పెహల్గావ్‌ ‌హత్యాకాండ, తరువాత ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పరిణామాల తరువాత దేశంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాస్తవాలు భారతీయులుగా తలదించుకునేటట్టు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఎం‌తటి రోగ్‌ ‌దేశమో తెలియనిది కాదు. అక్కడ మత ఛాందసత్వం ఏ స్థాయిలో ఉన్నదో కూడా ఎవరూ దాచ గలిగేది కాదు. అయినా ఆ దేశానికి మాతృభూమి రహస్యాలు, మరీ ముఖ్యంగా దేవాలయాలు, సైనిక సమాచారం అమ్ముకోవడం చూస్తే కడుపు మండిపోతుంది. హరియాణాకు చెందిన యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ‌జ్యోతి మల్హోత్రా అరెస్టు అలాంటిదే. మే 17న ఆమెను అరెస్టు చేసి కస్టడీకి పంపారు. మరో పదిమంది కూడా ఇలాంటి పనిలోనే ఉన్నట్టు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఇందులో ఒకడు ఆంధప్రదేశ్‌లోని విజయనగరం ప్రాంతంలో దొరికాడు. భారతదేశ వినాశాన్ని కోరుకుంటున్న నీచులు, దుర్మార్గులు ఇంతమంది ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారత గడ్డ మీద పుట్టి దేశానికి ఇంత ద్రోహం చేయతలపెట్టిన వీరిని ఏమనాలి? ఇంతకీ భారతదేశంలో పాకిస్తాన్‌ ‌దౌత్య కార్యాలయం ఇలాంటి విధ్వంసక చర్యల కోసమే పనిచేసిందా?

జ్యోతిని ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కూడా భావిస్తు న్నారు. కొద్దికాలం క్రితం సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సమాచారం కూడా పాకిస్తాన్‌కు పంపిందన్న అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్‌ ‌దౌత్యకార్యా లయంలో పనిచేసే వారితో సాన్నిహిత్యం, పలుసార్లు పాకిస్తాన్‌ ‌పర్యటనలు జ్యోతి ప్రవర్తనను పట్టిచ్చాయి. డానిష్‌ అనే పాకిస్తాన్‌ ‌దౌత్యకార్యాలయం ఉద్యోగిని భారత్‌ ‌నుంచి బహిష్కరించిన తరువాత, అతడి కుట్రలను వెలికి తీసే క్రమంలో జ్యోతి పేరు కూడా బయటపడింది. ఈమె ఈ సంవత్సరం జనవరిలో పెహల్గావ్‌లో తిరగడం కూడా ఒక రిక్కీ లాటిందేనని, దాని ఫలితమే దారుణ హత్యాకాండ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

 పర్యాటకం కోసం వీడియోల నిర్మాణం అంటూ ఈమె చేసిన నిర్వాకం పాకిస్తాన్‌కు దేశ సమాచారం అందించడమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ‘గతంలో మాదిరిగా సరిహద్దులలోనే యుద్ధాలు జరగాలని లేదు. ఆధునిక యుద్ధరీతి అంటే సరిహద్దులలో పోరాడడం కూడా కాదు. మాకు ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్‌ ‌తన వాదనను భారత్‌ ‌మీద రుద్దడానికి సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకుని వారి ద్వారా చేయాలని చూస్తున్నది’ ఇది హరియాణాకు సంబంధించిన ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పిన కొత్త సత్యం. అది కూడా గూఢచర్యం ఆరోపణలతో జ్యోతి మల్హోత్రా దొరికిన తరువాత ఆయన ఇలాంటి అభిప్రాయానికి రావలసి వచ్చింది. ఆమె చర్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. కాబట్టి సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద ఓ కన్నేసి ఉంచవలసిన అవసరం గురించి కూడా ఇది చెబుతోందని ఆ అధికారి అన్నారు. నిజానికి ఏ భారతీయుడు పాకిస్తాన్‌లో పర్యటించినా పోలీసు స్థాయిలో వారి మీద నిఘా ఉంటుంది. వీసాలో పేర్కొన్న ప్రదేశాలలో మాత్రమే వారు తిరగాలి. అయితే మల్హోత్రాకు పాకిస్తాన్‌లో అత్యున్నత స్థాయి ప్రముఖులకు లభించే సదుపాయాలన్నీ దక్కాయని తెలుస్తున్నది. ఇందుకు కారణం భారత్‌లోని పాకిస్తాన్‌ ‌హైకమిషన్‌ అధికారి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయమే. ఇహసాన్‌ ఉర్‌ ‌రహమాన్‌ అనే డానిష్‌ ‌నిఘా విభాగానికి చెందినవాడు. మల్హోత్రా పాకిస్తాన్‌లో పర్యటించిన సమయంలో ఆమెకు పోలీసు భద్రత కూడా కల్పించారు.

మల్హోత్రా నిర్వహిస్తున్నా యూట్యూబ్‌ ‌చానల్‌ ‌పేరు ట్రావెల్‌విత్‌జో. దీనికి 3.82 లక్షల వీక్షకులు ఉన్నారు. అదే పేరుతో ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌, ‌ఫేస్‌బుక్‌లకు 1.39 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. ఈమె పలుసార్లు పాకిస్తాన్‌ ‌వెళ్లారు. ఒకసారి చైనా కూడా వెళ్లారు. ఈమెను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆమె ఆదాయానికి ఆమె ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని వారు తేల్చారు. ఈమె తంతు ఎలా బయటపడిందో చూడాలి. ఏప్రిల్‌ 2024‌లో ఈమె 12 రోజులు పాకిస్తాన్‌లో ఉంది. ఆ సంవత్సరం జూన్‌లోనే చైనా వెళ్లింది. అక్కడ విలాస వంతమైన కార్లలో తిరుగుతూ చాలా ప్రదేశాలలో ఉన్న నగల దుకాణాలకు వెళ్లింది. దీనితోనే ఈమె భారత నిఘా వర్గాలు ఒక కన్నేసి ఉంచాయి. మల్హోత్రా భారత్‌లోని ప్రదేశాలను చిత్రీకరించి, పర్యాటకం పేరుతో పాకిస్తాన్‌ ‌హ్యాంలర్స్‌కు అందించేది. ఈ చిత్రీకరణ ఉద్దేశం యూట్యూబ్‌ ‌వీడియోల తయారీ అని పేరు పెట్టేది. మార్చి 23న పాకిస్తాన్‌ ‌దౌత్య కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్‌ ‌విందుకు కూడా మల్హోత్రా హాజరైంది. కానీ ఆ విషయం దాచుకోలేక పోయింది. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో ప్రదర్శించింది. అప్పుడే డానిష్‌ ‌తన భార్యను మల్హోత్రాకు పరిచయం చేసి, ఆమె కూడా మీడియా ఇన్‌ఫ్టుయెన్సరేనని చెప్పాడు. 2023లోనే డానిష్‌తో మల్హోత్రాకు పరిచయం ఏర్పడింది. ఇంత జరిగినా తన కుమార్తెను కావాలనే ఇరికించారని ఆమె తండ్రి హరీశ్‌ ‌మల్హోత్రా వాపోయాడు పాపం.

మల్హోత్రాను అరెస్టు చేసిన హరియాణాలోని హిస్సార్‌ ‌భద్రతా వ్యవస్థ పరంగా కీలక ప్రాంతం. గడచిన పాతికేళ్ల నుంచి ఐఎస్‌ఐ ‌దీని మీద కన్నేసి ఉంచింది. ఇది మిలటరీ కంటోన్మెంట్‌. ‌ప్రతిష్టాత్మక సైనిక గుర్రాల ఉత్పత్తి కేంద్రం. సరిహద్దు భద్రతాదళ శిబిరం కూడా ఉంది. అలాగే గతంలో కూడా హిస్సార్‌లో గూఢచర్యం కుట్రలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో మల్హోత్రా చర్య మీద మరింత ఆందోళన నెలకొన్నది. 2001లో అస్గర్‌ అలీ అనే అతడు నకిలీ పత్రాలు సంపాదించి కొంతకాలం ఉన్నాడు. తరువాత దేశం విడిచి పారిపోతుండగా రాజస్తాన్‌లో పట్టుకున్నారు. 2003లో మహమ్మద్‌ ‌హైదర్‌ అనేవాడు హిస్సార్‌లోని వాల్మీకినగర్‌లో ఉండేవాడు. ఇతడు పాకిస్తాన్‌కు సమాచారం అందించాడన్న ఆరోపణ మీద అంబాలాలో అరెస్టు చేశారు. 2005,2006లలో కూడా ఇలాంటి కుట్రలు బయటపడ్డాయి. ఇంతకీ మల్హోత్రా వ్యవహారం ఆమెతో ఆగిపోయేలా లేదు. పూరీలో ఉండే మరొక యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ‌ప్రియాంకా సేనాపతిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈమె పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ ‌సాహిబ్‌ ‌గురుద్వారాకు ఇటీవలనే వెళ్లి వచ్చింది. మల్హోత్రా గతేడాది పూరీ వెళ్లి వచ్చారు. ఈ ఇద్దరు మహిళల మధ్య గూఢచర్యం ఇచ్చిపుచ్చు కోవడాల మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది.

జ్యోతి తరువాత మరొక 10 మంది పాకిస్తాన్‌ ఏజెంట్లను కూడా వివిధ రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వీరంతా హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందినవారే. పంజాబ్‌కు చెందిన 32 ఏళ్ల గజాలాను నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఈమె యామీన్‌ ‌మహమ్మద్‌ ‌భార్య. అతడు చనిపోయాడు. ఈమె డబ్బుకు ఆశపడి భారత వివరాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నది. పంజాబ్‌లోనే మాలేర్‌కోట్లాలో అరెస్టు చేశారు. ఇంతకీ ఈమె కూడా డానిష్‌తో షరీకయినదే. భారత సమాచారం కోసం డానిష్‌ ‌వీళ్లని తరుచు కలిసేవాడు. వీళ్లు పాకిస్తాన్‌ ‌వీసాల కోసం అతడిని కలుసుకునే వారు. పంజాబ్‌లోని పటియాలా ఖాల్సా కళాశాలలో రాజనీతి శాస్త్రం చదువుతున్న 25 ఏళ్ల దేవేందర్‌ ‌సింగ్‌ ‌కూడా ఈ ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఇతడు పటియాలా సైనిక కంటోన్మెంట్‌ ‌ఫోటోలను, సమాచారాన్ని ఐఎస్‌ఐ ఏజెంట్‌కు ఇచ్చాడు. ఇతడు గడచిన ఏడాది నవంబర్‌లో పాకిస్తాన్‌ ‌వెళ్లివచ్చినట్టు దర్యాప్తులో తేలింది. నూహ్‌కు చెందిన అర్మాన్‌ ‌భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. నూహ్‌కే చెందిన తరీఫ్‌ ‌కూడా గూఢచర్యం ఆరోపణతో అరెస్టయ్యాడు. పాకిస్తాన్‌ ‌దౌత్యకార్యాలయంలోని ఇద్దరితో తనకు పరిచయం ఉండేదని ఇతడు దర్యాప్తులో చెప్పాడు. ఇతడు తరుచు పాకిస్తాన్‌ ‌వెళ్లి వచ్చేవాడు. సిర్సా వెళ్లి అక్కడి విమానా శ్రయం ఫోటోలు పంపమని ఇతడిని పంపినట్టు తేలింది. మరొకడు నైమనుల్లాహి. హరియాణాలోని పానిపట్‌కు చెందిన ఇతడిని ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌తో తరుచు కలుసుకుంటున్నందుకు అరెస్టు చేశారు. ఇతడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. పని కర్మాగారంలో సెక్యూరిటి. ఇతడుకూడా పాకిస్తాన్‌కు చాలాసార్లు వెళ్లివచ్చాడని తేలింది. మహమ్మద్‌ ‌ముర్తాజా అలీ పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినవాడు. ఇతడు కూడా ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నవాడే. తనే తయారుచేసిన మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా పాకిస్తాన్‌ ‌గూఢచారులు కోరిన సమాచారాన్ని ఇచ్చేవాడు. జలంధర్‌లోనే అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ‌యాంటీ టెర్రరిస్ట్ ‌స్క్వాడ్‌ అరెస్టు చేసిన వ్యక్తి షెహజాదా. ఇతడు కూడా ఐఎస్‌ఐ ‌కోసం పనిచేశాడు. ఇతడు చాలాసార్లు పాకిస్తాన్‌ ‌వెళ్లాడు. సరిహద్దుల నుంచి సరుకులను అక్రమ రవాణా చేయడంలో దిట్ట. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సమయంలో పాకిస్తాన్‌కు కీలక సమాచారం అందించాడన్న ఆరోపణతో అరెస్టయిన వాడు సుఖ్‌‌ప్రీత్‌ ‌సింగ్‌. ఇతడిని గురుదాస్‌పూర్‌లో పట్టుకున్నారు. పంజాబ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌, ‌జమ్ముకశ్మీర్‌లలోని వ్యూహాత్మక ప్రదేశాల సమాచారం ఇతడు పాకిస్తాన్‌కు అందించాడని తేలింది. పెహల్గావ్‌ ‌హత్యాకాడ తరువాత ఐఎస్‌ఐ ఇతడిని క్రీయాశీలం చేసింది. రూ.లక్ష ఇతడి పేరు మీద బదలీ అయినాయి. ఇతడితో పాటే కరణబీర్‌ ‌సింగ్‌ అనే మరొక యువకుడిని కూడా గురుదాస్‌పూర్‌లోనే అరెస్టు చేశారు. ఇతడికి నేరుగా ఐఎస్‌ఐతోనే సంబంధాలు ఉన్నాయి. గడచిన15, 20 రోజులలో వీళ్లంతా పాకిస్తాన్‌కు చాలా సమాచారం పంపారని పోలీసులు చెబుతున్నారు.

పాకిస్తాన్‌ ఓ ‌ముష్టిదేశం. ఆ ముష్టిదేశంలో పనిచేసే నిఘా సంస్థ ఐఎస్‌ఐ. అది తన గూఢచారు లకు ఎంత చెల్లిస్తుంది? జ్యోతి మల్హోత్రా, మరికొందరి కక్కుర్తి తరువాత ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది. ఐఎస్‌ఐకి పాకిస్తాన్‌ ‌కేటాయించే వార్షిక బడ్జెట్‌ 5 ‌బిలియన్‌ల పాకిస్తాన్‌ ‌రూపాయలు. ఇందులోనే నాలుగు వేల మంది ఐఎస్‌ఐ ఉద్యోగులకి, విదేశాలలో ఉండే గూఢచారులకి, కోవర్ట్ ఆపరేషన్స్‌కి ఇస్తారు. మళ్లీ ఇందులో తేడాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌, ‌మైన్మార్‌ ‌వంటి దేశాలలో గూఢచర్యానికి తక్కువ ఇస్తారు. భారత్‌, అమెరికాలలో గూఢచర్యానికి పెద్ద ఎత్తున ముట్టచెబుతారు. అమెరికాలో పట్టుబడిన ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌ ‌చెప్పిన ప్రకారం అతడికి అప్పగించిన పని కోసం మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదంతా పరిశీలిస్తే సామాజిక మాధ్యమాలు ఇంత ప్రమాదకరంగా తయారయ్యాయంటే, వాటిని నడుపుతున్న వారిలో కొందరు దేశద్రోహులు ఉన్నారు కాబట్టే అని నమ్మక తప్పడం లేదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE