధవీరులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ యాత్ర పరమార్థం అదేనన్నారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనటం అభినంద నీయమన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు భారత సైనికులు బుల్లెట్లతో సరైన సమాధానం చెప్పారన్నారు. శత్రువులు మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేశారని కొనియాడారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు,మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, తెదేపా విశాఖపార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాల్జీ, బీజేపీ నాయకులు పరశురామరాజు, నాగేంద్ర, సుబ్బరామిరెడ్డి, పృథ్విరాజ్, కె. రామకృష్ణ, తెదేపా నాయకులు తోటరత్నం, బుడుమూరి గోవింద్, మాజీ సైనికులు, నగర వాసులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరావు, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, కూటమి నాయకులు గొండు స్వాతి, మాదారపు వెంకటేష్, పైడి వేణుగోపాలం, జిల్లా మాజీ సైనిక సంఘం సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మాజీ సైనికులను ఎమ్మెల్యే ఈశ్వరరావు సత్కరించారు.
అనంతపురంలో తిరంగా ర్యాలీలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, మనందరి మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థ నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో సైన్యం పాకిస్థాన్కు గట్టిగా సమాధానం చెప్పిందన్నారు. దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలతో పాటుపడుతున్నవారికి బాసటగా నిలవాలన్నారు. మంత్రి పయ్యావుల్ కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో అందరూ ఒకే తాటిపై వచ్చి సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జేసీ శివనారాయణశర్మ, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్. రాజు, బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో… సైనికులకు బాసటగా ఆపరేషన్ సిందూర్ విజయవంతంలో భాగంగా వేయి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పలు వర్గాల ప్రజలు, సామాజికవేత్తలు, కూటమి నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ లో అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. కూటమి నేతలు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, ముని సుబ్రహ్మణ్యం, చంద్రప్ప, పృథ్వీ, వరప్రసాద్, నవీన్ కుమార్రెడ్డి, నవీన్ రాయల్, రుద్రకోటి సదాశివం, ఆర్సీ మునికృష్ణ, దేవర మనోహర, ఎస్కే బాబు, మాజీ సైనికులు, ముస్లిం, మైనారిటీలు, వస్త్ర వ్యాపారులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కడపలో తిరంగా ర్యాలీలో జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో దేశం పదిలంగా ఉంటుందన్నారు. భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచ దేశాలకు మన సత్తా ఏమిటో తెలిసిందన్నారు. తెదేపా, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, జనసేన నాయకుడు’ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సైనికులకు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్