‘‘ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా’’ అని మనసులో అనుకొంటూ కొబ్బరికాయ కొట్టాడు శ్రీరాములు. ప్రతిరోజూ మామూలుగా దణ్ణం పెట్టుకొన్నా శనివారం మాత్రం స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకొని, పొడుగుబొట్టు పెట్టుకొని, నడానికి ఉతికిన తువ్వాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాతగాని బల్లకట్టుతాడు విప్పడు. ఎంతమంది రేవులో ఉన్నా ‘‘ఓహో’’ ఈ రోజు శనివారం కామోసు అని కబుర్లు చెప్పుకుంటూ నిల్చుంటారు. అంతేగాని రాముల్ని ఎవరూ కంగారుపెట్టరు. అలాంటిది ఈ శనివారం రేవులో ఎవరూ లేరు. బల్లకట్టు లంగరు వేసే ఉంది. కాయకొట్టిన తరువాత గుడి అరుగుమీద కూలబడి ఆ స్వామికేసి చూస్తూ అడుగుతున్నాడు. ఊహ తెలిసిన దగ్గర నుండి నిన్ను కొలుస్తున్నాను. ఈ నడివయస్సులో నా బ్రతుకు ప్రశ్నార్థకం చేశావేమిటి స్వామీ! అని మౌనంగా రోదిస్తున్నాడు. ఇంటివద్ద భార్య మాలక్ష్మి కూడా అదే పరిస్థితిలో ఉన్నదని అతనికి తెలుసు.

మొదటిసారి గెడవేసినరోజు అతనికి జ్ఞాపకం వచ్చింది. తాత ఆ రోజుకి ఇంక పనిలేదని అత్తను చూడ్డానికి చంద్రారం వెళ్ళాడు. ప్రెసిడెంటు గారి అబ్బాయికి జ్వరం వచ్చిందని రాజమండ్రి తీసికొని వెళ్తూ రేవులోకి వచ్చారు, రేవు దాటించాను. మరలా వాళ్లు వచ్చే వరకు ఉండి రాత్రి ఇటు తీసుకుని వచ్చాను. ‘‘తాతేడిరా’’ అని ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావురా! అంటూ భుజంతట్టి వెళ్లిపోయారు. మర్నాడు దివాణం నుంచి రమ్మని కబురు వచ్చింది. తాత హడలిపోయాడు. నేను జరిగింది చెప్పాను. మేము వెళ్లేసరికి అబ్బాయి గారు వరండాలో ఆడుకొంటున్నారు. ఏరా నిన్న ఎక్కడికి పోయావు అని తాతను అడుగుతూ ‘‘నీ మనుమడు రాత్రంతా అద్దరినే ఉన్నాడురా’’ చలిలో వాడి ధైర్యం నాకు నచ్చింది. అంటూ అబ్బాయిగారి చేత బట్టలు, డబ్బులు ఇప్పించారు.

‘‘రేవులు, బల్లకట్టు బాగు చేయించు గ్రామ ఖాయిదాలోంచి డబ్బు పంపిస్తాను. నీ జీతం కూడా రెండు బస్తాలు పెంచుతున్నాను’’. వెళ్ళరా అన్నారు. తాతకు మాటలేదు. ఇంటికి వచ్చాకా తలనిమిరి నా పేరును నిలబెట్టావురా అన్నాడు. ఆ రోజు నుంచి బల్లకట్టే నా జీవితం అయ్యింది. కొన్నాళ్లకు అది నా ఇంటిపేరయ్యింది.

ఊర్లో అందరూ ఆదరంగా చూసేవారు. అక్కా-బావా అంటూ వేళాకోళాలాడుతూ బల్లకట్టు గెడవేసేవాడిని, ఊరి ఉమ్మడి జీతం కాక ఏదో ఒకటి ఇచ్చేవారు. కూరగాయల వాళ్లు కూరలు, పాల బిందెలవాళ్ళు పాలు, పెళ్లిళ్లు కుదిరితే స్వీట్లు, హాస్పటల్‌ ‌పురుళ్ళకి వెళ్తే ప్రసవమైవస్తూ మగపిల్లాడు పుడితే బహుమతి ఇచ్చేవారు. వేళకాని వేళల్లో దాటిస్తే ఎగస్ట్రా ఇచ్చేవారు. పంతులుగారమ్మాయి బల్లకట్టు మీదే ప్రసవిస్తే ఇంటికి పిలిచి స్టీలు కంచం ఇవ్వడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. తిండికి లోటు లేకపోయినా పెద్ద ఖర్చులకు అప్పు చేయాల్సివచ్చేది. రోజులు మారాయి. ప్రెసిడెంటుగారబ్బాయి మండల ప్రెసిడెంట్‌ అయ్యాడు. వ్యాపారస్తులు, ప్రయాణీకులే కాక కాలేజీ పిల్లలు పెరిగారు. ధాన్యంకాక డబ్బులిచ్చేపద్దతి పెట్టారు. సంపాదన పెరిగింది. అదిచూసి మావ కూతురు మాలక్ష్మినిచ్చి పెళ్లి చేశాడు. మాలక్ష్మి తెలివైంది. 5 వరకు చదివింది. ‘‘ నేను ఖాళీగా ఉన్నాను. ఏదైనా చేస్తాను’’ అంటే వెంకన్నబాబు గుడి దగ్గర కొబ్బరికాయలు పెట్టించాను. రేవుకొచ్చేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవారు లేదా కొని పట్టుకెళ్ళేవాళ్ళు రెండు సంవత్సరాలలో అది చిన్న బడ్డీ కొట్టు అయ్యింది. అందులో అన్నీ దొరికేవి. ఆదాయం పెరిగింది. ఊళ్లో మోటారు సైకిళ్లు పెరిగాయి. బల్లకట్టుపై వాటిని దాటిస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. మాలక్ష్మి ఆడబిడ్డనుకంది. దాని అదృష్టం అని మురిసి పోయాము. కాని ఇంతలోనే ఈ ఉపద్రవం వచ్చిపడింది. మాలక్ష్మి చంటిది ఇంట్లోనే ఉన్నారు. కొట్టు తియ్యలేదు. బల్లకట్టు తాడు విప్పలేదు. ఇంక ఊరి జనానికి దానితో పనిలేదు. దాన్నే నమ్ముకున్న నాతో ఎవరికీ పనిలేదు. రేవు బావురుమంటోంది నాకు బదులుగా. దూరంగా వంతెన వద్ద నుంచి మైకులో వినబడుతోంది. ప్రెసిడెంట్‌గారబ్బాయి మాట్లాడుతున్నారు. ‘‘ సోదరసోదరీమణులారా ! ఈ రోజు మన మద్దూరు గ్రామ చరిత్రలో సుదినం. ఎన్నోఏళ్లుగా మనం, మన చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు గోదావరి కాలవదాటడానికి ఎన్నో అవస్థలు పడుతున్నాం. బల్లకట్టు మీదే ఆధారపడుతున్నాం. ఈ రోజు ఎం.పి. గారు తమ నిధుల నుంచి ఈ వంతెన ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించవలసినదిగా వారిని కోరుచున్నాను’’ అందరూ చప్పట్లు కొట్టారు. బాణసంచా పేలింది. ఎం.పి గారనుకొంటా మాట్లాడుతూ మద్దూరు గ్రామ ప్రజలారా ! ఈ వంతెన ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞుడను. మీ ప్రెసిడెంట్‌ ‌గారి కృషి వల్లే ఇది సాధ్యం అయ్యింది. మీకు మరో శుభవార్త వచ్చే ఆగస్ట్ 15 ‌నుంచి మద్దూరు గ్రామం మీదుగా ఒక బస్సు కూడా మంజూరు అయ్యింది అని, అది నిడదవోలు, రాజమండ్రిల మధ్య తిరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మళ్లీ  చ•ప్పట్లు కొట్టారు. అవి నా గుండెలపై సమ్మెట పోట్లలా ఉన్నాయి.

రేపటినుంచి రేవు ఎవరు దాటుతారు? పోనీ కొట్టు పని చేసుకొందామా అంటే అదికూడా రేవులోనే ఉంది. పని గట్టుకొని గట్టుదాకా ఎవరు వస్తారు? మైకులో ఎవరో మాట్లాడుతున్నారు గోదావరి కాలువపై వడ్డాణంలా వంతెన అమరి ఉందని. నిజమే కాని అది నా పాలిట ఉరితాడులా కనబడుతోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. మరి నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? రేపటి నుంచి ఏమి చెయ్యాలి? ఇంకో పని అలవాటులేదు.

మావా! కాస్త ఎంగిలిపడుతూగాని రా … మాలక్ష్మి కేకవేస్తోంది. నిశ్శబ్దంగా లేచి వెళ్ళాను. ఒకరి కళ్లలోకి ఒకళ్లు చూసుకున్నారు. మాటలకందని బాధ అది. బెంగెట్టుకోకు మావా ఆ ఏడుకొండలవాడే ఏదో దోవచూపించకపోడు అని ఏదేదో మాట్లాడు తోంది. నన్ను ఊరడించడానికి. కానీ దానికీ తెలుసు.

ఆర్రోజులు గడిచాయి. బల్లకట్టుని, రాముల్ని ఊరు మరిచిపోయింది అనుకున్నాను. వంతెన వద్దకు నడిచివెళ్ళి చూశా. మోటారు సైకిళ్లు, సైకిళ్లుజోరుగా వెళ్తున్నాయి. రేవులో అరటిగెలలు దింపే ఒంటెద్దుబండి నాగన్న అరటిలోడుతో వంతెన పైనుంచి వెళ్తున్నాడు. కాలేజీ పిల్లలు, ఊళ్లో వాళ్ళు రోజుకు 4 ట్రిప్పులు తిరిగే బస్సులో వెళ్తున్నారు. బల్లకట్టు మీద పోస్టల్‌ ‌సంచులు పెట్టుకెళ్ళే ఆచార్యులుగారు సైకిలుపై వెళ్తున్నారు. నన్ను చూసి ఆగారు. ఏం చేస్తున్నావురా రాములూ? మాలక్ష్మి ఎలా ఉంది? చంటిది ఏంచేస్తోంది? అని ఆయన అడుగుతుంటే కళ్లు చెమర్చాయి. అంతా బాగానే ఉన్నారయ్యా? నా మాటల్లో విషాదం ఆయన కళ్లబడింది. మాట్లాడకుండా అలాగే నాకేసి చూస్తూ వెళ్లిపోయారు.

ఆ రోజు శనివారం మాలక్ష్మి గుడి ఊడ్చి ముగ్గు పెడుతోంది. స్నానం చేసి కొబ్బరికాయ పట్టుకుని గుడివద్దకు వచ్చాను. బల్లకట్టుపై కాకికూడా వాలడం లేదు. బాధ వచ్చింది. స్వామి ఎదురుగా కూల బడ్డాను. ‘‘ఓరేయ్‌ ‌రాములూ అయ్యగా రొస్తున్నార్రా’’ అని చాకలి సిద్దడు ఇంటిదగ్గర కేకేస్తున్నాడు. ప్రెసిడెంట్‌ ‌గారి అబ్బాయి, సర్పంచ్‌గారు, రాయుడుగారు, పంచాయితీ మెంబర్లు ఇంకా కొంతమంది బల్లకట్టు రేవులోకి వచ్చారు. కంగారుగా నడానికి గుడ్డకట్టి ఎదురువెళ్లాను. ‘‘దండాలు దొరా’’ అన్నా ‘‘ఏరా రాములు ఇలారా!’’ అని అందరూ గుళ్లోకి వచ్చారు. కొబ్బరికాయ కొట్టారు. నన్ను కొట్టమన్నారు. గునపంతో తవ్వి ముహూర్తం చెయ్యమన్నారు. రెండు ఇటుకలు తీసాను. నాకేమీ అర్థం కావడం లేదు. బల్లకట్టు తీయమన్నారు. వంతెన చివరరోడ్డు వద్ద ఆపమన్నారు. అక్కడ ఇంకా కొందరు జనం ఉన్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. తీసిన ఇటుకలు అక్కడ పెట్టమన్నారు. మళ్లీ అందరూ కొబ్బరికాయలు కొట్టారు. రాములూ ఇలారా అని నన్ను కేకేశారు. అందరూ దోవ ఇచ్చారు. కొబ్బరికాయ చేతికిచ్చారు. ఎవరో పొడుగుబొట్టు పెట్టారు. మెళ్లో దండ వేశారు. పోస్టలు ఆచార్యులు గారు సైగ చేశారు. కొబ్బరికాయ కొట్టమని, కాయకొట్టి నవధాన్యాలు వేశాను. అందరూ కూర్చున్నారు.

సర్పంచ్‌గారు నిలబడి గ్రామ ప్రజలారా మన రాముడు వాళ్ల కుటుంబం తరతరాలుగా మన గ్రామానికి సేవచేస్తోంది. మార్పు సహజంకదా! వంతెన వచ్చింది. బస్సు పడింది. బల్లకట్టు పనిలేదు. మరి రాములు, అతని కుటుంబం గురించి నిన్న ఆచార్యులుగారు చెప్పేదాకా ఎవరం ఆలోచించలేదు. వంతెనలో మిగిలిన నిధులతో పార్కు నిర్మించాలని తలపెట్టారు. దానికి వంతెన దిగువరోడ్డు వద్ద రాయుడుగారు రెండెకరాల పొలాన్ని రాసిస్తున్నారు. మన రేవులోని వేంకటేశ్వరస్వామిని అక్కడే ప్రతిష్టించి గుడి కట్టాలని పెద్దలు నిర్ణయించారు. పార్కు పని రాములు చూస్తాడు. గుడి పని అతని భార్య చూసుకుంటుంది. ఎకరం పొలం ఫలసాయం రాముడికి నిర్ణయించారు అని కాగితాలు చేతిలోపెట్టారు. ఒకేడాది పంట సొమ్ము గ్రామ ఖాయిదానుంచి ముందుగా ఇస్తారు అని సర్పంచ్‌గారు మాట్లాడడం పూర్తిచేసారు. అందరూ  చప్పట్లు కొట్టారు. రాయుడుగారి కాళ్లకి దండం పెట్టాను. అందరూ లేచారు, ప్రెసిడెంట్‌ ‌గారు భుజం మీద చేయివేసి బల్లకట్టును, వంతెన వద్ద కట్టి ఉంచు, పార్కులోకి పిల్లల్ని తీసికెళ్ళడానికి బాగుంటుంది అన్నారు.

పోస్టల్‌ ఆచార్యులుగారు నవ్వుతూ అడిగారు… ఏరా సంతోషమేనా? అని. చెయ్యెత్తి దండం పెట్టాను. ఆయనలో ఆ ఏడుకొండలవాడు కనబడుతున్నాడు. వెళ్లు, మాలక్ష్మి నీకోసం చూస్తూ ఉంటుంది అన్నారు. అప్పటికి కానీ అది నిజం అని నాకు తెలియలేదు. స్వామీ నువ్వున్నావని దణ్ణం పెట్టి గడవేస్తూ ఇంటికి చేరాను.

– గోవర్ధనం శ్రీనివాసమూర్తి

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE