చిత్రదుర్గ రాజ్యంలో రోకలి (ఒనకే) ఆయు ధంగా హైదరాలీ దళాలతో ఒంటరిగా పోరాడిన యోధురాలు ఓబవ్వ. ఆమె భర్త హనుమంతప్ప. చిత్ర దుర్గం రాతికోలో కాపలాదారు. శత్రు మూకలు వచ్చినప్పుడు శంఖం ఊది సైనికులను అప్రమత్తం చేయడం ఆయన పని. కర్ణాటక రాష్ట్రంలో ఓబవ్వను తక్కిన స్వాతంత్య్ర పోరాటయోధులైన అబ్బక్క చౌత, కలాడి చిన్నమ్మ, కిత్తూరు చిన్నమ్మలతో పాటు అగశ్రేణి మహిళా యోధురాలుగా ప్రజలు గౌరవించారు.
చిత్రదుర్గ రాజ్య పాలకులలో చివరివాడు మధుకరి నాయక. 1742 నుండి 1799 వరకు పాలించాడు. మదకరి నాయకను (మదకరి అనగా అహంకారాన్ని అణచి వేయగల సామర్థ్యం కలవాడు) కరిగుండి నాయక- అని కూడా పిలుస్తారు. మధుకరి నాయకను చిత్రదుర్గ, సిర్సి, కరిగుండి నాయకులలో గొప్ప వ్యక్తిగా పరిగణించారు. మధుకరి నాయక, మైసూరు పాలకుడు హైదరాలీ మధ్య జరిగిన సంఘర్షణ కర్ణాటక చరిత్రలోని నాటకీయ ఘట్టాలలో ఒకటి.
చిత్రదుర్గ నగరం నేటి బళ్లారికి 105 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది ప్రధాన పర్యాటక కేంద్రం. దీనినే కల్లినా (రాయి) కోటే, ఉక్కిన కోటే (Steet-Fort) ఏలు సుత్తిన కోటే (Seven Circles Fort) అని పిలుస్తారు. చిత్ర దుర్గంలో బోల్డ్రాక్ కొండలు, సుందరమైన లోయలు ఉన్నాయి.
భారతేతిహాసం మహాభారతం ప్రకారం అరణ్యవాస సమయంలో పాండవులు ఇక్కడ తలదాచుకున్నారు. హిడింబి, హిడింబాసురులు అనే ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఉండే వారని, హిడింబాసు రుడు భీమునితో పోరాడి ఓడి తన చెల్లెలు హిడింబిను ఇచ్చి వివాహం చేశాడని నమ్మతారు. వీరి కుమారుడే ఘటోత్కచుడు.
విజయనగర సామ్రాజ్యంలో నమ్మకమైన సైనిక అధికారిగా పనిచేసిన తిమ్మన్న నాయకను చిత్ర దుర్గానికి గవర్నర్గా నియమించారు. ఇతని కుమారుడు ఓబానా నాయకుడు లేక మధుకరి నాయకుడు. ఇతని కుమారుడు కస్తూరి రంగప్ప. ఇతని తరువాత మదకరి నాయక సోదరుడు చిక్కన్న నాయక పనిచేశాడు. మదకరి నాయకుల పాలకుల కాలంలో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందినట్లుగా చెపుతారు.
శత్రువులని ఎదుర్కొనడానికి మహారాణి కావలసిన అవసరం లేదు, గొప్ప గొప్ప యుద్ధకళలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేల మీద ప్రేమ, ధర్మం పట్ల అనురక్తి కలిగిన సాధారణ స్త్రీ కూడా పరిస్థితులను బట్టి తిరగబడగలదు. అందుకు మంచి ఉదాహరణ ఒనకే ఓబమ్మ. ఆమె జయంతి (నవంబర్ 11) సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఓబవ్వ దైర్యసాహసాలను కొనియాడారు. ‘ఆమెకు యుద్ధంలో ముందస్తు శిక్షణ లేదు. అయినప్పటికి తనను తాను నిరాశ పర్చుకోలేదు. చివరి వరకు ఒంటరి పోరాటాన్ని కొనసాగించింది. దేశాన్ని శత్రువుల బారి నుండి రక్షించింది. భారతదేశం అసమాన వీరవనితలకు జన్మనిచ్చిన పుణ్యభూమి. చరిత్ర చెప్పని అనేకమంది వీరవనితలున్నారు. ఈ దేశంలో పుట్టిన ఎందరో మాతృమూర్తులు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా, నిస్వార్థంగా త్యాగం చేశారు. అందరికి శతకోటి వందనాలు’ అన్నారు ప్రధాని. ఓబవ్వది చరిత్ర ప్రసిద్ధ కథ. కన్నడ జానపద కథల్లో స్థానం సంపాదించింది.
చిత్రదుర్గ 18వ శతాబ్దంలో మధుకరి నాయక పాలనలో ఉంది. ఆ కోట వైభవాన్ని, కోటపై ఎగురుతున్న భగవాధ్వజాన్ని 1716వ సంవత్సరంలో చూసిన మైసూర్ పాలకుడు హైదరాలీకి కన్ను కుట్టింది. హైదరాలీ, ఇతని కుమారుడు టిప్పు సుల్తాన్ల హిందూ వ్యతిరేకత చరిత్ర ప్రసిద్ధం. వెంటనే ఈ కోటను వశపరుచుకోవడానికి మధుకరి నాయకను ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కోటలోనికి ప్రవేశం దొరకలేదు. కారణం అది రాతి కోట, ఏడు ప్రాకారాలు ఉన్నాయి.
హైదరాలీ ఒక పథకం ప్రకారం ఈ కోటను ఆక్రమించాలనుకున్నాడు. కావలసిన పెద్ద సైన్యాన్ని, వేగులను సిద్దం చేశాడు. చిత్రదుర్గ చుట్టూ సైన్యాన్ని మోహరించాడు. కొన్ని గంటల్లో ముట్టడి పూర్తి అవుతుందని తలపోశాడు. కానీ రోజులు, వారాలు, నెలలు గడిచినా ప్రవేశించలేకపోయారు. కోటలో పుష్కలంగా ఆయుధాలు, ఆహారం, నీటి బావులు ఉన్నాయి. కానీ హైదరాలీ తెచ్చుకున్న ఆహారం పదార్థాలు, ఆయుధాల• నిండుకునే దశలో ఉన్నాయి. ఏదో రకంగా దుర్గంలోనికి ప్రవేశించాలి. ఏదైనా రహస్యమార్గం ఉందేమో పరిశోధించమని వేగులను పురమాయించాడు. వారు కొన్నిరోజులు నగరమంతా తిరిగి ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదే- రాతికోటలోనికి ఒక వ్యక్తి మాత్రమే ప్రవేశించడానికి వీలైన రంధ్రం. అక్కడ ఒక కాపలాదారు ఉంటాడు. కాబట్టి ఆనుపానులు చూసుకుని అతడు అజాగ్రత్తగా ఉన్న సమయంలో లోపలికి చొరబడాలని పథకం వేశారు. అక్కడ కాపలా కాసే బాధ్యత చూసే సైనికుడే హనుమంతప్ప. అతడు రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళతాడు. అది మాత్రమే అనువైన సమయం. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
రోజులాగానే హనుమంతప్ప ఇంటికి వెళ్లి భార్య ఓబవ్వను భోజనం వడ్డించమన్నాడు. త్వరగా వెళ్లిపోవాలనీ, లేకపోతే హైదరాలీ సైన్యం ఏదైనా ముప్పు తేగలదని కూడా హెచ్చరించాడు. ఓబవ్వ త్వరగా భోజనం వడ్డించే హడావిడిలో మంచినీళ్లు మరిచింది. నిజానికి ఇంట్లో మంచినీరు సిద్ధంగా లేదు. భర్తతో చెప్పి నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళ్లింది.
పథకం ప్రకారం హైదరాలీ సైన్యం ఆ రంధ్రం ద్వారా లోనికి దూరడం ఓబవ్వకు కనిపించింది. ఇంటికి వెళ్లి భర్తకు ఈ విషయం చెప్పే వ్యవధి లేదు. కాబట్టి ఆపద్ధర్మంగా తానే కోటను రక్షించాలను కుంది. ఆ పక్కన ఓ రోకలి జేరవేసి ఉంది, దాన్ని తీసుకుని రంధ్రం గుండా దూరుతున్న సైనికుడి తలపై బలంగా కొట్టింది. అతడు ప్రాణం విడిచాడు. శబ్దం చేయకుండా వాడిని పక్కకు ఈడ్చేసింది. రెండవ వాడికి అదే గతి పట్టించింది. ఇలా ఆ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. మంచినీళ్ల కోసం వెళ్లిన భార్య ఎంత సేపటికి రాకపోయే సరికి, హనుమంతప్ప భోజనం ముగించుకుని పరుగున వచ్చాడు. చూసేసరికి ఆమె వంటి నిండా రక్తం. అపర కాళికాదేవిలా, చేతిలో ఒనకె (రోకలి)తో కన్పించింది. ఆ విధంగా చిత్రదుర్గకోటను రక్షించింది. తరువాత జరిగిన పరిణామాలు వేరు. హైదరాలీ కుట్రలు వేరే విధంగా అమలు చేశాడు. దొంగచాటుగా హైదరాలీ సైన్యం ఓబవ్వను, హనుమంతప్పను హతమార్చింది. తన ప్రాణం పోయినా చిత్రదుర్గం కోటను రక్షించింది. ఆమె సైనికుని భార్య. కానీ ఆపదకాలంలో అపర కాళియై శత్రువుల నుండి కోటను రక్షించిన నిజమైన దేశభక్తురాలు. పరిస్థితులు ఆమెను అలా మార్చాయి.
ఓబవ్వ జ్ఞాపకార్థాం చిత్రకూట దుర్గానికి గల ఈ కన్నానికి ‘ఓబవ్వన కింది’ అని పేరు పెట్టారు. ఆమె వారసత్వాన్ని సజీవం ఉంచడానికి ఓబవ్వ స్డేడియం. ఆశోక్ గుడిగర్ తయారుచేసిన విగ్రహాన్ని చిత్రదుర్గలోని కమిషనర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించారు. ఆమె ప్రేరణతో మహిళల ఆత్మరక్షణ కోసం ఓబవ్వ పాడె (ఆల్ ఓమెన్ స్క్వేడ్)ను రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఆత్మరక్షణకు శిక్షణ ఇస్తున్నారు. బెంగళూర్ వెస్ట్, శివ మొగ్గ జిల్లాలో ఈ స్క్వాడ్ బాగా పనిచేస్తున్నది. 2019లో ‘‘చిత్ర దుర్గ ఓనకే ఓబవ్వ’’ అనే సినిమా ఆమె నిజమైన ఉద్దేశాలు దేశం పట్ల ఆమెకున్న ప్రేమను గురించి చెపుతుంది. ఆమె ప్రయత్నాలను ‘‘నాగరహవు’’ అనే పాటలో చిత్రీకరించారు. దొంగలు, స్మగ్లర్లను గొప్పగా సినిమాలో చూపించడం మాని ఇటువంటి దేశభక్తి సినిమాలు తీయాలి. కర్ణాటక ప్రభుత్వం ఆమె జయంతిని ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తుంది.
మూలం:
- Jasmine and Coconuts : South Indian Tales by Cathy Spagnoli, Paramasi Samanna
- మైసూర్ స్టేట్ గజిటీర్ చిత్రదుర్గ జిల్లా వాల్యూ-4
- మైసూర్ చరిత్ర హయవదనరావు
- కర్ణాటక స్వాతంత్య్ర సమరయోధులు బై సరోజిని, రాఘవేంద్రరావు
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు