ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల గురించి సరైన ప్రచారం లేకపోవడం, ఈ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో సాధారణ, పేద ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా మందులను అధిక ధరలకు కొనుగోలు చేయవలసి వస్తోంది. జనరిక్ మందులు ప్రైవేటు దుకాణాల్లో లభిస్తున్నా వాటిపై ముద్రించే ధరలకు, విక్రయ ధరల్లో వ్యత్యాసంతో ప్రజలు ఈ మందుల నాణ్యతను విశ్వసించడం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినవే పీఎం జనౌషధి కేంద్రాలు.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నాణ్యమైన జనరిక్ మందులను తయారుచేసి వీలైనంత తక్కువ ధరకు పీఎం జనౌషధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఔషధ విక్రయ కేంద్రాలను 2015లోనే ప్రారంభించింది. వాటిలో ప్రస్తుతం 2 వేల రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి గురించి సరిగా ప్రచారం చేయకపోవడంతో ఫలితం చేకూర లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ పీఎం జనౌషధి దుకాణాలు అందుబాటులోకి తేవాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలిచ్చారు.
జనరిక్ మందులు అంటే?
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై, ఆ ఫార్మా కంపెనీకి ఇరవైఏళ్ల పాటూ పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారుచేయకూడదు. ఆ మందు తయారీలో చాలా ఖర్చు పెట్టామని సదరు కంపెనీ వాదిస్తుంది. ఆ సొమ్మును రాబట్టుకోవాలంటే ఆ మందును తాము మాత్రమే అమ్మాలని భావిస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకే ఇస్తాయి. ఇరవై ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. వాటిని జనరిక్ మందుల షాపుల్లో తక్కువ ధరకే అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి పేదలకు తక్కువ ధరకు అమ్మే వాటిని జనరిక్ మందులు అంటారు. సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్… ఇవన్నీ బ్రాండెడ్ మందుల సంస్థలు. మనదేశంలో అమ్మేవి 80 శాతం బ్రాండెడ్ జనరిక్ మందులే. చాలా మంది వీటినే నమ్ముతారు. ఫార్మా సంస్థలు తమ సేల్స్మెన్లను వైద్యులు, ఆసుపత్రుల వద్దకు పంపించి బాగా ప్రమోషన్లు చేయిస్తారు. దాంతో వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాసిస్తారు.
జనరిక్, బ్రాండెడ్ మందుల ఫార్మూలాలు ఒకటే కాబట్టి నిజానికి జనరిక్ మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. డోలో 650 ఎంజీ ఇప్పుడు బాగా అమ్ముడవుతోన్న ఔషధం. దీని ధర పది మాత్రలు రూ.30 అనుకుందాం. అదే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ పారాసెటమాల్ ధర రూ.15. కానీ దీన్ని కొనేవారు ఎంతమంది? జనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేస్తాయి.
విశ్వసనీయత ఏది?
అయిదారేళ్లుగా కొన్ని ప్రైవేటు దుకాణాల్లో జనరిక్ మందులు అమ్ముతున్నారు. వాటిపైగల గరిష్ట అమ్మకం ధరకు, వారు అమ్మేధరల మధ్య వ్యత్యాసం వినియోగదారులకు విశ్వసనీయతను కలిగించడం లేదు. ఉదాహరణకు 10 మాత్రలు గల షీట్ ధర రూ.100 ఎంఆర్పీ ముద్రించి ఉంటుంది. అదే మందు ఒక జనరిక్ దుకాణంలో రూ.50, మరో జనరిక్ దుకాణంలో రూ.60 అమ్ముతారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని ఆర్ఎంపీలు (గరిష్ఠ చిల్లర ధర) వీటిని మరికాస్త ఎక్కువ ధరకే అమ్ముతారు. వాస్తవ ధర దానిపై ఉండదు. పైగా ఎప్పుడూ వినని పేర్లతో ఈ మందులను తయారు చేసే సంస్థల పేర్లు కనిపిస్తాయి. అందువల్ల వీటిపై ప్రజలకు విశ్వసనీయత కొరవడింది. వీటి పనితనంపై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లోనూ అధిక ధరలు
ప్రస్తుతం రాష్ట్రంలో 16 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో 23 జనరిక్ దుకాణాలను స్వయం సహాయక బృందాలు, ఇతర సంఘాలు, ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు. వీరు జనరిక్ ఔషధాల ధరల నిర్ణాయక విధానంలోని లొసుగులను ఉపయోగించుకుంటూ రోగులను దోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవస్థపై తగిన నియంత్రణ లేకపోవటం వారికి అనుకూలంగా మారింది. జనరిక్ ఔషధాల తయారీదారులు తమ ఉత్పత్తులపై అధిక ఎంఆర్పీని ముద్రించి సరఫరా చేయడాన్ని అమ్మకందారులు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. దీంతో రిటైలర్లు వివిధ మందులపై ఇష్టానుసారం డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ పక్రియలో వారు 50 శాతం నుండి 60 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాక వారు అవసరమైన జనరిక్ ఔషధాలలో కేవలం 30 శాతం నుండి 40 శాతం వరకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. అధిక లాభార్జనను నిరోధించడంతో పాటు ప్రిస్కిప్షన్ లేకుండా మందుల అమ్మకాలను నిరోధించే తప్పనిసరి బిల్లింగ్ వ్యవస్థ అమలులో లేదు. అటువంటి జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో నియంత్రణ లేకపో వటం కూడా ఆందోళన కలిగించే మరో అంశం.
జనౌషధి కేంద్రాల ఏర్పాటు నిర్ణయం
ప్రభుత్వ ఆస్పత్రులకొచ్చే రోగుల ప్రయోజనార్థం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరిక్ మందులు షాపుల్ని నిర్వహించడానికి లాభాపేక్షలేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ జనఔషధి కేంద్రాలకు సంబంధించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తగు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి శాఖలకు కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు. సెకండరీ ఆస్పత్రుల్లో కూడా జనౌషధి కేంద్రాల్ని ప్రవేశపెట్టాలని మంత్రి ఆదేశించారు. 17 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో జనౌషధి కేంద్రాల్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను ఆమోదించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, రోగులకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏరియా, జిల్లా ఆస్పత్రులలో కూడా వాటిని నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
పీఎం జనౌషధి ప్రయోజనాలు ఇవీ
ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను పరిష్కరించి, దేశవ్యాప్తంగా రోగులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి- భారతీయ జనౌషధి పరియోజన (పీఎం- బీజేపీ)ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, భారత ప్రభుత్వ ఔషధాల శాఖ జనౌషధి దుకాణాలకు సరఫరా చేయడానికి ముద్రించిన ప్రామాణిక గరిష్ట విక్రయ ధరతో జనరిక్ ఔషధాలను కొనుగోలు చేస్తుంది. వీటిని 15 శాతం లాభంతో మాత్రమే జనౌషధి కేంద్రాలు విక్రయిస్తాయి. ఇది రోగులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రతి అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్వేర్ నమోదు చేయాలి. తద్వారా రిటైలర్లు జనరిక్ ఔషధాల అమ్మకపు ధరలను మార్చటానికి వీలుండదు. ఉదాహరణకు ఒక ప్రైవేటు జనరిక్ దుకాణంలో అమ్మే మందు దాని బాక్స్పై రూ.100 ఎంఆర్పి ఉంటే, దానిని దుకాణదారు రూ.50లకు అమ్ముతాడు. ఇదే జనౌషధి దుకాణంలో మాత్రం రూ.30 మాత్రమే ధర ఉంటుంది. ఆ రేటుకే అమ్ముతారు. పైగా తయారీ, అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప జనౌషధి దుకాణదారులు ఖరీదైన బ్రాండెడ్ మందులను విక్రయించరు. సంబంధిత అధికారుల ఆమోదంతో కొన్ని వ్యాధులకు జనరిక్ మందులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే బ్రాండెడ్ మందులను విక్రయిస్తారు.
బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారం
నిరుద్యోగ డీ, బీ-ఫార్మసీ అభ్యర్థుల• బీసీ సంక్షేమ కార్పోరేషన్ ద్వారా 8 లక్షల విలువైన జనరిక్ మందుల దుకాణాన్ని 50 శాతం సబ్సిడీతో ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం సంకల్పిం చింది. వివిధ సామాజికవర్గాల కోసం కార్పొరేషన్ల ద్వారా వారికి ఆర్థికంగా చేయూత అందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి, అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్ వర్గాలు) బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించను న్నారు. ఇందుకోసం బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా రూ.25.6 కోట్లు కేటాయించారు. అభ్యర్థులు డీ- ఫార్మసీ, బీ- ఫార్మసీ వంటి కోర్సులు పాసైఉండాలి. ఒక్కో జనరిక్ మందుల యూనిట్ ఏర్పాటుకు రూ.8 లక్షల వరకూ ఖర్చుకానుండగా.. అందులో 50 శాతం అంటే రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. మిగతా రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా ఇవ్వనున్నారు. అలాగే అగ్రవర్ణ పేదలకు (ఈబీసీలు) అంటే కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంఘాలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నారు. ఇందులోనూ 50 శాతం ప్రభుత్వం రాయితీ అంది స్తోంది. ఈ పథకాలకు అర్హత వయస్సును 21 నుంచి 60 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్ లైన్లో నమోదు చేసుకున్న తర్వాత స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంప్రందించాలి.
ప్రభుత్వ ఆస్పత్రులకొచ్చే రోగుల ప్రయోజనార్థం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరిక్ మందులు షాపుల్ని నిర్వహించడానికి లాభాపేక్షలేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్