రాష్ట్రంలో ఓట్ల నమోదు పక్రియలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలతో ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్షాల వారి ఓట్ల తొలగింపు కార్యక్రమం భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దినపత్రికల్లో రోజూ రెండు, మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో బోగస్‌ ఓట్ల వ్యవహారం వస్తూనే ఉంది. 2024లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బోగస్‌ ఓట్ల వ్యవహారంతో ఆందోళన చెందిన విపక్షాలు సర్వేలు చేస్తూ, దొంగ ఓట్లను గుర్తిస్తున్నాయి. ఈ సర్వేతో కలుగు లోంచి వచ్చే ఎలుకల్లా పట్నాల్లో డివిజన్‌ ‌స్థాయిలోనే వందలకు వందల బోగస్‌ ఓట్లు బయటపడుతున్నాయి. ఒకే డోర్‌ ‌నెంబరుతో వందలాది ఓట్లు నమోదు కావడం విస్మయ పరుస్తోంది.

వైసీపీకి వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అలవాటుగా మారిందని విపక్షాలు మండిపడు తున్నాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో (ఏ ఎన్నికైనా సరే) ఆ పార్టీ వ్యవస్థలను దుర్విని యోగం చేసి గెలిచింది తప్ప, ప్రజాబలంతో కాదనేది తెలిసిన విషయమే. ఇప్పుడు చివరి సమయం వచ్చే సింది. అధికారం రావాలంటే మరల ఎన్నికల్లో గెలిచి తీరాలి. ప్రజల సమస్యల్ని పరిష్కరించి, పన్నులు, ధరలు పెంచకుండా అదుపులో ఉంచి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఎల్లప్పుడూ సమాజంలో శాంతి ఉండేలా పాలించే పార్టీలకు గెలుపు అవకాశా లుంటాయి. కాని వైసీపీ ప్రభుత్వం పైన పేర్కొన్న అన్ని అంశాలకు విరుద్ధంగా పాలించింది. నాలు గేళ్లుగా ప్రభుత్వ విధానాన్ని చూసి ప్రజలు విసిగివేసారి పోయారు. ఎప్పుడు దీనిని ఓడిద్దామా అని ఎదురుచూస్తున్నారు. దాంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజాగ్రహం ఇలాగే ఉన్నా, మరికాస్త పెరిగినా దారుణంగా ఓడిపోతామని భావించింది. అందుకే అడ్డదారిలో అయినా గెలవాలని ప్రణాళిక వేసింది. అందుకోసమే దొంగ ఓట్ల సృష్టి.

మొదటి నుంచీ ఇదే దారి

వైసీపీకి మొదటి నుంచి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. తమకు ప్రత్యర్థులే ఉండకూడదని ఆ పార్టీ అభిప్రాయం. అధికారుల అండగా అక్రమ మార్గాలకు పాల్పడింది. 2019 తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇదే వ్యవహారం. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు, బద్వేలు, కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు దొంగ ఓట్లకు తెరతీసింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనే 3 లక్షల వరకు ఫేక్‌ ఐడీలు సృష్టించి దొంగ ఓట్లు వేయించినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆ ఎన్నికల కోసం భారీగా దొంగ ఐడీలు సృష్టించి ఓట్లు తయారు చేసినట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించి వాటిని మీడియా ముందు ఉంచిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన దొంగ ఓటర్లను కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించినా వారిని వదలివేశారు. ఎన్నికల రాష్ట్ర ఉన్నతాధి కారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఏకగ్రీవం పేరుచెప్పి ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయ కుండా నిలువరించే ప్రయత్నం చేసింది. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయనీయ లేదు. బెదిరించి, ప్రలోభపెట్టి, రౌడీయిజం, గుండా యిజంచేసి అణచివేసే ప్రయత్నం చేసింది. కొందరిని కిడ్నాప్‌ ‌కూడా చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆగడాలకు దేశం మొత్తం నివ్వెర పోయింది.

ఓటమి భయంతో

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆ ప్రభుత్వం అన్ని వర్గాలను అన్ని రకాలుగా వేధించి దూరం చేసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన వందల కొద్దీ హామీలను నెరవేర్చలేదు. ఉద్యోగుల నుంచి నిరు ద్యోగుల వరకు, కార్మికుల నుంచి రైతుల వరకు, మహిళల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం అసంతృప్తి పరచింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేదు. నాలుగైదుసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. బస్సు ఛార్జీలు, పెట్రోలు ధరలు పెంచారు. పన్నుల భారం వేశారు. దీంతో అన్నివర్గాలు ప్రభుత్వ వైఖరితో మండిపడుతున్నాయి.

దూరం కానున్న ఓటు బ్యాంకు

ఎస్సీలు, ముస్లింలలో వైసీపీపట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలపై దమనకాండ పెరిగిపోయింది. వారి కోసం అమలవుతున్న 27 పథకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ని నిర్వీర్యం చేసింది. దానికి తోడు ఇసుక దొరకనీయకుండా చేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీయడంతో నిర్మాణ రంగంలో పనిచేసే ఎస్సీ, ముస్లింలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అలాగే నాసిరకం మద్యం రెండు రెట్లు అధిక ధరకు అమ్మడం కూడా వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్‌ ‌సుధాకర్‌ ‌పిచ్చివాడని ముద్రవేసి ప్రాణాలు తీసుకునేలా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన తన కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌ ‌డెలివరీ చేశాడు. చీరాలలో కిరణ్‌ అనే యువకుడిని కొట్టిచంపారు. మద్యం ధరలపై ప్రశ్నించినందుకు ఓంప్రకాష్‌ అనే యువకుడిని చంపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ అసైన్డ్ ‌భూములను ఆక్రమించుకుంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దాడులు, ఆరాచకాలు.

 ముస్లింలదీ ఇదే పరిస్థితి. వారికి ఉద్దేశించిన జీవనోపాధి, స్వయం ఉపాధి పథకాలను ఈ ప్రభుత్వం అమలుచేయలేదు. వీటన్నిటిపై సహజం గానే ఎస్సీ, ముస్లిం వర్గాల్లో అగ్రహం వ్యక్తమవు తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలోని ఎస్సీ మంత్రులు, కీలక పదవుల్లోని ఎస్సీ నాయకుల్లో ఒక్కరు కూడా ఎస్సీలపై జరుగుతున్న దమన కాండపై ఒక్కసారి కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేకత తమను చుట్టుముడుతున్న ఎస్సీ సునామీని తట్టుకునేందుకు బోగస్‌ ఓట్లతో గట్టెక్కాలని వైసీపీ భావిస్తోంది.

ఒకే ఇంటి నంబర్‌పై ఎన్ని ఓట్లో..

గతంలో వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత సర్వేల ప్రకారం కనీసం పదిహేను శాతం ఓట్లు తగ్గిపోనున్నాయి. అందుకే బోగస్‌ ఓట్లతో గెలవాలని నిర్ణయించిందంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడు నాలుగు విడతల్లో పోలింగ్‌ ‌జరిగేలా చేయాలని భావిస్తోంది. దొంగ చిరునామాలతో ఒకే ఇంటి నెంబరు మీద వందలాది ఓట్లు నమో దయ్యాయి. ఆయా గ్రామాల్లో విపక్షాల అభిమానుల ఓట్లను భారీగా తొలగించారు. కూలి పనుల కోసం వలస వెళ్లిన వారి ఓట్లు భారీగా తొలగించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా వాటిని వేయించుకుందా మనుకుంటున్నారు. ఈ పక్రియలతో కోల్పోయిన 15 శాతం ఓట్లు తిరిగి రాబట్టుకోవాలనేది వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. కొత్త ఓట్లు నమోదు చేయాలంటే అన్నిరకాల పరిశీలనల తర్వాత గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండాలి. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రోద్భలంతో లేని వారిని ఉన్నట్లు చూపించి ఓట్లు నమోదు చేసేలా గెజిటెడ్‌ అధికారులు సైతం సంతకం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎన్నికల అధికారికి ఫిర్యాదు

బోగస్‌ ‌నోట్ల నమోదు, విపక్షాల అభిమానులుగా గుర్తింపు పొందిన వారి ఓట్లు తొలగింపుపై ప్రతిపక్షాలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుచేసే నాటికి 14 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం దొంగ ఓట్లు చేర్పించిందని పేర్కొన్నారు. 2100 ఇంటి నంబర్లతో లక్షా 85 వేల దొంగ ఓట్లు చేర్పించారని తెలిపారు. ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 వరకు దొంగ ఓట్లు చేర్పించిం దని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. ఈ ఫిర్యాదుతో ఆయన కూడా ఏకీభవిస్తూ, ఈ అంశాలు తమ దృష్టికి కూడా వచ్చాయ న్నారు. జూలై 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్‌ ‌జాబితా పరిశీలన ప్రారం భమై, ఆ పక్రియ అక్టోబర్‌ 7 ‌వరకు కొనసాగు తుంద న్నారు. ఆ పరిశీలనలో బీ.ఎల్‌. ‌వోలు అందరూ ప్రతి ఇంటి కెళ్లి, ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్లు ఎంతమంది? ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఉండాల్సిన వారు ఎక్కడికైనా వెళ్లారా? వలస వెళితే ఎంతమంది వెళ్లారు? అనే వివరాలు సేకరిస్తారని ఆయన చెప్పారు. కానీ చాలాచోట్ల బీ.ఎల్‌.‌వో.లు ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడో ఒకచోట కూర్చొని ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలపై టిక్కులు పెడు తున్నారని పార్టీల నాయకులు ఆయనతో చెప్పారు. దానివల్ల దొంగఓట్లు తొలగించడం సాధ్యం కాదని కూడా వివరించారు. ఇప్పుడున్న సాంకేతిక పరి జ్ఞానంతో గూగుల్‌లోని హౌస్‌ ‌మ్యాపింగ్‌ ‌సాయంతో బీ.ఎల్‌.‌వోలు గ్రామానికి వెళ్లాక, ఇంటింటికీ తిరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగఓట్లను కట్టడిచేయడంపై తప్పకుండా ఆలోచిస్తామని ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చారు. అక్టోబర్‌ 17 ‌నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ ‌వెలువడుతుందని, దానిని అన్ని పార్టీలు చూసిన తర్వాత దొంగ ఓట్లు ఉంటే, ఆధారాలతో సహా మరోసారి ఫిర్యాదు చేయాలని, దానినిబట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘బీ.ఎల్‌.‌వో.లు క్షేత్రస్థాయిలో ఓటర్‌ ‌వెరిఫికేషన్‌కు వెళ్లినప్పుడు, పార్టీల కార్యకర్తలు కూడా వారితో పాటు వెళ్లాలి. అప్పుడు తొలిగించిన ఓట్లు, దొంగ ఓట్లపై నిగ్గుతేలుతుంది. బీ.ఎల్‌.‌వో.లు ఏ ఇంటికెళ్లినా, వారితోపాటు మీరు కూడా వెళ్లండి.. వారు తప్పుచేస్తే తమ దృష్టికి తీసుకురావాలి’ అని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram