కేంద్రం బిహార్ చర్చ నుండి బయటపడి సంక్షేమ రంగాన్ని స్థిరమైన అభివృద్ధితో సమతుల్యం చేయాలి. వలసలను నిరోధించాలి. సంక్షేమంతో శ్రేయస్సును సమ్మిళితం చేయాలి.
ఒకేసారి రెండు పరిణామాలు జరిగాయి. ఈ రెండింటికీ ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ ఒకే రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అత్యంత శక్తిమంతమైన రాష్ట్రం బిహార్ ఎన్నికలకు వెళ్లింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. మరోవైపు, ఫిబ్రవరి 1, 2026న తన తదుపరి సమాఖ్య బడ్జెట్ను సమర్పించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ కసరత్తు ప్రారంభించారు.
పరోక్షంగా అయినా ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు.
ఈ బడ్జెట్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలలో వాగ్దానం చేసిన రాజకీయ తాయి లాలను పరిగణనలోకి తీసుకుని, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఒక కొత్త నమూనాను రూపొందించాల్సి ఉంటుంది.
ఉచితాలు, సామాజిక సంక్షేమం
పరస్పరం అనుసంధానమైన మార్కెట్లు, పెట్టుబడులు, వాణిజ్యం, తీవ్రమైన పోటీతత్వంతో కూడిన ప్రపంచంలో సంక్షేమ రాజ్యం అనే ఆలోచనను చాలా మంది సామాజిక-ఆర్థిక విశ్లేషకులు లేదా ఆలోచనాపరులు సమర్థించరు.
రాష్ట్ర ఎన్నికలకు ముందు, నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ- జేడీ(యూ) కూటమి రెండు పెద్ద ప్రాజెక్టులను ప్రకటించింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన (ఎంఎంఆర్వై)తో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10,000 అందించారు.
దాదాపు 1.1 కోట్ల మంది వృద్ధ మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు గతంలో నెలకు రూ.400 పెన్షన్ ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ.1,100కు పెంచారు. ఈ రెండు పథకాల వల్ల అదనంగా రూ.14240 కోట్లు ఖర్చయ్యాయి. ఇది 2025-26 సంవత్సరానికి మొత్తం రూ.2,52,000 కోట్ల రెవెన్యూ ఖర్చులో ఆరు శాతం. అంతేకాకుండా, బీజేపీ-జేడీ(యూ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎన్డీఏ ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, కోటి ఉద్యోగాలు, రైతులకు అధిక మద్దతు మొదలైన వాటిని హామీ ఇచ్చింది.
కొందరు ఈ ఉచితాలను సామాజిక-ఆర్థిక సాధికారతకు సాధనాలుగా పేర్కొంటుండగా, మరికొందరు నువ్వులు, బెల్లంతో తయారుచేసిన తీపి చిరుతిండి అయిన ‘రెవ్డిస్’ లేదా ఎన్నికల తాయిలాలు’ అని పిలుస్తున్నారు. అయితే, ఇక్కడ జరుగుతున్న చర్చ అసమర్థతను, నిధుల దొంగతనాన్ని తొలగించి, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కచ్చితమైన మార్గంలో అవసరమైన వారికి లబ్ధి చేకూర్చడం గురించి కాదు.
భారతదేశం తన వృద్ధి గాథను విస్తరించడానికి, మరింత పటిష్టపరచడానికి, సౌభాగ్యాన్ని వ్యాప్తి చేయడానికి అనుసరించాల్సిన స్థిరమైన ఆర్థిక పాలన నమూనా ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, ఇప్పుడు మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల అనుభవాన్ని చూసినప్పుడు నగదు చెల్లింపులు ఆర్థిక సాధికారతకు తాత్కాలికంగా ఒక బూస్టర్ డోస్గా పనిచేస్తాయి తప్ప దీర్ఘకాలంలో అవి నిలబడలేవని తేలింది.
నైపుణ్యాలు, సామర్థ్యాలు, వస్తు,సేవలకు ఉపాధి అవకాశాలను సృష్టించడం, తక్కువ ఖర్చుతో కూడిన రుణ పరపతి నుండి పెద్ద మొత్తంలో మూల ధన పెట్టుబడులు పెట్టడం వరకు ఇవ్వన్నీ నిలకడతో కూడుకున్న ఉద్యోగాలను సృష్టిస్తాయి.
పైన పేర్కొన్న అభివృద్ధి నమూనాల్లో ఏ ఒక్కదాని తోనూ ఏ ఇద్దరు ఆర్థికవేత్తలు ఏకీభవించరు. ఈ రెండు విధానాల సమ్మిళిత విధానం మధ్యకాలికం నుండి దీర్ఘకాలికంగా ఆచరణయోగ్యం కావొచ్చు. ఆర్థికాభివృద్ధి అంచున ఉన్న రాష్ట్రాల జాబితాలో బిహార్ను తాజాగా చేర్చుకుంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విధానంపై స్పష్టత ఇవ్వడం మంచిది.
అనేక సంవత్సరాలుగా, ఎన్డీఏ, బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ, తమ ప్రచారాల్లో ప్రజాకర్షక పథకాల ను ప్రకటించడం ద్వారా ప్రజాదరణ పొందాలనే ప్రలోభానికి దూరంగా ఉన్నారు. కానీ, ఎన్డీఏను దాని రాజకీయ ప్రత్యర్థులు ఆచరించే పోటీతత్త్వంతో కూడుకున్న ప్రజాకర్షణ తాయిలాలు లేదా నగదు చెల్లింపులను ‘గెలుపు సూత్రం’, ‘ఆర్థిక సాధికారత’కు ఉపకరించే సాధనాలు అని భావించేలా చేసింది. పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మ్యానిఫెస్టోల నుండి ప్రేరణ పొంది, తమ రాజకీయ ప్రచారాలలో చంద్రుడిని సైతం నేల మీదకు దింపుతాం అనేలా హామీ ఇచ్చిన ఆయా కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆర్థిక గందరగోళంలోకి లేదా లోతైన అప్పుల భారంలోకి నెట్టాయి.
అందువల్ల, ఆర్థిక మంత్రి సీతారామన్ ముంగిట తాయిలాలకు ఉన్న ప్రాముఖ్యతను ఎలా పరిష్కరించా నే పెద్ద నిలిచి ఉంది.
వలసలు, ఆర్థిక సాధికారత
బిహార్లో ఓట్లు సంపాదించడానికి ఎన్డీఏ, ప్రతిపక్షాల నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ రెండూ కూడా ఉద్యోగాలపై భారీ వాగ్దానాలు చేశాయి. ఎన్డీఏ ఒక కోటి ఉద్యోగాలను హామీ ఇచ్చింది. ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ హామీ ఇచ్చింది. బిహార్, తదితర ప్రాంతాలలో ఉద్యోగాల సృష్టి, పెట్టుబడులతో వలసలకు ప్రత్యక్షమైన, సంక్లిష్టమైన సంబంధాలు ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఇన్స్ట్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రకారం, బిహార్లోని కులాలకు అతీతంగా 65 శాతం కంటే ఎక్కువ కుటుంబాలలో కనీసం ఒక వలసదారుడు ఉన్నాడు. అతడు లేదా ఆమె సంపాదించేది ఆ కుటుంబ ఆదాయంలో కనీసం 50 శాతం ఉంటుంది. భవన నిర్మాణం, వ్యవసాయ రంగాలు కేంద్రీకృతంగా బిహార్ నుండి జరిగే వలసలు గ్రామీణ ప్రాంతాల్లో కూలీ రేటును మూడు రెట్లు పెంచాయి.
ఉత్పాదక రంగం ఐదు శాతం మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుందని పైన పేర్కొన్న డేటా సూచిస్తుంది. పెరుగుతున్న యువత జనాభాకు ఉద్యోగాలు కల్పించడం దాదాపుగా అసాధ్యం. ఇన్స్టిట్యూట్ ప్రకారం 2025లో, 12.8 లక్షల మంది యువకులు మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. రాష్ట్ర జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 27 శాతానికి పైగా ఉన్నారు.
ఈ గణాంకాలు వేర్వేరు రాష్ట్రాలకు భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ, భారతదేశంలో మొత్తం జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు 15.6 శాతంగా ఉన్నారు.
గ్రామీణ భారతదేశం నుండి ఎగుమతులతో పాటు తయారీ, సేవలు, వ్యవసాయ రంగంలో అవకాశాలను సృష్టించడం వలసలను ఎదుర్కోవడానికి పనికి వస్తుంది. ప్రతీ రాష్ట్రంలో అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఎగుమతులపై సమగ్ర సర్వే మన విధాన ప్రాధాన్యాలను నిర్దేశించాలి.
జోహో కార్పొరేషన్కు చెందిన శ్రీధర్ వెంబు తమిళనాడులోని మారుమూల గ్రామంలో ఉండి కూడా తాను అంతర్జాతీయ సంస్థకు నాయకత్వం వహించ గలనని నిరూపించారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు మారుమూల ప్రాంతాల నుంచి పనిచేయడం వల్ల వారు ఉద్యోగ సంబంధిత పనులను నిర్వర్తిస్తూనే నగరాల నుండి బయటకు వెళ్లడానికి వీలు కలిగింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రైలు, ఓడరేవులు, విమానాశ్రయాల మౌలిక సదుపాయాలు, డేటా, టెలికాం కనెక్టివిటీ లాంటి భారీ నెట్వర్క్ వలసలకు వ్యతిరేకంగా విధానాన్ని రూపొందించడంలో ఉపయోగపడుతుంది.
ఆ దిశగా గ్రామాల నుండి వలసలను ఆపడానికి మొదటి అడుగు పడాలి. వలస వెళ్లినవారిని గ్రామాలకు తిరిగి రప్పించే విధంగా రెండవ అడుగు పడాలి. చివరకు దేశం వెలుపల మేధో ప్రవాహాన్ని వెనక్కి మళ్లించడమనేది చివరి అడుగుగా ఆర్థిక ప్రాధాన్యతను సంతరించుకొని ఉండాలి. విధాన రూపకల్పనలో వలసలను కేంద్రంగా చేసుకుని మన ఆర్థిక అభివృద్ధి నమూనాను తిరిగి రూపొందించడానికి ప్రయత్నించాలి.
అంతిమంగా, ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అంత్యోదయ స్ఫూర్తితో వరుసలో చివర నిలిచే వ్యక్తికి సౌభాగ్యాన్ని అందించేదిగా ఉండాలి. ప్రపంచ దేశాలతో సంబంధాలను విస్తరించేటప్పుడు సంక్షేమం, అవకాశాలను కలుపుకొనిపోవాలి. ఇప్పుడు ఆర్థిక పాలనకు ఒక సరైన నమూనాను పొందడం ఒక సవాలుగా మారింది.
కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.