జస్టిన్ ట్రూడో పార్టీ నాయకుడిగా రాజీనామా చేసిన తర్వాత మార్క్ కార్నీ నేతృత్వంలో లిబరల్ పార్టీ కెనడా ఎన్నికల బరిలో నిలిచింది. ఏప్రిల్ 28న జరిగిన ఎన్నికలు జరిగాయి.164 స్థానాల్లో గెలుపొంది పెద్దపార్టీగా అవతరించింది కానీ, అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ లిబరల్ పార్టీ సాధించలేదు.
కెనడా పార్లమెంటరీ వ్యవస్థ ప్రధానంగా బ్రిటన్ నమూనాలోనే కొనసాగుతున్నది. ఇక్కడి ఫెడరల్ పార్లమెంట్లో మొత్తం 343 సీట్లుండగా, ప్రతి నాలుగేళ్ల కోమారు ఎన్నికలు జరుగుతాయి. 172 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. ఒకవేళ ఏ పార్టీకి తగిన మెజారిటీ రాకపోతే, అధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది సరిగ్గా మన దేశ పార్ల మెంటరీ విధానం మాదిరిగా ఉంటుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే కెనడా రాజ్యాంగం ప్రకారం కార్నీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ దేశపగ్గాలు చేపట్టింది. ట్రూడో నిష్క్రమణ, ట్రంప్ బెదిరింపులు వంటి అంశాలు తటస్థ ఓటర్లను లిబరల్పార్టీ వైపు మొగ్గుచూపేలా చేయడంతో పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించగలిగింది.
భారత్తో సంబంధాలు
ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు భారత్తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్ కార్నీ నాయకత్వం వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళుతుందనేది సహజంగా అందరి లోను వ్యక్తమయ్యే అనుమానం. ‘‘నిజం చెప్పాలంటే కెనడా ప్రజలకు భారతీయులతో వ్యక్తిగత, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలున్నాయి. అన్ని స్థాయిల్లో భారత్తో కెనడాకు మంచి సంబంధాలుండటం అన్ని విధాలా శ్రేయస్కరమని’’ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, భారత్-కెనడా సంబంధాలు మళ్లీ గాట్లో పడే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయి.
భారత్ కెనడా సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణమైన నిజ్జర్ హత్య సంఘటపై ఆయన ఆచితూచి స్పందించడమే కాదు, దీనిపై నెలకొన్న విభేదాలు పరిష్కరించదగినవే నని పేర్కొనడం, కార్నీ సానుకూల వైఖరిని వెల్లడి స్తోంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కెనడా ప్రస్తుతం ఉత్తర అమెరికా మార్కెట్ల కోసం యత్నాలు మొదలుపెట్టింది. ఇదేసమయంలో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించి వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలన్న ఉద్దేశంతో కెనడా నూతన ప్రభుత్వం ముందుకెళుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో రాజకీయంగా భారత్ వంటి బలమైన దేశం మద్దతు అవసరమని కూడా కెనడా కొత్త నాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా కెనడాను 51వ రాష్ట్రంగా ట్రంప్ పేర్కొన్నప్పుడు, కార్నీ తీవ్రంగా ఖండించారు.
ఇక భారత్ మద్దతున్న కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్రే పోయిలీవర్ తాను ఓటమి పాలైనా, పార్టీ 144 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. సిక్కులకు ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) అధినేత జగ్మీత్సింగ్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం భారత్కు ఆనందం కలిగించడం సహజం. జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి అవసరమైన 12 స్థానాలు కూడా ఎన్డీపీ గెలుచుకోకపోవడం భారత్ పరంగా సానుకూల పరిణామం. 2021 ఎన్నికల తర్వాత ట్రూడో మైనారిటీ ప్రభుత్వానికి ఎన్డీపీ మద్దతు కొనసాగించిన సంగతి తెలిసిందే. 2023లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కార్నీ ఎప్పుడూ నేరుగా వ్యాఖ్యానించింది లేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో క్షీణించి పోవడానికి కారణమైన ఈ అంశాన్ని సాధ్యమై నంతవరకు మరుగునపరచి, ముందుకెళ్లాలన్న ఉద్దేశమే గతంలో ఆయన తరచుగా చేసిన వ్యాఖ్యల్లో కనిపిం చింది. అదీకాకుండా ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య పరంగా (ముఖ్యంగా అమెరికాతో) సంబంధాలు ఉద్రిక్త దశలో పడిన తరుణంలో, భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ను చేజార్చుకోవడం ఆత్మహత్యా సదృశమే అవుతుందని కార్నీకి తెలియంది కాదు. అందుకనే ట్రూడో చేసిన తప్పిదాలను సరిదిద్ది ముందుకు సాగడమే లక్ష్యంగా కార్నీ ముందుకు సాగుతామన్న సంకేతాలు పంపుతున్నారు. కెనడాను 51వ రాష్ట్రంగా ట్రంప్ వ్యాఖ్యానించడం, కెనడా ఉత్పత్తులపై అధిక టారిఫ్లు విధించడంతో దేశంలో ప్రస్తుతం అమెరికాపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతు న్నాయి.
సానుకూల దేశాలతో వాణిజ్య సంబంధాలు
కార్నీ ఒక ఆర్థికవేత్త మాత్రమేకాదు గతంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలనుంచి బయటపడే విధంగా, వ్యూహాలు రూపొందించి అమలు చేసేదిశగా ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. సానుకూల వ్యవహారశైలి ఉన్న దేశాలతో ముఖ్యంగా భారత్తో వాణిజ్య సంబంధా లను మరింత పటిష్టం చేసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సంకేతాలు వెలువడు తున్నాయి. అంతేకారు వచ్చే జూన్ 15-17 తేదీల్లో కానన్స్కీస్ నగరంలో కెనడా నిర్వహించనున్న జి-7 దేశాల సమావేశానికి మోదీని ఆహ్వానించడం సంబంధాలను మెరుగు పరచుకునే దిశగా చేపట్టిన చర్యల్లో ఒకటిగా భావించాలి. కొత్త కమిషనర్లను నియమించడం మరో ముందడుగుగా చెప్పుకోవాలి. నిజ్జర్ హత్య విషయంలో ట్రూడో ప్రభుత్వం మనవారిపై పెట్టిన కేసుల అంశాన్ని పరిష్కరించే దిశగా తెరవెనుక రెండు దేశాల భద్రతా అధికార్ల మధ్య చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. గత జనవరిలో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ)కు చెందిన అధికార్లు, మనదేశానికి చెందిన భద్రతాధికార్లను కలిసారు. అదేవిధంగా మార్చి 16న న్యూఢిల్లీలో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలో జరిగిన భద్రతా సదస్సుకు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) డేనియల్ రోజర్స్ పాల్గొనడం గమనార్హం. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన భద్రతాధికార్లు పాల్గొన్నారు.
ట్రూడో వైఖరితో దెబ్బతిన్న సంబంధాలు
గత ఎన్నికల్లో లిబరల్ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని ఎన్డీపీ మద్దతు తీసుకొని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి జస్టిన్ ట్రూడో నాయకత్వం వహించి ప్రధాని అయ్యారు. ట్రూడో నాయకత్వంలో భారత్-కెనడాల సంబం ధాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సంకీర్ణ భాగ స్వామి ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ ఒత్తిడి ట్రూడోపై బాగా పనిచేసింది. దీంతో ఆయన ఖలిస్తానీ మూకలకు మద్దతుగా నిలవడమే కాకుండా, పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి అవలంబించారు. అందువల్ల ఖలిస్తాన్ తీవ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటికప్పుడు కోరుతున్నా ఆయన పెడచెవిన పెడుతూ వచ్చాడు. ఎన్డీపీ మద్దతు ఉపసంహ రించుకున్న తర్వాత కూడా జగ్మీత్ సింగ్ భారత్తో వ్యవహరించే విషయంలో ట్రూడోకు వెన్నుదన్నుగానే కొనసాగడం చరిత్ర. ట్రూడో హయాంలో రెండు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్న సంగతి తెలిసిందే. ట్రూడో వ్యవహారశైలి కారణంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడమే కాదు, మనదేశంనుంచి కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పడిపో యింది. నిజం చెప్పాలంటే కెనడాలో 1.8మిలియన్ల మంది భారతీయులుండగా వీరిలో 4,27,000 మంది విద్యార్థులు.
ఖలిస్థానీలపై వైఖరి మారాలి
కార్నీ కేబినెట్లోని ఒక మంత్రి, ‘‘కార్నీకి, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మంచి మిత్రులున్నారు. అందువల్ల ఇరుదేశాల సంబంధాలను తిరిగి పూర్వ స్థాయికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతు న్నాయి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే కార్నీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో ఏవిధంగా వ్యవహరి స్తుందనే దానిపై కెనడాతో, మనదేశం సంబంధాలు నెరపడం ఆధాపడివుంటుందనేది మాత్రం అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కెనడాలో పరిణామా లను మనదేశం ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తోంది.
బలమైన ఆర్థిక సంబంధాలు
రెండు దేశాల మధ్యం బహుళ రంగాల్లో బలమైన ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. 2023లో రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 13.49 బిలియన్ డాలర్లు. 2021లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 7.1 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్నుంచి ఎగుమతులు 4.76 బిలియన్ డాలర్లు కాగా కెనడానుంచి దిగుమతుల విలువ 2.35 బిలియన్ డాలర్లు. అదే 2019 ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.10 బిలియన్ డాలర్లు! ఇది 2020 నాటికి 5.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంతటి విభేదాలున్నా పరిశీలిస్తే రెండుదేశాల మధ్య వాణిజ్యం ఏడాదికే డాది పెరుగుతూ రావడం గమనార్హం. వీటికి తోడు క్యూములేటివ్ పెన్షన్ ఫండ్ కింద 55 బిలియన్ డాలర్లు మనదేశంలో పెట్టుబడి పెట్టింది. కెనడాకు చెందిన 600 కంపెనీలు మనదేశంలో కార్యకలా పాలు నిర్వహిస్తుండగా, వెయ్యి కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక మనదేశానికి చెందిన కంపెనీలు కెనడాలో సాఫ్ట్వేర్, స్టీల్, సహజ వనరులు, బ్యాంకింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మనదేశంనుంచి రత్నాలు, ఆభరణాలు, ఖరీదైన రాళ్లు, ఔషధాలు, రెడీమేడ్ వస్త్రాలు, యంత్రసాధనాలు, సేంద్రీయ రసాయనాలు, తేలికపాటి ఇంజినీరింగ్ వస్తువులు, ఇనుము&ఉక్కు వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. కాయ ధాన్యాలు, న్యూస్ ప్రింట్, కలప గుజ్జు, ఆస్బెస్టాస్, పొటాష్, ఐరన్ స్క్రాప్, రాగి, ఖనిజాలు, పారిశ్రామిక రసాయ నాలు మనదేశం దిగుమతి చేసుకుంటోంది. బ్రిటిష్ కొలంబియాలోని లిక్విడ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టులో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పదిశాతం భాగస్వామ్యాన్ని కలిగివుంది. 2010లో రెండు దేశాల మధ్య పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది 2013 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. రెండు దేశాల మధ్య కొనసాగు తున్న శాస్త్ర సాంకేతిక సహకారం ముఖ్యంగా పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి 2009లో రెండు దేశాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒక జాయింట్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇక రెండు దేశాల మధ్య విద్యా రంగంలో ప్రధానంగా చెప్పుకోవలసింది, అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు కెనడాలో విద్యనభ్య సించడం. భారత్- కెనడాల మధ్య ఉన్నత అభ్యసనకు సంబంధించి 300 అవగాహనా ఒప్పం దాలు కుదిరాయి. 1968 నుంచి విద్య, సాంస్కృతిక సహకారం కోసం ‘శాస్త్రి-ఇండో కెనడియన్ సంస్థ’ కృషిచేస్తోంది. ఇక రక్షణరంగానికి వస్తే మనదేశానికి చెందిన డీఆర్డీఓ, యార్క్ యూనివర్సిటీ, కెనడాతో 2012 నవంబర్లో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు జీవ-రసాయన యుద్ధం, సెన్సార్ల విషయంలో పరిశోధనలు జరుపు తున్నాయి. కెనడాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్, కెనడియన్ కమర్షియల్ కార్పొరేషన్తో కూడా డీఆర్డీఓ రక్షణ రంగానికి సంబంధించిన ఎంఓయూలను కుదుర్చుకుంది.
చైనాపట్ల వ్యతిరేకత
ప్రస్తుతం భారత్-కెనడాలు చైనాపై ఆధారపడ టాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా, కెనడాతో వాణిజ్యం పెంచుకోవడానికి యత్నిస్తుండగా, కార్నీ మాత్రం చైనాతో స్నేహం తమ భద్రతకు ప్రమాదకరమన్న ఉద్దేశంతో ఉండటం గమనార్హం.
ఎందుకంటే, చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ సంస్థ ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝౌను కెనడా అరెస్ట్ చేసినందుకు ప్రతిగా చైనా 2018లో ఇద్దరు కెనడా జాతీయులను జైల్లో పెట్టింది. ఈ పరస్పర చర్యలు అప్పట్లో రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం విషయంలో కెనడా తటస్థ వైఖరినే అనుసరి స్తోంది. తనకు కూడా ట్రంప్ ‘సెగ’ తగిలినప్పటికీ, చైనాతో సానుకూలంగా వ్యవహరించడానికి కెనడా ఇష్టపడటంలేదు. అదీకాకుండా ప్రస్తుతం చైనా కూడా భారత్ను ఏదోవిధంగా ప్రసన్నం చేసుకోవాలని చేస్తున్న యత్నాలు కెనడాకు తెలియనివి కావు. ఈ నేపథ్యంలో భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడానికే కెనడా ప్రాధాన్యం ఇస్తుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం.
– విఠల్