తమ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని రాష్ట్రాలు తరచూ గగ్గోలు పెడుతుంటాయి. తెలంగాణలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆరోపణే వినవస్తుండేది. దాదాపు ప్రతి ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వమూ ఇదే విధమైన ఆరోపణలు చేయడం ఒక సర్వసాధారణ విషయమైపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను, విభేదాలను రాజ్యాంగ నిర్మాతలు ఊహించకపోలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుని, ఈ వివాదాలను, విభేదాలకు పరిష్కరించుకోవడానికి రాజ్యాంగంలో వారు కొన్ని అంశాలను పొందుపరచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం 1952లోనే జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1990లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 కింద అంతరాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించడమే కాకుండా వీటి మధ్య సమన్వయాన్ని, సహకారాన్ని పెంపొందించ డానికి కూడా ఈ రెండు మండళ్లు కృషి చేస్తాయి.
సహకారం, సమన్వయాల మీద ఆధారపడిన సమాఖ్య స్ఫూర్తి చుట్టూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తిరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం తన పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు. ఏ కారణంగానైనా ఈ రెండింటి మధ్య సంబంధాలు దెబ్బతినే పక్షంలో రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతినడం ఖాయం.
కేంద్ర ఖజానా నుంచి తమకు రావాల్సిన వాటా రావడం లేదని, తమ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్రాలు ఆరోపించే పరిస్థితికి ఈ రెండింటి సంబంధాలు దిగజారకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భౌగోళిక విభజనేదీ ఉండకూడదు. దేశమంతా ఒక్కటేనన్న భావన తప్ప ఇక్కడ రాజకీయ ప్రాధాన్యా లకు అవకాశం లేదు. అన్యాయం జరుగుతోందన్న భావన ఒక రాష్ట్రానికి కలిగే పక్షంలో దీని ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడే అవకాశముంటుంది.
సరుకులు, సేవల పన్ను(జి.ఎస్.టి) ప్రవేశపెట్టి నప్పుడు, రాష్ట్రాలకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందని అంతా నమ్మారు. పన్నుల వసూళ్లను క్రమబద్ధం చేసినప్పుడు, రాష్ట్రాలకన్నిటికీ అత్యధిక మొత్తంలో పన్నుల సొమ్ము అందుతుందనే అంతా భావించారు. ఈ విధంగా ఆశించడంలో తప్పేమీ లేదు కూడా. అయితే, కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలు తలకిందులైనట్టు భావిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతోందంటూ ఫిర్యాదు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ కోణం నుంచి, ఎన్నికల కోణం నుంచి కాక, ఒక జాతీయవేత్త కోణం నుంచి పరిశీలించి సానుభూతితో పరిష్కరిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన, తమకు వీలైన పేర్లు పెట్టి వాటిని అమలు చేస్తున్న మాట నిజమే. కానీ, ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేయడం అన్నది ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం అటువంటి సమస్యలను మరో విధంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది.
విచిత్రమేమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అంతరాష్ట్ర మండలి, జాతీయ అభివృద్ధి మండలి ఉన్నప్పటికీ, ఇంతవరకూ వాటికి తమ ఫిర్యాదులు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీనిని బట్టి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం తప్ప, సమస్యల పరిష్కారం ముఖ్యం కాదని తేలికగా అర్థమవుతోంది. కేంద్రానికి రాష్ట్రాలతో సమస్యలు వచ్చినా, రాష్ట్రాలకు కేంద్రంతో సమస్యలు వచ్చినా, ముఖాముఖీ తలపడే ప్రయత్నమే జరుగుతోంది. దాన్ని రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించు కోవడం, ప్రతీకార కోణం నుంచి ఆలోచించడం అనేక ఏళ్లుగా ఉంది. ఈ రెండు మండళ్లను ఉపయోగించుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తి బాగా పెరిగే అవకాశం ఉంది. వీటిని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదుల్లో ఒక్క శాతం వాస్తవం ఉన్నా అది దేశానికి శ్రేయస్కరం కాదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అభిప్రాయపడడానికి ఆస్కారం లేదు. రాష్ట్రాలకు నిధులు పంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆమోదయోగ్యమైన పద్ధతిని అనుసరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతిని ఉల్లంఘించే పక్షంలో కోర్టులను ఆశ్రయించడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్రాలు ఆ పని కూడా చేయడం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల ఆరోపణల్లో నిజం ఉందనే అనుకుందాం. కేంద్రం ఆర్థికంగా శక్తిమంతమైన ప్రభుత్వమే కావచ్చు. కానీ, కేంద్రం వద్ద చేరుతున్న సొమ్మంతా ఈ రాష్ట్రాల్లోని ప్రజల నుంచి పన్నుల రూపేణా అందుతున్న సొమ్మేనన్న విషయాన్ని మరచిపోకూడదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉండడం, రాష్ట్రాలు మాత్రం ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉండడం అనేది దేశానికి ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు.
దేశంలోని రాష్ట్రాల న్నిటి నుంచి తమకు అందుతున్న నిధులతో తాము ఆర్థికంగా శక్తిమంతం అవుతున్నామనే విషయాన్ని కేంద్రం అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయం కలగజేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు అందజేయవలసిన న్యాయమైన వాటాను చిన్నా చితకా కారణాలు చెప్పి, సాంకేతిక కారణాలు చూపించి దానికి దక్కకుండా చేయడం ఏ విధంగానూ న్యాయం కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక ధర్మకర్తలా వ్యవహ రించాల్సి ఉంటుంది. రాష్ట్రాల నమ్మకాన్ని చూరగొ నాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రమైనా నిధుల దుర్విని యోగానికి పాల్పడుతున్నదనే అభిప్రాయం కలిగినప్పుడు ఈ సమస్యను అంతరాష్ట్ర మండలి ద్వారా పరిష్కరించడం చాలా మంచిది. జాతీయ అభివృద్ధి మండలి, అంతరాష్ట్ర మండలికి సంబం ధించి రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్