కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇది ఒక ప్రళయ కాలం. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు (2,3 మినహా) కలిసికట్టుగా ఏకాత్మభావంతో, సంవేదనతో ప్రజలకు సేవ చేస్తున్నాయి. కొద్ది మంది మినహాయిస్తే ప్రజలందరూ నియమాలను పాటిస్తూ జాగ్త్రగా ఉంటున్నారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్‌ ‌సిబ్బంది నిరంతరం ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు. సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వేత్తలు, అనేకమంది వ్యక్తులు తోటి ప్రజలకు భోజన సదుపాయాలు, నిత్యావసర సామాగ్రి, పండ్లు, కూరగాయలు తదితర వస్తువులు ఇస్తూ ఎంతో ప్రేమతో సేవ చేస్తున్నారు. అదే సమయంలో వివిధ చోట్ల చిక్కుకున్న వలస కార్మికులు, బాధితులు ఆకలితో ఇతరులపై పడి దోచుకోలేదు. హింసించలేదు.

దేశంలో అనేక చ్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు నగరాల్లో, గ్రామాల్లో ఎంతో ఆప్యాయతతో వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల రామాయణ, మహాభారతాలు చూడడానికి టీవీలు కూడ ఏర్పాటు చేసారు. భారత ప్రధానమంత్రి నుండి సామాన్య ప్రజల వరకు ప్రేమ, బాధ్యత, సేవ, సహకారం అనే మానవత్వపు గుణాలు పూర్తిగా అందరి అనుభవంలోకి వచ్చాయి. విపత్తు సమయంలో అందరి కళ్లకు కనిపిస్తొన్న అద్భుతమైన దృశ్యం ఇది.
ఈ కష్ట కాలంలో లోతుగా ఆలోచించినట్లైతే…
1. వైద్య చికిత్సకు కావాల్సిన మందులు, డాక్టర్లు నర్సులకు కావలసిన జూజూవ దుస్తులు, మాస్కులు, వెంటిలేటర్లు, కరోనా పరీక్షా యంత్రాలు ఇవన్ని ఎంతో వేగంతో సమకూర్చుతున్నారు.
2. 130 కోట్ల మందికి కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సామాగ్రిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సరఫరా చేస్తోంది. లాక్‌డౌన్‌ ‌కాలంలో ప్రజలందరూ తమ ఇంట్లో ఉంటూ భోజనం పాలు, పండ్లు, ఇవన్ని తీసుకుంటూ జీవిస్తున్నారు. ఆరోగ్య రీత్యా అల్లం, సొంటి, దాల్చిన చెక్క, మిరియాలు వంటివి ఎన్నో కలిపి కషాయంగా వాడుకుంటున్నారు. పసుపు, పుదీన కలిపి ఆవిరి పడుతున్నారు. మొత్తం మీద బియ్యం, గోధుమలు, నూనె, పప్పు, దినుసులు, అల్లం, సొంటి, పసుపు, వెల్లుల్లి, మిరియాలు, తులసి ఆకులు, పుదీనా ఆకులు, అన్ని రకాల కూరగాయలు వాడుకుంటూ కోట్లాది ప్రజలు జీవిస్తున్నారు. ప్రజలకి ఈ కష్ట కాలంలో మిగతా భోగ భాగ్యాలమీద, విలాసవంతమైన వస్తువుల పైన దృష్టి లేదు. కాబట్టి ప్రజలందరికీ కావాల్సింది ఆరోగ్య ప్రదమైన భోజనం. అందుకు కావాల్సిన ప్రతి వస్తువు, పదార్థం, పండు, కాయ అన్ని గ్రామాల్లోనే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. అయితే నేటి వరకు భారతదేశంలో గ్రామీణ జీవనానికి• పెద్దగా విలువలేదు.
నేడు 130కోట్ల మంది ప్రజలు బ్రతికి బట్టగట్టింది గ్రామాల వల్లనే. ఈ రోజు ప్రశాంతంగా మానవత్వంతో, దూరదృష్టితో ఆలోచించవలసిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆర్థిక ప్రణాళికలు ఈ దిశలో ప్రయాణం చేశాయి. అయితే మన పెద్దలు ఎక్కడో తప్పటడుగులు వేశారు. నేడు అహంకారానికి అవకాశమివ్వకుండా సద్బుద్ధి, మానవత్వంతో ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది.
Human oriented economic planning నేటి అవసరమని భారత ప్రధానమంత్రి తెలిపారు. ఇది ఎంతో సంతోషకరమైన పరిణామం. 1910 సంవత్సరంలో పూజ్య గాంధీజీ ‘‘హిందూ స్వరాజ్య పుస్తకంలో’’ – స్వరాజ్యం వచ్చిన తరువాత దేశ ఆర్థిక ప్రణాళికల యోజన గ్రామాల కేంద్రంగా, వ్యవసాయాధారంగా జరగాలని సూచించారు.
ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలు మారడం అనేది ఒక మహా పక్రియ. నేడు జాతీయ భావనతో పని చేసే సంస్థలు, అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు, గ్రామాల ఆర్థిక వికాసం కొరకు విశేషంగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఆంగ్లేయులు భారత దేశాన్ని కొల్లగొట్టక ముందు 700 సంవత్సరాల పాటు ముస్లీంల దండయాత్ర కారణంగా, బానిసత్వంలో ఉన్నాం. అయిన్నప్పటికి దేశంలోని గ్రామీణ ప్రజలు ఆర్థికంగా సంపన్నంగా జీవించేవారు. 17వ శతాబ్దం వరకు గ్రామాలలో వ్యవసాయం, అనేక రకాల కుటీర పరిశ్రమలు ఉండేవి. తెలంగాణలోని అదిలాబాదు జిల్లా నుండి కొల్లమ్‌ ‌గిరిజన తెగ ప్రజలు స్టీల్‌ ఉత్పత్తి చేసి ఇంగ్లాండుకు ఎగుమతి చేసేవారు. 1803 సంవత్సరంలో బ్రిటిష్‌ ‌రాయల్‌ ‌సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ ‌బ్రాన్‌ ‌మాట్లాడుతూ ‘‘భారతదేశంలో అత్యంత నాణ్యమైన స్టీలు తక్కువ ధరకు లభిస్తోందని’’ లండన్‌ ‌సభలో చెప్పారు. అంటే దాదాపుగా 1820 సంవత్సరం వరకు మన గ్రామాల్లో వ్యవసాయం, చిన్న తరహ పరిశ్రమలు ఉండేవి. ఆంగ్లేయులు చిన్న తరహ పరిశ్రమలన్నింటిని ధ్వంసం చేశారు. ఢాకాలోని చేనేత కార్మికులు ఇంగ్లాండు రాణికి అగ్గి పెట్టెలో చీరను పెట్టి బహుమానంగా ఇస్తే ఆమె ఆ కార్మికుల బొటన వ్రేళ్లును నరికించి దేశీయ చేనేత పరిశ్రమను దెబ్బతీశారు.
నేటికి భారత గ్రామీణ ప్రజల్లో, యువతలో ఎంతో కళా నైపుణ్యం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా గ్రామాల పట్ల ప్రభుత్వాలు ఏ రకమైన శ్రద్ధ చూపలేదు. పైగా నిర్లక్ష్యం చేసాయి. అందువల్ల నేడు గ్రామాలపై విశేషంగా దృష్టి నిలపాల్సిన అవసం ఉంది. బతకలేక గ్రామాలను వదిలి, పట్టణాలకు వలస పోయే విధానం పూర్తిగా పోవాలి. గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, దేశీయ ఆవుల పోషణ, పండ్ల తోటల పెంపకం, తేనే తయారి, మత్స్యపాలన, కొళ్ల పెంపకం, వన సంరక్షణ, వన ఔషధాలన్నిటికి చెందిన చిన్నతరహా పరిశ్రమలను తిరిగి ప్రారంభించాలి. దేశీయ ఆవు పాలు, వెన్న, నెయ్యి, పంచగవ్యం, పెరుగు తయారు చేస్తూ ఆర్థిక వికాసానికి తోడ్పడాలి. అలాగే గ్రామాలలో చేతి వృత్తులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి. చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఊతమివ్వాలి. అందుకు కావలసిన స్కిల్‌ ‌ట్రైనింగ్‌ ఏర్పాటు చెయ్యాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిత్య జీవితానికి అవసరమయ్యే వస్తువులన్నీటిని గ్రామాల్లోనే ఉత్పత్తి చేసుకోవాలి. అందుకని 20 లేదా 30 గ్రామాల్లో సమూహన్ని ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబనని నిర్మాణం చేసుకోవాలి.
కొన్ని చోట్ల ఉప్పు తయారు చెయ్యలేం కాబట్టి అలాంటి రెండు మూడు వస్తువులు తప్ప మిగతావన్ని గ్రామాల్లోనే తయారు చేసుకోవాలి. ఇలా గ్రామాల్లో ప్రతి యువతకు చేతినిండా పని దొరకాలి. అక్కడి నుండి ప్రతీ వస్తువు పట్టణాలకి ఎగుమతి చెయ్యాలి. ఇవన్నీ జరగాలంటే గ్రామీణ ప్రజలను చైతన్య వంతులని చెయ్యాలి. జాగృతపర్చాలి. నేడు వేలాదిమంది వలస కార్మికులు అనేక కష్ట నష్టాలను భరిస్తూ తమ సొంత ఊర్లకు చేరుకొంటున్నారు. ఈ ఆపత్కాలంలో ఎంతో వేదనను, క్షోభను అనుభవించారు. కార్మికులు పడిన మానసిక వత్తిడి వర్ణనాతీతం.
ఎక్కడో సూరత్‌ ‌వెళ్లి లక్ష రూపాయలు ఆర్జించిన దానికంటే సొంత ఊరిలో ఉండి ఇరవై వేలు సంపాదించింది ఎంతో గొప్ప. అయితే స్వస్థలంలో కష్టపడే మనస్తత్వం అలవాటు కావాలి. అందుకు మానసికంగా సిద్ధపడాలి. పనికి మాలిన విలాస జీవితాలను అనుభవించాలనే కోరికల నుండి నేడు అందరూ బయటపడాలి. గ్రామాల్లో విద్యావంతులు, జ్ఞానసంపన్నులు, ఆర్థికంగా బలం కలవారు తమ పూర్తి శక్తియుక్తులను గ్రామాల వికాసం కోసం అంకితం చేయాలి. ఆ దిశగా ఆలోచిస్తూ పనులు సాధించాలి. జిల్లా, మండల కేంద్రంలో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తుల సహకారం తీసుకోవాలి. అదే నేడు మన ముందున్న సవాలు. గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో కనీసం ఇరవైఐదు శాతం మంది అక్కడే స్థిరపడడం ఖాయం. వారందరికీ పని కల్పించాలి. వారి అనుభవం గ్రామవికాసానికి, పురోభివృద్ధికి దోహదపడాలి. తద్వారా గ్రామాలు స్వయంసమృద్ధిని సాధించాలి. ఈ సంక్పం నెరవేరితేనే మన జీవితానికి సార్థకత. ఆ దిశగా అందరం అడుగులు వేద్దాం.

– వి. భాగయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత సహ సర్‌ ‌కార్యవాహ

About Author

By editor

Twitter
Instagram