– డా।। బండారి సుజాత

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన

……………………………………………………………………….

‘‘ఏమండీ! మన హిమాన్షికి పాప పుట్టిందట’’ అన్నది సుమిత్ర భర్త సూర్యంతో.

‘‘అవునా! చాలా సంతోషం పాపం వాళ్లు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారు కదా! అవును.. పెళ్లయి ఏడు, ఎనిమిది సంవత్సరాలయింది కదా!’’ అన్నాడు సూర్యం.

‘‘ఆఁ అవును పాపం సీతక్క కొడుకుకు సంతానం కోసం మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు, తిరగని డాక్టర్‌ ‌లేడు. వాళ్లిద్దరిని పట్టుకుని చేయాల్సిన వెన్నెన్నో చేసింది. ఇన్ని సంవత్సరాలకు వాళ్ల ఇంట్లో చిన్నిపాప వచ్చింది’’ అన్నది సంతోషంగా సుమిత్ర.

అక్క కొడుకుకు పాప పుట్టడంతో అందరికి చెప్పి సంతోషాన్ని పంచుకొంటున్నది, సుమిత్ర.

‘‘అబ్బో! అక్క కంటే నీకే ఎక్కువ సంబరం ఉన్నట్టున్నది’’ అన్నాడు సూర్యం.

‘‘భలే వారే! చిన్న పిల్లలున్న ఇల్లే అందాల పొదరిల్లు. పిల్లలు లేకుంటే ఆ ఇంట్లో సందడేది?’’ అన్నది సుమిత్ర.

‘‘అంతేకాదు, మన ఎదురింటి లక్ష్మమ్మ చిన్న కొడుకుకు కూడా కొడుకు పుట్టాడు’’ అన్నది సుమిత్ర. ‘‘ఇవాళ అన్ని ఇవే ముచ్చట్లు చెప్తావా? తినడానికి ఏమన్నా పెట్టేది ఉందా’’ అన్నాడు సూర్యం.

‘‘మరి నాకు ఇంకేం పని ఉంది. అలా అలవాటయిపోయింది. ఎవరింట్లో పసివాళ్లు పుట్టినా నాకే చెప్తారు కదా! అది మీకు తెలుసు’’ అన్నది సుమిత్ర.

మీరు త్వరగా కాళ్లు కడుక్కుని రండి వడ్డిస్తానంటూ వంటింట్లోకి వెళ్లింది సుమిత్ర.

సుమిత్ర, సూర్యంలకు ఇద్దరు కొడుకులు. వాళ్ల చదువులు,పెళ్లిళ్లు, పిల్లలతో ఇల్లు సందడికి మారు పేరుగా ఉండేది. కొడుకులు ఉద్యోగా లంటూ, దూరంగా వెళ్లిపోవడంతో ఇంట్లో మిగిలింది మళ్లీ ఇద్దరే.

పెద్ద కొడుకుకు ఒక కూతురు, ఒక కొడుకు. ప్రైవేట్‌ ‌కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది. చింతలేని కుటుంబం. ఈ మధ్యనే ఇల్లు కూడా కట్టుకున్నారు. పెద్దకొడుకు ఒకరిని అడగడు, ఎవరికి పెట్టడు. పిల్లలతో హాయిగా జీవించే ఆధునిక కుటుంబం.

రెండో కొడుకుకు ఒక బాబు. వాళ్లిద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. రెండో కొడుకు, కోడలు గుర్తు రాగానే బాబు పుట్టినప్పటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి సుమిత్రకు.

*********

బంగారం లాంటి బాబు పుట్టాడని అందరూ సంతోషించారు. ‘‘అసలు ఇప్పుడు మాకు పిల్లలే వద్దనుకున్నా కాని ఇతను వినలేదు’’ అన్నది రాధిక.

‘‘అవేం మాటలమ్మా! పండంటి బాబుకు జన్మనిచ్చావు. సంతానం లేకుంటే ఎంత బాధో నీకు అర్థం కావడంలేదు’’ అన్నది సుమిత్ర.

రాధిక తల్లి కూడా ‘‘తొమ్మిది నెలలు మోసి కన్నావు. అలాంటి మాటలు మాట్లాడొద్ద’ని’’ చెప్పింది. ‘‘అయినా బాబంటే నాకు ఇష్టం లేదు. కావాలంటే మీరే పెంచుకోండి.’’ అన్నది కోడలు రాధిక.

‘‘తల్లి గర్భం నుండి భూమి మీదకు వచ్చి కేవ్‌, ‌కేవ్‌ ‌మని ఏడ్చే పిల్లలకు అమ్మపాలే అమృతమమ్మా, తప్పకుండా బాబుకు నీ పాలు పట్టాలి’’ అన్నది డాక్టర్‌ ‌లావణ్య.

 ‘‘శిశువు శారీరకంగా, మానసికంగా పెరగా లంటే తల్లిపాలే శ్రేష్టమని తేల్చి చెప్పింది’’ డాక్టర్‌.

‘‘‌చూడమ్మా సృష్టిలోని ప్రతి జీవిలో మాతృత్వం దాగి ఉంటుందనే విషయం తెలియని వారెవ్వరూ ఉండరు. ఒకసారి నీ బాబుకు పాలిచ్చి చూడు అష్టైశ్వర్యాలు కూడా పనికిరావు’’ అన్నది డాక్టర్‌ ‌లావణ్య.

‘‘చూడు రాధికా నువ్వు డెలివరీ అయిన రోజే సమత అనే అమ్మాయికి ఆబార్షన్‌ ‌చేశాను. ఎందుకో తెలుసా? లోపల పాప ఎదగలేదు కనుక. ఆ అమ్మాయి బోరున ఏడుస్తోంది, పాప కోసం. నువ్వు పుట్టిన బిడ్డకు పాలివ్వనంటున్నావు.’ అన్నది డాక్టర్‌ ‌లావణ్య.

లావణ్య.. సుమిత్రకు ఫ్యామిలీ డాక్టర్‌. అం‌తేకాదు, సుమిత్ర చెల్లెలు కూతురు కనుక అనేక విధాలుగా నచ్చచెపుతూనే ఉంది. రాధికపై ఎక్కువ ఒత్తిడి తెస్తే మానసికంగా అనారోగ్యానికి గురవుతుందని వదిలేసింది లావణ్య.

బాబు ఏడ్చినప్పుడు డబ్బా పాలు పడుతున్న పెద్దవాళ్లిద్దరి కళ్లు నీళ్లతో నిండిపోతున్నాయి.

ఇక సుధీర్‌ ఆమె చెప్పినట్లే వింటే అయిపోయేది. పసిప్రాణాన్ని బాధపెడుతున్నానని బాధపడుతున్నాడు.

‘‘చూడమ్మా రాధిక కోడి ఇరవై ఒక్క రోజులు పొదిగి పిల్లలు రాగానే తన రెక్కల కింద భద్రంగా దాచుకుంటుంది. దగ్గరకు ఎవరొచ్చినా పొడుస్తుందని నీకు తెలుసు. ప్రతి జీవికి పిల్లలపై ఉండే మమకారం అలాంటిది’’ అన్నది సుమిత్ర.

‘‘ఆవులు, గేదెలు బిడ్డ పుట్టగానే ప్రేమతో తమ నాలుకతో నాకుతూ వాటికి దగ్గరవుతాయి. పశుపక్ష్యాదులలోని ప్రేమ నువ్వు చూడనిది కాదు. కనీసం బాబుని దగ్గర తీసుకోమ్మా! నేనే పెంచుకుంటాను, పసివాడు కదా!’’ అన్నది సుమిత్ర.

‘‘నీకిదేం ఆలోచనే! కుక్కలు, పిల్లులు క్షీరదాలన్నింటి గురించి చదువుకున్నావు కదా! ఇంక నువ్వు టీచర్‌వే కదా! పిల్లులు తమ పిల్లలను ఏడు ఇండ్లలో తిప్పుతూ కాపాడుకుంటాయి. కుక్క తన పిల్లల దగ్గరకు ఎవరినీ రానీయకుండా కాపాడుకుంటుంది. అంతేకాదు, నేను నీకు పాలివ్వకుంటే నువ్వు ఎక్కడ ఉండేదానివన్నది’’ రాధిక తల్లి జయమ్మ.

‘‘అందరు చెప్పే మాటలే కాక పిల్లలకు పాలిస్తే, పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇవ్వకుంటే ఎలా ఉంటుందో గూగుల్‌లో చూపి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు’’ రాధిక భర్త సుధీర్‌.

‌బాబు పుట్టి రెండు రోజులైంది. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. అందులో బాబుకు ‘పసకలు’ కూడా కావడంతో బాక్స్‌లో పెట్టి ఉంచారు.

సుమిత్ర, జయమ్మ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆవు ఎక్కడ ఉందో తెలిసుకొని ఆవుపాలను తెప్పించి బాబుకు తాగిస్తున్నారు.

‘‘చూడు రాధికా నీకు ఇంకోసారి చెప్తున్నా. నువ్వేం చిన్నపిల్లవు కాదు, చదువుకున్న దానివి. పిల్లలకు పాలిస్తే అందమేమి చెడిపోదు. ప్రసవానంతరం పాలు లేత పసుపు రంగులో చిక్కగా ఉంటాయి. వీటిలోనే పిల్లలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి పిల్లలకు పట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు రాకుండా కాపాడతాయి. వీటినే ‘ముర్రుపాలు’ అని అంటారు. ఇవి పిల్లలకు తప్పనిసరిగా తాగించాలి.

అంతేకాదు, బిడ్డకు పాలివ్వడం వలన పెరిగిన తల్లి బరువు తగ్గుతుంది. గర్భసంచి యథాస్థానానికి వస్తుంది. క్యాన్సర్‌ ‌ప్రమాదం నుండి రక్షిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ ‌వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు, బిడ్డకు పాలిస్తే ‘ఐదువందల నుండి ఏడువందల కేలరీలు కూడా ఖర్చు అవుతాయి. నీ అందం ఇంకా రెట్టింపవుతుంది తెలుసా? బాలింత మోము బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం మోములో కలకలలాడుతూ ఉంటుంది.

బాబు పుట్టి ఇప్పటికి మూడు రోజులు. పాలు పడలేదనుకుంటా. పాలు పడకుంటే నువ్వే అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీ అందాన్ని కాపాడుకోవచ్చు. నేను కూడా పాలు రాకుండా మందులిస్తాను.

బిడ్డకు పాలు పట్టడం లేదని ఏడ్చే తల్లులను చూశాను కానీ, నీ లాంటి దాన్ని చూడటం ఇదే మొదలు. ఎంతోమంది పిల్లల పెంపకానికి తమ కెరీర్‌ను కూడా వదలుకుంటున్నారు. అసలు నీ బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదు.

ఒకవేళ తల్లికి పాలు సరిగా పడకపోతే పసుపు, వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవాలి. పాలవృద్ధి జరుగుతుంది. అంతేకాదు నానపెట్టిన బాదాం గింజలను ఉదయం ఎనిమిది లేదా పది గింజలను గ్రైండు చేసి గోరువెచ్చని పాలలో వేసి తాగించాలి. ఇంకా పాలలేమి ఉన్నచో ఆయుర్వేద ఔషధాలలో ‘శతవరి’ వాడితే మంచి గుణం కనపడుతుందని, అలా చాలామందికి సూచనలిచ్చి పిల్లలకు పాలు ఇప్పిస్తున్నాను’’ వివరించింది లావణ్య.

అదే ఆస్పత్రిలో డెలివరీ అయిన సుష్మ.. రాధిక స్నేహితురాలు. ఆమెకు పాప పుట్టింది. రాధిక కూడా ఇక్కడే ఉందని తెలిసి చూడడానికి వచ్చింది సుష్మ వాళ్లమ్మ సునీత.

బాబు ఏడుపు, బాబుకు పోసే పోత పాలు చూసి, ‘‘అయ్యో రాధికకు పాలు పడలేదా? సుష్మకు త్వరగానే పాలు పడ్డాయి’’ అన్నది సునీత. మళ్లీ ఆమె మాట్లాడుతూ ‘‘బాబుకు ఆ పాలు పట్టకండి. ఇక్కడున్నన్ని రోజులు సుష్మే బాబుకు పాలు ఇస్తుంది.’’ అన్నది. తల్లి పాలను మించినది ఏదీ లేదు సరేనన్నారు జయమ్మ, సుమిత్ర.

తన బిడ్డకు స్నేహితురాలు పాలిస్తుందని తెలిసి సిగ్గుపడింది రాధిక. అప్పటికి ఐదు రోజులు అవుతుండడంతో పాలు పడి రొమ్ముల్లో సలపడం మొదలైంది రాధికకు.

‘‘అమ్మా! బాగా నొప్పి పెడుతున్నాయి’’ అని చెప్పింది రాధిక.

‘‘పాలు పడ్డాయనుకుంటా. అవే తల్లి పాలు. అవి నీ బిడ్డకు ఇచ్చావంటే బాబు ఆరోగ్యం బాగుంటుంది. నీకు నొప్పి ఉండదు’’ అని చెప్పింది జయమ్మ.

‘‘పాలిచ్చే తల్లి సిగ్గు పడాల్సిందేమీ లేదు. ఎలా ఏడుస్తున్నాడో చూడు. మా ఇద్దరికీ నిద్ర లేకుండా చేస్తున్నాడు. బాబుని తీసుకొని రమ్మంటావా?’’ అని అడిగింది రాధిక తల్లి జయమ్మ.

ఏడ్చే బాబునుఎత్తుకొని ఊర్కోపెడతున్నది సుమిత్ర. ‘‘వదినమ్మా! బాబును ఇవ్వండి. రాధిక ‘పాలు’ పడుతుంది.’’ అన్నది.

బాబు బాధను చూసి మూగగా రోదిస్తున్న సుమిత్ర ‘‘అవునా! ఒప్పుకుందా! నిజమా! వదినమ్మా?’’ అనగానే, మీరు కూడా రండి మనం మన మనవడికి పాలు పడదామన్నది జయమ్మ.

ఏ దేవుడు నా మొర విన్నాడో అనుకొని ఏడ్చేసింది సుమిత్ర. కళ్లు తుడుచుకుంటూ, బాబుకు తల్లి పాలు పడుతున్నది జయమ్మ. బాబు పాలు తాగుతూంటే మంత్రం వేసినట్టు నొప్పి మాయమవడంతో, వాణ్ణి గుండెలకు హత్తుకుని బోరున ఏడ్చింది రాధిక.

‘‘‘మేడం! మీ మరదలు రూములో ఏడుస్తున్నారు.’’ అని ఆయమ్మ చెప్పగానే పరుగున వచ్చింది లావణ్య.

 అక్కడ దృశ్యం చూసి, సంతోషించి రాధిక వెన్ను తట్టి ‘‘నువ్వు వద్దనుకున్నా మాతృమూర్తి మమతనందుకున్నాడు నా మేనల్లుడని బాబును ముద్దుచేసింది డాక్టర్‌ ‌లావణ్య.

బిడ్డకు పాలిచ్చిన తర్వాత మెల్లగా ఎర్రనిబట్టతో పెదవులు తుడవాలని అత్తగారు చెప్పే మాటలకు తలూపింది రాధిక. అప్పటివరకు బెంగతో ఉన్న అందరి మొహాల్లో నవ్వులు పూసాయి.

ఇప్పటికైనా నీ మొండితనం వదిలావు. బిడ్డకు సంపూర్ణ ఆహారం తల్లిపాలే. పిల్లలు కనీసం ‘ఇరవై’ గంటలు నిద్రపోవాలి. తల్లి పాలలో ఉండే ట్రిప్టోఫాన్‌ ‌రాత్రి వేళ శిశువు ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఉపయోగపడుతుంది. నిద్రపోతే లేపవద్దు. బాబు ఏడవగానే పాలు పట్టు. వాడి పెదాలు తాకగానే శరీరంలో మార్పులు జరుగుతాయన్నది లావణ్య.

*********

‘‘అన్నం పెట్టి మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తున్న భార్యను తట్టి ఏం ఆలోచిస్తున్నావు?’’ అన్నాడు సూర్యం.

ఏమీ లేదండి రాధిక చేసిన హఠం, చిన్నోడి ఏడుపు అన్ని గుర్తుకు వచ్చాయని కళ్లు తుడుచుకుంది సుమిత్ర. ‘‘ఏదైతే నేం తప్పు తెలుసుకొని బాబుని బంగారంలా చూసుకుంటుంది కదా’’ అన్నాడు సూర్యం.

అప్పటినుండి ఊర్లో ఏ ఇంట్లో పాప పుట్టినా, సుమిత్రకు చెప్పడం అందరికీ అలవాటైంది. వాళ్లకు తల్లి పాల శ్రేష్టత గురించి చెప్పి, పోతపాలు పోయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏమి తింటే పాలు పడతాయో చెప్తూ, యోగక్షేమాలు తెలుసుకొంటూ పుట్టిన పిల్లలందరితో అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిపించుకొంటున్నది సుమిత్ర.

తన వాళ్లు దూరంగా ఉన్నా, పసిపిల్లల ఆలన పాలనలో తనను తాను సాంత్వన పరుచుకొంటూ ఆనందగా జీవిస్తున్నది సుమిత్ర.

About Author

By editor

Twitter
Instagram