– క్రాంతి

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ మొబైల్‌ ‌ఫోన్‌ ఒక జాడ్యంగా మారింది. భారత్‌లో పబ్జీ వంటి గేమ్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా, ఇతర మార్గాల ద్వారా వాటిని డౌన్‌లోడ్‌ ‌చేసుకొని ఆడేవారున్నారు. పబ్జీలో పరిచయమైన యువకుడి కోసం ఓ పాకిస్తానీ మహిళ భర్తను వదిలేసి పిల్లలతో సహా భారత్‌కు రావడం ఉత్కంఠను రేపింది. సరిహద్దులు దాటిన ఈ ప్రేమకథ ఆసక్తి కలిగించినా, ఇందులోని  అసహజత్వంతో వివాదాస్పదం కూడా అయింది.

నోయిడాకు చెందిన సచిన్‌ ‌మీనా(22)కు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌ (30)‌తో పబ్జీ ద్వారా 2019లో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె వివాహిత. నలుగురు పిల్లలు. ఇటీవల ఆమె నేపాల్‌ ‌మీదుగా ఉత్తరప్రదేశ్‌ ‌చేరుకుంది. అటు నుంచి బస్‌లో గ్రేటర్‌ ‌నోయిడాకు వచ్చి మీనాను కలుసుకుంది.

ఓ పాకిస్తాన్‌ ‌మహిళ నోయిడాలో అక్రమంగా నివసిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వీసా లేకుండా భారత్‌లోకి ప్రవేశించి నివాసం ఉంటున్నందుకు సీమా హైదర్‌ను గ్రేటర్‌ ‌నోయిడా పోలీసులు జులై 4న అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌, అతడి తండ్రిని కూడా అరెస్టు చేశారు. అనంతరం జులై 7న ముగ్గురికీ బెయిలు లభించింది. ప్రస్తుతం ముగ్గురినీ యూపీ ఏటీఎస్‌ ‌పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

తాను హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు వెళ్లబోనని చెబుతోంది సీమ. వీరు మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్‌మెంట్‌ ‌యజమాని బ్రిజేష్‌ ‌పోలీసులకు చెప్పాడు.

పాకిస్తాన్‌ ఏజెంటా?

ఒక సాధారణ వ్యక్తి కోసం పాకిస్తానీ మహిళ భర్తను వదిలేసి ఎందుకు వచ్చింది? పైకి ప్రేమ అంటున్నా దర్యాప్తులో అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. సీమ పాకిస్తాన్‌ ఏజెంట్‌ అని గుర్తు తెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు సమాచారం పంపారు. యూపీ ఏటీఎస్‌ ‌దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి

నేపాల్‌ ‌మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన సీమ ముందుగా సంప్రదించింది సచిన్‌ ‌మీనాను కాదని విచారణలో తేలింది. ఆమెకు ఢిల్లీలో కొన్ని పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అది పబ్జీ బాంధవ్యం. ఏటీఎస్‌ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకూ సీమా ఆచితూచి సమాధానాలు చెప్పింది. ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం సులువేంకాదని అర్థమైపోయింది. సీమ ఆంగ్ల పరిజ్ఞానం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిందట. ఆమె పేరిట ఉన్న పాకిస్తాన్‌ ‌గుర్తింపు కార్డుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా జనన సమయంలో పొందే ఐడీ కార్డు ఈమె పేరున సెప్టెంబరు 20, 2022న జారీ అయింది. ఈ ఆలస్యం ఎందుకు అన్న కోణం నుంచి ఏటీఎస్‌ ‌విచారణ జరుపుతోంది. 2019లో తన భర్త గులాం హైదర్‌ ‌దూరంగా ఉన్న సమయంలో సచిన్‌ ‌మీనాతో స్నేహం ఏర్పడిందని ఆమె చెప్పింది. సచిన్‌పై ఇష్టంతోనే ఈ సాహసం చేశానని చెప్పింది. పాక్‌లోని ఆస్తిని అమ్మి ఇండియాకు వచ్చానని సీమ చెప్పింది. చదువు రాకపోతే ఇవన్నీ చేయడం ఎలా? ఆమె వెనుక ఇంకెవరో ఉన్నారని, లేదా ఆమె బాగా చదువుకున్నదై ఉంటుందని భావిస్తున్నారు

సోదరుడు, మామ పాక్‌ ఆర్మీలో..

తాజాగా సీమ సోదరుడు ఆసిఫ్‌ ‌పాక్‌ ‌సైన్యంలో పని చేస్తున్నాడని విచారణలో వెల్లడయింది. మామ గులాం అక్బర్‌ ‌కూడా పాక్‌ ‌సైన్యంలోనే పనిచేస్తున్నా డనీ చెప్పింది. ఈ విషయాన్ని గులాం హైదర్‌ (‌భర్త) విచారణలో స్వయంగా చెప్పడం విశేషం. మామ పాక్‌ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఇస్లామాబాద్‌లో ఉంటున్నాడని కూడా గులామ్‌ ‌తెలిపాడు. సీమకు పాక్‌ ‌గూఢచార సంస్థ ఇంటర్‌-‌సర్వీసెస్‌ ఇం‌టెలిజెన్స్‌తో సంబంధాలపై ఏటీఎస్‌, ఇం‌టెలిజెన్స్ ‌బ్యూరో అధికారులు విచారిస్తున్నారు.

‘ప్రీతి’గా చెప్పుకొని భారత్‌లోకి..

సీమ తన పేరును ‘ప్రీతి’గా చెప్పుకొని నేపాల్‌ ‌నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు సమాచారం. నేపాల్‌లోని పోఖారాలో బస్సు ఎక్కినప్పుడు ఆమె ఇదే పేరు చెప్పినట్లు బస్సు నిర్వాహకులు ఓ జాతీయ వార్తాసంస్థకు తెలిపారు. ఐడీ కార్డు చూపించాలని అడిగితే తాను భారతీయు రాలినేనని, ఆధార్‌ ‌కార్డు కూడా ఉందని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పినట్లు వారు వెల్లడించారు. మార్చిలో ఓసారి సచిన్‌, ‌సీమలు నేపాల్‌లో కలుసు కున్నప్పుడు కూడా నకిలీ పేర్లతోనే బస చేసినట్లు హోటల్‌ ‌యజమాని ధ్రువీకరించారు. సీమ కోసం నకిలీ ఆధార్‌ ‌కార్డును సృష్టించేందుకు సచిన్‌ ఏం ‌చేశాడో తేల్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

భారతీయురాలిగా కనిపించేందుకు..

సీమ అచ్చం భారతీయ మహిళలా కనిపించేం దుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆమె పక్కా ప్రణాళిక ఎంచుకుందని సెక్యూరిటీ ఏజెన్సీలు వివరించాయి. నేపాల్‌లోని పాకిస్తానీ ఏజెంట్లు  ఆమెకు శిక్షణ ఇచ్చి పంపి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేందుకు ఇలాంటి శిక్షణ ఇచ్చి నేపాల్‌ ‌సరిహద్దులు దాటిస్తుంటారని ఇంటెలిజెన్స్ ‌వర్గాలు వివరించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐతో సీమ సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో ఆమెపై ఏటీఎస్‌, ఐబీ (ఇంటెలిజెన్స్ ‌బ్యూరో) నిఘా వేశాయి. తన భార్యా, పిల్లల గురించి ఆందోళనతో ఉన్నానని  ఓ పాకిస్తానీ యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె భర్త హైదర్‌ ‌చెప్పాడు. పాక్‌•లో భద్రత లేదని భావిస్తే, ఆమెను, పిల్లలను సౌదీకి తీసుకెళ్లి అక్కడే స్థిరపడతానని చెప్పాడు.  సీమ అతడి రెండో భార్య. తాను ప్రతినెలా ఆమెకు రూ. 50 వేలు పంపే వాడినని, ఇల్లు కట్టుకోడానికి రూ.17 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తన భార్యా, పిల్లలను పాకిస్తాన్‌కు పంపేయాలని భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు. తాను  తిరిగి వెళితే హిందువుగా మారినందున మతోన్మాదులు చంపేస్తారని సీమ చెబుతోంది. పిల్లల జీవితాలు అగమ్యగోచరమవు తాయని చెబుతోంది.

తాను ఐఎస్‌ఐ ‌గూఢచారిననే ఆరోపణలను తోసిపుచ్చుతూ, గూఢచారినైతే అందరి దృష్టిలో పడకుండా ఎప్పుడో వెళ్లిపోయేదాన్ననన్నారు. సచిన్‌తో మూడేళ్ల అనుబంధం ద్వారా హిందీ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని వివరించింది. యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ‌తనను ప్రశ్నించిందని, తానూ, తన పిల్లలతో డీఎన్‌ఎ ‌పరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన సోదరుడు పాక్‌ ఆర్మీలో పని చేయడం గురించి చెబుతూ ఇప్పుడు ఆయనతో సంబంధాలు లేవన్నారు. చుట్టుపక్కల వారు ఆమె రాక మీద చిరుబుర్రుమంటున్నారు.

పాక్‌ ఎం‌బసీకి పత్రాలు

సీమా హైదర్‌ ‌నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను నోయిడా పోలీసులు ఢిల్లీలోని పాక్‌ ‌రాయబార కార్యాలయానికి పంపారు. ఆమె పాకిస్తానీ జాతీయురాలా? కాదా? అని నిర్ధారించుకో నున్నామని తెలిపారు. ఆ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొబైల్‌ను ఘజియాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌కు పంపారు. వీటిని నిర్ధారించిన తర్వాతనే కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను సిద్ధం చేస్తామని చెబుతున్నారు. ఫోన్‌ ‌నుంచి ఎలాంటి డేటాను తొలగించలేదని సీమ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొంది.

సీమ వ్యవహారం శాంతి భద్రతల సమస్యగా మారింది. ఆమెను పాకిస్తాన్‌ ‌పంపకపోతే 26/11నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌కు ఫోన్‌ ‌చేసి హెచ్చరించాడు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాష్ట్రపతి ముందుకు సీమా కేసు

భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్‌ ‌కేసు ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ ఆమె  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం ఇచ్చింది. సచిన్‌ ‌తండ్రి ఓ న్యాయవాది సాయంతో  ఈ పిటిషన్‌ ‌దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘నోయిడా నివాసి సచిన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమె ఇప్పుడు భారత కోడలు. అందువల్ల భారత పౌరసత్వం ఇవ్వాలి అని పిటిషన్‌ ‌వేశాం’’ అని సీమ తరఫు న్యాయవాది తెలిపారు.

——-

అలా ఇంకొందరు…

అచ్చం సీమా హైదర్‌ ఉదంతమే  మరొకటి జరిగింది. రాజస్తాన్‌కు చెందిన అంజు (34) అనే మహిళ వాయువ్య పాక్‌లోని ఖైబర్‌ ‌పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌ ‌దిర్‌ ‌జిల్లాకు వెళ్లింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా (29) ను కలుసుకుంది. ఇతడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైందట. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లింది. పాకిస్తాన్‌ ‌పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పాస్‌పోర్టు, వీసా సక్రమంగా ఉండటంతో వదిలిపెట్టారు.

అంజు కూడా వివాహిత. భర్త అర్వింద్‌తో కలిసి అల్వార్‌ ‌జిల్లా భివాండీలో ఉంటున్నది. వీరికి 16 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు  ప్రైవేట్‌ ‌సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌. ‌తన భార్య జైపూర్‌కు వెళ్తున్నాననే నెపంతో ఇంటి నుంచి వెళ్లినట్టు అరవింద్‌ ‌తెలిపారు. ఆమె పాక్‌  ‌వెళ్లినట్టు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజు భర్తకు ఫోన్‌ ‌చేసి, తాను లాహోర్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్పింది. రాజస్తాన్‌ ‌పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని నస్రుల్లా తెలిపాడు. ఆమె వీసా గడువు ముగిశాక ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వెళ్లిపోనుందని వెల్లడించాడు. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తాను పాక్‌కు రాలేదని, మీడియా రాద్ధాంతం చేస్తోందని అంజు ఆరోపించింది.

సీమా హైదర్‌ ‌మాదిరిగానే పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా (19) ఆన్‌లైన్‌ ‌గేమింగ్‌ ‌మాధ్య మంలో ములాయం సింగ్‌ను ప్రేమించింది. వీరి ప్రేమ లూడోతో మొదల య్యింది. 2022 సెప్టెంబరులో ఇక్రా స్కూలుకు వెళ్లి ఇంటికి చేరలేదు. స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని దుబాయ్‌ ‌వెళ్లిపోయింది. అక్కడి నుంచి నేపాల్‌ ‌చేరుకుంది. ములాయం కూడా నేపాల్‌ ‌చేరుకున్నాడు. అక్కడ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు వచ్చి కాపురం పెట్టారు. ఇక్రా ఇరుగుపొరుగువారితో తన పేరు రవాసింగ్‌ అని చెప్పినా, నమాజ్‌ ‌చేస్తూ పట్టుబడింది. పోలీసుల రంగప్రవేశంతో ఇక్రా, ములాయంల ప్రేమకథ బహిర్గతమయ్యింది. వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిగింది. ఇక్రాను పాక్‌ ‌పంపేశారు. ములాయంపై విచారణ జరగుతోంది.

పాకిస్తాన్‌ ‌వ్యక్తి.. నంద్యాల మహిళ

 ఇలాంటి మరో ప్రేమకథ 12 ఏళ్లుగా ఆంధప్రదేశ్‌ ‌కోర్టులో నలుగుతోంది. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌ ‌జిల్లా కుల్లులార్‌ ‌గ్రామానికి చెందిన గుల్జార్‌ఖాన్‌కు 2008లో రాంగ్‌ ‌కాల్‌ ‌ద్వారా నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే దౌలత్‌బీ భర్త చనిపోయాడు. ఒక కుమారుడు. అయినప్పటికీ  దౌలత్‌బీ కోసం 2011లో తాను పనిచేస్తున్న సౌదీ అరేబియా నుంచి గుల్జార్‌ ‌భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. గడివేములకు చేరుకుని కర్నూలులో దౌలత్‌బీని వివాహం చేసుకున్నాడు. పెయింటింగ్‌ ‌పనులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. ఆధార్‌ ‌కార్డులు సంపాదించారు.

గుల్జార్‌ ‌భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లేందుకు వీసా తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్‌ ‌వెళ్లాలని ప్రణాళిక. 2019లో సౌదీ వెళ్లేందుకు సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌చేరుకోగా, అక్కడ పోలీసులు గుల్జార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆరు నెలలు అనంతరం విడుదల చేశారు. ఫిబ్రవరి 9, 2022న మళ్లీ గుల్జార్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.  దౌలత్‌బీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగి భర్తను కండిషన్‌ ‌బెయిల్‌పై జూలై 20న బయటకు తీసుకువచ్చింది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram